సమర్కండ్ ఆగ్నేయ ఉజ్బెకిస్తాన్లోని నగరం.
మధ్య ఆసియాలో నిరంతరాయంగా మానవ ఆవాసముంటూ ఉన్న పురాతన నగరాలలో ఒకటి. దీనిని సమర్ఖండ్ అని కూడా పిలుస్తారు. సమర్కండ్ ఎప్పుడు స్థాపించబడిందనేదానికి ప్రత్యక్ష సాక్ష్యం లేనప్పటికీ, పురాతన శిలాయుగం చివరి నుండి నగర ప్రాంతంలో మానవ కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇది సా.పూ 8, 7వ శతాబ్దాల మధ్య స్థాపించబడిందని అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. చైనా, ఐరోపాల మధ్య గల సిల్క్ రోడ్లో ఉండడంతో ఇది అభివృద్ధి చెందింది. కొన్ని సమయాల్లో సమర్కండ్, మధ్య ఆసియాలోని అతిపెద్ద నగరాలలో ఒకటిగా ఉండేది. ఈ నగర నివాసులలో ఎక్కువ మంది స్థానిక పర్షియన్ మాట్లాడేవారు. తజిక్ పర్షియన్ మాండలికం కూడా మాట్లాడతారు. ఈ నగరం, మధ్య ఆసియాలోని తజిక్ ప్రజల చారిత్రక కేంద్రాలలో ఒకటి. ఇది గతంలో ఇరాన్ సామ్రాజ్యాలలో ముఖ్యమైన నగరాలలో ఒకటిగా ఉండేది.
సమర్కండ్ | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
— నగరం — | ||||||||
[[File: పైనుండి సవ్యదిశలో: ]]రేగిస్తాన్ స్క్వేర్, షా-ఇ-జిందా శ్మశానం, బీబీ ఖానుం మసీదు, షా-ఇ-జిందా లోపలి దృశ్యం, షేర్-దోర్ మద్రాసా, తైమూర్ సమాధి పైనుండి సవ్యదిశలో: రేగిస్తాన్ స్క్వేర్, షా-ఇ-జిందా శ్మశానం, బీబీ ఖానుం మసీదు, షా-ఇ-జిందా లోపలి దృశ్యం, షేర్-దోర్ మద్రాసా, తైమూర్ సమాధి | ||||||||
| ||||||||
దేశం | Uzbekistan | |||||||
విలాయత్ | సమర్కండ్ విలాయత్ | |||||||
ఆవాసాల ప్రారంభం | సా.పూ. 8 వ శతాబ్దం | |||||||
జనాభా (2019 జనవరి 1) | ||||||||
- నగరం | 5,13,572 | |||||||
- Metro | 9,50,000 | |||||||
Postal code | 140100 | |||||||
వెబ్సైటు | samarkand.uz (in English) |
పర్షియాకు చెందిన అచెమెనిడ్ సామ్రాజ్యం నాటికి, ఇది సోగ్డియన్ సాత్రాపికి రాజధాని. ఈ నగరాన్ని సా.పూ. 329 లో అలెగ్జాండర్ స్వాధీనం చేసుకున్నాడు. అప్పట్లో దీనిని మార్కండ అని పిలిచేవారు. 1220లో చెంఘిజ్ ఖాన్ నేతృత్వంలో మంగోలులు స్వాధీనం చేసుకునే వరకు ఈ నగరాన్ని ఇరానియన్, టర్కిక్ పాలకులు పరిపాలించారు. నేడు సమర్కండ్, సమర్కండ్ ప్రాంతానికి రాజధాని, జిల్లా-స్థాయి నగరం. ఇందులో పట్టణ ఆవాసాలైన కిమ్యోగర్లర్, ఫర్క్సోడ్, జిష్రావ్లు ఉన్నాయి . 5,51,700 జనాభాతో (2021), ఇది ఉజ్బెకిస్తాన్లో రెండవ అతిపెద్ద నగరం.
ఈ నగరం ఇస్లామిక్ పండితుల అధ్యయనానికి కేంద్రంగాను, తైమూరిడ్ పునరుజ్జీవనోద్యమానికి జన్మస్థలంగానూ ప్రసిద్ధి చెందింది. 14వ శతాబ్దంలో, తైమూర్ (తామర్లేన్) దీనిని తన సామ్రాజ్యానికి రాజధానిగా, తన సమాధి అయిన గుర్-ఎ అమీర్గాను మార్చుకున్నాడు . సోవియట్ కాలంలో పునర్నిర్మించబడిన బీబీ-ఖానిమ్ మసీదు నగరం లోని అత్యంత ప్రసిద్ధ మైలురాళ్లలో ఒకటిగా నిలిచిపోయింది. సమర్కండ్ లోని రిజిస్తాన్ స్క్వేర్ నగరం లోని పురాతన కేంద్రం. మూడు మతపరమైన స్మారక భవనాలు ఇక్కడ ఉన్నాయి. ఎంబ్రాయిడరీ, బంగారు పని, పట్టు నేత, రాగి చెక్కడం, సిరామిక్స్, చెక్క చెక్కడం, చెక్క పెయింటింగ్ వంటి పురాతన హస్తకళల సంప్రదాయాలను నగరం జాగ్రత్తగా సంరక్షించుకుంది. 2001లో, యునెస్కో ఈ నగరాన్ని తన ప్రపంచ వారసత్వ జాబితాలో సమర్కండ్- సాంస్కృతిక కూడలి (సమర్కండ్ - క్రాస్రోడ్స్ ఆఫ్ కల్చర్స్) గా చేర్చింది.
ఆధునిక సమర్కండ్లో పాత నగరం, కొత్త నగరం అనే రెండు విభాగాలున్నాయి. కొత్త నగరం రష్యన్ సామ్రాజ్యం, సోవియట్ యూనియన్ ల కాలంలో అభివృద్ధి చెందింది. పాత నగరంలో చారిత్రక కట్టడాలు, దుకాణాలు పాత ప్రైవేట్ గృహాలు ఉన్నాయి. కొత్త నగరంలో సాంస్కృతిక కేంద్రాలు, విద్యా సంస్థలతో పాటు పరిపాలనా భవనాలు ఉన్నాయి. 2022 సెప్టెంబరు 15-16, లో, SCO సభ్య దేశాల 22వ సమావేశం అయిన సమర్కండ్ సమ్మిట్ జరిగింది.
సోగ్డియన్ భాష లోని సమర్ (రాయి) నుండి ఈ పేరు వచ్చింది. కండ్ అంటే"కోట, పట్టణం." ఈ విషయంలో, సమర్కండ్ ఉజ్బెక్ రాజధాని తాష్కెంట్ పేరు వలె అదే అర్థాన్ని పంచుకుంటుంది, తాష్- "రాయి"కి టర్కిక్ పదం. కెంట్ అంటే టర్కిక్ లో కోట అని అర్థం.
బుఖారాతో పాటు, చైనా, ఐరోపా మధ్య వాణిజ్య మార్గంలో ఉండడంతో అభివృద్ధి చెంచిన మధ్య ఆసియాలోని పురాతన నగరాలలో సమర్కండ్ ఒకటి. ఇది ఎప్పుడు స్థాపించబడిందనే దానికి ప్రత్యక్ష ఆధారాలు లేవు. సమర్కండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ పరిశోధకులు నగర స్థాపన సా.పూ. 8వ-7వ శతాబ్దాలలో జరిగిందని అంటారు.
