సిమ్లా ఒప్పందం, 1914 లో గ్రేట్ బ్రిటన్, చైనా, టిబెట్ ల మధ్య సిమ్లాలో టిబెట్ యొక్క స్థితికి సంబంధించి కుదిరిన అస్పష్టమైన ఒప్పందం.
మూడు దేశాల ప్రతినిధులు 1913, 1914 ల్లో సిమ్లాలో చర్చలు జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు.
టిబెట్ను "ఔటర్ టిబెట్", "ఇన్నర్ టిబెట్" గా విభజించాలని సిమ్లా ఒప్పందం భావించింది. సుమారుగా యు-త్సాంగ్, పశ్చిమ ఖాం లను కలిగి ఉండే ఔటర్ టిబెట్, "చైనా సార్వభౌమత్వం కింద లాసా లోని టిబెట్ ప్రభుత్వం పాలన లోనే ఉంటుంది" కానీ, చైనా దాని పరిపాలనలో జోక్యం చేసుకోదు. అమ్డో, తూర్పు ఖామ్ తో కలిసి "ఇన్నర్ టిబెట్" ఏర్పడుతుంది. ఇది చైనా ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఈఒప్పందం, దాని అనుబంధాలతో సహా, టిబెట్, చైనాల మధ్య సరిహద్దునూ, టిబెట్ బ్రిటిష్ ఇండియాల మధ్య సరిహద్దునూ కూడా నిర్వచిస్తుంది (ఈ రెండో సరిహద్దునే తరువాతి కాలంలో మెక్ మహోన్ రేఖ అన్నారు).
1914 ఏప్రిల్ 27 న ముసాయిదా ఒప్పందంపై మూడు దేశాలు సంతకాలు చేసాయి. కాని చైనా వెంటనే దానిని తిరస్కరించింది. కొద్దిగా సవరించిన ఒప్పందంపై 1914 జూలై 3 న సంతకం చేసారు. కానీ బ్రిటన్, టిబెట్లు మాత్రమే చేసాయి. చైనాకు చెందిన స్వతంత్ర నిర్ణయాధికారం గల ప్రతినిధి (ప్లీనిపొటెన్షియరీ) అయిన ఇవాన్ చెన్, సంతకం చేయడానికి నిరాకరించాడు. ఈ ఒప్పందానికి తాము కట్టుబడి ఉంటామనీ, ఈ ఒప్పందం కింద చైనాకు ఎటువంటి హక్కులూ ఉండవనీ బ్రిటిషు, టిబెటన్ ప్రతినిధులు ఒక ద్వైపాక్షిక ప్రకటనను ఒప్పందానికి జతచేసారు.
మక్ మహోన్ చేసిన పనిని 1907 ఆంగ్లో-రష్యన్ ఒప్పందానికి విరుద్ధంగా ఉందంటూ బ్రిటిషు ప్రభుత్వం తిరస్కరించింది. 1921 లో ఆంగ్లో-రష్యన్ ఒప్పందం ముగిసిపోయింది. బ్రిటిష్ వారు 1937 లో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లపై మెక్మహన్ లైన్ను ఉపయోగించడం ప్రారంభించారు. సిమ్లా ఒప్పందాన్ని 1938 లో అధికారికంగా ప్రచురించారు.
సర్ ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ నేతృత్వంలోని బ్రిటిష్ దళాలు 1904 లో టిబెట్లోకి ప్రవేశించి టిబెటన్లతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. 1906 లో, టిబెట్పై జరిగిన ఆంగ్ల-చైనా సదస్సులో టిబెట్పై ఆధిపత్యాన్ని (సుజరెయిన్టీ) అంగీకరించాలని బ్రిటిషు ప్రభుత్వం చైనాను కోరింది. కాని సార్వభౌమాధికారం (సావరీన్టీ) కావాల్సిందేనని నొక్కిచెప్పిన చైనా రాయబారి బ్రిటిషు ప్రతిపాదనను తిరస్కరించాడు. 1907 లో, బ్రిటన్ రష్యాలు టిబెట్ పై చైనా "సుజరైన్టీ" ని అంగీకరించాయి.
చైనాలో క్వింగ్ రాజవంశ పతనం తరువాత, లాసాలోని టిబెట్ ప్రభుత్వం చైనా దళాలను బహిష్కరించి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది (1913), అయితే, దీనిని కొత్తగా స్థాపించబడిన రిపబ్లిక్ ఆఫ్ చైనా అంగీకరించలేదు.
