పర్షియన్ సాహిత్యం ( ఫార్సీ: ادبیات فارسی, pronounced ) పర్షియన్ భాషలో మౌఖిక రచనలు, వ్రాతపూర్వక గ్రంథాలతో కూడి ప్రపంచంలోని పురాతన సాహిత్యాలలో ఒకటిగా నిలుస్తున్నది.
పర్షియన్ సాహిత్యం రెండున్నర సహస్రాబ్దుల కాలంలో విస్తరించివుంది.
ఈ భాషా సాహిత్యం ఒకప్పటి గ్రేటర్ ఇరాన్ ప్రాంతంలో నిలిచి విలసిల్లింది. ప్రస్తుత ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, కాకసస్, టర్కీలలో పూర్తిస్థాయిలోనూ, మధ్య ఆసియా (తజికిస్తాన్ వంటివి), దక్షిణ ఆసియాలోని పర్షియన్ భాష చారిత్రకంగా స్థానిక భాషగానో, అధికారిక భాషగానో ఉన్న ప్రాంతాలను కలిపి చారిత్రకంగా గ్రేటర్ ఇరాన్ ప్రాంతంగా పరిగణిస్తారు. ఉదాహరణకు, పర్షియన్ సాహిత్యాభిమానులకు అత్యంత ప్రీతిపాత్రులైన కవుల్లో ఒకడైన రూమి ఈనాటి ఆఫ్ఘనిస్తాన్ లోని బాల్ఖ్ లో కానీ, ఈనాటి తజకిస్తాన్ లోని వాఖ్ష్ లో కానీ జన్మించాడు. అతను పర్షియన్ భాషలో రాసేవాడు, ఆ సమయంలో అనటోలియాలోని సెల్జుక్స్ రాజధాని అయిన కొన్యాలో (ఈనాడు టర్కీలో ఉంది) జీవించాడు.
ఘజ్నావిడ్ సామ్రాజ్యం మధ్య, దక్షిణ ఆసియాలో విస్తారమైన భూభాగాలను జయించి, పర్షియన్ను తమ రాజభాషగా స్వీకరించింది. ఈ కారణంగా ఇరాన్, మెసొపొటేమియా, అజర్బైజాన్, విస్తృత కాకసస్ ప్రాంతం, టర్కీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం, తజికిస్తాన్, మధ్య ఆసియాలోని ఇతర ప్రాంతాలలో పర్షియన్ సాహిత్యం వెలువడేది. పర్షియన్ అన్నది భాషా వాచకం మాత్రమే కాక జాతి వాచకం కూడా అయివుండడంతో పర్షియన్లు లేక ఇరానీయులు గ్రీక్, అరబిక్ వంటి ఇతర భాషల్లో రాసిన సాహిత్యాన్ని కూడా జాతిపరంగా చూసి పర్షియన్ సాహిత్యంగా పరిగణించాలని కొందరు సూచిస్తారు. అదే సమయంలో పర్షియన్ భాషలో రాసిన సాహిత్యం అంతా కూడా జాతిపరంగా పర్షియన్లు లేక ఇరాయన్లు అయినవారే రాసినది కాదు. టర్కిక్, కాకేసియన్, భారతీయ కవులు, రచయితలు కూడా ఆనాటి విస్తృత పర్షియన్ సంస్కృతికి సంబంధించిన సాహిత్యం పర్షియన్ భాషలో సృష్టించారు.
పర్షియన్ సాహిత్యం ప్రపంచ సాహిత్యాలలోకెల్లా గొప్ప సాహిత్యాలలో ఒకటిగా వర్ణించబడింది. గేథే అంచనా ప్రకారం ప్రపంచ సాహిత్యంలోని నాలుగు ప్రధాన సాహిత్యాలలో పర్షియన్ ఒకటి. పర్షియన్ సాహిత్యపు మూలాల మధ్య పర్షియన్, ప్రాచీన పర్షియన్ రచనలలో ఉంది. ప్రాచీన పర్షియన్ సాహిత్య చరిత్ర క్రీ.పూ. 522 నుంచి ప్రారంభమవుతుంది. ఐతే, పర్షియన్ సాహిత్యంలో ఎక్కువ భాగం సా.శ. 650లో ముస్లింలు పర్షియాను ఆక్రమించిన తరువాత కాలం నుండి వచ్చింది. సా.శ. 750లో అబ్బాసిడ్లు అధికారంలోకి వచ్చాకా ఇస్లామిక్ ఖలీఫత్లో అధికారులు, లేఖకులుగా పర్షియన్ల సంఖ్య పెరిగింది. ఈ అధికారులు, లేఖకుల్లో పర్షియన్ కవులు, రచయితలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండేవారు. గ్రేట్ ఇరాన్ ఈశాన్య భాగైన ఖొరాసన్లోనూ, ఈనాటి ఉబ్జెకిస్తాన్, తజకిస్తాన్, దక్షిణ కిర్గిస్తాన్, నైఋతి కజకిస్తాన్లు కలిసిన ప్రాచీన ట్రాన్సాక్సియానాలోనూ కొత్త పర్షియన్ భాషా సాహిత్యాలు విలసిల్లేవి. ఈ పరిణామం వెనుక ఇస్లామిక్ యుగానంతర ఇరాన్లో ఎదుగుతున్న తొలినాళ్ళ ఇరానియన్ రాజవంశాలైన టహిరిడ్, సమానిడ్ సామ్రాజ్యాలు ఖొరాసన్ ప్రాంతంలో నెలకొని ఉండడం వంటి రాజకీయ కారణాలు ఉన్నాయి.
