సాహసోపేత భారత సైనికుడు, జాతీయ హీరో ఫీల్డ్ మార్షల్ మానెక్షా పూర్తి పేరు శాం హోర్ముస్జీ ఫ్రేంజీ జెమ్షెడ్జీ మానెక్ షా (ఏప్రిల్ 3, 1914 – జూన్ 27, 2008).
1971లో పాకిస్తాన్తో యుద్ధంలో భారత్కు అతిపెద్ద సైనిక విజయాన్ని సాధించి పెట్టిన ఆయన బంగ్లాదేశ్ ఆవిర్భావానికి అద్యుడయ్యారు. మొత్తం ఐదు యుద్ధాలలో పాల్గొన్నారు. గూర్ఖా రైఫిల్స్తో ఆయనకున్న అనుబంధానికి గుర్తుగా అందరూ ప్రేమతో ఆయనను 'శ్యామ్ బహదూర్' అని పిలుచుకుంటారు.
శాం మానెక్షా | |
---|---|
జననం | శాం హోర్ముస్జీ ఫ్రేంజీ జెమ్షెడ్జీ మానెక్ షా ఏప్రిల్ 3 , 1914 అమృతసర్, పంజాబ్ |
మరణం | 27 జూన్, 2008 వెల్లింగ్టన్, తమిళనాడు |
మరణ కారణం | న్యుమోనియా |
నివాస ప్రాంతం | కూనూరు,తమిళనాడు |
ఇతర పేర్లు | శాం బహదూర్ |
వృత్తి | సైనికుడు |
పదవి పేరు | India దేశ సైనిక దళాల ప్రధాన అధికారి (మాజీ) |
పదవీ కాలం | 1934 - 1973 |
తర్వాత వారు | జనరల్ కుమారమంగళం |
మతం | పార్శీ |
భార్య / భర్త | సిల్లూ బోడె |
పిల్లలు | ఇద్దరు కుమార్తెలు (షెల్లీ బాట్లీవాలా, మాయా దారూవాలా) |
తండ్రి | డాక్టర్.మానెక్షా |
1914 ఏప్రిల్ 3వ తేదీన అమృతసర్లోని పార్శీ దంపతులకు మానెక్షా నలుగురు అన్నలు ఇద్దరు అక్కల మధ్య ఐదవ వాడిగా జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ అనే చిన్న పట్టణం నుంచి అమృతసర్, పంజాబ్ రాష్ట్రంకు వలస వచ్చారు.
బ్రిటిష్ జమానా మొదలుకొని నాలుగు దశాబ్దాల పాటు సైన్యంలో సేవలు అందజేసిన శాం మానెక్షా- రెండవ ప్రపంచ యుద్ధంలోను, భారత స్వాతంత్య్రానంతరం చైనా, పాకిస్థాన్లతో జరిగిన మూడు యుద్ధాల సందర్భంగాను ప్రదర్శించిన వ్యూహ చతురత, బుద్ధికుశలత అమోఘమైనవి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జపాన్ ఆక్రమిత దళాలను తిప్పికొట్టేందుకు ఉద్దేశించిన సైనిక విభాగం అధిపతిగా బర్మాలో ఆయన ప్రాణాలొడ్డి పోరాడారు. కడుపులోకి ఏడు గుళ్లు దూసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పతకం 'మిలిటరీ క్రాస్'ను మృతులకు ప్రకటించరాదన్నది నియమం. మానెక్షా బతికి బట్టకట్టకపోవచ్చునని భావించిన నాటి మేజర్ జనరల్ డి.టి.కోవన్, తన 'మిలిటరీ క్రాస్ రిబ్బన్'ను తక్షణం మానెక్షాకు ప్రదానం చేశారు. అదృష్టవశాత్తు మృత్యుముఖంలోంచి బయటపడిన మానెక్షా, మరోసారి బర్మాలో జపాన్ సైనికులను ఢీకొన్నారు. మళ్ళీ గాయపడినప్పటికీ వెన్నుచూపలేదు. జపాన్ సైనికులు లొంగిపోయాక, 10 వేల మందికిపైగా యుద్ధఖైదీలకు పునరావాసం కల్పించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 1947లో దేశవిభజన, 1947-48లో జమ్ముకాశ్మీర్లో సైనికచర్యల సందర్భంగా ఆయన తన పోరాటపటిమను మరోమారు లోకానికి చాటిచెప్పారు. 1971లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధం ఆయన వ్యూహనైపుణ్యానికి, దీక్షాదక్షతలకు అద్దంపట్టింది. ఆ యుద్ధంలో పాక్ చిత్తుగా ఓడిపోవడమేకాదు, 45,000 మంది పాక్సైనికులు, మరో 45,000 మంది పౌరులు యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. తరువాత బంగ్లా ఆవిర్భావానికి దోహదపడిన సిమ్లా అంగీకారం కుదర్చడంలోనూ ఆయనది కీలక భూమికే. ఆయన సమర్థ సారథ్యం దేశసైనిక దళాల్లో సరికొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 1973 జనవరిలో మొట్టమొదటి ఫీల్డ్మార్షల్గా పదోన్నతి కల్పించి, ఆయనను సముచితరీతిలో గౌరవించింది.
