ఆంధ్రప్రదేశ్లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి.
సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.
శ్రీనాధుడు (సా.శ. 14 నుండి 15వ శతాబ్డం) రచించిన భీమేశ్వర పురాణములో ఈ పంచారామాల ఉద్భవం గురించి ఒక కథ ఇలా ఉంది. క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపం ధరించి సురాసురులకు పంచుచుండగా, పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల, నాధుల నేతృత్వములో తీవ్రమైన జపతపాలను ఆచరించగా శివుడు మెచ్చి, వారికి వరములిచ్చాడు. కొత్తగా సంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేయడంతో వారు మహాదేవుని శరణువేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులనూ వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిధ్దికెక్కినది. ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురులు పూజ చెసిన ఒక పెద్ద లింగం మాత్రం చెక్కుచెదరలేదు. దీనినే మహదేవుడు ఐదు ముక్కలుగా ఛేదించి ఐదు వేరు వేరు ప్రదేశములందు ప్రతిష్ఠించుటకు పంచిపెట్టడం జరిగింది. లింగ ప్రతిష్ఠ చేసిన ఈ ఐదు ప్రదేశాలే పంచారామాలుగా ప్రసిద్ధికెక్కాయి.
స్కాంద పురాణంలోని తారాకాసుర వధా ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తోంది. హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లా తనకు మరణం లెకుందా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా! సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడమూ, వారతనిని గెలవలేకపొవటం జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలీ, పరమేశ్వర రక్షితుడూ అయిన తారకుడిని సామాన్య బాలకులేవ్వరూ గెలవడం అసాధ్యమని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు - కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు.
శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః
యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహబలః
- స్కాందం
తారకాసురుడు నేలకూలడంతో అతని యందున్న ఆత్మలింగం ఐదు ఖండాలుగా మారింది. దేవతలు ఆ ఐదు లింగ శకలాలను ఐదు చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచారామ క్షేత్రాలు. అవి:
అమరావతిక్షేత్రం లోని అమరేశ్వరస్వామి దేవాలయం గుంటూరుకు 35 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నెలకొన్న శివలింగాన్ని ఇంద్రుడు నెలకొల్పడని ప్రసిద్ధి. ఇక్కడ శివుడు అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.
కోనసీమ జిల్లాలో, కాకినాడకు ముఫ్పై కిలోమీటర్ల దూరంలో దక్షారామ క్షేత్రం ఉంది. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో సా.శ. 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్తంభాలపై, గోడలపై 800 పైగా శాసనాలు ఉన్నాయి. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ, క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. శివాలయంతో పాటు విష్ణ్వాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం దక్షారామము. దక్షప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేసాడని ప్రసిధ్ది . తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలకున్నారు. మార్గమధ్యమంలో తుల్యఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋుషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋుషులను గోదావరులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్యభగవానుడు శివలింగానికి ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋుషులను వేదవ్యాసుడు ఓదార్చి తాను సప్తగోదావరులను పుష్కరిణితో చేర్చానాని అది సప్తగోదావరిగా పిలువబడుతుందని, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు.
నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్యప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్యప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజ స్ధంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్లనీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరనారాయణ స్వాములని పిలుస్తారు.
భీమేశ్వర లింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది. ఆలయం రెండో అంతస్తులో ఉందు. అభిషేకాదులు పై అంతస్తులో లింగ భాగానికి చేస్తారు.
పశ్చిమ గోదావరి భీమవరం గునుపూడిలో సోమారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు అమ్మవారు ఉమాదేవి. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్ధనస్వామి ఆలయంఅంటారు. తూర్పుచాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడోశతాబ్దంలో నిర్మించాడు. మామూలురోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజున గోధుమ వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యధారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను అన్నపూర్ణా దేవి అమ్మవారు పైఅంతస్తులోనూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్ధన స్వామి.
కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో కుమారభీమారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు తల్లి బాలా త్రిపుర సుందరి. ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 14 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. దీనిని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఇది పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిధ్ధి చెందినట్టు భీమేశ్వరాలయంలోని శిలాశాసనాలనుబట్టి తెలుస్తోంది. ఈయనే దాక్షారామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా, నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది. ఈ మందిరం నిర్మాణం సా.శ.892లో ప్రారంభమై సుమారు సా.శ.922 వరకు సాగింది.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో క్షీరారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామి వారు రామలింగేశ్వర స్వామి, అమ్మ వారు పార్వతి. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతా యుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్ధనుడు. ఆలయ విశేషం తొమ్మిది అంతస్తులతో 20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం. చివర అంతస్తు దాకా వెళ్లడానికి లోనికి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగం రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్దగోపురం నుండి శివలింగంపై పడతాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ యాత్రికులకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
This article uses material from the Wikipedia తెలుగు article పంచారామాలు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.