నగర పరిధి లోపల (సయోబ్, మిడ్టౌన్), శివారు ప్రాంతాలలోనూ (హోజామాజ్గిల్, సజాగాన్) జరిపిన పురావస్తు త్రవ్వకాల్లో మానవ కార్యకలాపాలకు సంబంధించి 40,000-సంవత్సరాల నాటి ఆధారాలను కనుగొన్నారు. ఇవి ఎగువ పురాతన శిలాయుగం నాటివి. సజాగ్'న్-1, జమిచాతోష్, ఓఖాలిక్ శివారులో మెసోలిథిక్ (సా.పూ. 12వ-7వ సహస్రాబ్ది) పురావస్తు ప్రదేశాలను కనుగొన్నారు. నగరానికి, దాని శివారు ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే సయోబ్, దర్గోమ్ కాలువలు సా.పూ. 7వ-5వ (ప్రారంభ ఇనుప యుగం )లో కనిపించాయి.
దాని ప్రారంభ రోజుల నుండి, సమర్కండ్ సోగ్డియన్ నాగరికతకు చెందిన ప్రధాన కేంద్రాలలో ఒకటిగా ఉంది. పర్షియాకు చెందిన అచెమెనిడ్ రాజవంశం నాటికి, నగరం సోగ్డియన్ సత్రపికి రాజధానిగా మారింది.
సా.పూ. 329 లో అలెగ్జాండర్, సమర్కండ్ను జయించాడు. ఈ నగరాన్ని గ్రీకులు మరకండా అని పిలిచేవారు. వ్రాతపూర్వక మూలాలు తదుపరి ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించి చిన్న ఆధారాలను అందిస్తున్నాయి. ఈ మూలాల్లో ఒరేపియస్ అనే అతను "వారసత్వంగా కాక, అలెగ్జాండర్ ఇచ్చిన బహుమతిగా" ఈ నగరాన్ని పొందాడని పేర్కొన్నారు.
అలెగ్జాండర్ ప్రారంభ ఆక్రమణ సమయంలో సమర్కండ్ గణనీయమైన నష్టాన్ని చవిచూసింది. కానీ, దానినుండి నగరం వేగంగా కోలుకుంది. హెలెనిక్ ప్రభావంతో అభివృద్ధి చెందింది. కొత్త నిర్మాణ సాంకేతికతలు చోటు చేసుకున్నాయి; దీర్ఘచతురస్రాకార ఇటుకల స్థానే చతురస్రాకారపు ఇటుకలను వాడారు. రాతి, ప్లాస్టరింగ్ లలో ఉన్నతమైన పద్ధతులను ప్రవేశపెట్టారు.
అలెగ్జాండర్ విజయాలతో మధ్య ఆసియాలోకి సాంప్రదాయిక గ్రీకు సంస్కృతి ప్రవేశించింది. గ్రీకు సౌందర్యశాస్త్రం కొంతకాలం పాటు, స్థానిక కళాకారులను ఎక్కువగా ప్రభావితం చేసింది. అలెగ్జాండర్ మరణం తర్వాత అనేక శతాబ్దాల పాటు నగరం వివిధ వారసత్వ రాజ్యాలలో భాగమైనప్పటికీ, ఈ హెలెనిస్టిక్ వారసత్వం కొనసాగింది. వీటిలో సెల్యూసిడ్ సామ్రాజ్యం, గ్రీకో-బాక్ట్రియన్ రాజ్యం, కుషాణ సామ్రాజ్యం (కుషాణులు కూడా మధ్య ఆసియాలో ఉద్భవించినప్పటికీ) ఉన్నాయి. సా.శ. 3వ శతాబ్దంలో కుషాణ రాజ్యం సోగ్డియాపై నియంత్రణ కోల్పోయిన తర్వాత, సమర్కండ్ ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ శక్తి కేంద్రంగా క్షీణించింది. మళ్ళీ 5వ శతాబ్దం వరకు పెద్దగా పుంజుకోలేదు.
సా.శ. 260 లో సమర్కండ్ను పర్షియన్ సస్సానియన్లు స్వాధీనం చేసుకున్నారు. సస్సానియన్ పాలనలో, ఈ ప్రాంతం మానిచెయిజం కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రదేశంగా మారింది. మధ్య ఆసియా అంతటా మత వ్యాప్తిని సులభతరం చేసింది.
350-375లో సమర్కండ్ను జియోనైట్స్లోని సంచార జాతుల వారు స్వాధీనం చేసుకున్నారు. అయితే, దీని మూలం వివాదాస్పదంగా ఉంది. సమర్కండ్కు సంచార సమూహాల పునరావాసం 4వ శతాబ్దానికి చెందిన పురావస్తు సామగ్రిని నిర్ధారిస్తుంది. మధ్య సిర్దార్యా బేసిన్ నుండి వచ్చిన సంచార సంస్కృతి ఈ ప్రాంతంలో విస్తరిస్తోంది.
457-509లో సమర్కండ్ కిడారైట్ రాజ్యంలో భాగంగా ఉంది.
హెఫ్టలైట్లు ("శ్వేత హూణులు") సమర్కండ్ను జయించిన తర్వాత, సా.శ. 560 లో సస్సానిడ్ పర్షియన్లతో పొత్తుతో గోక్టర్క్స్ బుఖారా యుద్ధంలో విజయం సాధించే వరకు వారు దానిని నియంత్రించారు.
6వ శతాబ్దం మధ్యలో, అషినా రాజవంశం స్థాపించిన ఆల్టైలో టర్కిక్ రాజ్యం ఏర్పడింది. పాలకుడు - ఖగన్ నేతృత్వంలోని టర్క్స్ ప్రజల పేరు మీద కొత్త రాజ్యానికి టర్కిక్ ఖగనేట్ అని పేరు పెట్టారు. 557-561లో, టర్కులు సస్సానిడ్ల సంయుక్త బలగాల చేతిలో హెఫ్తలైట్ల సామ్రాజ్యం ఓడిపోయింది. ఇది రెండు సామ్రాజ్యాల మధ్య ఉమ్మడి సరిహద్దు ఏర్పాటుకు దారితీసింది.
ప్రారంభ మధ్య యుగాలలో, సమర్కండ్ నాలుగు వరుసల రక్షణ గోడల మధ్య, నాలుగు ద్వారాలతో ఉండేది.
సమర్కండ్ భూభాగంలో గుర్రంతో సహా టర్కిక్ ఖననాన్ని కనుగొన్నారు. ఇది 6వ శతాబ్దానికి చెందినది.
పాశ్చాత్య టర్కిక్ ఖగనేట్ పాలకుడు, టోంగ్ యాబ్ఘు కఘన్ (618-630) కాలంలో, సమర్కండ్ పాలకుడితో కుటుంబ సంబంధాలు ఏర్పడ్డాయి - టోంగ్ యాబ్ఘు కఘన్ తన కుమార్తెను అతనికి ఇచ్చాడు.
సమర్కండ్లోని కొన్ని ప్రాంతాలు 4వ శతాబ్దం నుండి క్రైస్తవులుగా ఉన్నారు. 5వ శతాబ్దంలో, సమర్కండ్లో నెస్టోరియన్ పీఠాన్ని స్థాపించారు. 8వ శతాబ్దం ప్రారంభంలో, ఇది నెస్టోరియన్ మెట్రోపాలిటనేట్గా రూపాంతరం చెందింది. క్రైస్తవ మతం, మానిచెయిజం లకు చెందిన సోగ్డియన్ అనుచరుల మధ్య చర్చలు, వివాదాలు తలెత్తాయి. ఇది పత్రాలలో ప్రతిబింబిస్తుంది.
కుతైబా ఇబ్న్ ముస్లిం ఆధ్వర్యంలో ఉమయ్యద్ కాలిఫేట్ సైన్యాలు సా.శ. 710 ప్రాంతంలో నగరాన్ని టర్కుల నుండి స్వాధీనం చేసుకున్నాయి.
