1945 లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో, అమెరికా, జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై రెండు అణుబాంబు దాడులు చేసింది.
1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జరిగిన ఈ దాడుల్లో కనీసం 1,29,000 మంది మరణించారు. మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగినది ఈ రెండు సంఘటనల్లో మాత్రమే. ఈ దాడులు చేసే ముందు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ మద్ధతు తీసుకుంది.
హిరోషిమా, నాగసాకిలపై అణుదాడులు | |||||||
---|---|---|---|---|---|---|---|
పసిఫిక్ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో భాగము | |||||||
హిరోషిమా (ఎడమ) నాగసాకిలపై (కుడి) అణుబాంబు సృష్టించిన పుట్టగొడుగు మేఘాలు | |||||||
| |||||||
ప్రత్యర్థులు | |||||||
United States Support from: United Kingdom | Japan | ||||||
సేనాపతులు, నాయకులు | |||||||
William S. Parsons Paul W. Tibbets, Jr. Charles Sweeney Frederick Ashworth | Shunroku Hata | ||||||
పాల్గొన్న దళాలు | |||||||
Manhattan District: 50 U.S., 2 British 509th Composite Group: 1,770 U.S. | Second General Army: Hiroshima: 40,000 (5 Anti-aircraft batteries) Nagasaki: 9,000 (4 Anti-aircraft batteries) | ||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||
20 బ్రిటిషు, డచ్చి, అమెరికా యుద్ధఖైదీలు మరణించారు | హిరోషిమా: *20,000+ సైనికులు మరణించారు *70,000–146,000 పౌరులు మరణించారు నాగసాకి: *39,000–80,000 మంది మరణించారు మొత్తం: 129,000–246,000+ మంది మరణించారు |
యుద్ధం చివరి ఏడాదిలో మిత్రరాజ్యాలు జపానును ఆక్రమించుకునేందుకు సిద్ధపడ్డాయి. దీనికి ముందు అమెరికా సాంప్రదాయిక బాంబుదాడులు చేసి 67 జపాన్ నగరాలను ధ్వంసం చేసింది. 1945 మే 8 న, హిట్లరు ఆత్మహత్య చేసుకున్న కొద్దిరోజులకు, జర్మనీ లొంగుబాటు ఒప్పందంపై సంతకం చెయ్యడంతో ఐరోపాలో యుద్ధం ముగిసింది. ఓటమి తప్పని స్థితిలో ఉన్న జపాను బేషరతు లొంగుబాటుకు ఒప్పుకోకపోవడంతో పసిఫిక్ యుద్ధం కొనసాగింది. జపాను బేషరతుగా లొంగిపోవాలని 1945 జూలై 26 న మిత్ర రాజ్యాలు తమ పోట్స్డామ్ డిక్లరేషనులో ప్రకటించాయి. లేదంటే పెను వినాశనమేనని కూడా డిక్లరేషను హెచ్చరించింది. జపాను దాన్ని పెడచెవిని పెట్టింది.
1945 ఆగస్టు నాటికి మన్హట్టన్ ప్రాజెక్టు రెండు రకాల అణుబాంబులు తయారు చేసింది. మారియానా ద్వీపాల్లోని టినియన్ నుండి ఈ బాంబులను మోసుకెళ్ళేందుకు అమెరికా వైమానిక దళం బోయింగ్ B-29 సూపర్ఫోర్ట్రెస్ను సమకూర్చుకుంది.
నాలుగు జపాను నగరాల మీద అణుబాంబులు వెయ్యాలని జూలై 25 న ఆదేశాలు జారీ అయ్యాయి. ఆగస్టు 6 న అమెరికా హిరోషిమాపై యురేనియం గన్ రకం బాంబును (లిటిల్ బాయ్) వేసింది. లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు జపానుకు చెప్పాడు. లేదంటే "చరిత్రలో ఎన్నడూ చూడని వినాశనం ఆకాశం నుండి వర్షిస్తుందని" హెచ్చరించాడు. మూడు రోజుల తరువాత, ఆగస్టు 9 న ప్లుటోనియమ్ ఇంప్లోజను రకం బాంబును (ఫ్యాట్ మ్యాన్) నాగసాకిపై వేసింది. రెండు నుండి నాలుగు నెలల్లోపున హిరోషిమాలో 90,000 నుండి146,000 మంది వరకు, నాగసాకిలో 39,000 నుండి 80,000 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో దాదాపు సగం మంది మొదటిరోజునే మరణించారు. ఆ తరువాతి నెలల్లో కాలిన గాయాల వలన, రేడియేషన్ సిక్నెస్ వలన, ఇతర గాయాల వలనా, పౌష్టికాహార లోపంతో కూడి అనేక మంది మరణించారు. మరణించినవారిలో ఎక్కువమంది సాధారణ పౌరులే. హిరోషిమాలో మాత్రం ఒక సైనికస్థావరం ఉంది.
నాగసాకిలో బాంబు వేసిన ఆరు రోజుల తరువాత జపాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబరు 2 న లొంగుబాటు పత్రంపై జపాను ప్రభుత్వం సంతకం చేసింది. దాంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. లక్షకు పైగా ప్రాణాలను బలితీసుకున్న ఈ అణుదాడుల నైతికత నేటికీ చర్చాంశమే.
1945 లో జపాను, మిత్ర రాజ్యాల మధ్య జరుగుతున్న పసిఫిక్ యుద్ధం నాలుగో ఏటికి చేరింది. జపాను తీవ్రంగా జరిపిన పోరాటం మిత్రరాజ్యాల విజయాన్ని కష్టతరం చేసింది. యుద్ధంలో అమెరికా కోల్పోయిన 12.5 లక్షల మందిలో పది లక్షల వరకూ 1944 జూన్ 1945 జూన్ మధ్యలోనే కోల్పోయింది. 1944 డిసెంబరు నెలలోనే 88,000 మంది అమెరికన్లు మరణించారు. పసిఫిక్లో, మిత్రరాజ్యాలు ఫిలిప్పీన్స్ ను తిరిగి చేరుకున్నారు. బర్మాను తిరిగి ఆక్రమించుకున్నారు. బోర్నియోను ఆక్రమించుకున్నారు. బోగన్విల్లా, న్యూగినియా, ఫిలిప్పీన్స్లో మిగిలిన జపాను దళాల అంతానికి దాడులు జరిపారు. 1945 ఏప్రిల్లో అమెరికా బలగాలు ఒకినావా చేరుకున్నాయి. జూన్ వరకూ అక్కడ తీవ్రమైన పోరు జరిగింది. అమెరికా జపాను సైనిక మరణాల నిష్పత్తి ఫిలిప్పీన్స్లో 5:1 ఉండగా, ఒకినావాలో అది 2:1 గా ఉంది.
జపాన్ సైనికులు కొంతమంది పట్టుబడినప్పటికీ, ఎక్కువమంది మరణించేవరకూ పోరాడేవారు, లేదా ఆత్మహత్య చేసుకునేవారు. ఇవో జిమా కు రక్షణగా ఉన్న 21,000 మంది సైనికుల్లో 99% వరకూ మరణించారు. 1945 ఏప్రిల్-జూన్ ల మధ్య ఒకినావాను సంరక్షిస్తున్న 117,000 మంది జపాను సైనికుల్లో 94% మంది మరణించారు. ఈ సంఖ్యల ఆధారంగా, తాము తలపెట్టిన జపాను ఆక్రమణలో అమెరికను సైనికులు ఎంతమంది మరణించే అవకాశం ఉందో అమెరికా అంచనా వేసుకుంది.
మిత్ర రాజ్యాలు జపాను వైపు సాగుతూండగా, జపానులో పరిస్థితులు అంతకంతకూ విషమిస్తూ పోయాయి. 1941 లో 52,50,000 టన్నులున్న జపాను వర్తక నౌకా సామర్థ్యం, 1945 మార్చిలో 15,60,000 టన్నులకు, ఆగస్టు నాటికి 5,57,000 టన్నులకూ పడిపోయింది. ముడిసరుకుల లేమి వలన 1944 మధ్య నుండి జపాను ఆర్థిక పరిస్థితి వేగంగా క్షీణించింది. యుద్ధ పర్యంతమూ దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితి 1945 మధ్య నాటికి విపత్కర స్థితికి చేరుకుంది. నౌకలు తగ్గిపోవడం చేపల పట్టడాన్ని కూడా దెబ్బతీసింది 1945 లో పట్టిన చేపల మొత్తం 1941 నాటితో పోలిస్తే 22% మాత్రమే. 1945 నాటి వరి దిగుబడి 1909 తరువాతి కాలంలో వచ్చిన వార్షిక దిగుబడులలో కెల్లా అతి తక్కువ. ఆకలి, పౌష్ఠికాహార లోపమూ సర్వత్రా తాండవం చేసాయి. అమెరికా పారిశ్రామిక ఉత్పత్తి జపానుకంటే ఎంతో అధికంగా ఉంది. 1943 నాటికి జపాను ఏడాదికి 70,000 విమానాలు ఉత్పత్తి చెయ్యగా, అమెరికా దాదాపు 1,00,000 విమానాలను ఉత్పత్తి చేసింది. 1944 వేసవి నాటికి పసిఫిక్లో ఉన్న అమెరికా విమాన వాహక నౌకలు 100 కాగా, యుద్ధకాలం మొత్తమ్మీద జపానుకు ఉన్నవి 25 నౌకలే. ఓటమి అనివార్యమని, పదవిని విడిచిపెట్టమనీ 1945 ఫిబ్రవరిలో యువరాజు ఫుమిమారో కోనో, చక్రవర్తి హిరోహిటోకు చెప్పాడు.
