మహారాష్ట్ర, (మరాఠీ: महाराष्ट्र ) భారతదేశంలో వైశాల్యపరంగా మూడవ పెద్దరాష్ట్రం, జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం.
మహారాష్ట్రకు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్నాటక, గోవా రాష్ట్రాలతోనూ, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా-నగరుహవేలి తోనూ సరిహద్దులున్నాయి. పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. ముంబయి నగరం మహారాష్ట్ర రాజధాని, అతిపెద్ద నగరం. మహారాష్ట్ర ప్రాంతం ఋగ్వేదంలో రాష్ట్రఅనీ, అశోకుని శాసనాలలో రాష్ట్రీకం అనీ, అతరువాత హువాన్త్సాంగ్ వంటి యాత్రికుల రచనలలో మహారాష్ట్ర అనీ ప్రస్తావింపబడింది. మహారాష్ట్రి అనే ప్రాకృత పదం నుండి ఈ పేరు రూపాంతరం చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మహాకాంతార (అంటే పెద్ద అడవులు) అన్నపదం నుండి మహారాష్ట్ర పదం పుట్టిందని అంటారు. అయితే ఈ విశ్లేక్షణలకు బలమైన ఆధారాలు లేవు.
మహారాష్ట్ర महाराष्ट्र | |
---|---|
Coordinates (ముంబై): 18°58′N 72°49′E / 18.96°N 72.82°E | |
దేశం | India |
ప్రాంతం | పశ్చిమ భారతదేశం |
స్థాపన | 1 మే 1960 |
రాజధాని | ముంబయి, నాగపూర్ |
అతి పెద్ద నగరం | ముంబయి |
జిల్లా | 36 |
Government | |
• Body | మహారాష్ట్ర ప్రభుత్వం |
• గవర్నర్ | భగత్ సింగ్ కొషియారి |
• ముఖ్యమంత్రి | eknath shinde |
• శాసన సభ | ద్విసభ (288 + 78 స్థానాలు) |
• లోక్ సభ స్థానాలు | 48 |
• ఉన్నత న్యాయస్థానం | ముంబై ఉన్నత న్యాయస్థానం |
Area | |
• Total | 3,07,713 km2 (1,18,809 sq mi) |
• Rank | 3వ |
Population (2011) | |
• Total | 11,23,72,972 |
• Rank | 2వ |
• Density | 370/km2 (950/sq mi) |
Time zone | UTC+05:30 (IST) |
ISO 3166 code | IN-MH |
మానవ అభివృద్ధి సూచి | 0.689 (medium) |
HDI rank | 12th (2005) |
అక్షరాస్యత | 82.9% (6th) |
లింగనిష్పత్తి | 925 ♀/1000 ♂ (2011) |
అధికారిక భాష | మరాఠీ |
Website | Maharashtra |
మహారాష్ట్ర గురించి సాశ.పూ. 3వ శతాబ్దం నుండే లిఖితపూర్వకమైన ఆధారాలు లభించాయి. అప్పుడు మహారాష్ట్రి అనే భాషగురించి ప్రస్తావన జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతం "దండకారణ్యం" అనబడింది. తరువాత అశోకుడు పాలించిన మగధ సామ్రాజ్యంలో మహారాష్ట్ర ఒక భాగమైంది. ఇప్పటి ముంబాయి నగరానికి ఉత్తరాన ఉన్న సోపార రేవు పట్టణంనుండి కొచ్చి (భారతదేశం) తోను, తూర్పు ఆఫ్రికా, మెసపొటేమియా లతోను వర్తక సంబంధాలుండేవి.
మౌర్యసామ్రాజ్యం పతనానంతరం సా.శ.పూ. 230 - సా.శ. 225 మధ్య మహారాష్ట్ర ప్రాంతం శాతవాహనసామ్రాజ్యంలో భాగమయ్యింది. ఈ కాలంలో ఇక్కడి సంస్కృతి, మరాఠీ భాష బాగా వృద్దిచెందాయి. సా.శ. 78 ప్రాంతంలో పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి పేరు మీద శాలివాహన శకం ఆరంభమయ్యింది. సా.శ. 3వ శతాబ్ది సమయంలో శాతవాహన సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది.