ఈ కాలంలో, సమర్కండ్ సమాజంలో విభిన్న మతాలుండేవి. జొరాస్ట్రియనిజం, బౌద్ధమతం, హిందూమతం, మానికేయిజం, జుడాయిజం, నెస్టోరియన్ క్రిస్టియానిటీతో సహా అనేక మతాలకు నగరం నిలయంగా ఉండేది. జనాభాలో ఎక్కువ మంది జొరాస్ట్రియనిజాన్ని అనుసరించేవారు. కుతైబా మధ్య ఆసియాలో అరబ్బుల ఆవాసాలను ఏర్పరచలేదు; తనకు కప్పం కట్టమని అతను స్థానిక పాలకులను బలవంతం చేసాడు. కానీ చాలావరకు వారిని వారి ఇష్టానికి విడిచిపెట్టాడు. అయితే, ఈ విధానానికి సమర్కండ్ ప్రధాన మినహాయింపు: ఖుతైబా నగరంలో అరబ్ దండు, అరబ్ ప్రభుత్వ పరిపాలనను స్థాపించాడు. అక్కడీ జొరాస్ట్రియన్ అగ్ని దేవాలయాలను ధ్వంసం చేసి, మసీదు నిర్మించాడు. నగర జనాభాలో ఎక్కువ మంది ఇస్లాంలోకి మారారు. దీర్ఘకాల ఫలితంగా సమర్కండ్, ఇస్లామిక్ అరబిక్ అధ్యయన కేంద్రంగా అభివృద్ధి చెందింది.
740 ల చివరలో, అరబ్ కాలిఫేట్లో ఉమయ్యద్ల అధికారంతో అసంతృప్తి చెందిన వారు ఉద్యమం లేవదీసారు. అబ్బాసిడ్ సేనాని అయిన అబూ ముస్లిం నేతృత్వంలో చేసిన తిరుగుబాటు విజయం సాధించిన తర్వాత అతను, ఖొరాసన్, మావెరన్నాహర్ (750 -755) లకు పాలకుడయ్యాడు. అతను సమర్కండ్ను తన నివాసంగా ఎంచుకున్నాడు. నగరం లోను, ప్యాలెస్ చుట్టూ అనేక కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మాణంతోనూ అతని పేరు ముడిపడి ఉంది.
పురాణాల ప్రకారం, అబ్బాసిడ్ పాలనలో, 751లో జరిగిన తలాస్ యుద్ధంలో ఇద్దరు చైనీస్ ఖైదీల నుండి కాగితం తయారీ రహస్యాన్ని సంపాదించారు. దీంతో ఇస్లామిక్ ప్రపంచంలోనే మొదటి పేపర్ మిల్లు సమర్కండ్లో ఏర్పడడానికి దారితీసింది. ఈ ఆవిష్కరణ మిగిలిన ఇస్లామిక్ ప్రపంచానికి, అక్కడి నుండి ఐరోపాకూ వ్యాపించింది.
సమర్కండ్పై అబ్బాసిడ్ నియంత్రణ త్వరలోనే ముగిసిపోయి, వారి స్థానంలో సమానిద్లు (875–999) అధికారానికి వచ్చారు. అయితే, సమానిద్లు సమర్కండ్పై నియంత్రణలో ఉన్న సమయంలో కూడా ఖలీఫాకు నామమాత్రపు సామంతులుగానే ఉన్నారు. సమానిద్ పాలనలో నగరం సమానిద్ రాజవంశానికి రాజధానిగా మారింది. అనేక వాణిజ్య మార్గాలకు మరింత ముఖ్యమైన కేంద్రంగా మారింది. దాదాపు 999లో కరాఖానిదులు సమానిదులను ఓడించారు. తరువాతి 200 సంవత్సరాలలో, సెల్జుక్స్, ఖ్వారాజ్మ్షాలతో సహా టర్కిక్ తెగల వారసత్వం సమర్కండ్ను పరిపాలించింది.
ట్రాన్సోక్సియానాలో పర్యటించిన 10వ శతాబ్దపు పెర్షియన్ రచయిత ఇస్తాఖ్రీ, "స్మార్కండియన్ సోగ్డ్ " అని తాను పిలిచిన ప్రాంతం లోని సహజ సంపద గురించి స్పష్టమైన వివరణను అందించాడు:
కాస్త ఎత్తైన ప్రదేశానికి ఎక్కితే పచ్చదనం, ఆహ్లాదకరమైన ప్రదేశం కనిపించని ప్రదేశమే సమర్కండ్లో నాకు కనిపించలేదు. దాని చుట్టుపక్కల ఎక్కడా చెట్లు, గడ్డి మైదానాలు లేని పర్వతాలు లేవు. సమకండియన్ సోగ్డ్... ఎనిమిది రోజుల పాటు ఎడతెగని పచ్చదనం, తోటల గుండా ప్రయాణించాను. . . . చెట్లు, పంట భూముల పచ్చదనం [సోగ్ద్] నదికి ఇరువైపులా విస్తరించి ఉంది... ఈ పొలాలకు ఆవల పశువుల మందలకు పచ్చిక మైదానం ఉంది. ప్రతి ఊరికి, ఆవాస స్థావరానికీ ఒక కోట ఉంటుంది. . . అల్లాహ్ కు చెందిన అన్ని దేశాలలోకీ ఇది అత్యంత ఫలవంతమైనది; అందులో ఉత్తమమైన చెట్లు, పండ్లు ఉన్నాయి, ప్రతి ఇంటిలో తోటలు, తొట్టెలు, ప్రవహించే నీరు ఉన్నాయి.
999లో సమనిద్ల రాజ్యం పతనం తర్వాత, దాని స్థానంలో ఖరాఖానిద్ రాజ్యం ఏర్పడింది. అప్పుడు తుర్కిక్ కరాఖానిడ్ రాజవంశం పాలించింది. కరాఖానిడ్స్ రాజ్యం 2 భాగాలుగా విడిపోయిన తరువాత, సమర్కండ్ పశ్చిమ కరాఖానిడ్ కగానేట్లో భాగమైంది. 1040-1212లో దాని రాజధానిగా ఉండేది. ఇబ్రహీం తమ్గాచ్ ఖాన్ (1040-1068), పశ్చిమ కరాఖానిడ్ కగనేట్ స్థాపకుడు. అతను మొదటిసారిగా, రాజ్య నిధులతో సమర్కండ్లో మదర్సాను నిర్మించాడు. ఈ ప్రాంతంలో సంస్కృతి అభివృద్ధికి తోడ్పడ్డాడు. అతని హయాంలో, సమర్కండ్లో ప్రభుత్వ ఆసుపత్రి (బెమోరిస్తాన్), మదర్సా లను స్థాపించారు. ఇక్కడ వైద్యాన్ని బోధించారు కూడా.
షా-ఇ-జిందా స్మారక సముదాయాన్ని 11వ శతాబ్దంలో కరాఖానిడ్ రాజవంశం పాలకులు స్థాపించారు.
సమర్కండ్లోని కరాఖానిడ్ శకం యొక్క అత్యంత అద్భుతమైన స్మారక చిహ్నం ఇబ్రహీం ఇబ్న్ హుస్సేన్ సౌధాన్ని (1178-1202), 12వ శతాబ్దంలో నిర్మించారు. త్రవ్వకాలలో, స్మారక పెయింటింగ్ శకలాలను కనుగొన్నారు. తూర్పు గోడపై, ఒక టర్కిక్ యోధుడు, పసుపు రంగు కాఫ్తాన్ ధరించి, విల్లును పట్టుకున్నట్లు చిత్రీకరించబడింది. గుర్రాలు, వేట కుక్కలు, పక్షులు, సమాకాలీన స్త్రీలను కూడా ఇక్కడ చిత్రీకరించారు.