1945 మే 8 న జర్మనీ లొంగిపోవడానికి ముందే, జపాన్ను లొంగదీసేందుకు పసిఫిక్ యుద్ధంలో అతిపెద్ద ఆపరేషను -ఆపరేషన్ డౌన్ఫాల్ కు రూపకల్పన మొదలైంది. అపరేషనులో రెండు భాగాలున్నాయి: ఆపరేషన్ ఒలింపిక్, ఆపరేషన్ కొరోనెట్. 1945 అక్టోబరులో మొదలవ్వాల్సిన ఒలింపిక్లో అమెరికన్ సిక్స్త్ ఆర్మీ జపాన్లోని క్యుషు ద్వీపంలో దిగుతుంది. ఒలింపిక్ పూర్తయ్యాక, 1946 మార్చిలో కొరోనెట్ మొదలౌతుంది. అమెరికా సైన్యంతో పాటు, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడాలకు చెందిన సైన్యాలు కూడా పాల్గొనే ఈ ఆపరేషన్లో కాంటో మైదాన ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారు. ఒలింపిక్ లక్ష్యాలు పూర్తిగా నెరవేరేందుకు, ఐరోపా లోని సైన్యాలను ఇక్కడ మోహరించేందుకూ సరిపడా సమయం కావాలి కనుక, జపానులో శీతాకాలం కూడా ముగిసేదాకా ఆగేందుకుగానూ కొరోనెట్ తేదీని ఇలా నిర్ణయించారు.
జపాను భౌగోళిక విశిష్టత కారణంగా ఈ ప్లాను జపానుకు స్పష్టంగా తెలిసిపోయింది; మిత్రరాజ్యాల ప్లాన్లను జపాను కచ్చితంగా అంచనా వెయ్యగలిగింది. అందుకు తగ్గట్టుగా ఆపరేషన్ కెట్సుగో అనే తమ స్వీయరక్షణ వ్యూహంలో తగు మార్పులు చేసింది. క్యుషు రక్షణ కోసం దాదాపు తమ బలగాల నన్నిటినీ మోహరించింది. ఇతర రక్షణ ఆపరేషన్ల కోసం పెద్దగా సైన్యం మిగల్లేదు. 1945 మార్చిలో మంచూరియాలో ఉన్న క్వాంటుంగ్ సైన్యం నుండి నాలుగు డివిజన్లను వెనక్కి రప్పించారు. 1945 ఫిబ్రవరి, మేల మధ్య 45 కొత్త డివిజన్లను తయారుచేసారు. తీరప్రాంత రక్షణ కోసం స్థిరంగా ఉండే డివిజన్లే వీటిలో ఎక్కువ. 16 మాత్రం ఉన్నత స్థాయి మొబైలు డివిజన్లు. మొత్తమ్మీద, 23 లక్షల జపాను సైనికులు, 28 లక్షల పౌర సైన్యమూ దేశ రక్షణకు సిద్ధమయ్యారు. మరణాలు ఎంతగా ఉండబోతున్నాయనే విషయమై ఊహాగానాలు రకరకాలుగా ఉన్నాయి. అన్నీ కూడా చాలా ఎక్కువ మరణాలుంటాయని ఊహించినవే. వైస్ అడ్మిరల్ తకజిరో ఓనీషి, జపాను వైపు మరణాల సంఖ్య 20 లక్షల దాకా ఉండవచ్చని అంచనా వేసాడు.
1945 జూన్ 15 న సంయుక్త యుద్ధ ప్రణాళికల కమిటీ జరిపిన అధ్యయనం, ఒలింపిక్ ఆపరేషన్లో అమెరికా తరపున క్షతులు 130,000 నుండి 220,000 వరకు, అందులో మృతులు 25,000 నుండి 46,000 వరకూ ఉండవచ్చని అంచనా వేసింది. అమెరికా సైన్యాధిపతి జార్జ్ మార్షల్, పసిఫిక్ ప్రాంత సైనిక కమాండరు డగ్లస్ మాకార్థర్ ఈ అంచనాను ఆమోదించారు.
జపాను వారి సన్నాహాల సమాచారాన్ని అల్ట్రా ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించిన అమెరికా కలత చెందింది. అధిక మరణాల అంచనాల పట్ల కలత చెందిన అమెరికా యుద్ధ మంత్రి హెన్రీ స్టిమ్సన్ మరోసారి అధ్యయనం చేయించాడు. ఇద్దరు సభ్యుల ఈ అధ్యయన సమితి, యుద్ధంలో 17 నుండి 40 లక్షల దాకా అమెరికన్ క్షతులుండవచ్చని, అందులో 4 నుండి 8 లక్షల దాకా మరణాలుంటాయనీ అంచనా వేసింది. జపాను తరపున 50 లక్షల నుండి కోటి దాకా క్షతులవుతారని కూడా అంచనా వేసింది.
అమెరికా మరణాల సంఖ్యను తగ్గించేలా యుద్ధం చేసేందుకు తగిన ఆయుధమేమైనా సిద్ధంగా ఉందా అని మార్షల్ ఆలోచించడం మొదలుపెట్టాడు: ఆపరేషన్ ఒలింపిక్ లో విషవాయువు వాడేందుకు అస్ట్రేలియా, న్యూ గినియాల నుండి ఫాస్జీన్, మస్టర్డ్ గ్యాస్, టియర్ గ్యాస్, సైనోజెన్ క్లోరైడ్ లను లుజాన్కు తరలించారు. రసాయనిక యుద్ధాల సేవా విభాగాలకు తగు శిక్షణ ఇచ్చి ఉంచారు. బయలాజికల్ ఆయుధాలను వాడే విషయమై కూడా ఆలోచనలు జరిపారు.
1944 మధ్యలో తన బి-29 సూపర్ఫోర్ట్రెస్ బాంబరు విమానాలు మోహరింపుకు సిద్ధమయ్యాక, అమెరికా జపానుపై దాడులకు సిద్ధమైంది. బి-29 విమానాలను భారత్లోని స్థావరం నుండి, చైనాలోని చెంగ్డు చుట్టుపక్కల ఉన్న స్థావరాలను అనువుగా చేసుకుని జపానులోని వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు చేసే ఆపరేషన్ మ్యాటర్హార్న్ను మొదలుపెట్టింది. లక్షాల నుండి బాగా దూరంగా ఉండడం, బాంబారు విమానాల్లో తలెత్తిన ఇబ్బందులు, చైనాలోని స్థావరాలు శత్రు దాడులకు అందుబాటులో ఉండడం వంటి కారణాల వలన ఈ ఆపరేషను అనుకున్న ధ్యేయాలను నెరవేర్చలేకపోయింది.
మారియానా దీవుల్లోని గ్వామ్, టినియన్, సైపాన్ దీవుల నుండి ఈ దాడులు చేస్తే మెరుగ్గా ఉంటుందని అమెరికా బ్రిగేడియర్ జనరల్ హేవుడ్ హ్యాన్సెల్ భావించాడు. అయితే, ఈ దీవులు జపాను అధీనంలో ఉన్నాయి. తన వ్యూహాలను తగువిధంగా మార్చి, 1944 జూన్ ఆగస్టుల మధ్య అమెరికా వారు ఈ దీవులను ఆక్రమించారు. అక్కడ వైమానిక స్థావరాలను నిర్మించారు. 1944 అక్టోబరులో మారియానా దీవుల నుండి బి-29 దాడులు మొదలయ్యాయి. ఈ స్థావరాలకు రవాణా నౌకల ద్వారా వస్తు సరఫరాలు చెయ్యడం తేలిక. 1944 నవంబరు 18 న XXI బాంబరు కమాండు జపానుపై దాడులు మొదలుపెట్టింది. అంతకు ముందు చైనా నుంచి చేసిన దాడుల వలెనే ఈ దాడులు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. బాగా ఎత్తు నుండి ఎంచుకున్న పారిశ్రామిక లక్ష్యాలపై దాడులు చేసే తన వ్యూహం ఆశించిన ఫలితాల నివ్వకపోయినా హ్యాన్సెల్ దీన్నే కొనసాగించాడు. లక్ష్యం నుండి స్థావరం ఉన్న దూరం, విమానాలలో ఏర్పడిన సాంకేతిక ఇబ్బందులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, శత్రు ప్రతిస్పందనల కారణంగా ఈ దాడులు విఫలమయ్యాయి.
హ్యాన్సెల్ తరువాత 1945 జనవరిలో నేతృత్వానికి వచ్చిన మేజర్ జనరల్ కర్టిస్ లెమే, అదే ప్రెసిషన్ బాంబింగు ఎత్తుగడలను తానూ అనుసరించాడు. ఫలితాలు కూడా అంతే అసంతృప్తికరంగా వచ్చాయి. మొదట్లో ఈ దాడులు కీలకమైన పరిశ్రమలను లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే జపానులో పారిశ్రామిక ఉత్పత్తి ఎక్కువగా చిన్న చిన్న వర్కుషాపుల్లోను, ఇళ్ళలోనూ జరుగుతూ ఉంటుంది. అమెరికా వాయుసేన కేంద్ర కార్యాలయం ఒత్తిడి మేరకు లెమే ఎత్తుగడలు మార్చి, తక్కువ ఎత్తు నుండి ఎక్కువ విస్తీర్ణంపై వేసే మంటల దాడులు (ఫైరుబాంబుల దాడులు) చెయ్యడం మొదలుపెట్టాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన అన్ని దాడుల లాగానే ఈ బాంబుదాడుల లక్ష్యం కూడా.. శత్రువు పరిశ్రమలను దెబ్బతీయడం, పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులను సంహరించడం, పౌరుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం.
