గుర్రం యాదగిరి రెడ్డి (ఫిబ్రవరి 5, 1931 – నవంబరు 22, 2019) తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాటయోధుడు.
మాజీ ఎమ్మెల్యే. మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ నుండి వరుసగా మూడుసార్లు రామన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.
గుర్రం యాదగిరి రెడ్డి | |||
గుర్రం యాదగిరి రెడ్డి | |||
మాజీ శాసనసభ సభ్యుడు, తెలంగాణ సాయుధ పోరాటయోధుడు. | |||
పదవీ కాలం 1985 – 1999 | |||
నియోజకవర్గం | రామన్నపేట | ||
---|---|---|---|
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ | |||
ముందు | కొమ్ము పాపయ్య | ||
తరువాత | ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి | ||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | ఫిబ్రవరి 5, 1931 సుద్దాల, గుండాల మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ, భారతదేశం | ||
మరణం | నవంబరు 22, 2019 హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత కమ్యూనిస్టు పార్టీ | ||
జీవిత భాగస్వామి | యాదమ్మ (రామాంజమ్మ) | ||
సంతానం | ఇద్దరు కుమారులు (రాజశేఖరరెడ్డి, రాంమోహన్రెడ్డి), ఇద్దరు కుమార్తెలు | ||
నివాసం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
యాదగిరి రెడ్డి గుండాల మండలం సుద్దాల గ్రామంలో 1931, ఫిబ్రవరి 5న గుర్రం నర్సమ్మ, రాంరెడ్డి చివరి సంతానంగా జన్మించాడు. ఈయనకు అన్నతో పాటు ఐదుగురు అక్కలు ఉన్నారు. రాత్రి బడిలో 5వ తరగతి వరకు భోగం యాదగిరి పంతులు వద్ద చదువుకున్నాడు. గొర్రెల కాపరిగా, వ్యవసాయం చేస్తూ జీవనం సాగించాడు. గుతుప సంఘానికి 15 ఏళ్ల వయస్సులోనే పాలు అందిస్తూ దళంలోకి వెళ్లాడు. ఆయనకు తల్లిదండ్రులు వారసత్వంగా ఇచ్చిన మూడెకరాల భూమితో పాటు పాత పెంకుటింట్లోనే జీవనం సాగించాడు.
తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లా దళంలో, నిర్మలా కృష్ణమూర్తి, నల్లా నరసింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి మొదలైన దళాల్లో సుద్దాల హనుమంతు, నాయిని నర్సింహారెడ్డి, దూదిపాల చిన్న సత్తిరెడ్డి, కూరెళ్ల సంజీవరెడ్డితో కలిసి పనిచేసి దళ కమాండర్ స్థాయికి ఎదిగాడు. తన పాటలతో, బుర్రకథలతో ప్రజల్లో చైతన్యం కలిగించాడు.
ఆయనకు భార్య యాదమ్మ (రామాంజమ్మ) తో పాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడైన గుర్రం రాజశేఖరరెడ్డి న్యాయవాదిగా, చిన్న కుమారుడు రాంమోహన్రెడ్డి హైదరాబాద్లో విశాలాంధ్ర దిన పత్రికలో రిపోర్టర్గా పని చేస్తున్నారు. పెద్ద కుమార్తెను మోటకొండూర్ మండలం తేర్యాల గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తికి వచ్చి పెళ్లి చేశాడు, చిన్న కుమార్తె హైదరాబాద్లో జీవనం సాగిస్తోంది. యాదగిరి రెడ్డి తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివించి ఆదర్శంగా నిలిచాడు.
చిన్నప్పటి నుండి ఉద్యమ, వామపక్ష భావాలు కలిగిన యాదగిరి రెడ్డి కమ్యూనిస్టు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవాడు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్ము పాపయ్య చేతిలో ఓడిపోయాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట నియోజకవర్గం నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ తరపున 1985, 1989, 1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిపై గెలుపొంది, ఎమ్మెల్యే అయ్యాడు.
ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేశాడు. గ్రామాలకు రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యంను కల్పించడంతోపాటు పాఠశాలల, ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు విశేషమైన కృషిచేశాడు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో అమలు చేసిన క్రాంతిపథకం నుంచి అనేకమంది రైతులకు ఇన్వెల్ బోర్లు వేయించడం ద్వారా వారిని ఆదుకున్నాడు.
యాదగిరిరెడ్డి అనారోగ్యంతో హైదరాబాదులోని ఓవైసీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ 2019, నవంబరు 22న మరణించాడు.
This article uses material from the Wikipedia తెలుగు article గుర్రం యాదగిరి రెడ్డి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.