1913 లో, టిబెట్ స్థితి గురించి చర్చించడానికి బ్రిటిషు వారు సిమ్లాలోని వైస్రాయి లాడ్జిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బ్రిటన్ ప్రతినిధులు, కొత్తగా ఏర్పడిన రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రతినిధులు, లాసాలోని టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులూ పాల్గొన్నారు. బ్రిటిషువారి తరపున వచ్చిన స్వతంత్రాధికార ప్రతినిధి సర్ హెన్రీ మక్ మహోన్, టిబెట్ ప్రాంతాలను "ఇన్నర్ టిబెట్", "ఔటర్ టిబెట్" గా విభజించి, విభిన్న విధానాలను వర్తింపజేసే ప్రణాళికను ప్రవేశపెట్టాడు. కింగ్హాయి, గాన్సు, సిచువాన్, యునాన్ ప్రావిన్సులలో టిబెటన్ల నివాస ప్రాంతాలన్నీ కలిసి "ఇన్నర్ టిబెట్" చైనా ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. "ఔటర్ టిబెట్", ఆధునిక " టిబెట్ అటానమస్ రీజియన్ " లాగా దాదాపుగా అదే ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. ఈ ఒప్పందంలో చేర్చిన మ్యాప్లో టిబెట్కు, బ్రిటిష్ ఇండియాకూ మధ్య గీసిన సరిహద్దునే తరువాత మక్ మహోన్ లైన్ అని పిలుస్తున్నారు.
చైనా ప్రతినిధి లేనప్పుడు బ్రిటన్, టిబెట్ ప్రతినిధులు మధ్య సిమ్లాలో చర్చలు జరిపి టిబెటన్ భారత సరిహద్దుపై ఒక నిర్ణయానికి వచ్చారు. సిమ్లా సమావేశంలో భారత టిబెట్ సరిహద్దు మ్యాపును ప్రతిపాదిత ఒప్పందానికి అనుబంధంగా చేర్చారు.
ఒప్పందానికి అనుబంధంగా ఉన్న షెడ్యూల్లో మరిన్ని గమనికలు ఉన్నాయి. వాటిలో కొన్ని: "టిబెట్ చైనా భూభాగంలో భాగం" అని అర్థం చేసుకోవాలి. టిబెటన్లు దలైలామాను ఎన్నుకున్న తరువాత, చైనా ప్రభుత్వానికి తెలియజేయాలి. అపుడు లాసాలోని చైనా కమిషనరు, చైనా ప్రభుత్వం ప్రదానం చేసే "బిరుదులను పతకాలనూ" అందజేస్తారు. "ఔటర్ టిబెట్" లోని అధికారులను టిబెట్ ప్రభుత్వమే నియమించుకుంటుంది. చైనా పార్లమెంటులో గానీ, ఏదేనీ అసెంబ్లీలో గానీ "ఔటర్ టిబెట్" కు ప్రాతినిధ్యం ఉండదు.
చైనా-టిబెట్ సరిహద్దుపై చైనా, టిబెట్లు అంగీకారానికి రాలేకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. చైనా స్వతంత్రాధికార ప్రతినిధి, ఇవాన్ చెన్, తన ప్రభుత్వం దీన్ని అంగీకరించాలనే షరతుపై ఒప్పందంపై సంతకం చేసాడు. ఆ ఒప్పందాన్ని తిరస్కరించాలని చైనా ప్రభుత్వం అతన్ని ఆదేశించింది. 1914 జూలై 3 న, బ్రిటిషు, టిబెట్ స్వతంత్రాధికార ప్రతినిధులు చైనా సంతకం లేకుండానే ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండాలనీ, ఒప్పందంపై సంతకం చేసేవరకు చైనాకు ఎటువంటి హక్కులూ ఉండవనీ వారిద్దరూ అదనంగా ఒక ద్వైపాక్షిక ప్రకటనపై సంతకం చేశారు. అదే సమయంలో బ్రిటిషు వారు, లోచెన్ షాత్రా లు 1908 నాటి స్థానంలో కొత్త వాణిజ్య నిబంధనలపై కూడా సంతకం చేశారు.