తరువాతి అరు నెలల్లో లెమే సారథ్యంలోని XXI బాంబరు కమాండ్ 67 జపాను నగరాలపై బాంబుదాడులు చేసింది. 1945 మార్చి 9 నాటి రాత్రి టోక్యో నగరంపై జరిపిన ఆపరేషన్ మీటింగ్హౌస్ అనే పేరుతో ఫైరుబాంబుల దాడి చేసింది. ఒక్క రాత్రిలో దాదాపు 1,00,000 మంది ప్రజలు మరణించారు. నగరంలోని 41 చ.కి.మీ వైశాల్యం గల ప్రాంతము, 267,000 భవనాలూ ధ్వంసమయ్యాయి. అత్యంత విధ్వంసకరమైన ఈ దాడిలో అమెరికా 20 బి-29 విమానాలను కోల్పోయింది. మే నాటికి, దాడుల్లో వాడిన బాంబుల్లో 75% వరకూ మంటలు రేపేవే. జూన్ మధ్య నాటికి, జపాను లోని ఆరు అతిపెద్ద నగరాలు ధ్వంసమయ్యాయి. ఒకినావాలో యుద్ధం ఆగిపోయాక, అక్కడి వైమానిక స్థావరం మిత్రపక్షాలకు అందడంతో జపానుకు మరింత దగ్గరలో స్థావరం లభించినట్లైంది. మిత్ర పక్షాల విమానవాహకనౌకల నుండి, ర్యుకు దీవుల నుండీ ఎగిరే యుద్ధ విమానాలు జపాను లక్ష్యాలను ఛేదించసాగాయి. ఫైరుబాంబుల దాడులు 60,000-3,50,00 జనాభా ఉండే చిన్న నగరాలపై చెయ్యడం మొదలుపెట్టారు. యూకి తనాక చెప్పినదాని ప్రకారం, అమెరికా వంద జపాను నగరాలు, పట్టణాలపై ఫైరుబాంబుల దాడులు చేసింది. ఈ దాడులు విధ్వంసాన్ని సృష్టించాయి.
జపాను సైనిక దళాలు మిత్ర పక్షాల దాడులను నిలువరించలేకపోయాయి. దేశ పౌర రక్షక వ్యవస్థలు ఈ దాడులకు సరిపోలేదు. బాగా ఎత్తున ఎగురుతున్న మిత్ర పక్షాల బాంబర్లను జపాను ఫైటరు విమానాలు, విమాన వ్యతిరేక గన్నులూ ఎదిరించలేకపోయాయి. 1945 ఏప్రిల్లో జపాను ఫైటరు విమానాలు మిత్ర పక్షాల బాంబరు విమానాలను ఎదుర్కోవడం ఆపేసాయి. రాబోయే ఆక్రమణను అడ్డుకునేందుకు వాళ్ళు విమానాలను జాగ్రత్త చేసుకున్నారు. 1945 మధ్య నాటికి దేశంపై నిఘా కోసం ఎగిరే అమెరికను బి-29 విమానాలను చుట్టుముట్టడం కూడా అరుదుగా చేసాయి. ఇంధనాన్ని ఆదా చేసేందుకు జపనీయులు ఈ చర్యలు చేపట్టారు.. జూన్ ఆఖరులో మిత్రపక్షాల బాంబర్లపై దాడులు చెయ్యాలని జపాను నిర్ణయించినప్పటికీ, అప్పటికి వారి వద్ద మరీ తక్కువ పైటరు విమానాలు మిగిలాయి.
1938 లో జర్మను కెమిస్టులు ఓట్టో హాన్, ఫ్రిట్జ్ స్ట్రాస్మన్లు అణువిచ్ఛిత్తిని కనిపెట్టడంతోను, లీస్ మీట్నర్, ఓట్టో ఫ్రిష్లు దానికి సైద్ధాంతిక వివరణ ఇవ్వడంతోనూ బాంబు తయారీ సైద్ధాంతికంగా సంభవమైంది. జర్మనీ ముందుగా అణుబాంబును తయారు చేస్తుందేమోననే నాజీ జర్మనీ నుండి పారిపోయిన వారి భయాలు, ఐన్స్టీన్-జిలార్డ్ ఉత్తరంలో ప్రతిబింబించాయి. దీంతో 1939 చివర్లో అమెరికాలో దీనిపై పరిశోధనలు మొదలయ్యాయి. 1941 లో బ్రిటిషు వారి మాడ్ కమిటీ నివేదిక వచ్చేదాకా పరిశోధన మందంగా సాగింది. బాంబు తయారీకి కోసం టన్నుల కొద్దీ సహజసిద్ధ యురేనియమ్ బదులు 5-10 కిలోల శుద్ధి చేసిన యురేనియమ్-235 సరిపోతుందని ఈ నివేదిక సారాంశం.
1943 లో క్విబెక్ ఒప్పందం ప్రకారం యుకె, కెనడాల అణుకార్యక్రమాలు - ట్యూబ్ అల్లాయ్స్, మాంట్రియల్ లాబొరేటరీలు అమెరికా వారి మన్హట్టన్ ప్రాజెక్టులో విలీనమయ్యాయి. రాబర్ట్ జె ఓపెన్హీమర్ నేతృత్వంలో న్యూ మెక్సికోలోని లాస్ అల్మాస్ లేబొరేటరీలో బాంబు రూపకల్పన పని జరిగింది. రెండు రకాల బాంబులను తయారు చేసారు. మొదటిది, లిటిల్ బాయ్ - గన్ రకపు విచ్ఛిత్తి బాంబు (యురేనియమ్-235). రెండవది, ఫ్యాట్మ్యాన్ - మరింత శక్తివంతమైన ఇంప్లోజన్ రకం బాంబు.
జపాను వారు కూడా అణుకార్యక్రమం చేపట్టారు గానీ, వారికి తగినన్ని మానవ, ఆర్థిక, ఖనిజ వనరులు లేనందు వలన అది బాంబు తయారు చేసే దిశగా ప్రగతి సాధించలేదు.
బాంబులేసేందుకు తగిన లక్ష్యాలను తనకు, స్టిమ్సన్కు సూచించమని 1945 ఏప్రిల్లో మార్షల్, గ్రోవ్స్ను అడిగాడు. ఇందుకోసం గ్రోవ్స్, సైనికాధికారులు, మన్హట్టన్ ప్రాజెక్టుకు చెందిన కొందరు శాస్త్రవేత్తలతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసాడు.
ఈ కమిటీ ఐదు లక్ష్యాలను సూచించింది:
లక్ష్యాల ఎంపికకు కింది అంశాలపై ఆధారపడ్డారు:
పై నగరాలు అప్పటివరకూ జరిగిన వైమానిక దాడులకు గురికాలేదు. ఇక ముందు కూడా వాటిపై దాడులు చెయ్యకుండా ఉండేందుకు అమెరికా సైనిక, వైమానిక దళాలు అంగీకరించాయి. అణుదాడి జరిగిన తరువాత జరిగే విధ్వంసాన్ని సరిగ్గా అంచనా వేసేందుకు ఇది ఉపకరిస్తుంది. "హిరోషిమా ఓడరేవు కేంద్రం, పారిశ్రామిక కేంద్రం, పెద్ద సైనిక స్థావరంగా ఉంది. అదొక మంచి రాడార్ లక్ష్యం. నగరం బాగా పెద్దది; దానిలోని పెద్ద భాగాన్ని ధ్వంసం చెయ్యవచ్చు. నగరాన్ని ఆనుకుని ఉన్న కొండలు పేలుడు ప్రభావాన్ని నగరంపై కేంద్రీకరింపజేసి, విధ్వంసాన్ని ఇనుమడింపజేస్తాయి. నగరంలోని నదుల కారణంగా, అది మంటల బాంబులకు అనువైనది కాదు."
క్యోటో నగరానికి ఉన్న చారిత్రిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత దృష్ట్యా ఈ జాబితా లోంచి తీసెయ్యాలని మే 30 న స్టిమ్సన్ గ్రోవ్స్కు సూచించాడు. కానీ దానికి ఉన్న సైనిక, పారిశ్రామిక ప్రాముఖ్యాన్ని గ్రోవ్స్ ఎత్తి చూపాడు. స్టిమ్సన్ అధ్యక్షుడు ట్రూమన్తో మాట్లాడి క్యోటోను లక్ష్యాల జాబితా నుండి తీసివేసేందుకు ఒప్పించాడు. తీసేసారు కూడాను. క్యోటోను తిరిగి చేర్చేందుకు గ్రోవ్స్ ప్రయత్నించాడు గానీ, స్టిమ్సన్ ఒప్పుకోలేదు. జూలై 25 న క్యోటో స్థానంలో నాగసాకిని చేర్చారు. నాగసాకి పెద్ద యుద్ధనౌకా స్థావరం, నౌకా నిర్మాణ కేంద్రం, నౌకా దళానికి అవసరమైన ఆయుధాలను తయారు చేసే కేంద్రం.
