సర్ విద్యాధర్ సూరజ్ప్రసాద్ నైపాల్ ( 1932 ఆగస్టు 17 - 2018 ఆగస్టు 11) ట్రినిడాడ్, టొబాగోలో జన్మించిన బ్రిటిష్ రచయిత.
కల్పన, కల్పనేతర రచనలను ఆంగ్లంలో రాశాడు. అతణ్ణి సాధారణంగా వి.ఎస్. నైపాల్ అని, విడియా నైపాల్ అనీ పిలుస్తారు. ట్రినిడాడ్ నేపథ్యంలో రాసిన కామిక్ నవలలకు, విస్తృత ప్రపంచంలో పరాయీకరణపై రాసిన నవలలకు, జీవితం గురించి, ప్రయాణాల గురించీ రాసిన నవలలకూ అతడు ప్రసిద్ధుడు. అతను రాసే గద్యాన్ని ప్రజలు ఆరాధిస్తారు. కాని అతని అభిప్రాయాలు కొన్నిసార్లు వివాదాన్ని రేకెత్తించాయి. యాభై ఏళ్ళలో ముప్పైకి పైగా పుస్తకాలను ప్రచురించాడు.
వి.ఎస్ నైపాల్ | |
జననం: | 17 ఆగస్టు 1932, 31 జూలై 1932 |
---|---|
వృత్తి: | నవలా రచయిత, వ్యాస రచయిత |
జాతీయత: | ట్రినిడాడ్ దేశీయుడు |
శైలి: | Novel |
Literary movement: | రియలిజం, పోస్ట్కలోనియలిజం |
నైపాల్ తన ఇన్ ఎ ఫ్రీ స్టేట్ నవల కోసం 1971 లో బుకర్ బహుమతిని గెలుచుకున్నాడు. 1989 లో అతనికి ట్రినిడాడ్ అండ్ టొబాగో యొక్క అత్యున్నత జాతీయ గౌరవం, ట్రినిటీ క్రాస్ లభించింది. అతను 1990 లో బ్రిటన్లో నైట్ హుడ్, 2001 లో సాహిత్యంలో నోబెల్ బహుమతీ పొందాడు.
19 వ శతాబ్దం చివరలో, నైపాల్ తాతలు ట్రినిడాడ్ తోటలలో పనిచేయడానికి భారతదేశం నుండి వలస వెళ్ళారు. అతని నవల ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిస్వాస్ 1961 లో ప్రచురించబడింది. దాని ప్రచురణ యొక్క యాభైవ వార్షికోత్సవం సందర్భంగా, అతను దానిని తన భార్య ప్యాట్రిసియా అన్నే హేల్కు అంకితం చేశాడు. అతని రచనలకు తొలి పాఠకురాలు, ఎడిటరూ విమర్శకురాలూ అమెయే.
నైపాల్ 1932 ఆగస్టు 17 న ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని చాగువానాస్లో జన్మించాడు. అతను ద్రోపతి కపిల్దేవ్, సీపర్సాద్ నైపాల్ దంపతుల రెండవ సంతానం. వారిది హిందూ కుటుంబం. అతని తమ్ముడు రచయిత శివ నైపాల్. 1880 లలో, అతని తాతలు భారతదేశం నుండి చక్కెర తోటలలో ఒప్పంద కార్మికులుగా పనిచేయడానికి వలస వచ్చారు. ట్రినిడాడ్లోని భారతీయ వలస సమాజంలో, నైపాల్ తండ్రి ఆంగ్ల భాషా పాత్రికేయుడు అయ్యాడు. 1929 లో ట్రినిడాడ్ గార్డియన్కు వ్యాసాలు అందించడం ప్రారంభించాడు. 1932 లో, నైపాల్ జన్మించిన సంవత్సరంలో, అతని తండ్రి చాగువానాస్ కరస్పాండెంట్గా సిబ్బందిలో చేరారు. "ఎ ప్రోలోగ్ టు ఎన్ ఆటోబయోగ్రఫీ" (1983) లో నైపాల్, రచయితల పట్ల, రచనా జీవితం పట్ల తండ్రి కున్న ఆరాధనే రచయితగా మారాలన్న తన సొంత కలలు, ఆకాంక్షల లోకి విస్తరించిందని రాసుకున్నాడు.
1939 లో, అతనికి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు, నైపాల్ కుటుంబం ట్రినిడాడ్ రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని ఒక పెద్ద ఇంట్లోకి మారారు. అక్కడ, నైపాల్, ప్రభుత్వం నడుపుతున్న క్వీన్స్ రాయల్ కాలేజీలో చేరాడు. దీన్ని బ్రిటిషు ప్రభుత్వ పాఠశాల మాదిరిగానే రూపొందించారు. గ్రాడ్యుయేషన్ తరువాత నైపాల్, ట్రినిడాడ్ ప్రభుత్వ స్కాలర్షిప్ను గెలుచుకున్నాడు. దాంతో బ్రిటిష్ కామన్వెల్త్లోని ఉన్నత విద్యాసంస్థలలో చదివేందుకు వీలు కలిగింది. అతను ఆక్స్ఫర్డును ఎంచుకున్నాడు.
