వంగారి మధాయ్ గా పేరొందిన వంగారి మట్టా మధాయ్ కెన్యా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యావరణవేత్త, రాజకీయవేత్త, శరీర ధర్మశాస్త్ర పరిశోధకురాలు.
ఈమె స్థాపించిన గ్రీన్ బెల్ట్ ఉద్యమానికి గానూ 2004లో నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు.
వంగారి మాథాయ్ | |
---|---|
జననం | వంగారి ముటా 1940 ఏప్రిల్ 1 |
మరణం | 2011 సెప్టెంబరు 25 | (వయసు 71)
పౌరసత్వం | కెన్యా |
విద్య | B.S. biology M.S. biological sciences PhD veterinary anatomy |
విద్యాసంస్థ | Mount St. Scholastica College University of Pittsburgh University College of Nairobi |
వృత్తి | పర్యావరణవేత్త, రాజకీయనాయకురాలు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | గ్రీన్ బెల్ట్ ఉద్యమము |
పురస్కారాలు | నోబెల్ శాంతి బహుమతి |
1940 ఏప్రిల్ 1న కెన్యా సెంట్రల్ ప్రావిన్స్, నైరీ జిల్లా లోని కికియు కుటుంబంలో జన్మించింది. వీరి కుటుంబము కెన్యాలోని పేరుగల జాతి సమూహాలలో ఒకటి. 1943 ప్రాంతంలో వీరి కుటుంబము నకురు వద్ద గల రిఫ్ట్ లోయ లోని ఒక శ్వేత జాతీయుని పంట పొలంలో పనిచేయడానికి అక్కడికి తమ మకాం మార్చింది. 1947 చివరిలో ఈమె మరలా తమ స్వగ్రామమైన ఇహితెకి తిరిగి వచ్చింది. అప్పటికే ఈమె ఇద్దరు సోదరులు ఆ గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసేవారు. వీరి తండ్రి మాత్రం రిఫ్ట్ లోయలోనే ఉండిపోయాడు. తన సహోదరులు చదువుతున్న ఇహితే ప్రాథమిక పాఠశాలలోనే వంగారి కూడా చేరింది.
పదకొండేళ్ళ ప్రాయంలో ఈమె నైరీ లోని సెంట్ సిసిలా మాధ్యమిక పాఠశాలలో ప్రవేశం తీసుకుంది. అక్కడే నాలుగు సంవత్సరాలు విద్యాభ్యాసం చేసింది. ఈ సమయంలోనే ఆంగ్లంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించింది. అలాగే కేధలిక్ మతాన్ని స్వీకరించింది. మానవసేవే మాధవ సేవయనే తలంపుతో స్థాపించబడిన లిజియన్ ఆఫ్ మేరీ అనే కైస్తవ సేవాసంస్థలో చేరి వివిధ సేవా కార్యక్రమాలను కొనసాగించింది.1956 లో తన తరగతిలో ప్రథమురాలిగా ఉత్తీర్ణురాలైంది. దీనితో కెన్యాలోని లిమ్రు లో గల ఒకే ఒక బాలికల ఉన్నత పాఠశాల లోరెటో ఉన్నత పాఠశాల లో ఈమెకు ప్రవేశం లభించింది. 1959 లో లోరెటో ఉన్నత పాఠశాల నుండి ఉన్నత విద్యను పూర్తిచేసునున్న తర్వాత ఉంగాడా రాజధాని కంపాలలో గల తూర్పు ఆఫ్రికా విశ్వవిద్యాలయం లో చేరాలనుకుంది. కానీ మారిన కెన్యా రాజకీయ పరిస్థుల ఫలితంగా పలు పాశ్చాత్య దేశాలు కెన్యా లోని ప్రతిభ గల విద్యార్థులకు తమ దేశాలలో చదువుకునే అవకాశం కల్పిస్తామని ముందుకు వచ్చాయి.దీనిలో భాగంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనడీ అలాంటి విద్యార్థులకు జోసెఫ్ పి.కెనడీ జూనియర్ ఫౌండేషన్ ద్వారా ఆఫ్రికాలోని ప్రతిభ గల పేద విద్యార్థులకు అమెరికాలో చదువుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ పధకమే తర్వాత కెనడీ ఎయిర్లిఫ్ట్ లేదా ఎయిర్లిఫ్ట్ ఆఫ్రికా గా పేరుపొందింది. ఈ పధకంలో భాగంగా 1960 సెప్టెంబరులో ఎంపిక చేయబడిన 300 మంది కెన్యా విద్యార్థులలో వంగారి ఒకరిగా నిలిచి అమెరికా విశ్వవిద్యాలయాలలో చదివే అవకాశం పొందింది.
