దశరథ్మంజీ (c.
1934 – 2007 ఆగష్టు 17) బీహార్ రాష్ట్రం లోని గెహ్లోర్ గ్రామానికి చెందిన ఒక సామాన్యుడు. ఈయన ఇరవైరెండు సంవత్సరాలు కష్టపడి మేరునగ సమానమైన పట్టుదలతో తానే ఒక సైన్యంగా కొండనే తొలిచిన వ్యక్తి. ఆయనను "మౌంటెన్ మ్యాన్"గా పిలుస్తారు.
దశరథ్ మాంఝీ दशरथ मांझी | |
---|---|
జననం | 1934 గెహ్లూర్, బీహార్, బ్రిటిష్ ఇండియా |
మరణం | ఆగష్టు 17 2007 |
మరణ కారణం | గాల్ బ్లాడర్ క్యాన్సర్ |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | ద మౌంటెన్ మ్యాన్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తన గ్రామ వాసులకోసం కొండను ఒక్కరే తొలిచిన వ్యక్తి. |
జీవిత భాగస్వామి | ఫల్గుణి దేవి |
"నా భార్య గాయపడటం తట్టుకోలేకపోయాను.
నా జీవితం మొత్తం కరిగిపోయినా సరే..
ఈ కొండను తవ్వి మధ్యలో రోడ్డును నిర్మిస్తాను.
"ఈ అవార్డులను, కీర్తి ప్రతిష్ఠలు, డబ్బును నేనెప్పుడూ పట్టించుకోను.
నాకు కావాల్సింది ప్రధాన రహదారితో మా గ్రామానికి రోడ్డు అనుసంధానం.
పిల్లలకు స్కూల్, ప్రజల కోసం వైద్యశాల.
ఇది అంత సులభమేమీ కాదు.
కానీ అదే జరిగితే మా ఊరి మహిళలకు, పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది"
ఆయన 1934 లో బీహార్ లోని గెహ్లార్ గ్రామంలో జన్మించాడు. ఆయన ధనబాద్ లోని బొగ్గు గనులలో బ్యాల్యం నుండి పనిలోకి చేరాడు. తరువాత తన స్వగ్రామానికి వచ్చి ఫల్గుని దేవిని వివాహమాడారు.
గెహ్లోర్ బీహార్ రాజధాని పాట్నాకు దాదాపు 100కి.మీ దూరాన ఉన్న ఓ పల్లె. బయటి ప్రపంచానికీ ఆ గ్రామానికీ మధ్య ఓ కొండ అడ్డం. గెహ్లోర్ వాసులు నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నా, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకోవాలన్నా కొండ చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. పోనీ అలాగే వెళ్దామా అంటే 32కి.మీ దూరం. కొండను పూర్తిస్థాయిలో తొలిస్తే అది కేవలం మూడు కిలో మీటర్ల ప్రయాణం.
అది 1960. గహ్లోర్ కు అవతలి వైపున్న వంజీర్గంజ్ పట్టణానికి ఈ పల్లెకు మధ్య 300 అడుగులు ఎత్తైన కొండ అడ్డుగా ఉంది. కొండ ఇవతలివైపు గహ్లోర్ గ్రామం ఉంటే.. అవతలి వైపు మాంఝీ ఓ భూస్వామి వద్ద క్వారీలో పనిచేసేవాడు. మధ్యాహ్నం సమయంలో మాంఝీ భార్య ఫల్గుణీ దేవీ భోజనం తీసుకొచ్చేది.గహ్లోర్ నుంచి కొండ ఇవతలికి వచ్చేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. ఈ వైపుకు రావాలంటే కొండ ఎక్కి దిగాల్సిందే. ఇందుకు కొన్ని గంటల సమయం పడుతుంది. ఒకరోజు మాంఝీ భార్య ఆహారం తీసుకొని వస్తున్నప్పుడు కొండమీది నుంచి పడిపోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆలస్యంగా వచ్చిన భార్యను కొట్టాలన్న కోపంతో ఉన్న మాంఝీ ఆమె పరిస్థితి చూసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. 300 అడుగుల ఎత్తైన కొండలోంచి రాతిని తొలచి మార్గాన్ని ఏర్పాటు చేసే పనికి శ్రీకారం చుట్టాడు. అందుకోసం తన వద్ద వున్న గొర్రెలను అమ్మి సమ్మెట, ఉలి, గునపాన్ని కొనుగోలు చేశాడు. ఈ పనిముట్లతో కొండపైకి ఎక్కి కొండను తవ్వడం ప్రారంభించాడు. కొండను తవ్వుతున్న మాంఝీని చూసి గ్రామస్తులు అతణ్ణి పిచ్చివాడిగా చూశారు.