ఆక్స్ఫర్డ్లోని యూనివర్శిటీ కాలేజీలో, నైపాల్ రచన ప్రయత్నాలు చేసాడు. ఒంటరితనం, తన సామర్థ్యంపై అపనమ్మకం వల్ల అతను నిరాశకు గురయ్యాడు. 1952 ఏప్రిల్ లో, అతను హఠాత్తుగా స్పెయిన్ వెళ్ళాడు. తను ఆదా చేసిన మొత్తాన్ని అక్కడ ఖర్చు పెట్టేసాడు. తన ఈ హఠాత్తు యాత్రను "నెర్వస్ బ్రేక్డౌన్" అని పిలిచాడు. ముప్పై సంవత్సరాల తరువాత, అతను దీనిని "మానసిక అనారోగ్యం లాంటిది" అని అన్నాడు.
1952 లో, స్పెయిన్ సందర్శించడానికి ముందు, నైపాల్ తన కాబోయే భార్య ప్యాట్రిసియా ఆన్ హేల్ను కళాశాల నాటకంలో కలుసుకున్నాడు. హేల్ మద్దతుతో, అతను కోలుకోవడం, క్రమంగా రాయడం మొదలు పెట్టాడు. అతని కెరీర్ను ప్లాన్ చేయడంలో ఆమె భాగస్వామి అయింది. ఆమె కుటుంబం వీరి సంబంధం పట్ల వ్యతిరేకంగా ఉంది; అతని కుటుంబం ఆసక్తి చూపలేదు. 1953 జూన్ లో, నైపాల్, హేల్ లు ఆక్స్ఫర్డ్ నుండి పట్టభద్రులయ్యారు. నైపాల్ రెండవ తరగతి డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు . అతని ఆక్స్ఫర్డ్ ట్యూటర్ పీటర్ బేలే తరువాత, "అతనికి రెండవ తరగతి డిగ్రీ ఇచ్చినందుకు నైపాల్ మమ్మల్ని క్షమించలేదు" అని వ్యాఖ్యానించాడు.
1953 లో, నైపాల్ తండ్రి మరణించాడు. అతను చిన్నా చితకా ఉద్యోగాలు చేసాడు. హేల్ దగ్గరా, ట్రినిడాడ్లోని అతని కుటుంబం నుండి డబ్బు అప్పు తీసుకున్నాడు.
నైపాల్ 1954 లో లండన్ వెళ్లాడు. 1955 జనవరి లో, అతను, పాట్రీషియా పెళ్ళి చేసుకున్నారు. 1954 డిసెంబరు లో, అతను వారానికి ఒకసారి BBC రేడియో కార్యక్రమం కరేబియన్ వాయిస్లో కనిపించడం ప్రారంభించాడు. పాత లాంగ్హామ్ హోటల్లోని బిబిసి ఫ్రీలాన్సర్స్ గదిలో కూర్చుని, మిగ్యూల్ స్ట్రీట్ లోని మొదటి కథ, "బోగార్ట్"ను రాసాడు. ఇది పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో తనకు తెలిసిన ఒక పొరుగువారి నుండి ప్రేరణ పొంది రాసినది. నైపాల్ ఐదు వారాల్లో మిగ్యూల్ స్ట్రీట్ రాశాడు. న్యూయార్క్ టైమ్స్ ఈ పుస్తకం గురించి ఇలా చెప్పింది: "స్కెచ్లు తేలికగా రాసాడు - తద్వారా విషాదాన్ని తక్కువ చేసి, కామెడీని పెంచి చూపాడు. అయినప్పటికీ చివరికి నిలిచేది సత్యమే."
నైపాల్ తన 86 వ పుట్టినరోజుకు ఒక వారం ముందు, 2018 ఆగస్టు 11 న తన 85 వ ఏట లండన్లోని తన ఇంటిలో మరణించాడు. అతని భార్య, నాదిరా నైపాల్, తన భర్త మరణాన్ని ధ్రువీకరించింది, "తాను ప్రేమించిన వారి మధ్య చనిపోయాడు". సర్ సల్మాన్ రష్దీ "మేము మా జీవితాంతం, రాజకీయాల గురించి, సాహిత్యం గురించి విభేదించాం. నేను నా స్వంత అన్నయ్యను కోల్పోయినట్లు బాధపడుతున్నాను. RIP విడియా. " అని నివాళి అర్పించాడు
This article uses material from the Wikipedia తెలుగు article విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.