స్వెత్లానా అలెక్సీరోవ్నా అలెక్సీవిచ్(జననం 31 మే 1948) మనిషి స్వార్థపూరిత ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన యుద్ధాలు, విపత్తులపై అక్షరాలతో గళమెత్తిన బెలారస్ రచయిత్రి.
2015 సంవత్సరానికి సాహిత్యరంగంలో ఆమెకు నోబెల్ బహుమతి లభించింది. బెలారస్ నుండి ఈ పురస్కారం పొందిన మొదటి మహిళ ఆమె. ప్రపంచ యుద్ధాల మొదలు..అంతర్యుద్ధాలు, విదేశీ యుద్ధాలు, కోట్లాది జనం ఉసురు తీసే రసాయన, అణు యుద్ధాలు దాకా.. ప్రతి రక్తసిక్త రణ సందర్భాన్నీ పదునుగా విమర్శించినందుకుగాను, స్వెత్లానా సుదీర్ఘ కాలం పాటు మాతృదేశానికి దూరం కావాల్సి వచ్చింది.
స్వెత్లానా అలెక్సీవిచ్ | |
---|---|
రచయిత మాతృభాషలో అతని పేరు | Святлана Аляксандраўна Алексіевіч |
పుట్టిన తేదీ, స్థలం | స్వెత్లానా అలెక్సాండ్రోవ్నా అలెక్సీవీచ్ 1948 మే 31 స్టానిస్లావివ్, ఉక్రయిన్, సొవియట్ యూనియన్ |
వృత్తి | జర్నలిస్టు, రచయిత |
భాష | రష్యన్ |
జాతీయత | బెలరూసియన్ |
పూర్వవిద్యార్థి | బెలరూసియన్ రాష్ట్ర విశ్వవిద్యాలయం |
పురస్కారాలు | నోబెల్ బహుమతి (సాహిత్యం) (2015) Order of the Badge of Honour (1984) Peace Prize of the German Book Trade (2013) Prix Médicis (2013) |
Website | |
http://alexievich.info/indexEN.html |
ఆమె సోవియట్ యూనియన్లోని ఉక్రెయిన్ ఎస్ఎస్ఆర్లోగల స్టానిస్లావ్లో మే 31, 1948 న జన్మించారు. ఆమె తండ్రి బెలారసియన్ కాగా, తల్లి ఉక్రేనియన్ జాతీయురాలు. కుటుంబంలోని ఈ మిశ్రమ సాంస్కృతిక వాతావరణం స్వెత్లానా వ్యక్తిత్వాన్ని భిన్నమైనదిగా మలిచింది. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత అనేక చిన్న పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఈ క్రమంలో ‘నేమ్యాన్’ అనే సాహిత్య పత్రికలో ఉద్యోగం దొరికింది. అలా సాహిత్యంతో పరిచయం ఏర్పడి, పదునైన రచనలు చేసే స్థాయికి ఎదిగారు. అప్పటి నుంచీ ప్రవాసానికి వెళ్లేవరకూ జర్నలిస్టుగానే స్వెత్లానా జీవితం గడిచింది. ఈ కాలంలోనే (1979) సోవియట్ దళాలు అఫ్ఘానిస్థాన్ని దురాక్రమించాయి. ఆ యుద్ధంలో గాయపడిన సైనికులు, వారి కుటుంబాలను ఇంటర్వ్యూ చేసే క్రమంలో యుద్ధాలపట్ల ఆమె విముఖతను పెంచుకొన్నారు.
వృత్తిరీత్యా జర్నలిస్టు అయిన ఆమె బాల్యం రెండో ప్రపంచ యుద్ధం మిగిల్చిన భయానక వాతావరణంలో గడిచింది.ఆమె బెలారస్ ను 2000లో విడిచిపెట్టింది. అందువల్లనే ఆమె జర్నలిస్టుగా యుద్ధ బాధితుల వెతలను ప్రపంచానికి చూపించటమే లక్ష్యంగా పనిచేశారు. ముఖ్యంగా మహిళల దయనీయ పరిస్థితులే కథా వస్తువులుగా పలు పుస్తకాలు రాశారు. ఆమె ప్రధానంగా రష్యన్ భాషలోనే రచనలు చేశారు. చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రం దుర్ఘటన, సోవియట్ యూనియన్ విచ్చిన్నానికి ముందు, ఆ తర్వాత పరిస్థితుల చుట్టే ప్రధానంగా ఆమె రచనలు సాగాయి. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో 1985లో ఆమె రచించిన వార్స్ అన్వామింగ్లీ ఫేస్ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యుద్ధ బాధిత మహిళలే తమ గోడును స్వయంగా వెల్లబోసుకొంటున్నట్లు ఫస్ట్ పర్సన్లో సాగే ఈ పుస్తకం అనేక భాషల్లోకి అనువాదమైంది. దాదాపు 20 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి.
యుద్ధ బాధిత చిన్నారుల అనుభవాల ఆధారంగా ఆమె రాసిన ది లాస్ట్ విట్నెస్: ది బుక్ ఆఫ్ అన్చైల్డ్లైక్ స్టోరీస్ పుస్తకం కూడా ఆమెకు గొప్ప గుర్తింపు తెచ్చింది. సోవియట్ యూనియన్ పతనం ఆధారంగా 1993లో రాసిన ఎన్చాంటెడ్ విత్ డెత్ పుస్తకం నాటి ప్రజల మానసిక సంఘర్షణలను ప్రపంచానికి సజీవంగా చూపింది. అత్యుత్తమ రచనలు చేసిన ఆమెకు అనేక అవార్డులు లభించాయి. చెర్నోబిల్ దుర్ఘటన బాధితులపై రాసిన వాయిసెస్ ఆఫ్ చెర్నోబిల్ గ్రంథానికి 2005లో నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు లభించింది.
గొప్ప ఆదర్శాల పునాదులపై మొదలయిన సోవియట్ రాజ్య వ్యవస్థ, దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ, కఠిన చట్రంగా మారిపోయి, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిన దశను కళ్ళారా చూసిన తరాలకు చెందిన రచయిత్రి ఈమె. ఎర్ర రాజ్యంపై అయిదు పాత్రికేయ కథనాల రచనలు, తన ముప్ఫయి అయిదేళ్ళ రచనా జీవితంలో చేసినందుకు, తగు గుర్తింపుతో బాటు దూషణ, తిరస్కారాలను పొందింది. ఆ అయిదు పుస్తకాలు ఇవి.
ఈ రచనలన్నిటిలో ప్రధాన లక్షణం, డాక్యుమెంటరీ చిత్రణ, న్యూస్ రీల్ పని, వార్తా స్రవంతి వలె విషయాన్ని అమర్చడం.
This article uses material from the Wikipedia తెలుగు article స్వెత్లానా అలెక్సీవిచ్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.