అమెరికాలోని కెన్సాస్ లోని అట్కిసన్ లోని సెయింట్ స్కొలస్టికా కళాశాల (ఇప్పటి బెనెడిక్టైన్ కళాశాల) లో చదవడానికి వంగారికి ఉపకారవేతనం లభించింది. అక్కడ జీవశాస్త్రం ప్రధానాంశంగా, భౌతిక శాస్త్రం, జర్మన్ ఉప ప్రధానాంశాలుగా 1964 లో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. ఈమె చదువుకు అయిన ఖర్చులను ఆఫ్రికా-అమెరికా ఇన్స్టిట్యూట్ అనే సంస్థ భరించింది. తర్వాత పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయము నుండి జీవశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసింది. ఇక్కడే ఈమె మొదటిసారిగా పర్యావరణ పరిరక్షకురాలుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో స్థానికంగా వాయు కాలుష్య నివారణకు, నిర్మూలనకు కార్యక్రమాలు చేపట్టింది. 1966 జనవరిలో జీవశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని అందుకుంది.. తర్వాత నైరోబీ విశ్వవిద్యలయ కళాశాల లోని ఒక జంతుశాస్త్ర పరిశోధకుడికి సహాయక పరిశోధకురాలిగా నియామక ఉత్తర్వులను అందుకుంది.
కెన్యా తిరిగి వచ్చిన తర్వాత తన కేధలిక్ పేరును తన జన్మనామమైన వంగారి ముట కు మార్చుకుంది. తన నూతన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి నైరోబి విశ్వవిద్యాలయ కళాశాలకు వచ్చిన ఆమెకు ఆ ఉద్యోగాన్ని ఇతరులకు ఇచ్చారని తెలిసింది. జాతి, లింగ వివక్షత వలనే ఈవిధంగా జరిగిందని ఆమె భావించింది. తర్వాత రెండు నెలల పాటు ఉద్యోగాన్వేషణను కొనసాగించింది. అప్పుడు పరిచయమైన జర్మనీ లోని గీసెన్ విశ్వవిద్యాలయం లో పనిచేసే ఆచార్యుడు నైరోబీ విశ్వవిద్యాలయంలో కొత్తగా స్థాపించిన జంతు శరీర ధర్మశాస్త్ర విభాగంలోని మైక్రోఅనాటమీ విభాగంలో సహాయ పరిశోధకురాలిగా ఈమెకు ఉద్యోగాన్ని కల్పించాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడే అమెరికాలో చదివిన మరొక కెన్యన్ మువాంగి మధాయ్ తో ఏప్రిల్ 1966 లో ఆమెకు పరిచయమైంది. తర్వాత కాలంలో అతడినే వివాహమాడింది.
1967 ఆచార్య హాఫ్మన్ అభ్యర్థన మేరకు జర్మనీ వెళ్ళి గీసెన్ విశ్వవిద్యాలయము, మ్యూనిచ్ విశ్వవిద్యాలయము లలో చదివి డాక్టరేట్ సాధించింది.
1969 వసంతకాలంలో తిరిగి నైరోబి వచ్చి సహాయ ఆచార్యురాలుగా తన కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించింది. అదే సంవత్సరం మే నెలలో మువాంగి మధాయ్ ని పెళ్ళాడింది. అదే సంవత్సరము గర్భం ధరించగా, ఆమె భర్త కెన్యా పార్లమెంటుకు పోటీచేసి కొద్దితేడాతో ఓటమి చెందాడు.తర్వాత కెన్యాలో ప్రజాస్వామ్యానికి తాతెకాలికంగా తెరపడింది. ఆ కాలంలోనే మొదటి బిడ్డ వవేరూ జన్మించాడు. 1971 లో నైరోబీ విశ్వవిద్యాలయం నుండి శరీర నిర్మాణ శాస్త్రంలో పి.హెచ్.డి అందుకున్న మొట్టమొదటి తూర్పు ఆఫ్రికా వనితగా ఖ్యాతి కెక్కింది. 1971లో ఈవిడ కుమార్తె వంజిరా జన్మించింది. పశు సంబంధిత జీవజాతులలో విలక్షణమైన బీజకోశాల అభివృద్ధి, భేదాలపై ఈవిడ ఎంతో అధ్యయనం చేసింది.
