కారకోరం కనుమ భారతదేశం, చైనా ల మధ్య కారకోరం పర్వత శ్రేణిలో ఉన్న 5,540 మీటర్ల పొడవైన కనుమ.
లడఖ్లోని లే, తారిమ్ బేసిన్లోని యార్కండ్ ల మధ్య పురాతన బిడారు మార్గంలో ఇది అత్యంత ఎత్తైన కనుమ. 'కారకోరం' అంటే మంగోలిక్ భాషలో 'నల్ల గులకరాయి' అని అర్ధం.
కారకోరం కనుమ | |
---|---|
సముద్ర మట్టం నుండి ఎత్తు | 5540 మీ |
ప్రదేశం | భారత చైనా సరిహద్దు |
శ్రేణి | కారకోరం శ్రేణి |
Coordinates | 35°30′48″N 77°49′23″E / 35.51333°N 77.82306°E |
కారకోరం కనుమ |
కనుమ చాలా ఎత్తున ఉండడం, పశుగ్రాసం లేకపోవడం వలన చారిత్రికంగా లెక్కలేనన్ని రవాణా జంతువులు మరణాల పాలయ్యాయి. మార్గం పొడవునా ఎముకలు పడి ఉండడం కనిపిస్తుంది. కనుమను చేరుకునే మార్గంలో వృక్షసంపద దాదాపు అసల్లేదు.
కనుమ నుండి దక్షిణం వైపుకు చేసే ప్రయాణంలో 5,300 మీటర్ల ఎత్తున ఉన్న డెప్సాంగ్ బంజరు మైదానంలో మూడు రోజులు నడవాల్సి ఉంటుంది. ఉత్తరం వైపున కొంత మేరకు జన సంచారం ఉంటుంది. ఈ దారిలో తక్కువ ఎత్తున ఉన్న సుగెట్ కనుమ గుండా సాగే ప్రయాణం, సాపేక్షికంగా కొంత సులభంగా కూడా ఉంటుంది. కరాకాష్ నది ఎగువ మైదానం లోని షహీదుల్లా (జైదుల్లా) చేరేసరికి ఆ చుట్టుపక్కల పచ్చటి గడ్డిమైదానాలు కనిపిస్తాయి.
ఈ కనుమ రెండు పర్వతాల మధ్య 45 మీటర్ల వెడల్పున ఉంది. ఇక్కడ వృక్షసంపద లేదు. ఇక్కడ వీచే గాలుల కారణంగా ఐస్క్యాప్ కూడా ఉండదు. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. గాలులు చాలా వేగంగా వీస్తూంటాయి, మంచు తుఫానులు వస్తూంటాయి. చాలా ఎత్తున ఉండడం వలన కలిగే ఇబ్బందులు తరచూ కలుగుతూంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ, రెండు వైపులా వాలు ఎక్కువగా ఉండడం చేతను, వేసవిలో మంచు ఉండకపోవడం వలనా, ఏడాది పొడుగునా ఐసు ఉండకపోవడం వల్లనూ కారకోరం కనుమను సాపేక్షికంగా సులభమైన కనుమగా పరిగణిస్తారు. అందుచేత ఈ కనుమ ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది. కనుమలో మోటారు వాహనాలు వెళ్ళేలా రహదారి లేదు. ప్రస్తుతం ఈ కనుమ అసలు వాహనాలే వెళ్ళకుండా మూసివేసి ఉంచారు.
కారకోరం కనుమ భారత భూభాగం లోని లడఖ్కు, చైనా లోని జిన్జియాంగ్ స్వయంప్రతిపత్త ప్రాంతానికీ మధ్య గల సరిహద్దులో ఉంది.
కనుమకు నైఋతి దిశలో ఉన్న సియాచిన్ హిమానీనదం ప్రాంతంపై నియంత్రణ విషయంలో భారత, పాకిస్తాన్ల మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో ఇది ప్రధానమైన భౌగోళిక పాత్ర పోషిస్తోంది. 1972 లో భారత పాకిస్తాన్ లు సంతకం చేసిన సిమ్లా ఒప్పందంలో, నియంత్రణ రేఖ చివరి నుండి చైనా సరిహద్దు వరకు ఉన్న చివరి 100 కిలోమీటర్లను నిర్వచించకపోవడంతో ఈ వివాద పరిస్థితి ఏర్పడింది. .
ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్కు సంబంధించి 1963 లో చైనా, పాకిస్తాన్ ల మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందంలో కారకోరం కనుమ వద్ద భారత-చైనా-పాకిస్తాన్ ల త్రిబిందువును సూచించారు. కాని ఆ ఒప్పందానికి గానీ, ఏ త్రిబిందు ఒప్పందానికి గానీ భారతదేశం పార్టీ కాదు. అన్ని ప్రధానమైన కనుమలు, సాల్టోరో రిడ్జ్ (సియా లా, బిలాఫాండ్ లా, జ్యోంగ్ లా, యర్మ లా (6,100 మీ), చులుంగ్ లా (5,800 మీ) లతో సహా ) లోని అన్ని శిఖరాలతో సహా మొత్తం సియాచిన్ హిమానీనదం అంతా 1984 నుండి భారత పరిపాలనలో (ప్రస్తుతం లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగంగా) ఉంది. ప్రస్తుత వాస్తవ త్రిబిందువు కారకోరం కనుమకు 100 కి.మీ. పశ్చిమాన, ఇందిరా కల్ వద్ద, భారత, పాకిస్తాన్ దళాల మధ్య ఉన్న వాస్తవ క్షేత్రస్థితి రేఖ చైనా సరిహద్దును కలిసే వద్ద ఉంది.
This article uses material from the Wikipedia తెలుగు article కారకోరం కనుమ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.