దుర్గాబాయి దేశ్ముఖ్ (జూలై 15, 1909 - మే 9, 1981) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త .
చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఆమె స్థాపించింది. ఆమె భారతదేశ రాజ్యాంగ సభ, భారతదేశ ప్రణాళికా సంఘ సభ్యురాలు. ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్పర్సన్గా వ్యవహరించింది.
దుర్గాబాయి దేశ్ముఖ్ | |
---|---|
జననం | జూలై 15, 1909 |
మరణం | మే 9, 1981 |
వృత్తి | న్యాయవాది, సంఘసేవ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఆంధ్ర మహిళా సభ |
జీవిత భాగస్వామి | సి.డి.దేశ్ముఖ్ |
తల్లిదండ్రులు |
|
దుర్గాబాయి దేశ్ముఖ్ మద్రాసు ప్రెసిడెన్సి (ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్) లోని రాజమండ్రిలో, 1909 జూలై 15 న మద్య తరగతి దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించింది. 8 ఏండ్ల వయసులో ఆమెకు తన మేనమామ సుబ్బారావుతో వివాహమయింది. తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకింది. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు అంగీకరించారు. బాల్యం నుండి ప్రతిభాపాటవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించింది. బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్ సైన్స్), 1942లో ఎల్. ఎల్.బి పూర్తిచేసింది. న్యాయశాస్త్రం చదివిన తరువాత మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించింది.
దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తన 12 యేండ్ల వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించింది. ఆమె రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించింది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కాబడింది. స్వాతంత్ర్య సమరకాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఎ, బిఎల్, బిఎ ఆనర్స్ చేసి న్యాయకోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్ లాయర్గా పేరుగాంచింది.
దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేసింది. ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నపట్నంలో (ప్రస్తుత చెన్నై లో) ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది.1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించింది. ఈమె 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్లు, వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పింది. చెన్నైలో 70మంది కార్యకర్తలతో ఉదయవనం అను పేరుతో సత్యాగ్రహ శిభిరం ఏర్పరిచింది. 1953లో ఆర్థికమంత్రి చింతామణి దేశ్ ముఖ్ తో వివాహం జరిగింది. 1971లో సాక్షారతా భవన్ ని ప్రారంభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పనిచేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసింది. ఆ సందర్భములో సి.డి.దేశ్ముఖ్తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న జరిగింది. ఈవిడ 1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేసింది. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్కు అధ్యక్షురాలిగా పనిచేసింది
దుర్గాబాయి 1981 మే 9వ తేదీన హైదరాబాదులో మరణించింది.
This article uses material from the Wikipedia తెలుగు article దుర్గాబాయి దేశ్ముఖ్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.