సా.శ. 250-525లో వాకాటకులు విదర్భ ప్రాంతాన్ని పాలించారు. వారి కాలంలో కళలు, సాంకేతిక పరిజ్ఞానము, నాగరికత బాగా వృద్ధిచెందాయి. 6వ శతాబ్దానికల్లా మహారాష్ట్ర ప్రాంతమును బాదామి చాళుక్యులు పాలించారు. 753వ సంవత్సరంలో రాష్ట్రకూటులు మహారాష్ట్రపాలకులయ్యారు. వారి సామ్రాజ్యం దాదాపు దక్కన్ అంతా విస్తరించింది. మరలా రాష్ట్రకూటులను ఓడించి బాదామి చాళుక్యులు 973-1189మధ్య మహారాష్ట్రలో కొంతభాగాన్ని పాలించారు. 1189 తరువాత దేవగిరి యాదవులు ఇక్కడి రాజులయ్యారు.
సా.శ.13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకొన్నారు. మొదట అల్లాఉద్దీన్ ఖిల్జీ, ఆతరువాత ముహమ్మద్ బిన్ తుఘ్లక్ దక్కన్లో తమ అధికారాన్ని నెలకొలిపారు. 1347లో తుఘ్లక్ల రాజ్యం పతనమయినాక బీజాపూర్కు చెందిన బహమనీ సుల్తానులు తరువాత 150 సంవత్సరాలు ఇక్కడ రాజ్యం నెరపారు. 16వ శతాబ్దంనాటికి మహారాష్ట్ర మధ్యప్రాంతం ముఘల్ సామ్రాజ్యానికి అధీనులైన చిన్న చిన్న ముస్లిమ్రాజుల అధీనంలో ఉండేది. తీరప్రాంతంలో పోర్చుగీసువారు అధికారం చేజిక్కించుకొని, సుగంధ ద్రవ్యాల వర్తకం పై గుత్తాధిపత్యాన్ని సాధించే ప్రయత్నంలో ఉన్నారు .
17వ శతాబ్దారంభంలో స్థానికులైన మరాఠాల నాయకత్వంలో మరాఠా సామ్రాజ్యం వ్రేళ్ళూనుకొనసాగింది. 1674లో శివాజీ భోన్సలే రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. శివాజీ మహారాజుగా ప్రసిద్ధుడైన ఈ నాయకుడు అప్పటి ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యంతోను, బిజాపూర్ నవాబు ఆదిల్ షా సైన్యంతోను పలుయుద్ధాలు సాగించాడు. అప్పుడే మహారాష్ట్రలో తమఅధిపత్యాన్ని విస్తరిస్తున్న బ్రిటిష్వారితో కూడా కొన్ని చిన్న యుద్ధాలు చేశాడు. మహారాష్ట్ర చరిత్రలో అత్యంత ప్రసిద్ధుడైన, జనప్రియుడైన, పరిపాలనా దక్షతగల రాజుగా శివాజీని పేర్కొనవచ్చును.
1680దశకంలో శివాజీ కొడుకు శంభాజీ భోన్సలే ఔరంగజేబు చేత చిక్కి ఉరితీయబడ్డాడు. శంభాజీ తమ్ముడైన రాజారామ్ భోన్సలే తమిళప్రాంతానికి పారిపోయి "జింజీ కోట"లో తలదాచుకొన్నాడు. 18వ శతాబ్దంలో రాజారామ్ కాస్త బలపడిన సమయానికి పరిస్థితులు మారిపోయాయి.