జూలై 16 నాడు న్యూ మెక్సికోలో జరిపిన అణ్వస్త్ర పరీక్ష (దీనికి ట్రినిటీ టెస్ట్ అని పేరు) అంచనాలను మించి విజయవంతమైంది. జూలై 26 న, మిత్రపక్షాలు విడుదల చేసిన పోట్స్డ్యామ్ ప్రకటనలో జపాన్ను లొంగిపొమ్మని చెబుతూ, అందుకు సంబంధించిన నిబంధనలను పేర్కొన్నారు. ఈ ప్రకటన జపానుకు చేస్తున్న చివరి హెచ్చరిక అని చెప్పారు. లొంగకపోతే మిత్ర పక్షాలు జపానుపై దాడి చేస్తాయని, అది "జపాను మాతృభూమి, జపాను సైనిక దళాల సంపూర్ణ విధ్వంసానికి దారితీస్తుంద"ని ప్రకటించారు. ఈ ప్రకటనలో అణ్వస్త్ర ప్రసక్తి లేదు.
ఈ ప్రకటనను జపాను ప్రభుత్వం తిరస్కరించిందని జూలై 28న జపాను వార్తాపత్రికలు ప్రకటించాయి. ఆ రోజు మధ్యాహ్నం జపాను ప్రధాని సుజుకి కంటారో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పోట్స్డ్యామ్ ప్రకటన కైరో ప్రకటనకు పునరావృతమేనని, ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదనీ ప్రకటించాడు. జపాను పత్రికలు, అంతర్జాతీయ పత్రికలూ దాన్ని పోట్స్డ్యామ్ ప్రకటనకు స్పష్టమైన తిరస్కరణగా భావించాయి. జపాను రష్యాకు పంపిన శాంతి సంకేతాలకు రష్యా స్పందన కోసం ఎదురుచూస్తున్న హిరోహిటో చక్రవర్తి ప్రభుత్వ అభిప్రాయాన్ని ఏమీ మార్చలేదు. లొంగుబాటు విషయమై జపాను కొన్ని షరతులు పెట్టింది. అవి:
రాచరిక వ్యవస్థను కొనసాగనివ్వాలి, నిరాయుధీకరణ బాధ్యతను రాజుకు అప్పగించాలి, జపాను భూభాగాన్ని గానీ, కొరియా, ఫార్మోసాలను గానీ ఆక్రమించరాదు, యుద్ధ నేరస్థులను శిక్షించే అధికారం జపాను ప్రభుత్వానికి ఇవ్వాలి.
జపానుపై అణుబాంబును వేసేటపుడు బ్రిటన్ను కూడా ఆ పనిలో భాగం చేసుకోవాలని పోట్స్డ్యామ్లో విన్స్టన్ చర్చిల్ ట్రూమన్ను అడిగాడు. అందుకు అతడు అంగీకరించాడు. అందుకు అనుగుణంగా బ్రిటన్, విలియమ్ పెన్నీ, గ్రూప్ కెప్టెన్ లియొనార్డ్ చెషైర్ లను టినియన్ దీవికి పంపించింది. కానీ లెమే వారిని బాంబు వేసిన దళంలో చేర్చలేదు. ఇక వాళ్ళు తమ ఫీల్డ్ మార్షల్ విల్సన్కు ఓ కటువైన సిగ్నలు (లేఖ) పంపించడం తప్ప, అక్కడ ఉండి చేసినదేమీ లేదు.
లిటిల్ బాయ్ బాంబు 1945 మే నాటికి సిద్ధమైంది. ఇక దానిలో యురేనియమ్ను కూర్చడమే తరువాయి. సగం అమర్చిన బాంబు, మిగతా విడిభాగాలూ కాలిఫోర్నియా లోని హంటర్స్ నేవల్ షిప్యార్డు నుండి జూలై 16 న బయల్దేరి జూలై 26 న టినియన్ చేరుకున్నాయి. టార్గెట్ ఇన్సర్ట్, విమానంలో జూలై 30 నాటికి వచ్చింది. బాంబును తీసుకుని వెళ్ళే బి-29 విమానం టేకాఫ్ దశలో కూలిపోతే, బాంబు అక్కడే పేలిపోతుంది కదా అని సైనిక దళం అనుమానం వ్యక్తం చేసింది. దాంతో బిర్చ్ దాని డిజైన్ను మార్చి అందులో ఒక బ్రీచ్ ప్లగ్గును అమర్చాడు. దీనివలన బాంబును విమానంలో మోసుకెళ్తూ దారిలో ఉండగా సచేతనం చేసే వీలు కలిగింది.
ప్లుటోనియమ్ బాంబుకు చెందిన కోర్ను, కిర్ట్ల్యాండ్ సైనిక విమాన స్థావరం నుండి ట్రినియన్ లోని నార్త్ఫీల్డుకు జూలై 28 న చేర్చారు. ఐదు ఫ్యాట్ మ్యాన్ బాంబులకు చెందిన మిగతా విడిభాగాలు ఐదు విమానాల్లో ఆగస్టు 2 నాటికి నార్త్ఫీల్డును చేరుకున్నాయి.
అణ్వస్త్రం వేసే నాటికి హిరోషిమా ఒక పారిశ్రామిక కేంద్రం, సైనిక దళాలకు పెద్ద స్థావరం కూడా. నగరం చుట్టుపట్ల అనేక సైనిక స్థావరాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది షున్రోకు హటా నేతృత్వం లోని రెండవ జనరల్ సైన్యపు ప్రధాన కేంద్రం. అది హిరోషిమా కోటలో ఉంది. జపాను సైన్యానికి చెందిన 59వ సైన్యం, 5వ డివిజను, 224 వ డివిజను ప్రధాన కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. మొత్తమ్మీద, 40,000 వరకు జపాను సైనికులు నగరంలో ఉన్నారు.
హిరోషిమా, జపాను సైన్యానికి సరఫరాలు చేసే స్థావరాల్లో ఒకటి. అది సమాచార కేంద్రం, నౌకారవాణా రేవు పట్టణం, సైనిక దళాల కేంద్రం. యుద్ధ పరిశ్రమల కేంద్రం - యుద్ధ విమానాలు, నౌకలకు, చెందిన విడిభాగాల తయారీ కేంద్రం, బాంబులు, తుపాకుల తయారీ కేంద్రం. నగర మధ్య భాగంలో కాంక్రీటు భవనాలు, దాని చుట్టూ ఉన్న నగర భాగంలో, ఇళ్ళలోనే కలపతో నిర్మించిన చిన్న చిన్న వర్కుషాపులూ ఉంటాయి. నగర శివార్లలో కొన్ని పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. ఇళ్ళు చాలావరకూ కలపతో నిర్మించినవే. మొత్తమ్మీద నగరం యావత్తూ తేలిగ్గా విధ్వంసానికి గురయ్యేదే. యుద్ధంలో ఇంకా ధ్వంసం కాని నగరాల్లో క్యోటో తరువాత ఇదే పెద్దది. XXI బాంబరు కమాండు ప్రధాన లక్ష్యమైన విమాన తయారీ కేంద్రం హిరోషిమాలో లేకపోవడం దీనికి ప్రధాన కారణం. జూలై 3 న కోకురా, నీగాటా, క్యోటో లతో పాటు హిరోషిమాను కూడా బాంబరు విమానాల పరిధి నుండి మినహాయించారు.
యుద్ధకాలంలో హిరోషిమా జనాభా 3,81,000 కి చేరినప్పటికీ జపాను ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజలను తరలించడంతో, బాంబు వేసే సమయానికి జనాభా సుమారు 3,40,000–3,50,000 వరకే ఉంది. అప్పటివరకూ మిగతా నగరాలపై వేసిన మంటల బాంబులు (ఫైర్ బాంబింగు) తమ నగరంపై ఎందుకు వెయ్యలేదో ఇక్కడి ప్రజలకు అర్థం కాలేదు. బహుశా అమెరికా జపాన్ను అక్రమించుకున్నాక వారు హిరోషిమాను తమ రాజధానిగా చేసుకుంటారేమోనని కొందరు, హవాయి క్యాలిఫోర్నియాల్లోని తమ బంధువులు ప్రభుత్వాన్ని అభ్యర్ధించి బాంబులు వెయ్యకుండా ఆపి ఉంటారని కొందరూ ఊహలు చేసారు. వాస్తవానికి దగ్గరగా ఆలోచించే అధికారులు కొందరు మాత్రం, ఫైరు బాంబులు వేస్తే రేగే మంటలు వ్యాపించకుండా, అక్కడక్కడా కొన్ని భవనాలను పడవేయించి, మంటల అడ్డుకట్టలను ఏర్పాటు చేసారు. ఈ ఏర్పాట్లు 1945 ఆగస్టు 6 ఉదయం వరకూ కొనసాగుతూనే ఉన్నాయి.
ఆగస్టు 6 న తలపెట్టిన అణ్వస్త్ర దాడికి ప్రాథమిక లక్ష్యం హిరోషిమా కాగా, కోకురా, నాగసాకిలు ప్రత్యామ్నాయ లక్ష్యాలు. అణుబాంబును తీసుకుని, ఇనోలా గే అనే పేరున్న బి-29 బాంబరు విమానాన్ని నడుపుతూ టిబ్బెట్స్, టినియన్ లోని నార్త్ఫీల్డు నుండి బయలుదేరాడు. ఆ విమానానికి అతని తల్లి పేరే పెట్టారు. ఇనోలా గే ను మరో రెండు బి-29 బాంబర్లు అనుసరించాయి.
