ముద్రారాక్షసం విశాఖదత్తుడు రచించిన సంస్కృత చారిత్రక నాటకం.
భారతదేశ చక్రవర్తిగా చంద్రగుప్త మౌర్యుడు రాజ్యం చేపట్టాక జరిగిన రాజకీయపు ఎత్తుగడలను, పరిణామాలను నాటకం చిత్రీకరించింది. నందవంశాన్ని చాణక్యుని నీతి చతురత సహాయంతో నిర్మూలించి చంద్రగుప్తుడు పాటలీపుత్రాన్ని పరిపాలిస్తున్న నేపథ్యంలో నాటకం ప్రారంభం అవుతుంది. నందుని మహా మంత్రి రాక్షస మంత్రి తన రాజు మరణానికి ప్రతీకారం తీర్చుకోదలచి చంద్రగుప్తుని చంపేందుకు ఎత్తులు వేస్తూండగా, చంద్రగుప్తుని పక్షాన చాణక్యుడు వాటన్నిటినీ చిత్తు చేస్తూ పైఎత్తులు వేయడంతో నాటకం కొనసాగుతుంది. చివరికి చాణక్యుని మంత్రాంగానికి చిక్కి రాక్షస మంత్రి చంద్రగుప్తునికి మంత్రిత్వం వహించేందుకు అంగీకరించడంతో నాటకం పూర్తవుతుంది.
చంద్రగుప్తునికి పరాభవం జరుగుతుందన్న సూచన విని కోపంతో తానున్నంత వరకూ చంద్రగుప్తునికి అవమానం కలుగజేసే మొనగాడెవరంటూ చాణక్యుడు రావడంతో నాటకం ప్రారంభం అవుతుంది. ఐతే నందవంశాన్ని నిర్మూలించి చంద్రగుప్తుణ్ణి రాజుగా నిలబెట్టడం, నందుని మంత్రి రాక్షసుడిని వశుణ్ణి చేసుకున్నాకానే సంపూర్ణమౌతుందని గ్రహిస్తాడు. తన రాజైన నందుణ్ణి చంపి రాజ్యం చేపట్టిన చంద్రగుప్తుణ్ణి ఎలాగైనా చంపాలని పగతో రగులుతూంటాడు రాక్షస మంత్రి. అందుకోసం తన వలెనే చంద్రగుప్తునిపై కత్తికట్టిన మలయకేతువు, పర్వతేశ్వరుల వంటివారితో చేయికలుపుతాడు. చంద్రగుప్తుణ్ణి మట్టుపెట్టేందుకు తయారుచేసిన విషకన్యను అతనిపైకి ప్రయోగిస్తాడు. ఆ విషకన్యతోనే పర్వతేశ్వరుణ్ణి చంపేలా చేసిన చాణక్యుడు, రాక్షసుని వల్లనే మరణించినట్టు ప్రచారం చేస్తాడు. పర్వతేశ్వరుని కుమారుడు మలయకేతువు, రాక్షస మంత్రి వద్ద అనేకులైన గుఢచారులను నియమించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూంటాడు. రాక్షసుని కుటుంబం ఆయన మిత్రుడు చందనదాసు రక్షణలో ఉన్నట్టు తెలుసుకుని, చందనదాసుతో రాక్షస మంత్రి కుటుంబాన్ని తనకు అప్పగించమని చాణక్యుడు అడుగుతాడు. కానీ చందనదాసు నిరాకరిస్తాడు.
చంద్రగుప్తుని చంపేందుకు రాక్షసుడు పన్నిన ఎత్తుగడలన్నీ విఫలం కావడంతో భేదోపాయాన్ని ఎంచుకుంటాడు. చాణక్య చంద్రగుప్తుల నడుమ విభేదాలు సృష్టించాలని వైతాళికుల వేషంలో ఇద్దరు గూఢచారుల్ని చంద్రగుప్తుని వద్దకు పంపుతాడు రాక్షస మంత్రి. వీరు చంద్రగుప్తునికి గర్వం, అహంకారం పుట్టించేలాంటి స్తుతి చేస్తూంటారు. చాణక్య చంద్రగుప్తులిద్దరూ తమ తమ కార్యసఫలత వల్ల గర్వులై, సంతృప్తులై ఉన్నారు కనుక వారి మధ్య వివాదం పుట్టించడం సులభమని రాక్షస మంత్రి యోచన.
రాక్షస మంత్రి చేసిన ఈ పన్నాగాన్ని తెలుసుకున్న చాణక్యుడు తమ మధ్య విభేదాలు పొడసూపినట్టు ప్రవర్తించమని చంద్రగుప్తుడితో చెప్తాడు. భేదాన్ని సృష్టించినట్టు నటించేందుకు గాను పాటలీపుత్రంలో కౌముదీ మహోత్సవాన్ని చేయాలని చంద్రగుప్తుడు ప్రకటించగా, కౌముదీ మహోత్సవంలో ప్రజలు, రాజాధికారులు అప్రమత్తులై ఉండగా దండెత్తివచ్చేందుకు రాక్షస, మలయకేతువులకు అవకాశం దొరుకుతుందని చాణక్యుడు అంటాడు. ఆ అవకాశం లేకుండా చేయాలంటే కౌముదీ మహోత్సవాన్ని చేయరాదని చాణక్యుడు శాసిస్తాడు. చాణక్య చంద్రగుప్తులు వాగ్వాదం చేసుకున్నట్టు నటిస్తారు. ఈ అదను చూసుకుని చంద్రగుప్తుడి కోపం రెచ్చగొట్టే స్తుతి చదువుతారు వైతాళికులు.
This article uses material from the Wikipedia తెలుగు article ముద్రారాక్షసం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.