పర్షియన్ కవులు ఫిరదౌసి, సాది, హఫీజ్, అత్తార్, నెజామి, రూమి,, ఒమర్ ఖయ్యామ్లు పశ్చిమ దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది, వివిధ దేశాల్లో పలు భాషల సాహిత్యాలను ప్రభావితం చేశారు.
పర్షియన్ కవుల్లో అత్యుత్తమమైన, ప్రీతిపాత్రులైన మధ్యయుగపు కవులలో కొందరు సూఫీలు. వారి కవిత్వాన్ని మొరాకో నుండి ఇండోనేషియా వరకు సూఫీలు విస్తృతంగా చదివారు. ముఖ్యంగా కవిగా సుప్రసిద్ధుడు, సూఫీయిజంలో పేరొందిన శాఖకు వ్యవస్థాపకుడు కూడా. ఈ భక్తి కవిత్వపు ఇతివృత్తాలను, వీటి శైలులను చాలా మంది సూఫీ కవులను విస్తృతంగా అనుకరించారు.
పర్షియన్ మార్మిక సాహిత్యంలో పలు ముఖ్యమైన గ్రంథాలు కవిత్వ రచనలు కావు, కానీ విస్తారంగా జనం చదివినవి, మన్నన పొందినవి వాటిలోనూ ఉన్నాయి. కిమియా-యి సాదత్, అస్రార్ అల్ తౌహిద్, కష్ఫ్ ఉల్ మహజూబ్ వాటిలో కొన్ని.
16వ శతాబ్దం ప్రారంభంలో, పర్షియన్ సంప్రదాయాలు జార్జియన్ పాలకవర్గాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. దీని ఫలితంగా జార్జియన్ కళ, వాస్తుశిల్పం, సాహిత్యాలపై పర్షియన్ ప్రభావం పడింది. జార్జియాను రష్యన్లు పరిపాలించడం మొదలుపెట్టేవరకూ ఈ సాంస్కృతిక ప్రభావం కొనసాగింది.
, ఘజ్నవీ దండయాత్రికులు, వారి వారసులైన ఘోరీ, తైముర్ వంటి వారి సైన్యాలు భారతదేశపు భూభాగాలను ఆక్రమించడం, మొఘల్ సామ్రాజ్యం ఆవిర్భావం వంటి పరిణామాలతో పర్షియన్ సంస్కృతి, దాని సాహిత్యం క్రమంగా దక్షిణ ఆసియాలోకి దిగుమతి చెందింది. మొదట్లో సాంస్కృతికంగా పర్షియన్లు అయిన టర్కిక్, ఆఫ్ఘన్ రాజవంశాలు తమతో పాటు పర్షియన్ భాషా సాహిత్యాలను భారత ఉపఖండంలోకి తీసుకువచ్చారు. పర్షియన్ భాష వందల సంవత్సరాలుగా ప్రభు వంశీకుల భాషగానూ, సాహిత్య భాషగానూ, మొఘల రాజాస్థానాల భాషగానూ కొనసాగింది. 19వ శతాబ్దం ప్రారంభంలో హిందూస్థానీ భాష ఈ స్థానాన్ని భర్తీ చేసింది.
16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్య పాలనలోని భారత ఉపఖండానికి పర్షియన్ అధికార భాష అయింది. 1832లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ దక్షిణాసియాను ఆంగ్లంలో అధికారికంగా వ్యవహరింపజేయడం ప్రారంభించేవరకూ పర్షియన్ ఆ స్థానంలో కొనసాగింది. (క్లావ్సన్, పే. 6) పర్షియన్ కవిత్వం ఈ దశలో భారతదేశంలోనే వృద్ధి చెందింది. సఫావిడ్ అనంతర ఇరాన్లో పర్షియన్ సాహిత్యం స్తబ్దుగా నిలిచిపోయింది. ఉదాహరణకు, డెహ్ ఖోడా, 20వ శతాబ్దానికి చెందిన ఇతర పర్షియన్ పండితులు తమ పరిశోధనను, రచనలను భారతదేశంలో రూపొందిన పర్షియన్ లెక్సికోగ్రఫీలను ఆధారం చేసుకునే నిర్మించారు. వీటిలో ఘాజీ ఖాన్ బదర్ ముహమ్మద్ డెహ్లావి రాసిన అదత్ అల్-ఫుధాలా ( اداة الفضلا ), ఇబ్రహీం గవాముద్దీన్ ఫరూగి రాసిన ఫర్హాంగ్-ఇ ఇబ్రహీమి ( فرهنگ ابراهیمی ), ముహమ్మద్ పాద్ షా రాసిన ఫర్హాంగ్-ఎ అనాంద్రజ్ فرهنگ آناندراج ) వంటివి ఉన్నాయి.
18, 19 శతాబ్దాలకు ముందు పర్షియన్ సాహిత్యం పశ్చిమ దేశాలలో పెద్దగా తెలియదు మధ్యయుగాంతానికి చెందిన పర్షియన్ కవుల రచనలు అనేకం పాశ్చాత్య భాషల్లోకి అనువాదమై ప్రచురణ పొందాకా బాగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాతి కాలంలో పర్షియన్ సాహిత్యం వివిధ పాశ్చాత్య కవులు, రచయితల రచనలకు ప్రేరణగా నిలిచింది.
This article uses material from the Wikipedia తెలుగు article పర్షియన్ సాహిత్యం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.