Aircraft | Pilot | Call Sign | Mission role |
స్ట్రెయిట్ ఫ్లష్ | మేజర్ క్లాడ్ ఈథర్లీ | డింపుల్స్ 85 | వాతావరణ పరిశీలన (హిరోషిమా) |
జాబిట్ 3 | మేజర్ జాన్ విల్సన్ | డింపుల్స్ 71 | వాతావరణ పరిశీలన (కోకురా) |
ఫుల్ హౌస్ | మేజర్ రాల్ఫ్ టేలర్ | డింపుల్స్ 83 | వాతావరణ పరిశీలన (నాగసాకి) |
ఇనోలా గే | కలనల్ పాల్ టిబ్బెట్స్ | డింపుల్స్ 82 | బాంబును వేసే విమానం |
ది గ్రేట్ ఆర్టిస్ట్ | మేజర్ చార్లెస్ స్వీనీ | డింపుల్స్ 89 | పేలుడును కొలిచే పరికరాలు |
నెసెసరీ ఈవిల్ | కెప్టెన్ జార్జి మార్కార్ట్ | డింపుల్స్ 91 | దాడి పరిశీలన, ఫోటోలు తీయడం |
టాప్ సీక్రెట్ | కెప్టెన్ చార్లెస్ మెక్నైట్ | డింపుల్స్ 72 | స్పేరు - దాడిలో పాల్గొనలేదు |
టినియన్ నుండి పైకెగిరాక విమానాలు వేరువేరు దారుల్లో ప్రయాణించి, ఇవో జిమా వద్ద కలిసి, అక్కడి నుండి జపాను వైపు ప్రయాణించాయి. మిషను కమాండరైన పార్సన్స్, ప్రయాణంలో ఉండగా బాంబును చైతన్యవంతం చేసాడు. బాంబు ముందే చేతనంగా ఉంటే, టేకాఫ్ సమయంలో విమానం కూలిపోతే పేలుడు జరగడాన్ని నివారించేందుకు ఈ ఏర్పాటు చేసారు. అతడి సహాయకుడు సెకండ్ లెఫ్టినెంటు మోరిస్ జెప్సన్ లక్ష్యం చేరడానికి అరగంట ముందు బాంబుకు ఉన్న సేఫ్టీ డివైసును తొలగించాడు.
అణుబాంబు దాడికి ఒక గంట ముందు స్ట్రెయిట్ ఫ్లష్ విమానం హిరోషిమాపై ఎగిరి వాతావరణాన్ని పరిశిలించింది. అది ఇనోలా గే కు ఒక సందేశం పంపించింది: "క్లౌడ్ కవర్ లెస్ దేన్ 3/10త్ ఎట్ ఆల్ ఆల్టిట్యూడ్స్. ఎడ్వైస్: బాంబ్ ప్రైమరీ." ఆ విమానం వెనక్కి వెళ్ళిపోయాక, ఉదయం 07:09 కి, జపాను ప్రభుత్వం హిరోషిమాలో అంతా ఓకే అనే ప్రకటనను ప్రజలకు విడుదల చేసింది.
అణుబాంబును తీసుకుని ఎగురుతున్న ఇనోలా గే విమానం 08:09 కి బాంబును విడుదల చేసే దశకు చేరుకున్నాక, పైలట్ టిబ్బెట్స్, ఆ పనిని తన బొంబార్డియరు, మేజర్ థామస్ ఫెరెబీకి అప్పగించాడు. అతడు, అనుకున్న సమయానికి - 08:15 కు, (హిరోషిమా సమయం) - బాంబును విడుదల చేసాడు. 64 కిలోల యురేనియమ్-235 కలిగిన "లిటిల్ బాయ్" బాంబు, విమానం ఎగురుతున్న 9,400 మీ. ఎత్తు నుండి పేలుడు జరిగిన 580 మీ. ఎత్తుకు పడడానికి 44.4 సెకండ్లు తీసుకుంది. పేలుడు వల్ల ఉద్భవించిన షాక్ వేవ్లు ఇనోలా గే ను తాకేటప్పటికి అది 18.5 కి.మీ. దూరం ప్రయాణించింది.
బలంగా వీస్తున్న గాలి కారణంగా, బాంబు తన లక్ష్యమైన "అయ్యోయి" వంతెనకు 240 మీ. దూరంలో, సరిగ్గా షిమా ఆసుపత్రిపై పేలింది. 16 కిలోటన్నుల టిఎన్టి కి సమానమైన శక్తిని అది విడుదల చేసింది. ఆ బాంబు సమర్ధత బహుతక్కువ; దాని పదార్థంలో కేవలం 1.7% మాత్రమే విచ్ఛిత్తి జరిగింది. సంపూర్ణంగా ధ్వంసమైన భూ విస్తీర్ణపు వ్యాసార్థం 1.6 కి.మీ. పేలుడు తరువాత రేగిన మంటలు 11 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించాయి.
లక్ష్యించిన ప్రాంతంపై ఇనోలా గే రెండు నిముషాలు ఉంది. బాంబు పేలినపుడు పదిమైళ్ళ దూరంలో ఉంది. బాంబరులో ఉన్న టిబ్బెట్స్, పార్సన్స్, ఫెరెబీ లకు మాత్రమే తాము తీసుకెళ్తున్న బాంబు ఎలాంటిదో తెలుసు. విమానంలో ఉన్న మిగతావారికి తెలియదు. బాంబు పేలినపుడు కళ్ళు చెదిరే వెలుగు వస్తుందని చెప్పి వారికి నల్ల కళ్ళద్దాలు ఇచ్చారు. టిబ్బెట్స్ "నమ్మలేని దృశ్యాన్ని చూసాం" అని పాత్రికేయులతో అన్నాడు.
పేలుడును ప్రత్యక్షంగా చూసిన వారు ఒక పీకా (జపనీసు భాషలో కళ్ళు చెదిరే కాంతి) ను, ఓ డాన్ (జపనీసు భాషలో మహా శబ్దం) నూ గమనించినట్లు చెప్పారు. పేలుడులో 70,000–80,000 మంది - మొత్తం హిరోషిమా జనాభాలో 30% - మరణించారు. మరో 70,000 మంది గాయపడ్డారు. సుమారు 20,000 మంది జపాను సైనికులు మరణించారు. 12 చ.కి.మీ. నగరం ధ్వంసమైందని అమెరికా అంచనా వేసింది. జపాను అధికారుల అంచనా ప్రకారం హిరోషిమాలోని భవనాల్లో 69% ధ్వంసం కాగా, మరో 6–7% దెబ్బతిన్నాయి.
కాంక్రీటు భవనాల్లో కొన్నింటిని భూకంపాలను తట్టుకునేందుకు గాను బాగా బలంగా నిర్మించారు. అవి, పేలుడు ప్రదేశానికి దగ్గరగా ఉన్నప్పటికీ తట్టుకున్నాయి. వాటి ఫ్రేమ్వర్కు దెబ్బతినలేదు. బాంబు భూమి నుండి కొంత ఎత్తులో, గాలిలో పేలడం వలన పేలుడు పక్కల కంటే కింది వైపుకు కేంద్రీకృతమైంది. పేలుడు ప్రదేశానికి 150 మీ. దూరంలోనే ఉన్న జెన్బాకు డోమ్ నాశనం కాకుండా ఉండడానికి అదే కారణం. ఈ భవనాన్ని హిరోషిమా శాంతి స్మారకంగా పిలుస్తున్నారు. 1996 లో దీన్ని యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. యుద్ధంలో ఎక్కువ దెబ్బ తిన్నది ఇతర ఆసియా దేశాలు కాగా, జపానుపై దృష్టి ఎక్కువ పెట్టడం చారిత్రిక దృష్టి లేకపోవడమేనని చెబుతూ, అమెరికా, చైనాలు దీనికి అభ్యంతరం తెలిపాయి. పేలుడు తరువాత మంటలు రేగాయి. కాగితం, కలపలతో చేసిన ఇళ్ళ ద్వారా ఈ మంటలు వేగంగా వ్యాపించాయి. ఇతర నగరాల్లో లాగానే మంటల అడ్డుకట్టలు ఈ మంటలను అడ్డుకోలేకపోయాయి. ఈ మంటలు 2 కి.మీ. వ్యాసార్థంలోని ప్రదేశాన్ని భస్మీపటలం చేసాయి.
హిరోషిమాపై అణుబాంబు దాడి | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
|
హిరోషిమాలోని వ్యాపార కేంద్రం తీవ్రమైన విధ్వంసానికి గురైంది. ఇక్కడే నగరంలోని డాక్టర్లలో 90% మంది, నర్సుల్లో 93% మందీ మరణించడమో, గాయపడడమో జరిగింది. ఆసుపత్రులు ధ్వంసం కావడమో బాగా దెబ్బతినడమో జరిగింది. రెడ్ క్రాస్ ఆసుపత్రిలో తెరుఫూమి ససాకి అనే ఒకే ఒక్క డాక్టరు మిగిలారు. మధ్యాహ్నాని కల్లా పోలీసులు, స్వచ్ఛంద సేవకులూ కలిసి ఆసుపత్రులు, పాఠశాలలు, ట్రాము స్టేషన్లలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసారు. అసానో గ్రంథాలయంలో ఒక శవాగారాన్ని ఏర్పాటు చేసారు.
పేలుడు కేంద్రానికి 820 మీ. దూరంలో ఉన్న రెండవ సైన్యపు కేంద్ర కార్యాలయపు పెరేడ్ మైదానంలో ఉన్న 3,243 మంది సైనికులు మరణించారు. ఆ కార్యాలయపు మాళిగలో ఉన్న సమాచార కేంద్రంలో చెందిన యోషీ ఓకా అనే బాలిక సమాచార అధికారిగా పనిచేస్తోంది. ఆమె 100 కి.మీ. దూరం లోని ఫుకుయామా కార్యాలయానికి ఓ ప్రత్యేకమైన ఫోనులో ఒక సందేశం పంపింది. అందులో ఆమె "హిరోషిమాపై కొత్త రకం బాంబుతో దాడి జరిగింది. నగరం దాదాపు పూర్తిగా ధ్వంసమైన స్థితిలో ఉంది" అని పంపింది.