కొండను తవ్వేందుకు అంతకుముందు చేస్తున్న పనిని మాంఝీ వదిలేశాడు. పనిలేని కారణంగా ఆ కుటుంబం తరచుగా పస్తులతో పడుకునేది. అదే సమయంలో మాంఝీ భార్య ఫల్గుణీ అనారోగ్యం పాలైంది. వజీర్గంజ్ నుంచి మాంఝీ గ్రామం గహ్లోర్ రావాలంటే అడ్డుగా ఉన్న కొండ కారణగా 75 కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి వచ్చేది. డాక్టర్ వద్దకు తీసుకువెళ్లలేకపోవడం కారణంగా ఫల్గుణీ చనిపోయింది. భార్య చనిపోవడంతో మాంఝీలో పట్టుదల మరింత పెరిగింది. పదేళ్ల తర్వాత మాంఝీ కొండను చీల్చాడు. కొండ మధ్యలో చీలికను ప్రజలు గుర్తించారు. దీంతో కొండ మధ్యలో రోడ్డు వేసేందుకు మరికొందరు కూడా ముందుకొచ్చారు. 1982లో ఆశ్చర్యం చోటు చేసుకొంది. సమ్మెట, ఉలి, గునపంలతో శ్రమించి మాంఝీ కొండను పిండి చేసి నిజంగానే చిన్నపాటి మార్గాన్ని సృష్టించాడు. 22 ఏళ్ల పాటు శ్రమించి ఓ సామాన్య భూమిలేని నిరుపేద కూలి పర్వతాన్ని జయించాడు. 360 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడల్పుతో కొండను నిట్ట నిలువుగా చీల్చాడు దశరథ్ మాంజీ. ఇప్పుడు వజీర్ గంజ్లో ఉన్న హాస్పిటల్స్కు, స్కూల్స్ కు చేరాలంటే కేవలం ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న 60 గ్రామాల ప్రజలు ఆ మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారు.
గ్రామస్తులు దశరథ్కి పర్వత మనిషి (పహాడీ ఆద్మీ.. మౌంటెన్మెన్) అని పేరు పెట్టారు. మాంఝీ సాధించిన ఘనత దినపత్రికల్లో రావడంతో ప్రభుత్వం కూడా ఈయన శ్రమను గుర్తించింది. ఇంటిని నిర్మించుకునేందుకు భూమిని కేటాయించింది. ఐతే ఈ భూమిని కూడా హాస్పిటల్ నిర్మించేందుకు మాంఝీ ప్రభుత్వానికే దానంగా ఇచ్చాడు. 2006లో మాంఝీ పేరును పద్మ శ్రీ అవార్డుకు బీహార్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. కానీ అటవీశాఖ అడ్డంకులు సృష్టించడంతో ఆ అవార్డును మాంఝీ అందుకోలేకపోయాడు. అటవీ సంపద అయిన కొండను తవ్వడం అక్రమమని అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అయితే వీటిని మాంఝీ పట్టించుకోలేదు.
2006లో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్వహిస్తున్న “జనతా దర్బార్”కు వెళ్లాడు మాంఝీ. అప్పటికే మాంఝీ చేసిన ఘనత గురించి తెలుసుకున్ననితీష్కుమార్ ఆయనను వేదికపైకి ఆహ్వానించాడు. ఓ ఐదు నిమిషాలు ముఖ్యమంత్రిగా ఉండమంటూ తన కుర్చిమీద కూర్చోబెట్టారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో హిందీలో తెరకెక్కిన చిత్రం ‘మంఝీ-ది మౌంటేన్ మ్యాన్' విడుదలైంది. దశరథ్ మాంఝీ అనే వ్యక్తి జీవిత కథను దర్శకుడు కేతన్ మెహతా అదే 'మాంఝీ' పేరుతో తెరకెక్కించారు. నవాజుద్దీన్ సిద్దిఖీ, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన 'మాంఝీ - ది మౌంటెన్ మ్యాన్' చిత్రానికి పన్ను మినహాయిస్తున్నట్టు ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్రావత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం మొత్తం కొండ ప్రాంతమని, 'మాంఝీ' చిత్రం చూసి ప్రతికూల పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో ప్రజలు తెలుసుకోవాలని ఆయన కోరారు.
కొండను పించి చేసిన దశరథ్ మాంజీ క్యాన్సర్ను మాత్రం జయించలేకపోయాడు. ఆగస్ట్ 17, 2007న క్యాన్సర్తో మృతి చెందాడు. బీహార్ ప్రభుత్వం, ప్రభుత్వ లాంఛనాలతో మాంఝీ అంత్యక్రియలు నిర్వహించింది.
This article uses material from the Wikipedia తెలుగు article దశరథ్ మాంఝీ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.