1220లో మంగోలు సమర్కండ్ను స్వాధీనం చేసుకున్నారు . చెంఘీస్ ఖాన్, కోట లోను మసీదు లోనూ ఆశ్రయం పొందిన వారందరినీ చంపి, నగరాన్ని పూర్తిగా దోచుకున్నాడనీ, 30,000 మంది కళాకారులతో పాటు 30,000 మంది యువకులను నిర్బంధించాడనీ జువైనీ వ్రాశాడు. సైన్యానికి చెల్లించాల్సిన నిధిని పొందడానికి ఖాన్ బరాక్, మరోసారి సమర్కండ్ పై దాడిచేసాడు. 1370 వరకు ఇది చగటాయ్ ఖానేట్ (నాలుగు మంగోల్ వారసుల రాజ్యాలలో ఒకటి)లో భాగంగా ఉంది.
13వ శతాబ్దం చివరలో సిల్క్ రోడ్లో తన ప్రయాణాన్ని ది ట్రావెల్స్ ఆఫ్ మార్కో పోలో గారాసిన పోలో, సమర్కండ్ను "చాలా పెద్ద, అద్భుతమైన నగరం. . ." అని వర్ణించాడు.
యెనిసీ ప్రాంతంలో చైనీస్ మూలానికి చెందిన నేత కార్మికుల సమాజం ఉండేది. సమర్కండ్, ఔటర్ మంగోలియా రెండు చోట్లా చైనీస్ మూలానికి చెందిన కళాకారులు ఉండేవారని చాంగ్చున్ రాసాడు. చెంఘిజ్ ఖాన్ మధ్య ఆసియాను జయించిన తర్వాత, విదేశీయులను ప్రభుత్వ పాలకులుగా నియమించాడు; చైనీస్, ఖారా-ఖితాయ్ (ఖితాన్స్) లను సమర్కండ్లోని తోటలు, పొలాల సహ-నిర్వాహకులుగా నియమించాడు. వాటిని నిర్వహించుకునేందుకు ముస్లింలను అనుమతించలేదు. ఖానేట్ క్రిస్టియన్ బిషప్రిక్స్ స్థాపనను అనుమతించింది.
1333లో సందర్శించిన ఇబ్న్ బటుటా, సమర్కండ్ను "అత్యుత్తమమైన, అత్యున్నతమైన నగరాలలో ఒకటి. అందంలో అత్యంత పరిపూర్ణమైనది" అని పేర్కొన్నాడు. పండ్ల తోటలకు జలరాట్నాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు కూడా ఆయన రాసాడూ.
1365లో, చగటాయ్ మంగోల్ నియంత్రణకు వ్యతిరేకంగా సమర్కండ్లో తిరుగుబాటు జరిగింది.
తైమూరిడ్ సామ్రాజ్య స్థాపకుడు పాలకుడు తైమూర్ (తామర్లేన్) 1370లో సమర్కండ్ను తన రాజధానిగా చేసుకున్నాడు. తరువాతి 35 సంవత్సరాలలో, అతను నగరంలో చాలా భాగాన్ని పునర్నిర్మించాడు. సామ్రాజ్యం అంతటా ఉన్న గొప్ప కళాకారులు, హస్తకళాకారులతో నగరాన్ని నింపేసాడు. తైమూర్, కళల పోషకుడిగా ఖ్యాతిని పొందాడు. సమర్కండ్ ట్రాన్సోక్సియానా ప్రాంతానికి కేంద్రంగా మారింది. కళల పట్ల తైమూర్కు ఉన్న నిబద్ధత, అతను తన శత్రువులపై చూపిన నిర్దయతో పోలిస్తే, ప్రత్యేక కళాత్మక సామర్థ్యాలు ఉన్నవారి పట్ల అతను ఎంత దయను ప్రదర్శించాడో స్పష్టంగా తెలుస్తుంది. కళాకారులు, హస్తకళాకారులు, వాస్తుశిల్పులను క్షమించి, తైమూర్ రాజధానిని మెరుగుపరచడానికి, అందంగా తీర్చిదిద్దడానికీ వారిని వాడుకున్నాడు.
తైమూర్ నిర్మాణ ప్రాజెక్టులలో నేరుగా పాల్గొన్నాడు. అతని ఆలోచనలు నిర్మాణ కార్మికుల సాంకేతిక సామర్థ్యాలను మించిపోయేవి. నగరం నిరంతరం నిర్మాణాలు జేరుగుతూ ఉండేవి. ఫలితాలతో సంతృప్తి చెందకపోతే భవనాలను త్వరగా పూర్తి చేయమని, తిరిగి కట్టమనీ తైమూర్ ఆదేశించేవాడు. సమర్కండ్ను చేరుకునే మార్గాల్లో లోతైన గుంటలు తవ్వించాడూ. 8 kilometres (5 miles) చుట్టుకొలత గల గోడలు నగరం చుట్టూ నిర్మించాడు. ఈ సమయంలో, నగరంలో సుమారు 1,50,000 జనాభా ఉండేది. హెన్రీ III రాయబారి రూయ్ గొంజాలెజ్ డి క్లావిజో, 1403 - 1406 మధ్య కాలంలో సమర్కండ్లో ఉన్నాడు. నగరంలో అంతులేని నిర్మాణాలను అతను ధ్రువీకరించాడు. "సమర్కండ్ నగరంలో మేము సందర్శించిన మసీదులన్నింటిలో తైమూర్ నిర్మించిన మసీదు మాకు గొప్పదిగా అనిపించింది. " అని అతను రాసాడు.
1417-1420లో, తైమూర్ మనవడు ఉలుగ్బెక్, సమర్కండ్లో ఒక మదర్సాను నిర్మించాడు. రెజిస్తాన్ నిర్మాణాల్లో ఇది మొదటి భవనం. ఉలుగ్బెక్ ఇస్లామిక్ ప్రపంచంలోని ఖగోళ శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రజ్ఞులను పెద్ద సంఖ్యలో ఈ మదర్సాకు ఆహ్వానించాడు. ఉలుగ్బెక్ ఆధ్వర్యంలో సమర్కండ్, మధ్యయుగ సైన్స్ కు ప్రపంచ కేంద్రాలలో ఒకటిగా మారింది. ఇక్కడ, 15 వ శతాబ్దం మొదటి భాగంలో, ఉలుగ్బెక్ ఆధ్వర్యంలో మొత్తం శాస్త్రీయ సమాజం ఉద్భవించింది. గియాసిద్దీన్ జంషిద్ కాషి, కజిజాడే రూమి, అల్-కుష్చి వంటి ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రవేత్తలను ఏకం చేసింది. విజ్ఞానశాస్త్రంలో ఉలుగ్బెక్ ప్రధాన ఆసక్తి, ఖగోళ శాస్త్రం. 1428లో ఉలుగ్బెక్ అబ్జర్వేటరీ నిర్మాణం పూర్తయింది. దాని ప్రధాన పరికరం గోడ క్వాడ్రంట్ - దీనికి సమానమైనది ప్రపంచంలోనే లేదు.
1500లో, సంచార ఉజ్బెక్ యోధులు సమర్కండ్పై నియంత్రణ సాధించారు. షైబానిద్లు ఈ సమయంలో లేదా ఆ సమయానికి అటూఇటూగా నగర పాలకులుగా ఉద్భవించారు.