ఉదయం అల్పాహారం తింటున్న మేయరు సెంకిచీ అవాయా ఈ దాడిలో మరణించాడు. ఆయన స్థానంలో ఫీల్డ్ మార్షల్ హటా బాధ్యతలు స్వీకరించి పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించాడు. సైనికులు, దాడిలో దెబ్బ తినని ఉజినా హార్బరులో ఉన్న ఆత్మహత్యా పడవల్లో (అమెరికనులు దాడి చేస్తే ఎదురుదాడి చేసేందుకు జపాను సైనికులు వీటిని సిద్ధం చేసి ఉంచారు) గాయపడిన వాళ్ళను ఉజినా ప్రాంతంలోని సైనిక ఆసుపత్రికి తరలించారు. ట్రక్కులు, రైళ్ళూ సహాయ సామాగ్రిని నగరానికి తీసుకువచ్చి, వాటిలోనే బాధితులను తరలించాయి.
పేలుడు జరిగిన ప్రదేశానికి 400 మీ. దూరంలో ఉన్న చుగోకు సైనిక పోలీసు ప్రధాన కార్యాలయంలో 12 మంది అమెరికను వాయుసేన సైనికులు బందీలుగా ఉన్నారు. వీరిలో చాలామంది వెనువెంటనే మరణించారు. అయితే వారిలో ఇద్దరిని జపనీయులు చంపారని తెలియ వచ్చింది. మరో ఇద్దరు పేలుడులో గాయపడగా వారిని బయట వదిలి పెట్టారు. వాళ్లను ప్రజలు రాళ్ళతో కొట్టి చంపారనీ వార్తలు వచ్చాయి. క్యుషు యూనివర్సిటీలో వైద్య పరిశోధనలకు గాను వాడిన 8 మంది అమెరికను యుద్ధ ఖైదీలు ఆ పరిశోధనల్లో మరణించగా, దాన్ని కప్పిపుచ్చేందుకు గాను, వారు అణుబాంబు పేలుడులో మరణించారని జపాను ప్రకటించింది.
జపాను బ్రాడ్కాస్టింగు కార్పొరేషను వారి హిరోషిమా స్టేషను మూగబోయిందని టోక్యో కంట్రోల్ ఆపరేటరు గమనించాడు. మరొక టెలిఫోను లైను వాడి కార్యక్రమాన్ని కొనసాగించేందుకు అతడు ప్రయత్నించగా, అది కూడా విఫలమైంది. 20 నిముషాల తరువాత, హిరోషిమాకు ఉత్తరాన తమ మెయిన్ లైన్ టెలిగ్రాఫు పనిచెయ్యడం లేదని టోక్యో రెయిల్ రోడ్ టెలిగ్రాఫ్ కేంద్రం గమనించింది. హిరోషిమాలో పెను పేలుడు జరిగిందని నగరానికి 16 కి.మీ. లోపున ఉన్న రైల్వే స్టేషన్ల నుండి కబుర్లు వచ్చాయి. ఈ కబుర్లన్నీ జపాను సైన్యానికి చేరాయి.
హిరోషిమా లోని సైనిక నియంత్రణ కేంద్రాన్ని సంప్రదించేందుకు సైనిక స్థావరాలు పదేపదే ప్రయత్నించాయి. నగరం పూర్తిగా మౌనం వహించడం వారికి అయోమయం కలిగించింది; పెద్ద శత్రుదాడి ఏమీ జరగలేదని వాళ్లకు తెలుసు, ఆ సమయంలో హిరోషిమాలో మందుగుండు సామాగ్రి పెద్దగా లేదని కూడా వాళ్లకు తెలుసు. హిరోషిమాకు విమానంలో వెళ్ళి, లాండయి, నష్టాన్ని అంచనా వేసి, విశ్వసనీయ సమాచారంతో తిరిగి టోక్యోకు రావాలని ఒక కుర్ర అధికారిని ఆదేశించారు. భయపడాల్సినంత పెద్ద నష్టమేమీ జరగలేదని, భారీ పేలుడు అనేది పుకారనీ వాళ్ళు అనుకున్నారు.
ఆ అధికారి విమానం ఎక్కి, నైరుతి దిశగా ప్రయాణించాడు. మూడు గంటలు ప్రయాణించాక, హిరోషిమా ఇంకా 160 కి.మీ. దూరంలో ఉండగానే నగరంపై బాంబు పేలుడు వలన ఏర్పడిన మహా మేఘాన్ని అతడు, అతడి పైలట్ చూసారు. నష్టాన్ని అంచనా వేసేందుకు నగరంపై ఒక చుట్టు వేసాక, నగర దక్షిణ భాగంలో దిగారు. టోక్యోకు నివేదిక పంపించాక, ఆ అధికారి పునరావాస కార్యక్రమాలు మొదలుపెట్టాడు. 16 గంటల తరువాత, ప్రెసిడెంట్ ట్రూమన్ హిరోషిమాపై అణుదాడి చేసామని ప్రకటించినప్పుడు, నగరం ఓ కొత్త బాంబు పేలుడులో నాశనమైందని మొదటిసారిగా టోక్యోకు తెలిసింది.
హిరోషిమాపై బాంబుదాడి తరువాత ఈ కొత్త ఆయుధాన్ని ప్రయోగించామని ట్రూమన్ ప్రకటించాడు. "జర్మను అణుబాంబు తయారీ విఫలమవడం పట్ల మనం దేవుడికి దండం పెట్టుకోవాలి. అమెరికా, దాని మిత్ర దేశాలు కలిసి బాంబు తయారీ కోసం 200 కోట్ల డాలర్లు ఖర్చుపెట్టాయి. శాస్త్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద జూదం. ఈ జూదంలో మనం గెలిచాం." అని అతడన్నాడు. జపాన్ను అతడు హెచ్చరిస్తూ "వాళ్ళు మన షరతులకు అంగీకరించకపోతే, ఈ భూమ్మీద ఎవరూ ఎన్నడూ చూడని వినాశనం ఆకాశం నుండి వర్షిస్తుంది. ఈ ఆకాశ దాడి తరువాత, వాళ్ళు మున్నెన్నడూ చూడనంత పెద్ద సంఖ్యలో భూ, సముద్ర బలగాలు వాళ్లను చుట్టుముడతాయి. ఈ బలగాల శక్తి సామర్థ్యాలు వాళ్ళు ముందే రుచి చూసి ఉన్నారు." అని ప్రకటించాడు. ఈ ప్రసంగాన్ని జపాను వార్తా సంస్థలకు కూడా అందేలా ప్రసారాం చేసారు.
సైపాన్లో ఉన్న 50,000 వాట్ల రేడియో స్టేషను హిరోషిమా గురించి అలాంటి సందేశాన్నే ప్రతి 15 నిముషాల కొకసారి ప్రసారం చేసింది. పోట్స్డామ్ ప్రకటన లోని నిబంధనలకు ఒప్పుకోకపోతే, మరిన్ని జపాను నగరాలకు కూడా ఇదే గతి పడుతుందని ఈ సందేశంలో చెప్పింది. ప్రధాన నగరాలను ఖాళీ చెయ్యమని పౌరులను కోరింది. రేడియో జపాన్ మాత్రం ఎవరికీ లొంగని జపాను, విజయాన్ని పొందుతుందని చెప్పింది. ఒకే బాంబుతో హిరోషిమాను నాశనం చేసిన సంగతిని అది ప్రకటించింది. ప్రధాన మంత్రి సుజుకి పత్రికలతో మాట్లాడక తప్పలేదు. మిత్ర పక్షాల డిమాండ్లను తిరస్కరించి, పోరును కొనసాగించడం పట్ల తన ప్రభుత్వ కృతనిశ్చయాన్ని అతడు పునరుద్ఘాటించాడు.
జపాను సోవియట్ యూనియన్ ల మధ్య ఉన్న తటస్థ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సోవియట్ విదేశాంగ మంత్రి వ్యాచెస్లావ్ మోలొటోవ్ ఆగస్టు 5 న జపానుకు తెలియజేసాడు. ఆగస్టు 9 అర్థరాత్రి దాటిన రెండు నిముషాలకు సోవియట్ పదాతి, శతఘ్ని దళాలు, వాయుసేనలు మంచూరియా వ్యూహాత్మక దాడిని మొదలు పెట్టాయి. నాలుగు గంటల తరువాత, సోవియట్ల అధికారిక యుద్ధ ప్రకటన జపానుకు చేరింది. జపాను యుద్ధ మంత్రి కోరెచికా అనామి సహాయంతో, దేశంలో మార్షల్ లా విధించేందుకు జపాను సైన్యపు ఉన్నతాధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. శాంతి కోసం ఎవరూ ప్రయత్నాలు చెయ్యకుండా ఉండేందుకు వారీ ప్రయత్నాలు చేసారు.
ఆగస్టు 7 న, హిరోషిమా వినాశనం జరిగిన మరుసటి రోజు, డా. యోషియో నిషినా ఇతర అణు శాస్త్రవేత్తలతో కలిసి హిరోషిమా వెళ్ళి జరిగిన నాశనాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. టోక్యో తిరిగి వెళ్ళాక, హిరోషిమా నిజంగానే అణుదాడిలో నాశనమైందని క్యాబినెట్కు నివేదిక ఇచ్చారు. మరో ఒకటో రెండో బాంబుల కంటే ఎక్కువ తయారై ఉండవని నావికాదళాధిపతి అడ్మిరల్ సీము టొయోడా వేసిన అంచనా ఆధారంగా యుద్ధాన్ని కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. "మరింత నాశనం జరగొచ్చేమో గానీ యుద్ధం మాత్రం కొనసాగుతుంది" అని వాళ్ళు అనుకున్నారు. అమెరికా గూఢచార వ్యవస్థ ఈ క్యాబినెట్ సందేశాలను పట్టుకుంది.
