ఆతుకూరి మొల్ల, (1440-1530) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి.
తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణంను రాసినది. ఈమె కుమ్మరి కుటుంబంలో జన్మించింది. మొల్ల శ్రీ కృష్ణదేవరాయలు సమయం (16వ శతాబ్దం) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైంది, రమణీయమైంది.
మొల్ల జీవించిన కాలం గురించి పరిశోధకులలో భిన్నాభిప్రాయాలున్నాయి. 'సన్నుత సుజ్ఞాన సవివేకి వాల్మీకి' దగ్గరనుండి 'తిక్కకవిరాజు భోజు' వరకూ మొల్ల నుతించింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో ఆమె పేర్కొనని కారణంగా ఆమె రాయలవారి సమయానికే కవయిత్రి అయి ఉండాలని భావిస్తున్నారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు మొల్ల, తెనాలిరామలింగడు సమకాలీకులని వెల్లడిస్తున్నాయి. 16వ శతాబ్దికి చెందిన ఏకామ్రనాధుడనే చరిత్రకారుడు తన ప్రతాపచరిత్రలో మొల్లను పేర్కొన్నాడు. అందులో పేర్కొన్న సాంఘిక పరిస్థితులను బట్టి మొల్ల సుమారుగా సా.శ. 1581 కి ముందుగా జీవించి ఉండేదనిపిస్తున్నది. ఆమె తిక్కన సోమయాజికీ, భాస్కరునికీ, ప్రతాపరుద్రునికీ సమకాలీనురాలు కావచ్చును కూడాను. ఈమె కులావంశ సంజాత. ఇంటి పేరు ఆతుకూరివారు. కులాన్నిబట్టి కుమ్మరి మొల్ల అని వ్యవహరించబడుచున్నది. ఈమె జనకుడు కేతనపెట్టి. గ్రంథావతారికలో ఆదికవి స్థుతియందు శ్రీనాథుడిని స్మరించియుండుటచే ఈమె శ్రీనాథుని తరువాత కాలమున ఉండెడిదని తెలియుచున్నది. చరిత్ర పరిశోధకులు 1525సం. ప్రాంతమని నిర్ణయించారు. ఈమె ఆజన్మబ్రహ్మచారిణి అని చెప్పెదరు.
మొల్ల స్వస్థలం కడప జిల్లా, గోపవరం మండలం, గోపవరం గ్రామం. ఈ గ్రామం కడప పట్టణానికి 56 కి.మీ దూరంలో, బద్వేలుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈమె ఈ ప్రాంతానికి చెందినదని మొల్ల రామాయణంలోని ఈ క్రింది పద్యం ద్వారా తెలుస్తుంది.
“ | గావ్య సంపద క్రియలు నిఘంటువులును-గ్రామం లేవియు నెఱుఁగ, విఖ్యాత గోప వరపు శ్రీ కంఠమల్లేశు వరముచేత - నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా నేర్చుకొంటి | ” |
నెల్లూరు దగ్గర ఇంకో గోపవరం ఉన్నా గానీ అక్కడ శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం లేదు. మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది. శ్రీరామాలయం గోపవరంలోనే ఉంది. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఉంది. గ్రామస్థులు ఈ బండకు పూజ చేయడం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు ఈ గోపవరంలో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకొంటూ ఉంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరుకు చెంది ఉంటారనీ, అందుకే ఆతుకూరు ఇంటిపేరు అయిందనీ కొందరి అభిప్రాయం. కుమ్మరి కులానికి చెందిన మొల్ల ఈ ప్రాంతానికి చెందినదనడానికి గోపవరం దగ్గర కుమ్మరి కులాలవారూ ఉన్నారు. మొల్ల నివసించిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు ఉంది. పెద్దన, తెనాలి రామలింగడు కూడా గోపవరం వచ్చి మహా భక్తురాలైన కవయిత్రి మొల్లను దర్శించినట్లు ఆమెపై చేసిన దూషణను మన్నించవలసినదిగా ప్రాధేయపడినట్లు చెబుతారు.
వాఙ్మయ మూలాల ఆధారంగా మొల్ల స్వంతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్న తనంలోనే తల్లిని కోల్పోగా తండ్రి కేసన శెట్టి ఈమెను గారాబంగా పెంచెనని తెలుస్తుంది. ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టం. చివరి దాకా తండ్రి ఇంటి పేరునే ఉపయోగించడం మూలాన మొల్ల పెళ్ళి చేసుకోలేదని అనుకోవచ్చు.
మొల్ల రామాయణం ఆరు కాండాలలో 871 పద్యాలతో కూడుకుంది. ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాసిందని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా ఉంది.