1501లో, సమర్కండ్ను చివరకు ఉజ్బెక్ రాజవంశం షైబానిడ్స్ నుండి ముహమ్మద్ షైబానీ ఆక్రమించాడు. ఈ నగరం కొత్తగా ఏర్పడిన "బుఖారా ఖానేట్"లో భాగమైంది. సమర్కండ్ ఈ రాజ్యానికి రాజధాని అయింది. ఇందులో ముహమ్మద్ షైబానీ ఖాన్కు పట్టాభిషేకం చేయబడింది. సమర్కండ్లో, ముహమ్మద్ షైబానీ ఖాన్ ఒక పెద్ద మదర్సాను నిర్మించమని ఆదేశించాడు. అక్కడ అతను శాస్త్రీయ, మతపరమైన వివాదాలలో పాల్గొన్నాడు. షైబానీ ఖాన్ మద్రాసా గురించిన మొదటి వార్త 1504 నాటిది (సోవియట్లు అధికారంలో ఉన్న సంవత్సరాల్లో దాన్ని పూర్తిగా నాశనం చేసారు). షీబానీ ఖాన్, తన సోదరుడు మహమూద్ సుల్తాన్ జ్ఞాపకార్థం సమర్కండ్లో మదర్సాను నిర్మించాడని మహమ్మద్ సలీఖ్ రాశాడు. "మిక్మోన్-నామీ బుఖారా"లో ఫజ్లల్లాహ్ ఇబ్న్ రుజ్బిహాన్ మదర్సా యొక్క గంభీరమైన భవనం, దాని పూతపూసిన పైకప్పు, ఎత్తైన హుజ్రాలు, విశాలమైన ప్రాంగణం, మదర్సాను స్తుతిస్తూ ఒక పద్యాన్ని ఉటంకించాడు. చాలా సంవత్సరాల తర్వాత షీబానీ-ఖాన్ మదర్సాను సందర్శించిన జైన్ అడ్-దిన్ వాసిఫీ, మదర్సా యొక్క వరండా, హాలు, ప్రాంగణం విశాలంగా, అద్భుతంగా ఉన్నాయని తన జ్ఞాపకాలలో రాశాడు.
1540-1551లో సమర్కండ్లో పాలించిన మిర్జో ఉలుగ్బెక్ మనవడు కుచ్కుంజి ఖాన్ కుమారుడు అబ్దులతీఫ్ ఖాన్, మావెరన్నాహర్, షిబానిద్ రాజవంశపు చరిత్రలో నిపుణుడిగా పరిగణించబడ్డాడు. అతను కవులు, శాస్త్రవేత్తలను ఆదరించాడు. అబ్దులతీఫ్ ఖాన్ స్వయంగా ఖుష్ అనే మారుపేరుతో కవిత్వం రాశారు.
అష్టర్ఖనిద్ ఇమామ్ కులీ ఖాన్ (1611-1642) పాలనలో సమర్కండ్లో ప్రసిద్ధ నిర్మాణ కళాఖండాలు నిర్మించబడ్డాయి. 1612-1656లో, సమర్కండ్ గవర్నర్ యాలంగ్తుష్ బహదూర్ ఒక కేథడ్రల్ మసీదు, తిల్యా-కారీ మదర్సా, షెర్డోర్ మదర్సాలను నిర్మించారు.
అఫ్సర్ షాహన్షా నాదర్ షా దాడి తరువాత, 1720ల ప్రారంభంలో నగరం నిర్జనమైంది. 1599 నుండి 1756 వరకు, సమర్కండ్ను బుఖారా ఖనాటే యొక్క అష్ట్రఖానిడ్ శాఖ పరిపాలించింది.
1756 నుండి 1868 వరకు, దీనిని బుఖారా కు చెందిన మంగూద్ ఎమిర్లు పరిపాలించారు. ఉజ్బెక్ రాజవంశం యొక్క స్థాపకుడు, మాంగిట్స్, ముహమ్మద్ రఖిమ్ (1756-1758) పాలనలో నగరం పునరుజ్జీవన దశ ప్రారంభమైంది. అతను తన బలమైన-ఇష్టాయిష్టాలకు, సైనిక కళకూ ప్రసిద్ధి చెందాడు. మహమ్మద్ రఖింబీ సమర్కండ్ను పునరుద్ధరించడానికి కొన్ని ప్రయత్నాలు చేశాడు.
1868లో కల్నల్ కాన్స్టాంటిన్ పెట్రోవిచ్ వాన్ కౌఫ్మాన్ ఆధ్వర్యంలో కోటను స్వాధీనం చేసుకోవడంతో ఈ నగరం ఇంపీరియల్ రష్యన్ పాలనలోకి వచ్చింది. కొంతకాలం తర్వాత 500 మందితో కూడిన చిన్న రష్యన్ దండు ముట్టడించబడీంది. బుఖారాన్ ఎమిర్ పెద్ద కుమారుడు, తిరుగుబాటుదారుడు అయిన అబ్దుల్ మాలిక్ తురా, అలాగే షాహ్రిసాబ్జ్కు చెందిన బాబా బేగ్, కితాబ్కు చెందిన జురా బేగ్ ల నేతృత్వంలో జరిగిన ఈ ముట్టడిని రష్యన్లు తిప్పికొట్టారు. జనరల్ అలెగ్జాండర్ కాన్స్టాంటినోవిచ్ అబ్రమోవ్ మిలిటరీ ఓక్రుగ్ కు మొదటి గవర్నర్ అయ్యాడు. జెరావ్షాన్ నది వెంట, సమర్కండ్ పరిపాలనా కేంద్రంగా రష్యన్లు దీనిని స్థాపించారు. నగరం లోని ఈ రష్యన్ విభాగాన్ని ఈ పాయింట్ తర్వాత పాత నగరానికి ఎక్కువగా పశ్చిమాన నిర్మించారు.
1886లో, ఈ నగరం రష్యన్ తుర్కెస్తాన్లో కొత్తగా ఏర్పడిన సమర్కండ్ ఒబ్లాస్ట్కు రాజధానిగా మారింది.1888లో ట్రాన్స్-కాస్పియన్ రైల్వే నగరాన్ని చేరుకున్నప్పుడు ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
సమర్కండ్ 1925 నుండి 1930 వరకు ఉజ్బెక్ SSR కు రాజధానిగా ఉంది. ఆ తరువాత దీని స్థానంలో తాష్కెంట్ వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, నాజీ జర్మనీ సోవియట్ యూనియన్పై దండెత్తిన తర్వాత , శత్రువుతో పోరాడేందుకు సమర్కండ్ కు చెందిన అనేక మంది పౌరులను స్మోలెన్స్క్కు పంపారు. వారిలో చాలామంది నాజీలకు బందీలయ్యారు లేదా వారి చేతిలో హతులయ్యారు. సోవియట్ ఆక్రమిత పశ్చిమ ప్రాంతాల నుండి వేలాది మంది శరణార్థులు నగరానికి పారిపోయి వచ్చారు. ఉజ్బెక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ నుండే కాక, మొత్తం సోవియట్ యూనియన్ నుండి పారిపోతున్న పౌరులకు ప్రధాన శరణార్థి కేంద్రాలలో ఇది ఒకటైంది.
1868లో రష్యన్ సామ్రాజ్యం సమర్కండ్ను స్వాధీనం చేసుకున్న తర్వాత, సమర్కండ్ చరిత్రపై శాస్త్రీయ అధ్యయనం ప్రారంభమవుతుంది. సమర్కండ్ చరిత్ర మొదటి అధ్యయనాలు N. వెసెలోవ్స్కీ, V. బార్టోల్డ్, V. వ్యాట్కిన్లు చేసారు. సోవియట్ కాలంలో, ఉజ్బెకిస్తాన్ విద్యావేత్త ఇబ్రగిం ముమినోవ్ సంపాదకత్వం వహించిన రెండు-సంపుటాల "సమర్కండ్ చరిత్ర"లో సమర్కండ్ చరిత్ర సాధారణీకరణ ప్రతిబింబిస్తుంది.