అదే రోజున పర్నెల్, పార్సన్స్, టిబ్బెట్స్, స్పాట్జ్, లీమే లు గ్వామ్ లో సమావేశమై తరువాత ఏం చెయ్యాలో చర్చించారు. జపాను లొంగిపోయే సూచనలు కంబడనందున, మరొక బాంబు వెయ్యాలని వాళ్ళు నిర్ణయించారు. ప్రాజెక్టు ఆల్బర్టా తయారు చేస్తున్న రెండవ బాంబు ఆగస్టు 11 కల్లా సిద్ధమౌతుందని పార్సన్స్ చెప్పాడు. కానీ ఆ రోజున తుపాను వల్ల వాతావరణం బాగా ఉండదన్న వాతావరణ సూచనల కారణంతో బాంబును ఆగస్టు 9 నాటికే సిద్ధం చెయ్యాలని టిబ్బెట్స్ కోరాడు. పార్సన్స్ అందుకు ఒప్పుకున్నాడు.
దక్షిణ జపానులోని పెద్ద రేవు పట్టణాల్లో నగసకి ఒకటి. మందుగుండు తయారీ, ఓడలు, సైనిక యంత్రాల తయారీ, ఇతర యుద్ధ సామాగ్రి తయారీ కేంద్రం కావడాన ఈ నగరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. నగరంలోని అతిపెద్ద సంస్థలైన మిట్సుబిషి షిప్యార్డ్స్, ఎలక్ట్రికల్ షిప్యార్డ్స్, ఆయుధ కర్మాగారం, స్టీల్ అండ్ ఆర్ంస్ వర్క్స్ లలో నగరంలోని 90% కార్మికులు పనిచేస్తున్నారు. నగరంలోని పరిశ్రమల్లో కూడా 90% ఇవే.
అణుబాంబు పేలుడు నాటికి నగరంలో 263,000 జనాభా ఉన్నారు. వీరిలో 240,000 మంది జపనీయులు, 10,000 మంది కొరియన్లు, 2,500 మంది నిర్బంధ సైనిక సేవలో ఉన్న కొరియను కార్మికులు, 9,000 మంది జపాను సైనికులు, 600 మంది నిర్బంధ సైనిక సేవలో ఉన్న చైనీసు కార్మికులు, 400 మంది యుద్ధ ఖైదీలూ ఉన్నారు.
రెండవ బాంబును ఎప్పుడు వేయాలన్న నిర్ణయం తీసుకునే బాధ్యతను టిబ్బెట్స్కు అప్పజెప్పారు. ముందు అనుకున్న తేదీని - ఆగస్టు 11 - వాతావరణ పరిస్థితుల కారణంగా ఆగస్టు 9 గా మార్చారు. F-31, F-32, F-33 అనే పేర్లున్న మూడు బాంబుల మధ్యంతర కూర్పులను టినియన్కు రవాణా చేసారు. ఆగస్టు 8 న, బాంబు వెయ్యడాన్ని ఒక రిహార్సలు చేసారు. F-33 అనే మధ్యంతర కూర్పును ఈ రిహార్సలులో వాడారు. F-31 కూర్పును దాడి కోసం వాడాలని నిశ్చయించారు.
Aircraft | Pilot | Call Sign | Mission role |
ఇనోలా గే | కెప్టెన్ జార్జి మార్కార్ట్ | డింపుల్స్ 82 | వాతావరణ పరిశీలన (కోకురా) |
లాగిన్డ్రాగన్ | కెప్టెన్ చార్లెస్ మెక్నైట్ | డింపుల్స్ 95 | వాతావరణ పరిశీలన (నాగసాకి) |
బోక్స్కార్ | మేజర్ చార్లెస్ స్వీనీ | డింపుల్స్ 77 | బాంబును వేసే విమానం |
ది గ్రేట్ ఆర్టిస్ట్ | కెప్టెన్ ఫ్రెడరిక్ సి. బోక్ | డింపుల్స్ 89 | పేలుడును కొలిచే పరికరాలు |
బిగ్ స్టింక్ | మేజర్ జేమ్స్ హాప్కిన్స్ జూ. | డింపుల్స్ 90 | దాడి పరిశీలన, ఫోటోలు తీయడం |
ఫుల్ హౌస్ | మేజర్ రాల్ఫ్ టేలర్ | డింపుల్స్ 83 | స్పేరు - దాడిలో పాల్గొనలేదు |
1945 ఆగస్టు 9 తెల్లవారు ఝామున 03:49 కి స్వీనీ నడుపుతున్న బోక్స్కార్ విమానం ఫ్యాట్మ్యాన్ బాంబును మోసుకుని కోకురా మొదటి లక్ష్యం గాను, నాగసాకి ప్రత్యామ్నాయ లక్ష్యంగానూ ఉంచుకుని బయలుదేరింది. సరిగ్గా హిరోషిమా దాడిలో లాగానే రెండు బి-29 లు వాతావరణ పరిశీలనకు ముందు వెళ్ళగా, మరో రెండు బి-29 లు విధ్వంసాన్ని కొలిచే పరికరాలతోను, ఫోటోలు తీసేందుకు గానూ స్వీనీ వెంట వెళ్ళాయి. బాంబు సిద్ధంగా ఉంది. దాని సేఫ్టీ ఫ్యూజును తియ్యలేదు.
ఎగిరే ముందు విమానానికి చేసిన పరీక్షలో దాని ఇంధన బదిలీ పంపు ఒకటి పనిచెయ్యడం లేదని గమనించారు. ఆ పంపును మార్చడానికి కొన్ని గంటలు పడుతుంది. ఫ్యాట్మ్యాన్ (బాంబు)ను మరో విమానం లోకి తరలించేందుకు కూడా అంతే సమయం పడుతుంది. ఈ కారణాల వలన బాంబును బోక్స్కార్ లోనే తీసుకుపోవాలనే వాళ్ళు నిశ్చయించారు.
ఈసారి పెన్నీ, చెషైర్లను మిషనులో పాల్గొననిచ్చారు. మూడవ విమానం, బిగ్స్టింక్లో అబ్సర్వర్లుగా వాళ్ళు పాల్గొన్నారు. విమానాలన్నీ కలవాలని అనుకున్న చోట కలిసినపుడు, కోకురా నగరంపై బాంబు వెయ్యాలని స్వీనీ నిర్ణయించి ఆ దిశగా ప్రయాణం మొదలు పెట్టాడు.
కోకురాకు దగ్గరలో ఉన్న యహాటా ప్రాంతంపై ముందు రోజు చేసిన దాడిలో వెలువడ్డ పొగ, కోకురా నగరమ్మీద పరచుకుంది. పైగా, యాహాటా లోని ఉక్కు కంపెనీ కావాలని నల్లని పొగను వదిలింది. దట్టమైన మేఘాలు, పొగ అన్నీ కలిసి, కోకురా గగనతలాన్ని 70% వరకూ కమ్మేసాయి. 50 నిముషాల్లో మూడు సార్లు బాంబు వేసే ప్రయత్నం చేసారు. ఇలా చెయ్యడంలో వాళ్ళు కోకురా లోని రక్షణ స్థావరాల దృష్టిలో పడ్డారు.
మూడు ప్రయత్నాల తరువాత, ఇంధనం తగ్గిపోతూ ఉండగా, వాళ్లు తమ రెండవ లక్ష్యం, నాగసాకి దిశగా ప్రయాణం మొదలుపెట్టారు. ఒకవేళ నాగసాకి కూడా మేఘావృతమై కనబడకుండా ఉంటే, బాంబును ఒకినావాకు తీసుకువెళ్ళి అక్కడ సముద్రంలో పడెయ్యాలని వాళ్ళు తొలుత అనుకున్నారు. సరిగ్గా కనిపించని పక్షంలో, లక్ష్యాన్ని కనుక్కునేందుకు రాడార్ను వాడాలని తరువాత నిశ్చయించారు. జపాను సమయం 07:50 కి, నాగసాకిలో వైమానిక దాడి హెచ్చరిక మోగించారు. మళ్ళీ 08:30 కి అంతా బానే ఉంది అనే సిగ్నలు మోగించారు. 10:53 కి రెండు బి-29 లు మాత్రమే కనబడినపుడు, అవి నిఘా కోసమే వచ్చాయని భావించిన జపనీయులు, దాడి హెచ్చరిక కూడా మోగించలేదు.
కొద్ది నిముషాల తరువాత, 11:00 గంటలకు ది గ్రేట్ ఆర్టిస్ట్ మూడు పారాచూట్ల ద్వారా పరికరాలను దించింది. పరికరాలతో బాటు యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన ప్రొఫెసరు ర్యోకిచి సగానే కు రాసిన సంతకం లేని ఉత్తరం కూడా ఒకటి ఉంది. అణుబాంబు తయారీలో పాల్గొన్న ముగ్గురు శాస్త్రవేత్తలతో కలిసి ఆయన చదువుకున్నాడు. ఇలాంటి సామూహిక విధ్వంసం కలుగజేసే బాంబుల వలన పొంచి ఉన్న ప్రమాదాల గురించి ప్రజలకు చెప్పమనే అభ్యర్ధన అందులో ఉంది. ఆ ఉత్తరం సైనిక అధికారులకు దొరికింది. కానీ, ఒక నెల తరువాత గానీ వారు దాన్ని ఆయనకు అందించలేదు. ఆ ఉత్తరం రాసిన వారిలో ఒకడైన లూయీ ఆల్వారెజ్ 1949 లో సగానేను కలిసినపుడు, ఆ ఉత్తరంపై సంతకం పెట్టాడు.
