కోటిలింగాల, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాలో, వెల్గటూర్ మండలానికి చెందిన గ్రామం.
కోటిలింగాల | |
---|---|
పవిత్ర స్థలం | |
Coordinates: 18°51′41″N 79°11′47″E / 18.861255°N 79.196488°E | |
దేశం | India |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జగిత్యాల |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | TS |
కోటిలింగాల మండల కేంద్రమైన వెల్గటూరు నుండి ఈశాన్య దిశలో నాలుగు కిలోమీటర్ల దూరంలో, గోదావరి నది, పెద్దవాగు సంగమస్థలంలో ఉంది. గ్రామానికి ఉత్తరాన పడమర నుండి తూర్పుకు ప్రవహించు గోదావరి నది ఉంది. గోదావరి దక్షిణ ఒడ్డున కోటిలింగాల దేవస్థానం (శివాలయం) ఉంది. గ్రామానికి తూర్పున దక్షిణం నుండి ఈశాన్యం వైపు ప్రవహించి గోదావరి నదిలో కలుస్తున్న పెద్దవాగు ఉంది. ఈ రెండు కలిసే చోటు మునేరు అంటారు. వెనుకట ఇక్కడ మునులు స్నానం చేసేవారట. అందుకే ఆ పేరు వచ్చింది. కోటిలింగాల చారిత్రక బౌద్ధక్షేత్రము. చరిత్రకారులు ఇది శాతవాహనుల తొలి రాజధానిగా భావిస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయితే జలాయశ్రపు నీటిలో కోటిలింగాల చారిత్రక ప్రదేశము మునిగిపోతుందని భావిస్తున్నారు.
కోటిలింగాల అంటే ఇక్కడ కోటి శివలింగాలు లేవు. కోటలో లింగముండటం వల్ల కోటలింగమైంది. శాతవాహనుల కాలంలో ఇక్కడ 110 ఎకరాల విస్తీర్ణంలో దీర్ఘచతురస్రాకారంలో పెద్దకోట ఉండేది. దానికి ఎత్తైన గోడలతో పాటు నాలుగు మూలాల ఎత్తైన కోట బురుజులు ఉండేవి. వాటి ఈశాన్య మూలన ఉన్న కోట బురుజు శిథిలమై ఎత్తైన గడ్డగా మారిన తర్వాత కాలంలో ఈ గడ్డపైన గుడికట్టి, లింగాన్ని ప్రతిష్ఠించగా దానిని కోటలింగం అని, అదే కాలక్రమేణ కోటిలింగంగా రూపాంతరం చెందింది. అందులోని దేవుడు కోటేశ్వరస్వామిగా పిలవబడుతున్నాడు.
ఈ కోట గోడలు గోదావరి నది ఒడ్డు వెంబటి తూర్పు పడమరగా, పెద్దవాగు ఉత్తర దక్షిణములుగా దాదాపు 300 మీటర్ల ఆనవాళ్లను బట్టి తెలియుచున్నది. ఇక్కడ పురావస్తు శాఖ వారు రెండు సార్లు త్రవ్వకాలు జరిపారు. మొదట 1979 నుండి 1984 వరకు, రెండవసారి ఫిబ్రవరి 2009లో జరిగాయి. మొదటిసారి 1979లోత్రవ్వకాలు జరిపినపుడు ఈ ప్రాచీన నగరం బయల్పడింది.
మూడు దశాబ్దాల క్రితం చారిత్రక పట్టణంగా వెలుగులోకి వచ్చిన కోటిలింగాల శాతవాహనుల రాజధానిగా చారిత్రక పరిశోధకులు భావించారు. క్రమక్రమంగా త్రవ్వకాలలో లభించిన ఆధారాలను బట్టి ఇదే శాతవాహనుల తొలి రాజధానిగా నిర్థారించారు. కోటిలింగాలలో లభించిన శ్రీముఖుని నాణేలు వారి రాజధాని కోటలింగాల అని నిరూపించినట్లు ప్రముఖ చారిత్రక పరిశోధకుడు రాజారెడ్డి వాదించగా ఇది నిస్సందేహంగా శాతవాహనుల రాజధాని అని ఏటుకూరి బలరామయ్య అన్నాడు. పైఠాన్, ధాన్యకటకంలకు ముందు ఇదే శాతవాహనులకు రాజధానిగా పనిచేసిందని జైశెట్టి రమణయ్య, శాతవాహనుల జన్మభూమి తెలంగాణయే అనే విషయంలో సందేహానికీ తావులేకుండా పోయిందని శ్రీరామశర్మ, శాతవాహనులు తొలుత కోటిలింగాలలోనే రాజ్యమొనర్చినారని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు బి.ఎన్.శర్మ వివరించారు.
This article uses material from the Wikipedia తెలుగు article కోటిలింగాల, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.