శంభాజీ కొడుకు షాహు భోన్సలే అసలైన వారసునిగా, పినతల్లి తారాబాయితో కొంత ఘర్షణను ఎదుర్కొని, తన మంత్రి (పేష్వా)బాలాజీ విశ్వనాధ్ సహాయంతో సింహాసనం చేజిక్కించుకొన్నాడు. తరువాత 4దశాబ్దాలు భోన్సలేలు నామమాత్రంగా అధికారంలో ఉన్నారు పేష్వాలు నిజమైన అధికారాన్ని నెరపారు. ముఘల్లను ఓడించిన పేష్వాల అధికారం ఉత్తరాన పానిపట్ నుండి దక్షిణాన తంజావూరు వరకు, గుజరాత్ లోని మెహసనా నుండి మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, ఇండోర్ల వరకు విస్తరించింది.
బాలాజీ విశ్వనాధ్, అతని కొడుకు బాజీరావు పేష్వాలు వారిపాలనలో ఉన్న ప్రాంతంలో రెవెన్యూ విధానాన్ని, పరిపాలనా విధానాన్ని క్రమబద్ధీకరించారు. ఇందుకు వారు ముఘల్ చక్రవర్తుల విధానాలను తమ స్వంత విధానాలతో జోడించారు. పేష్వాల కాలంలో వర్తకం, బ్యాంకింగ్ వ్యవస్థలు పటిష్ఠంగా అభివృద్ధిచెందాయి. వ్యవసాయం మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. పేష్వాలు పశ్చిమతీరంలో నౌకాభద్రతను అభివృద్ధిచేయసాగారు. అందుకై కొలాబాలో Archived 2021-08-04 at the Wayback Machine నౌకాదళాన్ని ఏర్పాటు చేశారు. నౌకాబలంమీద, సముద్ర వర్తకంమీద ఆధారపడిన పాశ్చాత్యదేశాల స్థావరాల అధిపత్యానికి ఇది కలవరపాటు కలిగించింది.
అదేసమయంలో మరాఠా ప్రాంతాలుకాని చోట్ల అధిపత్యం సామంతులకు కట్టబెట్టారు. అలా గ్వాలియర్లో సింథియాలు, ఇండోర్లో హోల్కర్లు, బరోడాలో గైక్వాడ్లు, ధార్లో పవార్లు స్థానిక రాజులయ్యారు.
1761లో మూడవ పానిపట్టు యుద్ధంలో అఫ్ఘన్ సేనాని అహ్మద్షా అబ్దాలీ సైన్యంతో జరిగిన యుద్ధంలో మరాఠాలు దారుణంగా పరాజితులయ్యారు. దీనితో మరాఠా సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలయ్యింది. పూణేలో మాత్రం పేష్వాకుటుంబాల రాజ్యం కొనసాగింది. స్థానిక సంస్థానాధీశులు తమ రాజ్యాలను చక్కబెట్టుకొనసాగారు. భోన్సలేలకు దక్కన్లో సతారా కేంద్రమయ్యింది. వారి కుటుంబంలో రాజారామ్ వంశానికి చెందినవారు (1708లో షాహు అధికారాన్ని ఒప్పనివారు)మాత్రంకొల్హాపూర్లో స్థిరపడ్డారు. 19వ శతాబ్దారంభం వరకు కొల్హాపూర్లో వీరి పాలన సాగింది.
భారత రాజకీయాల్లోకి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రావడంతో వారికి, మరాఠాలకు పోరులు మొదలయ్యాయి. 1777-1818 మధ్య మూడు ఆంగ్ల-మరాఠా యుద్ధాలు జరిగాయి. తత్ఫలితంగా 1819నాటికి మహారాష్ట్రలో పేష్వాల పాలనలో ఉన్న భూభాగం ఆంగ్లేయుల పరమైంది. మరాఠా సామ్రాజ్యం అంతమైంది. బ్రిటిష్వారు ఈ ప్రాంతాన్ని బొంబాయి ప్రెసిడెన్సీలో భాగంగా పాలించారు. అది ప్రస్తుత పాకిస్తాన్లోని కరాచీనుండి ఉత్తర దక్కన్ వరకు విస్తరించి ఉండేది. చాలా మరాఠా రాజ్యాలు మాత్రం బ్రిటిష్ సామంతరాజ్యాలుగా మిగిలి ఉన్నాయి. వాటిలో నాగపూర్, సతారా, కొల్హాపూర్లు ముఖ్యమైనవి. 1848లో సతారా, 1853లో నాగపూర్, 1903లో బేరార్లు బ్రిటిష్ రాజ్యంలో కలిపివేయబడ్డాయి. మరాఠ్వాడా ప్రాంతం హైదరాబాద్ నిజాం రాష్ట్రంలో భాగంగా ఉండేది.
