లిపులేఖ్ కనుమ (ఎత్తు 5,200 మీటర్లు ) భారతదేశం లోని ఉత్తరాఖండ్ రాష్ట్రానికి, చైనాలోని టిబెట్ ప్రాంతానికీ మధ్య సరిహద్దులో, హిమాలయాల్లో ఉన్న కనుమ.
ఇది, నేపాల్తో ఈ రెండు దేశాల సరిహద్దులు కలిసే ట్రైజంక్షను సమీపంలో ఉంది. కనుమకు దక్షిణ భాగంలో ఉన్న కాలాపానీ భూభాగం - భారతదేశం నియంత్రణలో ఉంది - తనదని నేపాల్ వాదిస్తోంది. ఈ కనుమ టిబెట్లోని చైనా వాణిజ్య పట్టణం తక్లాకోట్కు ( పురంగ్ ) సమీపంలో ఉంది. పురాతన కాలం నుండి భారతదేశం, టిబెట్ ల మధ్య ప్రయాణించే వ్యాపారులు, యాచకులు, యాత్రికులూ దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. కైలాస్, మనసరోవర్ లకు వెళ్ళే యాత్రికులు కూడా దీన్ని ఉపయోగిస్తారు.
లిపులేఖ్ కనుమ | |
---|---|
సముద్ర మట్టం నుండి ఎత్తు | 5,200 m (17,060 ft) |
ప్రదేశం | భారతదేశపు ఉత్తరాఖండ్కు, చైనా లోని టిబెట్కూ మధ్య సరిహద్దు |
శ్రేణి | హిమాలయాలు |
Coordinates | 30°14′03″N 81°01′44″E / 30.234080°N 81.028805°E |
ఈ కనుమ ఉత్తరాఖండ్ లోని బ్యాన్స్ లోయను టిబెట్ స్వాధికార ప్రాంతంతో కలుపుతుంది. ఇది భారత భూభాగం లోని చిట్టచివరి ప్రాదేశిక బిందువు. కైలాష్ పర్వతం, మానసరోవర్ సరస్సుకి హిందూ మతస్థులు చేసే తీర్థయాత్ర ఈ కనుమ గుండానే వెళుతుంది. లిపులేఖ్ కనుమ, టిబెట్ లోని ప్రాచీన వ్యాపార పట్టణం పురాంగ్ (తక్లాకోట్) సమీపంలో ఉన్న చాంగ్ లోబోచహేలా ను కలుపుతుంది.
చైనాతో వాణిజ్యం కోసం ప్రారంభించిన మొదటి భారత సరిహద్దు పోస్టు ఈ కనుమ.1992 లో దీన్ని తెరిచారు. దీని తరువాత 1994 లో హిమాచల్ ప్రదేశ్ లోని షిప్కి లా, 2006 లో సిక్కిం లోని నాథు లా ల వద్ద ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం, లిపులేఖ్ కనుమ ఏటా జూన్ నుండి సెప్టెంబరు వరకు సరిహద్దు వాణిజ్యం కోసం తెరిచి ఉంటుంది.
భారతదేశం నుండి ఎగుమతి కోసం క్లియర్ చేసిన ఉత్పత్తులలో బెల్లం, పటిక బెల్లం, పొగాకు, సుగంధ ద్రవ్యాలు, పప్పుధాన్యాలు, ఫఫర్ పిండి, కాఫీ, కూరగాయల నూనె, నెయ్యి, వివిధ ఇతర వినియోగ వస్తువులు ఉన్నాయి. భారతదేశంలోకి ప్రధాన దిగుమతులు గొర్రె ఉన్ని, పాసమ్, గొర్రెలు, మేకలు, బోరాక్స్, యాక్ తోకలు, చిర్బీ (వెన్న), ముడి పట్టు ఉన్నాయి.
2014 లో భారత చైనా సంబంధాలను మెరుగుపరిచేందుకు రెండు సైన్యాల మధ్య క్రమం తప్పకుండా సంప్రదింపులు, పరస్పర చర్యల కోసం భారత, చైనా సైన్యాల మధ్య సరిహద్దు సిబ్బంది సమావేశ సమావేశ స్థలంగా ఈ కనుమను ఉపయోగించడం గురించి చర్చించారు.
లిపులేఖ్ కనుమ వద్ద వాస్త్వాధీన రేఖకు కాస్త దూరంలో దాదాపు 1,000 మంది చైనా సైనికులను మీహరించినట్లుగా ఆగస్టులో వార్తలు వచ్చాయి. ఓవైపు అక్సాయ్ చిన్లో సైనిక ప్రతిష్ఠంభన కొనసాగుతూండగా ఇక్కడ ఈ మోహరింపు జరిగింది,
కనుమకు దక్షిణ భాగంలో కాలాపానీ అని పిలే భూభాగంపై నేపాల్ వాదనలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నేపాల్కూ మధ్య 1816 నాటి సాగౌలి ఒప్పందాన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి. ఈ ఒప్పందం కాళి నది (దీనిని శారదా నది అనీ, మహాకాళి నది అనీ కూడా పిలుస్తారు) ని సరిహద్దుగా గుర్తించింది. ఈ నది కాలాపానీ గ్రామంలో ప్రారంభమవుతుందని, ఇక్కడే దాని ఉపనదులన్నీ విలీనం అవుతాయని భారత్ పేర్కొంది. కానీ ఇది లిపులేఖ్ కనుమ నుండి ప్రారంభమవుతుందని నేపాల్ వాదించింది. చారిత్రిక రికార్డు ప్రకారం, 1865 లో కొంతకాలం పాటు బ్రిటిషు వారు, కాలాపానీ సమీపంలో ఉన్న సరిహద్దును నదికి బదులుగా కాలాపానీ నది వాటర్షెడ్కు మార్చారు. తద్వారా ఈ ప్రాంతాన్ని ఇప్పుడు కాలాపానీ భూభాగం అని పిలుస్తారు. ఇది, కాళీ నది కాలాపానీ బుగ్గల నుండి మాత్రమే ప్రారంభమవుతుందనే బ్రిటిష్ అభిప్రాయానికి అనుగుణంగానే ఉంటుంది. దీని అర్థం సుగౌలి ఒప్పందం బుగ్గలకు ఎగువన ఉన్న ప్రాంతానికి వర్తించదు.
2015 లో భారత ప్రధాని చైనా పర్యటన తరువాత, లిపులేఖ్లో వాణిజ్య కేంద్రం తెరవడానికి భారత్, చైనాలు అంగీకరించాయి. దీనిపై నేపాల్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 'వివాదాస్పద భూభాగంపై నేపాల్ సార్వభౌమ హక్కులను ఈ ఒప్పందం ఉల్లంఘిస్తోంది' అని నేపాల్ పార్లమెంటు పేర్కొంది. నేపాల్ ఇప్పుడు భారత్తో దౌత్య మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తోంది.
This article uses material from the Wikipedia తెలుగు article లిపులేఖ్ కనుమ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.