1937లో లాహోర్లో ఉన్నప్పుడు ఓ కార్యక్రమంలో సిల్లూ బోడెను ఆయన కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అదే ఏడాది ఏప్రిల్ 22న వారు వివాహం చేసుకున్నారు.
ఆయనకు ఇద్దరు కుమార్తెలు, షెల్లీ బాట్లీవాలా, మాయా దారూవాలా.
అమృతసర్, నైనిటాల్లలో పాఠశాల విద్య పూర్తయ్యాక డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో క్యాడెట్గా తొలి బ్యాచ్లో మానెక్ షా చేరారు.
పురస్కారం పేరు | బహుకరించింది | సంవత్సరం | ఇతర వివరాలు | |
---|---|---|---|---|
మిలిటరీ క్రాస్ రిబ్బన్ | మిలిటరీ క్రాస్ రిబ్బన్ | మేజర్ జనరల్ డి.టి.కోవన్ | రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జపాన్ ఆక్రమిత దళాలను తిప్పికొట్టేందుకు ఉద్దేశించిన సైనిక విభాగం అధిపతిగా బర్మాలో ఆయన ప్రాణాలొడ్డి పోరాడారు. కడుపులోకి ఏడు గుళ్లు దూసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పతకం 'మిలిటరీ క్రాస్'ను మృతులకు ప్రకటించరాదన్నది నియమం. మానెక్షా బతికి బట్టకట్టకపోవచ్చునని భావించిన నాటి మేజర్ జనరల్ డి.టి.కోవన్, తన 'మిలిటరీ క్రాస్ రిబ్బన్'ను తక్షణం మానెక్షాకు ప్రదానం చేశారు. | |
పద్మభూషణ్ | భారత ప్రభుత్వం | 1968 | ||
పద్మవిభూషణ్ | భారత ప్రభుత్వం | 1973 | ||
ఫీల్డ్ మార్షల్ | భారత ప్రభుత్వం | 1973 | మానెక్షా సేవలను గుర్తించిన ప్రభుత్వం 1973 జనవరిలో మొట్టమొదటి ఫీల్డ్మార్షల్గా పదోన్నతి కల్పించి, ఆయనను సముచితరీతిలో గౌరవించింది |
ఒక సైనికుడికి, ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు నూటికి నూరు శాతం ఈయనలో గమనించవచ్చు. సైనికులకు మాత్రమే కాకుండా సాదారణ వ్యక్తులకు కూడా ఒక వ్యక్తి ఎంత సాధించగలడో ఉదాహరణగా నిలిచిన విశిష్ట వ్యక్తిత్వం ఈయన సొంతం.
1971 ఆరంభంలో తూర్పు పాకిస్థాన్ నుంచి పెద్దయెత్తున శరణార్థులు భారత్లోకి వస్తున్న సమస్యపై ఆ ఏడాది ఏప్రిల్ 27న జరిగిన క్యాబినెట్ సమావేశానికి త్రివిధ దళాధిపతుల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న మానెక్షానూ ఆహ్వానించారు.ఈ సమస్యని పరిష్కరించడానికి తక్షణం సైనికులని పంపాలన్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నిర్ణయాన్ని వాతావరణం అనుకూలంగా లేదన్న కారణముతో ఒప్పుకోకుండా, వెంటనే యుద్ధానికి దిగక తప్పదంటే మానసిక లేదా శారీరక అనారోగ్య కారణాలపై రాజీనామా చేయడానికీ తాను సిద్ధమే అనడం ద్వారా తన నాయకత్వ లక్షణాలని చాటిన ఈయన, తన సమర్థ వాదనతో క్యాబినెట్ను ఒప్పించి 1971 డిసెంబరులో, అన్ని విధాలా సానుకూల పరిస్థితుల్ని చూసుకొని పాక్పై పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రారంభించి, అద్భుత విజయం సాధించి చూపి తన నిర్ణయం ఎంత సరియినదో నిరూపించి వ్యూహకర్తగా ఆయన చతురతను చాటిచెప్పిన వైనం అద్వితీయం.