బ్రిటిష్ కాలంలో సంఘ సంస్కరణలు ఊపందుకొన్నాయి. మౌలిక సదుపాయాలు కొంత మెరుగు పడినాయి. క్రమంగా తిరుగుబాటులు మొదలయ్యఅయి. 20వ శతాబ్దం ఆరంభంలో బాల గంగాధర తిలక్ నాయకత్వంలో భారత స్వాతంత్ర్య పోరాటం వ్రేళ్ళూనుకొంది. తరువాత మహాత్మా గాంధీ నాయకత్వంలో ఇది అహింసాయుత పోరాటంగా విస్తరించింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభమైంది.
1947లో స్వాతంత్ర్యం తరువాత బొంబాయి ప్రెసిడెన్సీలో మహారాష్ట్ర ప్రాంతం, విదర్భ, నాగపూర్, వాటితో మరికొన్ని రాజ సంస్థానాలు విలీనం చేసి 1950లో బొంబాయి రాష్ట్రం ఏర్పాటు చేశారు. 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర వైశాల్యం 308,000 చ.కి.మీ. రాజస్థాన్, మధ్యప్రదేశ్ల తరువాత ఇది పెద్ద రాష్ట్రం. తీర ప్రాంతానికి సమాంతరంగా ఉన్న పడమటి కనుమలు సగటు ఎత్తు 1,200 మీటర్లు. వాటికి పశ్చిమాన కొంకణ్ తీరభూమి మైదానం ఉంది. పడమటి కనుమలకు తూర్పున దక్కన్ పీఠభూమి ఉంది. తమ్హిని ఘాట్, వరంధ ఘాట్, సవంత్వాడి ఘాట్ - ఇవి పడమటి కనుమలలో విభాగాల పేర్లు. పడమటి కనుమలు భారతదేశంలో మూడు వాటర్ షెడ్ ప్రాంతాలలో ఒకటి. దక్షిణభారతదేశపు ముఖ్యమైన నదులు చాలా పడమటికనుమలలో పుడుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి గోదావరి, కృష్ణ - ఇవి తూర్పువైపుకు ప్రవహించి బంగాళా ఖాతంలో కలుస్తయి. మహారాష్ట్ర మధ్య, తూర్పు ప్రాంతాలకు ఇవి ప్రధాన నీటి వనరులు. ఇంకా పడమటి కనుమలలో చాలా చిన్న నదులు పడమటివైపుకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయు. మహారాష్ట్రకు ఉత్తరాన, మధ్యప్రదేశ్ సరిహద్దులలో సాత్పూరా పర్వతశ్రేణులున్నాయి.
నర్మద, తపతి నదులు మహారాష్ట్ర ఉత్తరభాగంలో నీటి వనరులు. ఇవి పడమటివైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. వైన గంగ వంటి నదులు దక్షిణదిశగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో అనేక బహుళార్ధ సాధక ప్రాజెక్టులున్నాయి. దక్కన్ పీఠభూమిలో చాలాభాగం నల్లరేగడినేల. ప్రత్తి వ్యవసాయానికి అనుకూలమైనది.
