అనితా మజుందార్ దేశాయి భారతీయ నవలా రచయిత్రి, విశ్వవిద్యాలయ ఆచార్యులు.
1937జూన్ 24న జన్మించిన అనితా మజుందార్ రచయిత్రిగా మూడు పర్యాయాలు బుకర్ ప్రైజ్ కు నామినేట్ అయ్యింది. 1978లో ఫైర్ అన్ ది మౌంటెన్ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. ద విలేజ్ బై ది సీ రచనకు గానూ ఆమె బ్రిటీష్ గార్డియన్ ప్రైజ్ను పొందింది.
అనితా దేశాయి | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | అనితా మజుందార్ 1937 జూన్ 24 ముస్సోరీ, భారతదేశం |
వృత్తి | రచయిత, ఆచార్యులు |
జాతీయత | భారతీయురాలు |
పూర్వవిద్యార్థి | ఢిల్లీ విశ్వవిద్యాలయం |
కాలం | 1963–వర్తమానం |
రచనా రంగం | కాల్పానిక |
సంతానం | కిరణ్ దేశాయ్ |
అనితా మజుందార్ ఉత్తర భారతదేశంలోని నేటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రడన్ జిల్లాలోని ముస్సూరీలో జన్మించింది. టోనీ నైమ్, డి.ఎన్.మజుందార్ ఈమె తల్లిదండ్రులు. తల్లి జర్మన్ జాతీయురాలు, తండ్రి బెంగాళీ వ్యాపారవేత్త. ఇంట్లో తల్లిదండ్రుల భాషలు నేర్చుకుంటూ పెరిగింది. ఆమె సాహితీక్షేత్రానికి సాధనమైన ఆంగ్లభాషను పాఠశాల స్థాయిలో నేర్చుకుంది. తరువాత ఉర్దూ, హిందీ భాషలూ అలవడినవి. అనిత తన ఏడవ యేట నుండే రచనలు చేయడం ప్రారంభించింది. తొమ్మిది సంవత్సరాల వయస్సులోనే ఆమె రాసిన కథ అచ్చైంది.
ఢిల్లీలోని క్వీన్ మేరీ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి 1957లో ఆంగ్లసాహిత్యం ఐచ్చికాంశంగా పట్టభద్రురాలైంది. అదే సంవత్సరం ఓ సాఫ్ట్వేర్ కంపెనీ డైరెక్టర్, రచయిత అయిన అశ్విన్ దేశాయిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నలుగురు పిల్లలు. బుకర్ ప్రైజ్ విజేత నవలా రచయిత అయిన కిరణ్ దేశాయి ఆ నలుగురిలో ఒకరు. అనిత వారాంతాలలో తన పిల్లలను అలీబాగ్ సమీపాన ఉన్న తుల్ కు వెళ్ళేది. అక్కడి అనుభవాలు, సంగతుల ఆధారంగానే ఆమె ది విలేజ్ బై ది సీ పుస్తకాన్ని రచించింది. ఈ పుస్తకం 1983లో గార్డియన్ చిల్డ్రన్స్ ఫిక్షన్ ప్రైజ్ను గెలుచుకుంది. బ్రిటీష్ బాల సాహిత్య సృజనకారులు ఈ పుస్తకానికి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని కూడా ప్రకటించారు.
1963లో అనితా దేశాయి తన మొదటి నవల క్రై ది పికాక్ వెలువరించింది. 1980లో క్లియర్ లైట్ ఆఫ్ డే వెలువరించింది.ఇది ఆమె జీవన స్మృతుల ఆధారంగా రాయబడింది. 1984లో ఇన్ కస్టడీ నవలను ప్రచురించింది. ఇది ఒక ఉర్దూ రచయిత చరమాంక జీవితాన్ని ప్రతిబింబించిన రచన. 1993లో అనితా దేశాయి మసాచుసెట్ సాంకేతిక విద్యాలయంలో క్రియేటివ్ విభాగంలో అధ్యాపకురాలిగా చేరింది ఇటీవల తన కథలను ద ఆర్టిస్ట్ ఆఫ్ డిసప్పీయరెన్స్ పేరుతో కథాసంకలనంగా 2011లో వెలువరించింది.
అనితా దేశాయి మౌంట్ హోల్యోక్ కళాశాలలో, బార్చ్ కళాశాలలో, స్మిత్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసింది. రాయల్ సొసైటీ (సాహిత్యం) ఫెలోగా గౌరవాన్ని అందుకుంది.
అనితా దేశాయి రచించిన ఇన్ కస్టడీ నవల ఆధారంగా 1993లో అదే పేరుతో ఆంగ్లంలో చలనచిత్రం వచ్చింది. దీనిని మర్చంట్ ఐవరీ ప్రోడక్షన్స్ నిర్మించింది. షారుక్ హుస్సేన్ చిత్రానువాదం చేయగా, ఇస్మాయిల్ మర్చంట్ దర్శకత్వం వహించాడు ఈ చిత్రానికి భారత రాష్ట్రపతి నుండి ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కింది. ఈ చిత్రంలో శశి కపూర్, షబనా అజ్మీ, ఓంపురి తదితరులు నటించారు.
This article uses material from the Wikipedia తెలుగు article అనితా దేశాయి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.