ఉజ్బెక్ SSR కు చెందిన అకాడెమీ ఆఫ్ సైన్సెస్ యొక్క అకాడెమీషియన్ I. ముమినోవ్, షరాఫ్ రషిడోవ్ మద్దతుతో, 1970లో సమర్కండ్ 2500వ వార్షికోత్సవం జరిపారు. ఈ విషయంలో, మిర్జో ఉలుగ్బెక్ స్మారక చిహ్నం తెరిచారు. సమర్కండ్ చరిత్ర మ్యూజియాన్ని స్థాపించారు. 2-సంపుటుల సమర్కండ్ చరిత్రను తయారు చేసి, ప్రచురించారు.
ఉజ్బెకిస్తాన్ స్వాతంత్ర్యం పొందిన తరువాత, సమర్కండ్ యొక్క పురాతన, మధ్యయుగ చరిత్రపై అనేక మోనోగ్రాఫ్లను ప్రచురించారు.
సమర్కండ్ ఆగ్నేయ ఉజ్బెకిస్తాన్లో, జరేఫ్షాన్ నది లోయలో ఉంది, ఖర్షి నుండి 135 కి.మీ. దూరంలో ఉంది. M37 రోడ్డు సమర్కండ్ని 240 కి.మీ. దూరంలో ఉన్న బుఖారాతో కలుపుతుంది. M39 రహదారి దీనిని 270 కి.మీ. దూరం లోని తాష్కెంట్తో కలుపుతుంది. తజికిస్తాన్ సరిహద్దు సమర్కండ్ నుండి సుమారు 35 కి.మీ దూరంలోను, తాజిక్ రాజధాని దుషాన్బే 210 కి.మీ. దూరంలోనూ ఉన్నాయి. M39 రహదారి సమర్కండ్ను ఆఫ్ఘనిస్తాన్లోని మజార్-ఇ-షరీఫ్కు కలుపుతుంది. ఇది నగరం నుండి 340 కి.మీ దూరంలో ఉంది.
సమర్కండ్లో మధ్యధరా వాతావరణం ( కొప్పెన్ క్లైమేట్ క్లాసిఫికేషన్ Csa ) ఉంది, ఇది వేడి, పొడి వేసవికాలం, సాపేక్షంగా తడిగా ఉండే, శీతాకాలాలతో పాక్షిక శుష్క వాతావరణానికి ( BSk )కి దగ్గరగా ఉంటుంది. జూలై, ఆగస్ట్లు సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే నెలలు. అప్పుడు ఉష్ణోగ్రతలు 40 °C (104 °F) కి చేరుకుంటాయి. డిసెంబరు నుండి ఏప్రిల్ వరకు వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. 2008 జనవరిలో ఉష్ణోగ్రత −22 °C (−8 °F) కి పడిపోయింది
శీతోష్ణస్థితి డేటా - Samarkand (1981–2010, extremes 1936–present) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 23.2 (73.8) | 26.7 (80.1) | 32.2 (90.0) | 36.2 (97.2) | 39.5 (103.1) | 41.4 (106.5) | 42.4 (108.3) | 41.0 (105.8) | 38.6 (101.5) | 35.2 (95.4) | 31.5 (88.7) | 27.5 (81.5) | 42.4 (108.3) |
సగటు అధిక °C (°F) | 6.9 (44.4) | 9.2 (48.6) | 14.3 (57.7) | 21.2 (70.2) | 26.5 (79.7) | 32.2 (90.0) | 34.1 (93.4) | 32.9 (91.2) | 28.3 (82.9) | 21.6 (70.9) | 15.3 (59.5) | 9.2 (48.6) | 21.0 (69.8) |
రోజువారీ సగటు °C (°F) | 1.9 (35.4) | 3.6 (38.5) | 8.5 (47.3) | 14.8 (58.6) | 19.8 (67.6) | 25.0 (77.0) | 26.8 (80.2) | 25.2 (77.4) | 20.1 (68.2) | 13.6 (56.5) | 8.4 (47.1) | 3.7 (38.7) | 14.3 (57.7) |
సగటు అల్ప °C (°F) | −1.7 (28.9) | −0.5 (31.1) | 4.0 (39.2) | 9.4 (48.9) | 13.5 (56.3) | 17.4 (63.3) | 19.0 (66.2) | 17.4 (63.3) | 12.8 (55.0) | 7.2 (45.0) | 3.5 (38.3) | −0.2 (31.6) | 8.5 (47.3) |
అత్యల్ప రికార్డు °C (°F) | −25.4 (−13.7) | −22 (−8) | −14.9 (5.2) | −6.8 (19.8) | −1.3 (29.7) | 4.8 (40.6) | 8.6 (47.5) | 7.8 (46.0) | 0.0 (32.0) | −6.4 (20.5) | −18.1 (−0.6) | −22.8 (−9.0) | −25.4 (−13.7) |
సగటు అవపాతం mm (inches) | 41.2 (1.62) | 46.2 (1.82) | 68.8 (2.71) | 60.5 (2.38) | 36.3 (1.43) | 6.1 (0.24) | 3.7 (0.15) | 1.2 (0.05) | 3.5 (0.14) | 16.8 (0.66) | 33.9 (1.33) | 47.0 (1.85) | 365.2 (14.38) |
సగటు అవపాతపు రోజులు | 14 | 14 | 14 | 12 | 10 | 5 | 2 | 1 | 2 | 6 | 9 | 12 | 101 |
సగటు మంచు కురిసే రోజులు | 9 | 7 | 3 | 0.3 | 0.1 | 0 | 0 | 0 | 0 | 0.3 | 2 | 6 | 28 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) | 76 | 74 | 70 | 63 | 54 | 42 | 42 | 43 | 47 | 59 | 68 | 74 | 59 |
Average dew point °C (°F) | −2 (28) | −1 (30) | 2 (36) | 6 (43) | 9 (48) | 9 (48) | 10 (50) | 9 (48) | 6 (43) | 4 (39) | 2 (36) | −1 (30) | 4 (40) |
Mean monthly sunshine hours | 132.9 | 130.9 | 169.3 | 219.3 | 315.9 | 376.8 | 397.7 | 362.3 | 310.1 | 234.3 | 173.3 | 130.3 | 2,953.1 |
Average ultraviolet index | 2 | 3 | 3 | 4 | 5 | 6 | 6 | 6 | 4 | 3 | 2 | 2 | 4 |
Source 1: Centre of Hydrometeorological Service of Uzbekistan | |||||||||||||
Source 2: Weather Atlas (UV), Time and Date (dewpoints, 1985-2015), 理科年表 (mean temperatures/humidity/snow days 1981–2010, record low and record high temperatures), NOAA (sun, 1961–1990) |
అధికారిక నివేదికల ప్రకారం, సమర్కండ్ నివాసులలో ఎక్కువ మంది ఉజ్బెక్కులు. వీరు టర్కిక్ ప్రజలు. అయితే, చాలా మంది "ఉజ్బెక్"లు నిజానికి తజిక్లు. వారు ఇరానియన్ ప్రజలు. వారి పాస్పోర్ట్లలో వారి జాతిని ఉజ్బెక్గా పేర్కొన్నప్పటికీ వారు తజిక్లే. సమర్కండ్ నివాసితులలో దాదాపు 70% మంది పెర్షియన్ (తాజిక్ మాండలికం )-మాట్లాడే తజిక్లు. తజిక్లు ముఖ్యంగా నగరం లోని ప్రధాన నిర్మాణాలున్న తూర్పు భాగంలో ఉన్నారు.