నైరోబీలో అధ్యాపకురాలిగా తన జీవితాన్ని కొనసాగించింది. 1974 లో శరీర ధర్మశాస్త్రంలో ఉ న్నత అధ్యాపకురాలిగానూ, 1976లో జంతుశాస్త శరీర ధర్మశాస్త్రం విభాగాధిపతిగానూ, 1977 లో సహాయ ఆచార్యురాలు గానూ పదోన్నతులు సాధించింది. నైరోబీలో ఆయా స్థానాలు అలంకరించిన మొదటి మహిళగా ఖ్యాతి కెక్కింది.. లింగ సమానత్వం కోసం, మహిళ సాధికారిత కోసం అక్కడ పనిచేస్తున్న వారిని సంఘటితపరిచి విశ్వవిద్యాలయ పాలకులతో పోరాటాలు సాగించింది. దీనిని అక్కడి న్యాయస్థానం తప్పుపట్టినా, తర్వాతి కాలంలో ఆమె ప్రతిపాదనలన్నీ కార్యరూపం దాల్చాయి. 1970 లలో తన ఉద్యోగంతో బాడు కెన్యా లోని అనేక పౌర ఉద్యమాలలో కూడా పాలుపంచుకుంది. కెన్యా లోని రెడ్క్రాస్ నైరోబీ శాఖలో సభ్యత్వం తీసుకుంది. 1973లో అదే శాఖకు సంచాలకురాలుగా ఎన్నికయ్యింది. కెన్యా విశ్వవిద్యాలయ మహిళా సంఘములో కూడా సభ్యత్వం తీసుకుంది. 1974లో స్థాపించిన పర్యావరణ సంబంధ సంఘ స్థానిక కార్యవర్గంలో సభ్యురాలై తదనంతరం దానికి అధ్యక్షురాలుగా ఎన్నికయ్యింది. ఈ సంఘము ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమాలలో స్వచ్ఛంద సంస్థలను భాగస్థులను చేసి ప్రోత్సహించింది. వీరి కార్యకలాపాలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి 1972 లో స్టాక్హోంలో జరిగిన United Nations Conference on the Human Environment సదస్సు తర్వాత ఈ సంఘ ప్రధాన కార్యాలయాన్ని నైరోబీలో ఏర్పాటు చేసింది. కెన్యా జాతీయ మహిళా సంఘంలో కూడా ఈమెకు సభ్యత్వం లభించింది. ఇన్ని వేర్వేరు ఉద్యమాలు, సంఘాలలో పనిచేసిన తర్వాత కెన్యా యొక్క అనేక సమస్యలకు మూల కారణం క్షీణిస్తున్న పర్యావరణమనే విషయము ఈమెకు అర్థమయ్యింది.
1974 లో మూడవ సంతానంగా కుమార్తె ముటా జన్మించింది. అదే సంవత్సరంలో ఈమె భర్త పార్లమెంటుకు పోటీచేసి గెలుపొందాడు. తన పదవీకాలంలో కెన్యాలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని అదుపుచేస్తానని అతను వాగ్దానం చేశాడు. ఈ సందర్భంలోనే వంగారికి తన ఆలోచనలను అమలు పరిచే అవకాశం వచ్చింది. పర్యావరణ పరిరక్షణకు ఉద్యోగ సృష్టిచేసి అటు నిరుద్యోగమును రూపుమాపటంతో పాటు ఇటు సహజ వనరుల వృద్ది కూడా చేయవచ్చనే ఆమె అద్భుత ఆలోచనలను కార్యరూపంలో పెట్టింది. దీని ఫలితంగా సాధారణ ప్రజలను మొక్కల పెంపకంలో భాగస్వామ్యం చేసే ఎన్వికోర్ లిమిటెడ్ అనే వ్యాపార సంస్థ ఆవిర్భావం జరిగింది. ఈ సంస్థకోసం తన మొదటి నర్సరీని కరూరా అడవిలో ప్రారంభించింది. ప్రారంభంలో ఈ సంస్థ అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. నిధుల సమస్య అందులో ముఖ్యమైనది. దీనితో ఈ సంస్థ మూతబడింది. కానీ వంగారి యొక్క సదుద్దేశము, కార్యశీలత గుర్తించిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం వారు 1976 జూన్ లో జరిగిన హాబీటాట్ -1 గా పిలవబడిన UN conference on human settlementsకి ఆమెను పంపించారు.
తన భర్త మువాంగీ మధాయ్ తో 1977 లో విడిపోయింది. 1979లో ఈవిడ నుండి విడాకులు కోరుతూ అతను దరఖాస్తు దాఖలు చేశాడు. ఈవిడ మీద అనేక బలమైన ఆరోపణలు దాఖలు చేయడంతో న్యాయమూర్తి ఈవిడ భర్తతో ఏకీభవించి విడాకులు మంజూరు చేశాడు. ఈ తీర్పు తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ న్యాయమూర్తి చేతకానివాడు లేదా అవినీతి పరుడని వ్యాఖ్యానించడంతో, అదే న్యాయమూర్తి ఈవిడపై చట్టపరమైన చర్యలకు ఆదేశించాడు. ఈ ఆరోపణలు రుజువైన ఫలితంగా ఈవిడకు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. నైరోబీ లోని లంగతా మహిళా కారాగారంలో ఆరు నెలలు శిక్ష అనుభవించిన తర్వాత ఈవిడ న్యాయవాది రూపొందించిన నివేదికతో ఏకీభవించిన న్యాయస్థానం ఈవిడను విడుదల చేసింది. కానీ ఈవిడ మాజీ భర్త ఈమె పేరులో నుండు తన పేరైన మధాయ్ ని తీసివేయవలసిందిగా మరలా తాఖీదులు పంపాడు. దీనితో తన పేరులో నుండి మధాయ్ ని తీసివేయకుండా కొద్ది మార్పులతో మాధాయ్ గా మార్చుకుంది.
This article uses material from the Wikipedia తెలుగు article వంగారి మాథాయ్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.