మీ యుద్ధ విమానాలు నాశనం చేశాం, మిమ్మల్నందరిని మా సైనికులు చుట్టూ ముట్టి వున్నారు లోంగిపోకపొతే నిర్ధాక్ష్యంగా చంపేస్తాం అంటూ పాకిస్తాను సైనికులని కఠినంగా హెచ్చరించి శత్రువులని లొంగదీసుకున్న వృత్తి పరమయిన బాధ్యతని ఎంత కచ్చితంగా నిర్వర్తించారో భార్యకు ఇష్టం అయిన ప్రదేశమని తమిళనాడు లోని కూనూరు అనే సుందర ప్రాంతంలో ఉద్యోగ విరమణ అనంతరం స్థిరపడిన వైనం అయన సున్నిత మనస్తత్వానికి నిదర్శనం.
ఉద్యోగ విరమణ అనంతరం ఈయన 9 కంపెనీలకి డైరెక్టర్ గా పనిచేసి వ్యాపార రంగంలో కూడా విజయవంతంగా రాణించి తన సమర్ధతని నిరూపించుకున్నారు.
శాం మానెక్షా గొప్ప వక్త కూడా. మాటలోనే కాదు రాతలో కూడా స్పష్టత, క్లుప్తత, వ్యంగ్యం ఆయన సొంతం. సామాజికపరమైన, ముఖ్యంగా దౌత్య సంబంధమైన కార్యక్రమాలకు ఆయనను ముఖ్య అతిథిగా పిలిచేవారు.1999లో ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో హాస్యోక్తులలో 40 నిమిషాలపాటు అనర్గళంగా ప్రసంగించిన ఆయన, భారత సమాజాన్ని నాయకత్వ కొరతే పట్టిపీడిస్తోందంటూ చేదు నిజాన్ని చాటిచెప్పారు. అన్ని రంగాల్లో నెలకొన్న నాయకత్వ కొరతే దేశంలోని అస్తవ్యస్త పరిస్థితులకు కారణమని స్పష్టం చేశారు. వృత్తిపరమైన సామర్థ్యం, విజ్ఞానం, నిజాయతీ, నిష్పాక్షికత, ధైర్యం, విశ్వసనీయత, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నిబద్ధత - ఇవీ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలని తెలియజేసి ఎన్నో లక్షలమంది సైనికులకి, సైనికులుగా చేరాలనుకున్న వారికే కాకుండా సామాన్యులకి కూడా స్ఫూర్తిగా నిలిచారు.
న్యూమోనియాకు చికిత్స పొందుతూ, కొంత సహజమయిన వృద్దాప్యం వలన జూన్ 26, 2008 గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు భారత్కు ఎన్నో విజయాలను అందించిన యుద్ధ సేనాని జీవితంలో అలసిపోయి శాశ్వతంగా చుట్టూ ఉన్న కుటుంభ సభ్యుల మధ్య ప్రశాంతంగా ఈ లోకాన్ని వీడారు. గొప్ప యోధుడిగానే 94 ఏళ్ల పరిపూర్ణ జీవనం సంతోషంగా గడిపారు.
పుస్తకం ముఖ చిత్రం | పుస్తకం పేరు & ఇతర వివరాలు |
---|---|
సోల్జరింగ్ విత్ డిగ్నిటీ:ఫీల్డ్ మార్షల్ శాం మానెక్షా
లభించు చిరునామా:
| |
లీడర్షిప్:ఫీల్డ్ మార్షల్ శాం మానెక్షా
లభించు చిరునామా:
|
This article uses material from the Wikipedia తెలుగు article మానెక్షా, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.