ది గ్రేటెస్ట్ ఇండియన్ అనేది స్వాతంత్ర్యానంతర భారతదేశంలో అత్యంత గొప్ప భారతీయులెవరో గుర్తించే సర్వే.
ఇది 2012 లో ఈ పోల్ జరిగింది. దీన్ని రిలయన్స్ మొబైల్ ప్రాయోజితం చేయగా, సిఎన్ఎన్-న్యూస్ 18, ది హిస్టరీ ఛానల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ పత్రిక నిర్వహించింది. 2012 జూన్ నుండి ఆగస్టు వరకు ఈ పోల్ నిర్వహించారు. విజేతగా బి.ఆర్.అంబేద్కర్ను 2012 ఆగస్టు 11న ప్రకటించారు. సర్వేకు సంబంధించిన కార్యక్రమాన్ని జూన్ 4 నుండి ఆగస్టు 15 వరకు ప్రసారం చేసారు.
గ్రేటెస్ట్ బ్రిటన్స్ వంటి ఇతర పోటీల్లాగా కాకుండా, ది గ్రేటెస్ట్ ఇండియన్ పోటీలో చరిత్ర లోని అన్ని కాలాలల్లోని వ్యక్తులను చేర్చలేదు. స్వాతంత్ర్యానంతర భార్తీయులనే ఈ పోటీకి పరిగణించారు. దీనికి రెండు కారణాలు చెప్పారు. మొదటిది "భారతదేశ స్వాతంత్ర్యానికి ముందరి చరిత్రలో మహాత్మా గాంధీ ఆధిపత్యం చలాయించాడు. నాయకత్వం, ప్రభావం, సహకారం విషయానికివస్తే ఎవరూ జాతిపిత స్థాయి దగ్గరకు రావడం అసాధ్యం. ఈ జాబితాలో గాంధీని చేర్చినట్లయితే, ది గ్రేటెస్ట్ ఇండియన్ టైటిల్ కోసం పోటీయే ఉండదని నిపుణుల సంఘం భావించింది." రెండవది, ది గ్రేటెస్ట్ ఇండియన్ పోటీకి ఆధునిక భారతదేశాన్ని పరిగణించాలని భావించారు. "1947 లో స్వాతంత్ర్యం పొందినప్పటి భారతదేశానికీ ఇప్పటి దేశానికీ అసలు పోలికే లేదు. కోట్లాది మంది భారతీయుల సహకారంతో ఈ దేశం ప్రపంచంలో ఈ స్థాయిని సాధించింది. స్వతంత్ర భారతం సాధించిన ఈ అభివృద్ధిలో గరిష్ట సహకారం, ప్రభావం చూపిన వ్యక్తిని గుర్తించే ప్రయత్నమే ఇది." అని సంఘం వివరించింది.
నటీనటులు, రచయితలు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, తమతమ రంగాలలో ప్రతిభ కనబరచిన పురుషులు, మహిళలతో కూడీన 28 మంది న్యాయ నిర్ణేతల సంఘానికి 100 మంది పేర్ల జాబితాను సంకలనంచేసి సమర్పించారు. ఈ న్యాయ నిర్ణేతల సంఘ సభ్యుల్లో ఎన్. రామ్ (మాజీ ది హిందూ పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్), వినోద్ మెహతా (అవుట్లుక్ పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ ), సోలి సొరాబ్జీ (భారతదేశ మాజీ అటార్నీ జనరల్), షర్మిలా ఠాగూర్ (బాలీవుడ్ నటి, మాజీ చైర్పర్సన్ సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఇండియా), హర్ష భోగ్లే (క్రీడలు), చేతన్ భగత్ (రచయిత), రామచంద్ర గుహ (చరిత్రకారుడు), శశి థరూర్ (రాజకీయవేత్త, రచయిత), నందన్ నిలేకని, రాజ్ కుమార్ హిరానీ, షబానా అజ్మీ, అరుణ్ జైట్లీలు ఉన్నారు. వారు ఖరారు చేసిన అగ్రగామి 50 మంది జాబితాను సిఎన్ఎన్ ఐబిఎన్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాజ్దీప్ సర్దేశాయ్ 2012 జూన్ 4న ప్రజలకు విడుదల చేసాడు. ఈ జాబితా నుండి మొదటి పదిమందిని అంచనా వేయడానికి మూడు మార్గాలు అవలంబించారు. దీనిలో న్యాయ నిర్ణేతల ఓట్లు, ఆన్లైన్ సర్వేలు, నీల్సన్ కంపెనీ నిర్వహించిన మార్కెట్ సర్వేలకు సమాన స్థాయి ఇచ్చారు. ఆన్లైన్ పోల్లో ఈ దశలో 71,29,050 మంది పాల్గొన్నారు. పబ్లిక్ ఓటింగ్ జూన్ 4 నుండి జూన్ 25 వరకు నిర్వహించబడింది. మొదటి 10 మంది జాబితాను జూలై 3 న ప్రకటించారు. జూలై 1 నుండి ఆగస్టు 1 వరకు జరిగే మొదటి పద్ధతిని ఉపయోగించి రెండవ రౌండ్ ఓటింగ్ జరిగింది. www.thegreatestindian.in ని సందర్శించడంద్వారా లేదా ప్రతి నామినీకి ఇచ్చిన ప్రత్యేక సెల్ నంబర్కు కాల్ చేయడం ద్వారా వ్యక్తులు ఓట్లు వేయగలిగారు. ఈ సర్వేలో దాదాపు 2 కోట్ల మంది ఓటు వేశారు. విజేత ప్రకటన ఆగస్టు 11న, ప్రత్యేక ముగింపు కార్యక్రమాన్ని అమితాబ్ బచ్చన్ నిర్వహించాడు. అందులో ఇతర భారతీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఇది ఆగస్టు 14, 15 (స్వాతంత్ర్య దినోత్సవం) నాడు ప్రసారమైంది.
మొదటి 10 నామినీలు అందరూ భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అందుకున్నవారే.
శ్రేణి సంఖ్య | బొమ్మ | పేరు | రాష్ట్రం | విశిష్టత |
---|---|---|---|---|
1 | బి. ఆర్. అంబేద్కర్ (1891–1956) | మహారాష్ట్ర | అంబేద్కర్ "రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక పితామహుడి"గా గుర్తింపు పొందాడు". బహుముఖ ప్రజ్ఞాశాలి పండితుడు, సామాజిక సంస్కర్త, దళితుల నాయకుడు, అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్త, భారతదేశపు మొదటి న్యాయ మంత్రిగా పనిచేశాడు. అతను "బాబాసాహెబ్" ("గౌరవనీయమైన తండ్రి") అనే గౌరవ బిరుదు పొందాడు. దళితులు, మహిళలు, షెడ్యూల్డ్ తెగలు ఇతర వెనుకబడిన కులాలతో హిందూ కుల వ్యవస్థతో సామాజిక వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ ప్రధానంగా ప్రచారం చేశారు. అతను దళిత బౌద్ధ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నాడు. 1956 అక్టోబరు 14 న తన 5 లక్షల మంది అనుచరులతో పాటు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. అంబేద్కర్ భారతదేశంలో బౌద్ధమతాన్ని పునరుద్ధరించాడు. | |
2 | ఎ. పి. జె. అబ్దుల్ కలాం (1931–2015) | తమిళనాడు | అబ్దుల్ కలాం ఏరోస్పేస్, డిఫెన్స్ సైంటిస్ట్. కలాం భారతదేశపు మొదటి ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV III అభివృద్ధిలో పాలుపంచుకున్నాడు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రూపశిల్పి. అతను ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ కోసం పనిచేశాడు. రక్షణ మంత్రికి సైంటిఫిక్ అడ్వైజర్గా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు.. తరువాత, అతను 2002 నుండి 2007 వరకు భారతదేశ పదకొండవ రాష్ట్రపతిగా పనిచేశాడు. | |
3 | వల్లభభాయి పటేల్ (1875–1950) | గుజరాత్ | "భారతదేశ ఉక్కు మనిషి"గా ప్రసిద్ధి చెందిన పటేల్ స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త, భారతదేశ మొదటి ఉప ప్రధాన మంత్రి (1947-50). స్వాతంత్ర్యానంతరం, "సర్దార్" పటేల్ మీనన్తో కలిసి 555 సంస్థానాలను భారతీయ యూనియన్లో విలీనం చేయడానికి పనిచేశాడు. | |
4 | జవహర్ లాల్ నెహ్ర (1889–1964) | ఉత్తర ప్రదేశ్ | నెహ్రూ స్వాతంత్ర్యోద్యమకారుడు, రచయిత, భారతదేశంలో మొదటి సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధాన మంత్రి (1947-64). భారతరత్న అవార్డు అందుకున్న సమయంలో నెహ్రూ స్వయంగా భారత ప్రధానిగా ఉన్నాడు. | |