1907 నాటి ఆంగ్లో-రష్యన్ ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నందున సిమ్లా ఒప్పందాన్ని బ్రిటిషు భారత ప్రభుత్వం మొదట తిరస్కరించింది. అధికారిక ఒప్పంద రికార్డు, సియు అట్చిసన్ రాసిన ఎ కలెక్షన్ ఆఫ్ ట్రీటీస్ లో ప్రచురించారు. సిమ్లాలో శిరోధార్యమైన ఒప్పందమేదీ కుదుర్చుకోలేదనే గమనికతో దీన్ని ప్రచురించారు. ఒప్పందంలో పేర్కొన్న షరతు (చైనాతో ఒప్పందం) నెరవేరనందున, టిబెటన్ ప్రభుత్వం మక్ మహోన్ లైన్ను ఆమోదించలేదు.
ఆంగ్లో-రష్యన్ ఒప్పందాన్ని 1921 లో రష్యా, బ్రిటన్లు సంయుక్తంగా త్యజించాయి. కాని 1935 వరకు మక్ మహోన్ లైన్ సంగతిని మర్చిపోయారు. 1937 లో సర్వే ఆఫ్ ఇండియా మక్ మహోన్ లైన్ను అధికారిక సరిహద్దుగా చూపించే మ్యాప్ను ప్రచురించింది. 1938 లో, బ్రిటిష్ వారు సిమ్లా ఒప్పందాన్ని అట్చిసన్ ఒప్పందాలలో ప్రచురించారు. ఇంతకుముందు ప్రచురించబడిన ఒక వాల్యూమ్ గ్రంథాలయాల నుండి తీసేసి దాని స్థానంలో సిమ్లా ఒప్పందాన్ని కూడా చేర్చిన సంచికను పెట్టారు. టిబెట్, బ్రిటన్లు మాత్రమే - చైనా కాదు - ఈ ఒప్పందాన్ని శిరోధార్యంగా అంగీకరించాయనే ఒక ఎడిటర్ నోట్తో దీన్ని ప్రచురించారు. ఈ కొత్త సంచికలో ప్రచురణ తేదీని తప్పుగా, 1929 అని వేసారు.
1938 ఏప్రిల్లో, కెప్టెన్ జి.ఎస్. లైట్ఫుట్ నేతృత్వం లోని బ్రిటిషు సైనిక దళం తవాంగ్ చేరుకుని, ఈ జిల్లా భారత భూభాగం లోనిదని అక్కడి బౌద్ధవిహారానికి తెలియ జేసాడు. టిబెటన్ ప్రభుత్వం దీనిపై నిరసన వ్యక్తం చేసింది. లైట్ఫుట్ అక్కడినుండి వెళ్ళిపోగానే తన అధికారాన్ని పునరుద్ధరించుకుంది. 1951 వరకు ఈ జిల్లా టిబెట్ చేతిలోనే ఉంది.
సిమ్లా సదస్సుకు చైనా అంగీకారం పొందనందున టిబెటన్లు కొత్త భారత-టిబెట్ సరిహద్దును అంగీకరించలేదని బ్రిటిషు రికార్డులు చూపిస్తున్నాయి. బ్రిటీషు వారు చైనీయుల ఆమోదాన్ని పొందలేక పోయినందున, టిబెటన్లు మెక్ మహోన్ లైన్ చెల్లదని భావించారని అలస్టెయిర్ లాంబ్ పేర్కొన్నాడు.
1950 ల చివరలో, మెక్ మహాన్ రేఖ భారత చైనాల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. టిబెట్ ఎప్పుడూ స్వతంత్ర రాజ్యం కాదని, అందువల్ల అంతర్జాతీయ సరిహద్దును వివరించే ఒప్పందంపై చైనా తరపున అది సంతకం చేయజాలదని చైనా వాదించింది. భారత చైనాలు 1962 లో యుద్ధం చేసుకున్నాయి. అయినప్పటికీ యుద్ధపూర్వ స్థితి ఏమీ మారలేదు. ఆస్ట్రేలియా జర్నలిస్టు, చరిత్రకారుడు నెవిల్ మాక్స్వెల్ ఒక రహస్య భారత యుద్ధ నివేదికను బహిర్గతం చేశాడు. ఆ సమయంలో భారతదేశంలో అత్యున్నత స్థాయి నేతలను ఆ నివేదిక తీవ్రంగా విమర్శించింది. చైనా ఎదురు తిరిగితే ఎదుర్కొనే సాధన సంపత్తి లేకపోయినా, దాన్ని రెచ్చగొట్టే దోషపూరిత వ్యూహం అనుసరించడాన్ని అది తీవ్రంగా విమర్శించింది. మాక్స్వెల్ సంపాదించిన ఆ నివేదిక, న్యూ ఢిల్లీ పనుపున భారత సైనిక పరాజయంపై తయారైన హెండర్సన్ బ్రూక్స్-భగత్ నివేదిక. 1963 లో లెఫ్టినెంట్ జనరల్ హెండర్సన్ బ్రూక్స్, బ్రిగేడియర్ ప్రీమీంద్ర సింగ్ భగత్ ఈ నివేదికను తయారు చేసారు. దీనిని బహిర్గతపరచాలని అనేక విజ్ఞప్తులు వచ్చినప్పటికీ భారత ప్రభుత్వం ఈన్ని రహస్యంగానే ఉంచింది కొన్ని సంవత్సరాల తరువాత, అప్పుడు ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ అనే పేరున్న ఈ ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ గా భారత రాష్ట్ర హోదాను పొందింది.