11:01 కు, మేఘాలు తప్పుకోగా, లక్ష్యం కనబడింది. 5 కిలోల ప్లుటోనియమ్ కలిగిన ఫ్యాట్మ్యాన్ బాంబును నగరపు పారిశ్రామిక లోయలో పడేలా జారవిడిచారు. అది 47 సెకండ్ల తరువాత, మిట్సుబిషి ఉక్కు, ఆయుధ కర్మాగారానికి, నాగసాకి ఆయుధాగారానికీ మధ్య, ఒక టెన్నిసు కోర్టుకు పైన 503 మీ. ఎత్తులో పేలింది. ముందు అనుకున్న ప్రదేశానికి ఇది 3 కి.మీ. దూరంలో ఉంది; పేలుడు ఉరకామి లోయకే పరిమితమైంది. నగరంలోని అధికభాగాన్ని మధ్యన ఉన్న కొండలు కాపాడాయి. ఈ పేలుడు 21 కిలోటన్నుల టిఎన్టి కి సమానమైన శక్తిని విడుదల చేసింది. వంద మైళ్ళ దూరంలో ఉన్న బిగ్స్టింక్ ఈ పేలుడును చూసింది. విధ్వంసాన్ని చూసేందుకు అది నగరం మీదుగా ఎగిరింది.
నాగసాకిపై వేసిన బాంబు, హిరోషిమా బాంబు కంటే శక్తివంతమైన దైనప్పటికీ, కొండల కారణంగా దాని ప్రభావం ఉరకామి లోయకే పరిమితమైంది. మిట్సుబిషి ఆయుధ కర్మాగారంలో పని చేసే 7,500 మందిలో 6,200 మంది మరణించారు. ఇతర ఆయుధ కర్మాగారాల్లో పనిచేసే వారు కూడా 17,000 నుండి 22,000 మంది దాకా మరణింఛారు. తక్షణమే మరణించిన వారి సంఖ్య 22,000 నుండి 75,000 దాకా ఉండవచ్చని వివిధ అంచనాలు ఉన్నాయి. కనీసం 35,000 నుండి 40,000 దాకా మరణించారు. 60,000 మంది గాయపడ్డారు. విస్ఫోటనం తరువాత కొన్ని నెలల్లో గాయాలపాలైన వారు అనేక మంది మరణించారు. సరైన దస్త్రాలు లేకుండా పని చేస్తున్న విదేశీ కార్మికులు నగరంలో ఉండటం, వచ్చి పోయే సైనికులు అనేక మంది ఉండటం వంటి కారణాల వలన, 1945 అంతానికి కూడా మరణాల లెక్క సరిగ్గా తేలలేదు. వివిధ అధ్యయనాల్లో 39,000 నుండి 80,000 దాకా వివిధ అంచనాలు వెలువడ్డాయి.
హిరోషిమాలో వలె కాకుండా ఇక్కడ కేవలం 150 మంది జపాను సైనికులు మాత్రమే తక్షణం మరణించారు. 8 నుండి 13 మంది యుద్ధ ఖైదీలు మరణించారు. బ్రిటిషు వాయుసేనకు చెందిన రోనాల్డ్ షా, ఏడుగురు డచ్చి ఖైదీలు మరణించిన వారిలో ఉన్నారు. జో కియోమియా అనే ఒక అమెరికను బాంబు పేలుడు సమయంలో నాగసాకిలో ఉన్నాడు గాని, అతడు మరణాన్ని తప్పించుకున్నాడు. అతడి జైలుకున్న బలమైన కాంక్రీటు గోడలే అతణ్ణి కాపాడాయి. 24 గురు ఆస్ట్రేలియా యుద్ధ ఖైదీలు కూడా ఉన్నారు; వారంతా కూడా మరణాన్ని తప్పించుకున్నారు.
వినాశనం జరిగిన స్థలం 1.6 కి.మీ. వ్యాసార్థంలో ఉంది. నగర ఉత్తర భాగంలో మంటలు కమ్ముకున్నాయి. మిట్సుబిషి ఆయుధ కర్మాగారం 58% దెబ్బతింది. మిట్సుబిషి ఉక్కు కర్మాగారం 78% దెబ్బతింది. మిట్సుబిషి ఎలక్ట్రికల్ కర్మాగారం వినాశన క్షేత్రానికి అంచున ఉండటాన 10% మాత్రమే దెబ్బతింది. హిరోషిమాలో లాగా నాగసాకిలో మంటలకు అవసరమైన ఇంధనం దట్టంగా లేనందువల్ల ఇక్కడ మంటల తుపాన్లు రాలేదు. పైగా గాలుల కారణంగా ఈ మంటలు లోయ వెంబడి కొట్టుకు పోయాయి.
హిరోషిమాలో లాగా నాగసాకిలో కూడా వైద్య సౌకర్యాలు అస్తవ్యస్తమయ్యాయి. షింకోజెన్ పాఠశాలను తాత్కాలిక ప్రధాన ఆసుపత్రిగా మార్చారు. రైళ్ళు నడుస్తూనే ఉండటంతో అనేక మంది క్షతగాత్రులను సమీపంలోని నగరాలకు తీసుకెళ్ళి అక్కడి ఆసుపత్రుల్లో చేర్చారు. నౌకాదళ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు సాయంత్రానికి నగరం చేరుకున్నారు. అగ్నిమాపక దళాలు కూడా చేరుకుని మంటలను ఆర్పడంలో సాయపడ్డారు. తకాషి నగాయ్ నాగసాకి మెడికల్ కాలేజి ఆసుపత్రి రేడియాలజీ విభాగంలో డాక్టరుగా పనిచేస్తున్నాడు. పేలుడులో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి కుడి టెంపొరల్ ధమని తెగిపోయింది. అయినప్పటికీ అతడు దాన్ని లెక్కచెయ్యకుండా, గాయపడ్డవారికి వైద్య సేవలు అందించడంలో పాల్గొన్నాడు.
ఆగస్టు 19 నాటికి మరొక బాంబు సిద్ధంగా ఉంటుందని గ్రోవ్స్ ఆశించాడు. సెప్టెంబరులో మరొక మూడు, అక్టోబరులో మూడు సిద్ధమౌతాయని కూడా అతడు భావించాడు. ఆగస్టు 10 న మార్షల్కు పంపిన సందేశంలో అతడు "ఆగస్టు 17, 18 తరువాత వాతావరణం బాగున్న ఏ రోజునైనా ప్రయోగించేందుకు మరొక బాంబు సిద్ధంగా ఉండాలి" అని రాసాడు. మార్షల్ ఆ అభ్యర్ధనను ఆమోదిస్తూ, "ప్రెసిడెంటు నుండి స్పష్టమైన అనుమతి లేకుండా దాన్ని జపానుపై వెయ్యరాదు" అని ఆ నోటుపై రాసాడు. అలా అనుమతి పొందాలని ప్రెసిడెంటు ట్రూమన్ ఆ రోజే చెప్పి ఉన్నాడు. "బాంబులు తయారు అయీ అవగానే" లక్ష్యిత నగరాలను అణ్వస్త్రాలతో దాడి చెయ్యాలంటూ గతంలో జారీ చేసిన ఆదేశానికి ఇది సవరణ. అప్పుడు తయారీలో ఉన్న అణ్వస్త్రాలను ఆపరేషన్ డౌన్ఫాల్ కోసం గాను, దాచి ఉంచాలని యుద్ధ మంత్రిత్వ శాఖలో ఆసరికే చర్చ జరుగుతూ ఉంది. లక్ష్యాలుగా పెట్టుకున్న ఇతర నగరాలను అణ్వస్త్ర దాడుల జాబితా నుంచి తీసెయ్యాలని మార్షల్ స్టిమ్సన్ కు సూచించాడు.
మరో రెండు ఫ్యాట్మ్యాన్ బాంబులను సిద్ధం చేసి ఉంచారు. కర్ట్ల్యాండ్ ఫీల్డ్ నుండి ఇవి టినియన్కు ఆగస్టు 11, 14 తేదీల్లో వెళ్ళాల్సి ఉంది. న్యూమెక్సికో లోని అల్బూకెర్క్కు వెళ్ళి, వాటిని తీసుకుపొమ్మని లెమే టిబ్బెట్స్కు చెప్పాడు కూడా. లాస్ అలమోస్ వద్ద, పనివాళ్ళు 24 గంటల పాటు ఏకధాటిగా పనిచేసి మరొక ప్లుటోనియమ్ కోర్ను పోత పోసారు. పోతపోయడం అయినినప్పటికీ, దాన్ని ప్రెస్ చేసి, పూత పూసే పనులు ఆగస్టు 16 నాటికి గానీ పూర్తి కావు. అంచేత అది ఆగస్టు 19 నాటికి గానీ వాడేందుకు సిద్ధమయ్యేది కాదు. మార్షల్ అందుబాటులో లేనందున, ఆ కోర్ను పంపించరాదని గ్రోవ్స్ స్వయంగా నిర్ణయం తిసుకున్నాడు.
This article uses material from the Wikipedia తెలుగు article హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.