మహారాష్ట్ర ప్రాంతంలోని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు చాలా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు (wildlife sanctuaries), జాతీయ ఉద్యానవనాలు (national parks), ప్రాజెక్ట్ టైగర్ ఏర్పాటు చేయ బడ్డాయి. 2004 మే నాటికి మొత్తం దేశంలో 92 జాతీయ ఉద్యానవనాలుండగా వాటిలో 5 మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలో ఎక్కువ అటవీ ప్రాంతం విదర్భలో ఉంది. అక్కడ ఉన్న జాతీయ ఉద్యానవనాలు
ఇవికాక మహారాష్ట్రలో 35 వన్యప్రాణి అభయారణ్యాలున్నాయి. వాటిలో నాగ్జిరా (భంద్రా జిల్లా), ఫన్సాద్, కొన్యా అభయారణ్యాలు ముఖ్యమైనవి.
మహారాష్ట్ర స్థూల రాష్ట్రోత్పత్తి వివరాలు (మార్కెట్ ధరల ఆధారంగా, కోట్ల రూపాయలలో) క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి. భారత ప్రభుత్వం గణాంకవిభాగం అంచనా.
సంవత్సరం | స్థూల రాష్ట్రోత్పత్తి (కోట్ల రూ.) |
---|---|
1980 | 1,663.1 |
1985 | 2,961.6 |
1990 | 6,443.3 |
1995 | 15,781.8 |
2000 | 23,867.2 |
2004లో మహారాష్ట్ర స్థూలాదాయం 106 బిలియన్ డాలర్లు అని అంచనా.
మహారాష్ట్ర ప్రభుత్వపు పన్ను ఆదాయం (కేంద్రం నుండి వచ్చే వాటాను మినహాయించి) క్రింద చూపబడ్డాయి.
సంవత్సరం | పన్ను ఆదాయం (కోట్ల రూపాయలు) |
---|---|
2000 | 19,882.1 |
2005 | 33,247.6 |
పన్నుల ద్వారా కాకుండా, కేంద్రం నుండి వచ్చే వాటఅను మినహాయించి, వచ్చే ఆదాయ వివరాలు.
సంవత్సరం | ఆదాయం (కోట్ల రూపాయలు)- పన్నులు కాక |
---|---|
2000 | 2,603.0 |
2005 | 3,053.6 |
1970దశకంలో అవలంబించిన ఆర్థిక విధానాల ఫలితంగా భారతదేశంలో పారిశ్రామికంగా మహారాష్ట్ర బాగా అభివృద్ధి చెందింది. గుజరాత్ తరువాత మహారాష్ట్ర దేశంలో అత్యధిక పారిశ్రామిక రాష్ట్రం. ముంబాయి నగరంతో సహా, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతం బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఆ ప్రాంతంవారు అన్ని అవకాశాలను చేజిక్కించుకొంటున్నారన్న అభిప్రాయం విదర్భ, మరాఠ్వాడా, కొంకణ్ ప్రాంతంలో ప్రబలంగా ఉంది. విదర్భ ప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఉద్యమం కూడా ఉంది. మొత్తం దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులలో 13% మహారాష్ట్రనుంచే వస్తున్నాయి. రాష్ట్రంలో 64% ప్రజలు వ్యవసాయ, సంబంధిత వృత్తులపై ఆధారపడి ఉన్నారు. కాని స్థూల రాష్ట్రాదాయంలో 46% పరిశ్రమలనుండే వస్తున్నది. దేశంలో మొదటి 500 వ్యాపార సంస్థలలో 41% పైగా సంస్థలు (Over 41% of the S&P CNX 500 conglomerates) వాటి ప్రధాన కార్యాలయాలను మహారాష్ట్రలో కలిగి ఉన్నాయి.
మహారాష్ట్రలో ముఖ్యమైన పరిశ్రమలు:
మహారాష్ట్రలో ముఖ్యమైన వ్యవసాయోత్పత్తులు
మొత్తం రాష్ట్రంలో నీటివనరులున్న భూమి 33,500చ.కి.మీ.
