ఎ ఫిల్మ్ బై అరవింద్ 2005 లో శేఖర్ సూరి దర్శకత్వంలో విడుదలైన మిస్టరీ సినిమా.
ఈ సినిమా హిందీలోకి భయానక్ - ఎ మర్డర్ మిస్టరీ అనే పేరుతో అనువాదం అయింది.
ఎ ఫిల్మ్ బై అరవింద్ | |
---|---|
దర్శకత్వం | శేఖర్ సూరి |
రచన | శేఖర్ సూరి (కథ), సురేంద్ర కృష్ణ, రాధాకృష్ణ (సంభాషణలు) |
నిర్మాత | శ్రీధర్ రావు, కె.ఎస్. రామారావు (సమర్పణ) |
తారాగణం | రాజీవ్ కనకాల రిషి మోనా చోప్రా గజల్ శ్రీనివాస్ |
ఛాయాగ్రహణం | రమేష్ కృష్ణ |
కూర్పు | బి. ఆర్. తిరుపతి రెడ్డి |
సంగీతం | విజయ్ కురాకుల |
నిర్మాణ సంస్థ | క్రియేటివ్ కమర్షియల్స్ |
పంపిణీదార్లు | శ్రీధర్ సినిమా |
విడుదల తేదీ | 2005 జూలై 9 |
సినిమా నిడివి | 143 నిమిషాలు |
భాష | తెలుగు |
చిన్ననాటి స్నేహితులైన అరవింద్ (రాజీవ్ కనకాల), రిషి (రిషి) సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కలలు కంటుంటారు. వారికి అవకాశం వచ్చి రిషి కథానాయకుడుగా, అరవింద్ దర్శకుడిగా రెండు విజయవంతమైన చిత్రాలు రూపొందిస్తారు. మూడో సినిమా కోసం కొత్త కథ, కొత్త రచయితల కోసం అన్వేషిస్తూ అనేకమంది రచయితలను పురమాయిస్తారు. అలా ఎంపికైన కథల్లో అరవింద్ ఒక కొత్త రచయిత రాసిన కథ ఆసక్తిగా అనిపించడంతో దానిని పరిశీలిస్తుండగా అతని సహాయ దర్శకుడొకరు ఆ పేపర్ల మీద ఇంకు ఒలికిస్తాడు. అంతటితో చదవడం ఆపి అరవింద్ తన స్నేహితుడు రిషితో కలిసి రోడ్డు మీద అలా సరదాగా ప్రయాణిస్తూ సినిమా గురించి స్ఫూర్తి పొందాలనుకుంటారు. వారిద్దరూ అలా ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో నిరుపమ అనే అమ్మాయిని రౌడీల బారి నుండి రక్షిస్తారు. ఒక నలుపు రంగు కారు వారిని వేగంగా దాటుకుని వెళ్ళడంతో నిరుపమ థ్రిల్లింగ్ కోసం ఆ కారును ఓవర్ టేక్ చేయమని డ్రైవింగ్ చేస్తున్న రిషిని కోరుతుంది. రిషి వేగంగా కారు నడిపి, లాఘవంగా ఆ కారును దాటుకుని వెళ్ళిపోతారు. కానీ ఆ ప్రయత్నంలో ఆ నలుపు రంగు కారు ఒక ట్రక్కుకు తగిలి ప్రమాదం జరుగుతుంది. కానీ ముందు దాటుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ విషయం తెలియదు.
వారు ఓ అడవిలో కాటేజీలో దిగుతారు. రిషి నెమ్మదిగా నిరుపమతో ప్రేమలో పడతాడు. అరవింద్ కి కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టం ఏర్పడుతుంది. కొత్త సినిమా కథ చదివేకొద్దీ అరవింద్, రిషికి ఆ కథలో చెప్పిన సంఘటనలే ఇప్పటిదాకా తమ జీవితంలో జరుగుతున్నట్లు గుర్తిస్తారు. కథ చివరిలో ఇద్దరు స్నేహితులు ఒక అమ్మాయి కోసం పోట్లాడుకుంటున్నట్లుగా రాసి ఉంటుంది. కథలో చెప్పిన విధంగానే నిరుపమ గురించి కూడా అరవింద్, రిషి పోట్లాడుకుంటారు. మిగతా కథ పూర్తి చేయడం కోసం ఆ రచయిత (గజల్ శ్రీనివాస్) ను అడవిలోకి రమ్మంటారు. అతను ఆ ఇద్దరు స్నేహితులు పోట్లాడుకుంటున్న అమ్మాయి నిజానికి ఒక మానసిక రోగి అనీ, ఆమె ఆ ఇద్దరు స్నేహితుల్లో చంపేస్తుందని చెబుతాడు. ఇప్పటి దాకా వారి జీవితంలో కథ ప్రకారమే జరిగాయి కాబట్టి తామిద్దరిలో ఎవరో ఒకరు చనిపోతారని భావించిన అరవింద్ ఆ అమ్మాయిని వదిలించుకోమని రిషిని కోరతాడు. కానీ దానికి రిషి అంగీకరించకుండా అరవింద్ కి చెప్పకుండా ఆమెతో కలిసి లేచిపోయి పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. అదే సమయానికి వారున్న ప్రాంతంలోనే ఒక మానసిక రోగి తిరుగుతున్నదనీ వార్త వస్తుంది. దాంతో అరవింద్ నిరుపమే ఆ మానసిక రోగి అని నిర్ణయానికి వస్తాడు.
అరవింద్ ఎలాగైనా నిరుపమను చంపి తన స్నేహితుణ్ణి కాపాడాలనుకుంటాడు. కానీ అప్పటికే రచయిత కథను రొమాంటిక్ క్లైమాక్స్ గా మార్చేస్తాడు. దాంతో రిషి భద్రంగానే ఉంటాడు కానీ అరవింద్ మాత్రం వార్తల్లో చెప్పిన సైకోపాత్ చేతిలో మరణిస్తాడు. నిజానికి వారు తమ ప్రయాణంలో ప్రమాదానికి కారణమైన నల్ల కారులో ఉన్నది సైకోపాత్ అయిన ఒక అమ్మాయి. తమకు ప్రమాదం జరగడానికి వారే కారణమని వాళ్ళను చంపాలని తిరుగుతుంటుంది. తన స్నేహితుడు అరవింద్ చావుకు కారణమైన రిషి ఆ సైకోపాత్ ను చంపి నిరుపమను కలుసుకోవడంతో కథ ముగుస్తుంది.
This article uses material from the Wikipedia తెలుగు article ఎ ఫిల్మ్ బై అరవింద్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.