టిబెట్ పై చైనాకు ఆధిపత్యమే తప్ప, సంపూర్ణ సార్వభౌమాధికారం ఉండరాదనే అభిప్రాయం, బ్రిటిషు ప్రభుత్వానికి 2008 వరకు అలాగే ఉండిపోయింది. ఈ అభిప్రాయం కలిగి ఉన్న ఏకైక దేశం ఇది. బ్రిటిషు విదేశాంగ కార్యదర్శి డేవిడ్ మిలిబాండ్, ఇది 20 వ శతాబ్దం ప్రారంభంలో భౌగోళిక రాజకీయాలలో ఉద్భవించిన కాలవైపరీత్యం (అనాక్రోనిజం) అని పేర్కొన్నాడు. 2008 అక్టోబరు 29 న టిబెట్పై చైనా సార్వభౌమత్వాన్ని గుర్తించి, తదనుగుణంగా తన వెబ్సైట్లో ఒక ప్రకటన విడుదల చేయడంతో బ్రిటన్ ఈ అభిప్రాయాన్ని మార్చుకున్నట్లైంది.. బ్రిటిషు విదేశాంగ కార్యాలయం వెబ్సైటులో సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించనప్పటికీ, విదేశాంగ కార్యాలయ అధికారులు "బ్రిటన్కు సంబంధించినంతవరకూ, టిబెట్ చైనాలో భాగం. ఫుల్ స్టాప్." అని అన్నారని ది ఎకనామిస్ట్ పత్రిక రాసింది.
బ్రిటిషు ప్రభుత్వం తమ కొత్త వైఖరిని తమ అభిప్రాయాన్ని నవీకరించడంగా చూస్తుంది, మరికొందరు దీనిని బ్రిటిష్ అభిప్రాయంలో వచ్చిన ఒక ప్రధానమైన మార్పుగా భావించారు. టిబెటాలజిస్ట్ రాబర్ట్ బార్నెట్, ఈ నిర్ణయం విస్తృత ప్రభావాలుంటాయని భావించాడు. ఉదాహరణకు, ఈశాన్యంలో కొంత భాగం విషయంలో భారతదేశం చేసే వాదన చాలావరకు భారత, టిబెట్ల సరిహద్దును నిర్ణయించిన 1914 సిమ్లా ఒప్పందంలో మార్పిడి చేసుకున్న గమనికల పైనే ఆధారై ఉంటుంది. బ్రిటిషు వారు వాటిని పక్కకు పెట్టేసినట్లే కనిపిస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధికి చైనా ఎక్కువ నిధులు ఇస్తున్నందున దానికి బదులుగా బ్రిటన్, తన అభిప్రాయంలో ఈ మార్పు చేసుకుందని భావించారు
(గోల్డ్స్టీన్ (1991), p. 80 భారత కార్యాలయ రికార్డులు IOR/L/PS/10/344 ను ఉటంకిస్తూ).
భారత ప్రభుత్వం 1914 ఫిబ్రవరి-మార్చి లో టిబెటన్లతో డేలిలో ద్వైపాక్షిక చర్చలను ప్రారంభించింది (సిమ్లా శీతాకాలం నుండి వెనక్కి తగ్గారు) ప్రతిపాదిత ఎలైన్మెంటుకు టిబెట్ సమ్మతిని పొందాలనే ఉద్దేశ్యంతో.
—గుప్తా, కరుణాకర్, ది మెక్మహాన్ లైన్ 1911–45: ది బ్రిటిష్ లెగసీ
This article uses material from the Wikipedia తెలుగు article 1914 సిమ్లా ఒప్పందం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.