భారతదేశానికి ఆర్థిక రాజధాని, సినిమా రాజధాని ముంబాయి నగరమేనని అంటారు. దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలు, వాణిజ్య సంస్థల ప్రధాన కార్యాలయాలు ముంబాయ నగరంలో ఉన్నాయి. ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ దేశంలో షేర్ మార్కెట్ లావాదేవీల కేంద్రం. ఇది ఆసియాలో అత్యంత పురాతనమైంది.
ముంబాయిలో సినిమా పరిశ్రమను బాలీవుడ్ అని చమత్కరిస్తుంటారు. (అమెరికాలోని హాలీవుడ్ను పురస్కరించికొని). హిందీ సినిమాలకు, టెలివిజన్ పరిశ్రమకు ఇది ప్రధాన కేంద్రం.
ఇటీవల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ ఊపందుకుంది. పూణే, నాగపూర్, ముంబాయి, నాసిక్ లలో సాఫ్ట్వేర్ పార్కులు నెలకొలుపబడ్డాయి.
బొగ్గు ఆధారంగా ఉత్పత్తి చేసే విద్యుత్తు (దేశంలో 13%), అణు విద్యుత్తు (దేశంలో 17%) - ఈ రెండింటిలోనూ మహారాష్ట్రదే దేశంలో అగ్రస్థానం.
ఇటీవల జత్రోపా వ్యవసాయం మహారాష్ట్రలో విస్తరిస్తుంది.
రాలెగావ్ సిద్ధి అనే ఊరు అహమ్మద్ నగర్ జిల్లాలో ఉంది. పర్యావరణ సంరక్షణ ఈ ఊరు ఒక ఆదర్శప్రాయంగా ఉంది.
మహారాష్ట్ర పాలనా వ్యవస్థ అన్ని రాష్ట్రాలవలెనే ఉంటుంది. రాజధాని ముంబాయి నగరం. ప్రధాన న్యాయ స్థానం బొంబాయి హైకోర్టు మహారాష్ట్రకు, గోవాకు, డామన్-డయ్యుకు కూడా హైకోర్టుగా వ్యవహరిస్తుంది.
శాసన సభ బడ్జెట్, వర్షాకాలపు సమావేశాలు ముంబాయిలోను, శీతాకాలపు సమావేశాలు నాగపూర్లోను జరుగుతాయి. నాగపూర్ నగరం రాష్ట్రానికి ద్వితీయ రాజధాని అని వ్యవహరిస్తారు.
మహారాష్ట్ర శాసనసభలో విధాన సభ (అసెంబ్లీ), విధాన పరిషత్ (కౌన్సిల్) అనే రెండు సభలున్నాయి. మహాహారాష్ట్రకు లోక్సభలో 48 స్థానాలు, రాజ్యసభలో 19 స్థానాలు ఉన్నాయి.
స్వాతంత్ర్యం తరువాత మహారాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన పాత్రను చేజిక్కించుకొంటూ వచ్చింది. 1995వరకూ వారికి బలమైన ప్రత్యర్థులు లేరు. ఈ కాలంలో వై.బి.చవాన్ ప్రముఖ కాంగ్రెసు నాయకుడు. 1995లో బాల్ థాకరే అధ్వర్యంలోని శివసేన, భారతీయ జనతా పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత శరద్ పవార్ ప్రారంభించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరొక ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించింది. 2004 ఎన్నికలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
మహారాష్ట్ర స్థానికులను మహారాష్ట్రియన్ అంటారు. 2001 జనాభా లెక్కల ప్రకారం మహారాష్ట్ర జనాభా 96,752,247. ఇందులో మరాఠీ మాతృభాషగా ఉన్నవారు 62,481,681. రాష్ట్రం జనసాంద్రత చ.కి.మీ.కు 322.5. రాష్ట్రజనాభాలో పురుషులు 5.03 కోట్లు, స్త్రీలు 4.64 కోట్లు. ఆడ, మగ నిష్పత్తి 922/1000. పట్టణ జనాభా 42.4%. అక్షరాస్యులు 77.27%. స్రీలలో అక్షరాస్యత 67.5%, పురుషులలో 86.2%. 1991-2001 మధ్య జనాభా వృద్ధిరేటు 22.57%.