తోయజదళాక్షి వలరాయడిటు లేచి పటుసాయకములేర్చి ఇపుడేయగ దొడంగెన్
తోయదపథంబున నమేయరుచి తోడ నుదురాయడును మించి వడ గాయగ గడంగెన్
కోయిలలు కీరములు కూయగ నళివ్రజము లేయెడల జూచినను మ్రోయుచు చెలంగెన్
నాయెడల కృపారసము నీయకవివేకమున నీయెడల నుండుతిది న్యాయమె లతాంగీ
జడలు దాలిచి తపసుల త్సందమునను
తమ్ముడును తాను ఘోర దుర్గమ్ములందు
కూరగాయలు కూడుగా కుడుత్సునట్టి
రాముడేరీతి లంకకు రాగలండు
తనకు శాస్త్రీయమైన కవిత్వజ్ఞానం లేదనీ, భగవద్దత్తమైన వరప్రసాదంవల్లనే కవిత్వం చెబుతున్నాననీ ఆమె అన్నది. కాని ఆమె అనేక సంస్కృత, తెలుగు పూర్వకవులను స్తుతించిన విధం చూస్తే ఆమెకు వారి రచనలతో గణనీయమైన పరిచయం ఉండిఉండాలనిపిస్తున్నది. తనకు పాండిత్యం లేదని మొల్ల వ్రాసినది సంస్కృతిలో భాగమైన అణకువ, విధేయత వంటి లక్షణాల కారణంగానే తప్ప వేరే కాదని స్త్రీ రచయిత్రుల చరిత్ర వ్రాసిన నిడదవోలు మాలతి భావించారు. గ్రంథావతారికను బట్టి ఈమె తక్కిన కవయిత్రులవలె గురువునొద్ద విద్యనభ్యసించలేదని, గోపవరపు శ్రీకంఠ మల్లేశుకృపను కవిత్వం చెప్పనేర్చినదనియు తెలియుచున్నది. ఈమె కావ్యలక్షణాదికముల నేమియు నెరుంగక పోయినను నన్నయ తిక్కనాది కవుల గ్రంథములను మాత్రము క్షుణ్ణముగా చదివినదని ఈమె పద్యముల తీరు నడకలను బట్టి చెప్పవచ్చును. ఈమెపై పోతన కవితా ప్రభావము ఎక్కువగాగలదు. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట... అని పోతన చెప్పిన మాదిరిగనే ఈమె రామాయణమందు చెప్పమని రామచంద్రుడు, చెప్పించిన పలుకుమీద జెప్పెదనే నెల్లప్పుడు నిహపరసాధన, మిప్పుణ్యచరిత్ర, తప్పులెంచకుడు కవుల్ అని పల్కినది. సర్వగుణాకరుడు శ్రీరాముని చరితమును ఎందరెన్ని విధముల రచన గావించినను నవ్యతకలిగి వీనులవిందై, యమృతపు సోనలపొందై యలరారుచుండుట తానీ గ్రంథమును చేపట్టుటకు కారణమని చెప్పినది. అట్టి మహాత్ముని చరితమును కందువ మాటల్ నందముగా కూర్చి పఠితలకు శ్రోతలకు విందును గూర్తునని ముందంజ వేసింది. గ్రంథావతారిక యందు చెప్పబడిన విషయముల వల ఈమె పూర్వకవుల సంప్రదాయమునే అనుసరించి కావ్యారంభమున అయోధ్యాపుర వర్ణనతో ప్రారంభమై, దశరథుని పుత్రకామేష్ఠి, శ్రీరామచంద్రుని జననమాదిగా రావణవధానంతరము ముగియుచున్నది. ఉత్తరరామాయణముని స్పృశించలేదు.
సాధారణంగా కవులు వర్ణనాదులయందు జటిలమై, సుదీర్ఘమైన సమాసము ల నొడగూర్చితమ పాండిత్యప్రకర్షను చూపింతురు. శబ్దాడంబరమునకు ప్రాధాన్యమిచ్చిన ప్రబంధయుగమున పుట్టిన మొల్ల శబ్దాడంబరమునకు లోనుగాక యలతి యలతి పదములతోనే రచన సాగించి పేరొందినది. చిన్ని చిన్ని గీతములలో పెద్ద భావముల నిముడ్చుట ఈమె సహజ గుణము. జడలు ధరియించి తపసుల చందమునను, దమ్ముడును దాను ఘోరదురమ్ములందు కూరగాయలు కూడుగాగుడుచునట్టి, రాముడేరీతి లంకకు రాగలడు. పదబంధముల యందు ఈమెకు చక్కని నేర్పు ఉంది.
తిక్కన వలె ఈమె పాత్రలను కండ్లకు కట్టునటుల చింత్రించ గలదు. హనుమంతుడు సముద్రమున దాటునపుడు ఈమె ఆప్రాంతమును చూచినది గాబోలు అనిపించును, ఆసముద్రోల్లంఘన మెంత సత్యసముపేతముగా వర్ణించెనో చూడండి:
మొగము బిగించి, పాదముల మొత్తముగానట నూదిత్రొక్కి, నీ టుగ మొగమెత్తి భీకర కఠోర రవంబున వార్చి బాహు ల త్యగణితలీలమాచి, వలయంబుగ వాలముద్రిప్పి వ్రేగునన్ నగము సగంబు క్రుంగ గపినాథుడు నింగి దాటే రివ్వునన్!!!
This article uses material from the Wikipedia తెలుగు article ఆతుకూరి మొల్ల, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.