వివిధ మూలాల ప్రకారం, తజిక్లు సమర్కండ్లో మెజారిటీ జాతి సమూహం. ఉజ్బెక్లు రెండవ అతిపెద్ద సమూహం వీరు సమర్కండ్లో పశ్చిమాన ఎక్కువగా ఉన్నారు. ఉజ్బెకిస్తాన్లోని కొంతమంది వ్యక్తులు తమ మొదటి భాషగా తజికీని మాట్లాడుతున్నప్పటికీ వీరిని "ఉజ్బెక్"గా గుర్తించడం వలన వీరి ఖచ్చితమైన జనాభా గణాంకాలను పొందడం కష్టం.
ఉజ్బెకిస్తాన్ దేశంలో ఉన్నట్లే సమర్కండ్లో కూడా ఉజ్బెక్ భాషే అధికార భాష. ఉజ్బెక్ టర్కిక్ భాషలలో ఒకటి. ఉజ్బెక్స్, తుర్క్మెన్స్, సమర్కాండియన్ ఇరానియన్లు, సమర్కండ్లో నివసిస్తున్న చాలా మంది సమర్కాండియన్ అరబ్బులు అందరికీ ఇది మాతృభాష.
మిగతా ఉజ్బెకిస్తాన్లో లాగానే, సమర్కండ్లో కూడా రష్యన్ భాష అనధికారికంగా రెండవ అధికారిక భాష. సమర్కండ్లోని దాదాపు 5% సంకేతాలు, శాసనాలు ఈ భాషలోనే ఉన్నాయి. రష్యన్లు, బెలారసియన్లు, పోల్లు, జర్మన్లు, కొరియన్లు, మెజారిటీ ఉక్రేనియన్లు, మెజారిటీ ఆర్మేనియన్లు, గ్రీకులు, కొందరు తాతార్లు, కొంతమంది అజర్బైజానియన్లు రష్యన్ మాట్లాడతారు. అనేక రష్యన్-భాషా వార్తాపత్రికలు సమర్కండ్లో ప్రచురించబడ్డాయి, వాటిలో అత్యంత ప్రజాదరణ పొందినది " సమర్కండ్స్కీ వెస్ట్నిక్". సమర్కాండియన్ TV ఛానెల్ STV, రష్యన్ భాషలో కొన్ని ప్రసారాలను నిర్వహిస్తుంది.
సమర్కండ్లో ఉజ్బెక్ అత్యంత సాధారణ భాష అయినప్పటికీ, కొన్ని డేటా ప్రకారం కేవలం 30% మంది మాత్రమే మాతృభాషగా మాట్లాడతారు. మిగిలిన 70% మందికి, తజిక్ భాష మాతృభాష, ఉజ్బెక్ రెండవ భాష, రష్యన్ మూడవది. అయితే, 1989 నుండి ఉజ్బెకిస్తాన్లో జనాభా గణన జరగనందున, ఈ విషయంపై ఖచ్చితమైన డేటా లేదు. సమర్కండ్లో తజిక్ రెండవ అత్యంత సాధారణ భాషే అయినప్పటికీ, అది అధికారిక లేదా ప్రాంతీయ భాష హోదాను పొందలేదు. సమర్కండ్లోని ఒక వార్తాపత్రిక మాత్రమే తాజిక్లో, సిరిలిక్ తజిక్ వర్ణమాలలో ప్రచురించబడుతోంది. అది "ఓవోజీ సమర్కండ్". స్థానిక సమర్కాండియన్ STV, "సమర్కండ్" TV ఛానెల్లు ఒక ప్రాంతీయ రేడియో స్టేషన్ వలె తాజిక్లో కొన్ని ప్రసారాలను అందిస్తాయి.
8వ శతాబ్దంలో, మధ్య ఆసియాలోని అరబ్బుల దాడి సమయంలో ( ఉమయ్యద్ కాలిఫేట్ ) ఇస్లాం సమర్కండ్లోకి ప్రవేశించింది. దీనికి ముందు, దాదాపు సమర్కండ్లోని ప్రజలందరూ జొరాస్ట్రియన్లు. అనేక మంది నెస్టోరియన్లు, బౌద్ధులు కూడా నగరంలో నివసించారు. అప్పటి నుండి, అనేక ముస్లిం పాలక శక్తుల పాలనలో, నగరంలో అనేక మసీదులు, మదర్సాలు, మినార్లు, పుణ్యక్షేత్రాలు, సమాధులు నిర్మించబడ్డాయి. ఉదాహరణకు, సహీహ్ అల్-బుఖారీ అని పిలువబడే హదీథ్ సేకరణను రచించిన ఇస్లామిక్ పండితుడు ఇమామ్ బుఖారీ యొక్క పుణ్యక్షేత్రం ఉంది. దీనిని సున్నీ ముస్లింలు అత్యంత ప్రామాణికమైన ( సాహిహ్ ) హదీథ్ సేకరణలలో ఒకటిగా భావిస్తారు. అతని ఇతర పుస్తకాలలో అల్-అదాబ్ అల్-ముఫ్రాద్ ఉన్నాయి. సమర్కండ్లో ఇస్లాం, జుడాయిజం, క్రైస్తవ మతాలలో గౌరవించబడే ప్రవక్త డేనియల్ సమాధి, ఇమామ్ మాటురిడి పుణ్యక్షేత్రం కూడా ఉంది .
సమర్కండ్ ప్రజల్లో చాలా మంది ముస్లింలు. వీరిలో ప్రధానంగా సున్నీ (ఎక్కువగా హనాఫీ ), సూఫీలు . నగరంలో దాదాపు 80-85% మంది ముస్లింలు సున్నీలు. వీరిలో దాదాపు అందరూ తాజిక్లు, ఉజ్బెక్లు, సమర్కాండియన్ అరబ్బులు. సమర్కండ్ యొక్క అత్యంత ప్రసిద్ధ ఇస్లామిక్ పవిత్ర వంశాలు ఖోజా అఖ్రోర్ వలీ (1404–1490), మఖ్దుమీ అజామ్ (1461–1542), సయ్యద్ అటా (14వ శతాబ్దపు మొదటి సగం), మిరాకోని క్జోజ్ వంటి సూఫీ నాయకుల వారసులు. (ఇరాన్లోని మిరాకాన్ అనే గ్రామం నుండి సయ్యద్లు). అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్ ఉదారవాద విధానం మతపరమైన గుర్తింపు యొక్క వ్యక్తీకరణకు కొత్త అవకాశాలను తెరిచింది. సమర్కండ్లో, 2018 నుండి, హిజాబ్ ధరించిన మహిళల సంఖ్య పెరిగింది.
భారతదేశంలో తన 1398-1399 ప్రచారం తర్వాత తైమూర్, బీబీ ఖానుమ్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. బీబీ ఖానుమ్లో వాస్తవానికి దాదాపు 450 పాలరాతి స్తంభాలు ఉన్నాయి. తైమూర్ హిందూస్థాన్ నుండి తీసుకువచ్చిన 95 ఏనుగుల సహాయంతో వాటిని అక్కడ ఏర్పాటు చేశారు. భారతదేశానికి చెందిన కళాకారులు, రాతి కళాకారులు మసీదు గోపురాన్ని రూపొందించారు. ఇతర భవనాల కంటే విలక్షణమైన రూపాన్ని దానికి అందించారు. 1897 భూకంపంలో స్తంభాలు నాశనమయ్యాయి. తదుపరి పునర్నిర్మాణంలో దీన్ని పూర్తిగా పునరుద్ధరించలేదు.