అధికార భాష మరాఠీ. పెద్ద నగరమైన ముంబాయిలో మరాఠీతో బాటు హిందీ, గుజరాతీ, ఇంగ్లీషు భాషలు విస్తారంగా మాట్లాడుతారు. రాష్ట్ర వాయవ్యప్రాంతంలో అహిరాణి అనే మాండలికం కొద్దిమంది మాట్లాడుతారు. దక్షిణ కొంకణ ప్రాంతంలో మాల్వాణి అని పిలువబడే కొంకణి భాష మాట్లాడుతారు. దీనిని మరాఠీ భాష మాండలికం అనికూడా అనవచ్చు. దక్కన్ అంతర్భాగంలో దేశ భాషి అనబడే మరాఠీ మాండలికం మాట్లాడుతారు. విదర్భ ప్రాంతంలో వర్హాదిఅనబడే మరాఠీ మాండలికం మాట్లాడుతారు.
మతపరంగా హిందువులు 80.2%, ముస్లిములు10.6%, బౌద్ధులు 6%, జైనులు 1.3%, క్రైస్తవులు 1% ఉన్నారు. భారతదేశంలో అత్యధిక జైన, జోరాస్ట్రియన్ (పార్సీ), యూదు జనాభా మహారాష్ట్రలోనే ఉన్నారు.
మహారాష్ట్రలోని 35 జిల్లాలని 6 విభాగాలు (డివిజన్లు)గా విభజిస్తారు.
భౌగోళికంగానూ, చారిత్రికంగానూ, రాజకీయ భావాలను బట్టీ మహారాష్ట్రలో 5 ముఖ్యప్రాంతాలను గుర్తింపవచ్చును.
మహారాష్ట్రలో అధికభాగంలో భారతీయ రైల్వే వారి రవాణా సదుపాయం విస్తరించి ఉంది. రైలు ప్రయాణం బాగా సామాన్యం. ముంబాయి కేంద్రంగా సెంట్రల్ రైల్వే ఎక్కువ భాగంలో ఉండగా, దక్షిణతీర ప్రాంతంలో కొకంణ్ రైల్వే ఉంది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ (ఎం.ఎస్.ఆర్.టి.సి) వారి బస్సు రవాణా దాదాపు అన్ని పట్టణాలకు, గ్రామాలకు విస్తరించి ఉంది. ఇంకా ప్రైవేటు రవాణా వ్యవస్థ కూడా దూరప్రయాణాలకు వాడుతుంటారు.
ముంబాయిలో పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. పూణే, నాగపూర్లలో కూడా చిన్న అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. రత్నగిరి, కొల్హాపూర్, నాశిక్లలో విమానాశ్రయాలున్నాయి. ఫెర్రీ సర్వీసులు తీర ప్రాంత పట్టణాల మధ్య ప్రయాణ సౌకర్యాన్ని కలుగజేస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ ప్రమాణాలతో, టోల్గేటు ద్వారా అనుమతి లభించే పూణె-బొంబాయి ఎక్స్ప్రెస్వేను నిర్మించారు.
ముంబాయి నగరంలో మూడు నౌకాశ్రయాలు ఉన్నాయి - ముంబాయి, నవసేన, రత్నగిరి.
మహారాష్ట్ర సంస్కృతి అన్ని మతాల, వర్గాల జీవనశైలికి కలయికగా రూపు దిద్దుకొంది. అత్యధిక సంఖ్యాక జనులు హిందువులైనందున మహారాష్ట్ర సంస్కృతిలో ఆ ప్రభావం కనిపిస్తుంది.