5 | మదర్ థెరీస్సా (1910–1997) | పశ్చిమ బెంగాల్ స్కోప్జే లో జన్మించింది, ఉత్తర మేసిడోనియా | "సెయింట్ మదర్ థెరిసా ఆఫ్ కలకత్తా" ఒక కాథలిక్ సన్యాసిని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ రోమన్ కాథలిక్ మత సమాజ వ్యవస్థాపకురాలు.ఈ సంస్థ హెచ్ఐవి, ఎయిడ్స్, కుష్టు వ్యాధి, క్షయ వ్యాధితో భాధపడుచున్న రోగులకు గృహాలను నిర్మించింది.1979 లో ఆమె చేసిన మానవతా సేవ కోసం ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2003 అక్టోబరు 19న పోప్ జాన్ పాల్ II ప్రశంసించాడు. పోప్ ఫ్రాన్సిస్ చేత 2016 సెప్టెంబరు 4న కాననైజ్ చేయబడింది. | |
6 | జె.ఆర్.డి.టాటా (1904–1993) | మహారాష్ట్ర | టాటా కుటుంబం లోని పారిశ్రామికవేత్త, పరోపకారి, విమానయాన మార్గదర్శకుడు, భారతదేశంలో మొదటి ఎయిర్లైన్, ఎయిర్ ఇండియాను స్థాపించాడు. అతను టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా మెమోరియల్ హాస్పిటల్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టాటా మోటార్స్, టిసిఎస్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్, నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్తో సహా వివిధ సంస్థల వ్యవస్థాపకుడు. | |
7 | ఇందిరాగాంధీ (1917–1984) | ఉత్తర ప్రదేశ్ | "ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా"గా, పిలువబడే గాంధీ 1966-77. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో, ఆమె ప్రభుత్వం బంగ్లాదేశ్ లిబరేషన్ యుద్ధానికి మద్దతు ఇచ్చింది, ఇది బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడటానికి దారితీసింది. | |
8 | సచిన్ టెండుల్కర్ (b. 1973) | మహారాష్ట్ర | 1989లో అరంగేట్రం చేసిన సచిన్ రెండు దశాబ్దాల కెరీర్లో 664 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఆడాడు.అతను అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు, వన్డే ఇంటర్నేషనల్లో డబుల్ సెంచరీ సాధించిన మొదటి బ్యాట్స్మన్, వన్డే, టెస్ట్ క్రికెట్లో 34,000 పరుగులు పూర్తి చేసిన ఏకైక ఆటగాడు. | |
9 | అటల్ బిహారీ వాజపేయి (1924–2018) | మధ్య ప్రదేశ్ | నాలుగు దశాబ్దాలకు పైగా పార్లమెంటేరియన్ అయిన వాజ్పేయి, తొమ్మిది సార్లు లోక్సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యాడు మూడు పర్యాయాలు భారత ప్రధానిగా పనిచేశాడు.1996, 1998, 1999–2004. అతను 1977-79 సమయంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు.1994 లో "ఉత్తమ పార్లమెంటేరియన్" అవార్డు పొందాడు. | |
10 | లతా మంగేస్కర్ (1929-2022) | మహారాష్ట్ర | "నైటింగేల్ ఆఫ్ ఇండియా"గా విస్తృతంగా ప్రశంసించబడింది. ప్లేబ్యాక్ సింగర్ మంగేష్కర్ 1940 వ దశకంలో తన కెరీర్ను ప్రారంభించింది. 36 కి పైగా భాషల్లో పాటలు పాడింది.1989 లో మంగేష్కర్కు భారతదేశ సినిమా అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. |
50 మంది నామినీలలో 15 మంది భారతరత్న అందుకున్నారు.ఆరుగురు మహిళలు ఉన్నారు.పోల్ సమయంలో రవిశంకర్ (92), ఎంఎస్. స్వామినాథన్ (87) అటల్ బిహారీ వాజ్పేయి (88) వృద్దులు. సచిన్ టెండూల్కర్ (39) యువకుడు.
బాబాసాహెబ్ అంబేద్కర్ అత్యంత గొప్ప భారతీయుడిగా ఎంపికయ్యాడు. రామచంద్ర గుహ, ఎస్.ఆనంద్ వంటి పలువురు ప్రముఖులు అతనిని అభినందిస్తూ వ్యాసాలు రాశారు.
This article uses material from the Wikipedia తెలుగు article ది గ్రేటెస్ట్ ఇండియన్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.