సమర్కండ్లో అత్యంత ప్రసిద్ధమైన మైలురాయి, గుర్-ఐ అమీర్ అని పిలువబడే సమాధి. ఇది అనేక సంస్కృతులు, గత నాగరికతలు, పొరుగు ప్రజలు, మతాల - ముఖ్యంగా ఇస్లాం - ప్రభావాలను ప్రదర్శిస్తుంది. సమర్కండ్ యొక్క పూర్వ-తైమూరిడ్ ఇస్లామిక్ వాస్తుశిల్పాన్ని మంగోలులు విధ్వంసం చేసినప్పటికీ, తైమూర్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణ శైలులను పునరుద్ధరించారు. మసీదు బ్లూప్రింట్, లేఅవుట్, వాటి ఖచ్చితమైన కొలతలతో ఉన్న జ్యామితిలు ఇస్లామిక్ అభిరుచిని ప్రదర్శిస్తాయి. గుర్-ఐ అమీర్ ప్రవేశ ద్వారం అరబిక్ కాలిగ్రఫీ, శాసనాలతో అలంకరించబడింది. ఇది ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో ఒక సాధారణ లక్షణం. సమాధి లోపల తైమూర్ చూపిన ఖచ్చితమైన శ్రద్ధ ప్రత్యేకించి స్పష్టంగా కనిపిస్తుంది: టైల్ గోడలు మొజాయిక్ ఫైయెన్స్కి ఒక అద్భుతమైన ఉదాహరణ. ప్రతి పలకను కత్తిరించి, రంగు వేసి, ఒక్కొక్కటిగా అమర్చే ఇరానియన్ శైలి అది. గుర్-ఐ అమీర్ యొక్క పలకలను " ముహమ్మద్", "అల్లా" వంటి మతపరమైన పదాలను ఉచ్చరించేలా ఏర్పాటు చేసారు.
టర్కో-మంగోల్ ప్రభావం సమర్కండ్ వాస్తుశిల్పంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సమాధులకు పుచ్చకాయ ఆకారపు గోపురాలను సాంప్రదాయ మంగోల్ గుడారాల (యర్ట్) ఆకారంలోరూపొందించారు. చనిపోయిన వారి మృతదేహాలను ఖననం చేసేముందు ఇందులో ప్రదర్శించేవారు. తైమూర్ తన గుడారాలను ఇటుకలు, కలప వంటి మరింత మన్నికైన పదార్థాలతో నిర్మించాడు. అయితే వాటి ఉద్దేశాలు మాత్రం పెద్దగా మారలేదు. తైమూర్ దేహాన్ని ఉంచిన గదిలో " టగ్స్ " ఉన్నాయి. గుర్రం లేదా యాక్ తోక వెంట్రుకలతో చేసిన వృత్తాకార అమరికతో స్తంభాలను వేలాడదీసారు. ఈ బ్యానర్లు చనిపోయినవారిని గౌరవించడం కోసం గుర్రాలను బలి ఇచ్చే పురాతన టర్కీ సంప్రదాయానికి ప్రతీక. టగ్స్ అనేది ఒట్టోమన్ టర్క్స్ కాలం వరకు చాలా మంది సంచార జాతులు ఉపయోగించే ఒక రకమైన అశ్వికదళ ప్రమాణం.
సమర్కండ్లోని భవనాల రంగులకు కూడా ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. బాగా కనిపించే నిర్మాణ రంగు నీలం. తైమూర్, తనలోని అనేక భావనలను తెలియజేయడానికి దీన్ని ఉపయోగించాడు. ఉదాహరణకు, గుర్-ఐ అమీర్లోని నీలిరంగులు శోకానికి గుర్తు; ఆ యుగంలో, మధ్య ఆసియాలో నీలం శోకాన్ని సూచించే రంగు. ఇది నేటికీ వివిధ సంస్కృతులలో ఉంది. మధ్య ఆసియాలో "దిష్టి" నుండి రక్షించగల రంగుగా కూడా నీలాన్ని పరిగణిస్తారు; నగరం లోను, చుట్టుపక్కలా ఉన్న నీలిరంగు తలుపుల సంఖ్య ఈ భావనను నిరూపిస్తుంది. ఇంకా, నీలం రంగులో ఉండే నీరు, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియాల్లో ప్రత్యేకించి అరుదైన వనరు; నీలం రంగులో ఉన్న గోడలు నగరపు సంపదను కూడా సూచిస్తాయి.
సమర్కండ్లో బలమైన ప్రజా రవాణా వ్యవస్థ ఉంది. సోవియట్ కాలం నుండి నేటి వరకు, పురపాలక బస్సులు, టాక్సీలు సమర్కండ్లో నడుస్తున్నాయి. బస్సులు, నగరంలో అత్యంత సాధారణ రవాణా విధానం. 2017 నుండి, సమర్కాండియన్ ట్రామ్ లైన్లు కూడా ఉన్నాయి. సోవియట్ యుగం నుండి 2005 వరకు, సమర్కాండియన్లు కూడా ట్రాలీబస్ ద్వారా తిరిగారు.
1950 వరకు, సమర్కండ్లో రవాణా యొక్క ప్రధాన రూపాలు గుర్రాలు, గాడిదలు లాగే బళ్ళు " అరాబాలు ". అయితే, నగరంలో 1924-1930లో ఆవిరి ట్రామ్లు వచ్చాయి. 1947-1973లో మరింత ఆధునిక ట్రామ్లు వచ్చాయి.
నగరానికి ఉత్తరాన సమర్కండ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది సోవియట్ల ఆధ్వర్యంలో 1930లలో ప్రారంభించబడింది. 2019 వసంతకాలం నాటికి, సమర్కండ్ అంతర్జాతీయ విమానాశ్రయం తాష్కెంట్, నుకస్, మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్, యెకాటెరిన్బర్గ్, కజాన్, ఇస్తాంబుల్, దుషాన్బేలకు విమానాలు నడుస్తున్నాయి. ఇతర నగరాలకు చార్టర్ విమానాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఆధునిక సమర్కండ్ ఉజ్బెకిస్తాన్ యొక్క ముఖ్యమైన రైల్వే కేంద్రం; అన్ని తూర్పు-పశ్చిమ రైల్వే మార్గాలు నగరం గుండా వెళతాయి. వీటిలో అతి ముఖ్యమైనది, పొడవైనది తాష్కెంట్ - కుంగ్రాడ్ మార్గం . హై-స్పీడ్ తాష్కెంట్-సమర్కండ్ హై-స్పీడ్ రైల్ లైన్ రైళ్లు తాష్కెంట్, సమర్కండ్, బుఖారాల మధ్య నడుస్తాయి. సమర్కండ్కు అంతర్జాతీయ రైల్వే కనెక్షన్లు కూడా ఉన్నాయి. వీటిలో సరాటోవ్ -సమర్కండ్, మాస్కో -సమర్కండ్, నూర్-సుల్తాన్- సమర్కండ్ మార్గాలున్నాయి.
1879-1891లో, రష్యన్ సామ్రాజ్యం మధ్య ఆసియాలో తన విస్తరణను సులభతరం చేసుకోడానికి ట్రాన్స్-కాస్పియన్ రైల్వేను నిర్మించింది. ఈ రైల్వే కాస్పియన్ సముద్ర తీరంలో క్రాస్నోవోడ్స్క్ (ఇప్పుడు తుర్క్మెన్బాషి) లో మొదలౌతుంది. దీని టెర్మినస్ తొలుత సమర్కండ్లో ఉండేది. ఈ స్టేషన్ 1888 మేలో ప్రారంభించారు. అయితే, ఒక దశాబ్దం తరువాత, ఈ మార్గాన్ని తూర్పువైపు తాష్కెంట్, ఆండిజన్ వరకు విస్తరించారు. దాని పేరును సెంట్రల్ ఆసియన్ రైల్వే అని మార్చారు. ఉజ్బెకిస్తాన్ SSR, సోవియట్ మధ్య ఆసియాలోని అతిపెద్ద, అతి ముఖ్యమైన రైలు స్టేషన్లలో సమర్కండ్ ఒకటి.
This article uses material from the Wikipedia తెలుగు article సమర్కండ్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.