మహారాష్ట్రలో చాలా పురాతనమైన మందిరాలున్నాయి. ఇక్కడి మందిరాలలో ఉత్తర, దక్షిణ భారతాల నిర్మాణశైలుల కలయిక ప్రతిబింబిస్తుంది. ఇంకా హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాల మేళవింపు మందిరాల్లోనూ, ఆచారాల్లోనూ చూడవచ్చును. మహారాష్ట్రలోని మందిరాలలో పండరిపూర్లోని విఠలుని ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది. అజంతా చిత్రాలు,ఎల్లోరాశిల్పాలు, ఔరంగాబాదు మసీదు ప్రసిద్ధ పర్యాటక స్థలాలు. ఇంకా రాయగఢ్, ప్రతాప్గఢ్, సింధుదుర్గ్ వంటి కోటలు కూడా చూడదగినవి.
గోంధల్, లవని, భరుద్, పొవడా వంటివి మహారాష్ట్ర జానపదసంగీత విధానాలు.
ధ్యానేశ్వరుడు రచించిన "భావార్ధ దీపిక" (ధ్యానేశ్వరి) మరాఠీ సాహిత్యంలో మొదటి రచనలలో ఒకటి. ధ్యానేశ్వరుడు, తుకారామ్, నామదేవ్ వంటి భక్తుల భజన, భక్తి గీతాలు జనప్రియమైనవి. ఆధునిక మరాఠీ రచయితలలో కొందరు ప్రముఖులు - పి.యల్.దేశ్పాండే, కుససుమగ్రాజ్, ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే, వ్యాకంతేష్ మద్గుల్కర్.
నాటక రంగం, సినిమా పరిశ్రమ, టెలివిజన్ పరిశ్రమ - మూడూ బొంబాయి నగరంలో కేంద్రీకృతమైనాయి. నటీనటులు, సాంకేతికనిపుణులు, కళాకారులు ఈ మూడు రంగాలలో ఒకదానినుండి మరొకదానికి మారడం సర్వసాధారణం.
మహారాష్ట్ర వినోదరంగంలో కొందరు ప్రముఖులు:
మహారాష్ట్ర వంటకాలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. కొకణతీరంలో వరిఅన్నం, చేపలు ప్రధాన ఆహారపదార్ధాలు. తూర్పు మహారాష్ట్రలో గోధుమ,జొన్న, సజ్జలతో చేసిన పదార్ధాలు ఎక్కువ తింటారు. పప్పులు, ఉల్లి, టొమాటో, బంగాళదుంప, అల్లం, వెల్లుల్లి వంటివి అన్నిచోట్లా వాడుతారు. కోడి, మేక మాంసాల వాడకం కూడా బాగా ఎక్కువ.
సాంప్రదాయికంగా ఆడువారు 9 అడుగుల చీర ధరిస్తారు. మగవారు ధోతీ, పైజమా ధరిస్తారు ఇప్పుడు ఆడువారికి సల్వార్-కమీజ్, మగవారికి ప్యాంటు-షర్టు సాధారణ దుస్తులు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో.
భారతదేశమంతటిలాగానే క్రికెట్ అత్యంత జనప్రియమైన ఆట. గ్రామీణ ఆటలలో కబడ్డి, విట్టి-దండు, గిల్లి-దండా, పకడా-పకడీ ఆటలు సామాన్యం.
మహారాష్ట్రలో ముఖ్యమైన పండుగలు: గుడి-పాడ్వా, దీపావళి, రంగపంచమి, గోకులాష్టమి, వినాయక చవితి (గణేషోత్సవం) - గణేషోత్సవం పెద్ద ఎత్తున జరుపుతారు. ఈ ఊరేగింపులు దేశంలో అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. ఆషాఢమాసంలో పండరీపూర్కు వందలాది కిలోమీటర్లు పాదయాత్రలు చేయడం ఒక సంప్రదాయం.
This article uses material from the Wikipedia తెలుగు article మహారాష్ట్ర, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.