యేదుగురి సందింటి జగన్మోహనరెడ్డి (జ.
1972 డిసెంబరు 21), (వై.యస్.జగన్మోహనరెడ్డి లేదా జగన్ గా సుపరిచితుడు) వ్యాపారవేత్త, రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. అతను భారతీయ రాజకీయ పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు. అతను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి తనయుడు. జగన్మోహనరెడ్ది తన రాజకీయ ప్రస్థానాన్ని భారత జాతీయ కాంగ్రెస్లో ప్రారంభించి, 2009 మే నెలలో తొలిసారిగా కడప లోక్సభ నియోజకవర్గం నుండి భారతదేశ లోక్ సభ సభ్యునిగా గెలుపొందాడు. తన తండ్రి 2009 లో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపట్టాడు. తరువాత భారత జాతీయ కాంగ్రెసుతో విభేదాల కారణంగా పార్టీకి రాజీనామా చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తన పార్టీ 67 స్థానాలను సాధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. తరువాత అతను రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 స్థానాలలో 151 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడు.
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి | |||
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి . | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 మే 30 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 మే 30 | |||
గవర్నరు | ఎస్. అబ్దుల్ నజీర్ | ||
---|---|---|---|
ముందు | చంద్రబాబు నాయుడు | ||
నియోజకవర్గం | పులివెందుల | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షనాయకుడు | |||
పదవీ కాలం 26 మే 2014 – 2019 మే 29 | |||
ముందు | చంద్రబాబు నాయుడు | ||
తరువాత | చంద్రబాబు నాయుడు | ||
శాసనసభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 26 మే 2014 | |||
ముందు | వై. ఎస్. విజయమ్మ | ||
నియోజకవర్గం | పులివెందుల | ||
లోక్సభ సభ్యుడు | |||
పదవీ కాలం 26 మే 2009 – 26 మే 2014 | |||
ముందు | వై.ఎస్.వివేకానందరెడ్డి | ||
తరువాత | వై.యస్.అవినాష్రెడ్డి | ||
నియోజకవర్గం | కడప లోక్సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | జమ్మలమడుగు గ్రామం, వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1972 డిసెంబరు 21||
రాజకీయ పార్టీ | YSR కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | భారతీ రెడ్డి | ||
సంతానం | ఇద్దరు కుమార్తెలు (హర్ష, వర్ష) | ||
నివాసం | విశాఖపట్నం, హైదరాబాదు, బెంగలూరు, |
జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా, జమ్మలమడుగులో వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వై.ఎస్.విజయమ్మ దంపతులకు జన్మించాడు. అతని సోదరి వై.ఎస్.షర్మిల కూడా రాజకీయ నాయకురాలు. అతను బేగంపేట లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 12వ గ్రేడు వరకు విద్యనభ్యసించాడు. టాలీవుడ్ నటుడు యార్లగడ్డ సుమంత్ కుమార్ అతనికి పాఠశాలలో ఆప్తమిత్రుడు. అతను బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ (బి.కాం) డిగ్రీని హైదరాబాదులోని కోఠీ వద్ద గల మహావిద్యాలయ డిగ్రీ అండ్ పి.జి. కళాశాల నుండి చేసాడు. అతను 1996 ఆగస్టు 28న భారతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు లండన్ లో గ్రాడ్యుయేషన్ చేసారు.
జగన్మోహనరెడ్డి మొదట సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ (SPCL)ని 2001లో దాని ఒరిజినల్ ప్రమోటర్ ఎం.బి. ఘోర్పడే నుండి ఒక పనికిరాని పవర్ ప్రాజెక్ట్ని కొనుగోలు చేసాడు. SPCL తర్వాత ఇతర కంపెనీలలో కోట్లాది రూపాయలను పెట్టుబడి పెట్టి, మరిన్ని వ్యాపారాలను పొందగలిగింది. దీనికి ఆయన సతీమణి వై.ఎస్. భారతి నేతృత్వం వహిస్తున్నది. అతను SPCLలో తన వాటాలను విక్రయించి, రాజకీయాల్లో ఎక్కువగా పాల్గొనడంతో తన క్రియాశీల ప్రత్యక్ష వ్యాపారాలకు దూరంగా ఉన్నాడు. [ఆధారం చూపాలి]
జగన్మోహనరెడ్డి తండ్రి "వై.యస్.ఆర్"గా సుపరిచితుడైన వై.ఎస్.రాజశేఖరరెడ్ది 2004 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహనరెడ్డి కడప జిల్లాలోని 2004 ఎన్నికల సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 2009 లో కడప లోక్ సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. 2009 సెప్టెంబరులో తన తండ్రి మరణించిన తరువాత, అతను తన తండ్రి వదిలిపెట్టిన రాజకీయ వారసత్వాన్ని చేపట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. మెజారిటీ శాసనసభ్యులు ఆయనను ముఖ్యమంత్రిగా నియమించాలని మొగ్గు చూపారు. అయితే ఈ ఎంపికను పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఆమోదించలేదు.
తన తండ్రి మరణించిన ఆరు నెలల తర్వాత, అతను ముందుగా వాగ్దానం చేసినట్లుగా, తన తండ్రి మరణ వార్త విని ఆత్మహత్య చేసుకున్న లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాలను కలుసుకోవడానికి వెళ్లి ఓదార్పు యాత్ర ( సంతాప యాత్ర) ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం తన ఓదార్పు యాత్రను విరమించుకోవాలని ఆదేశించింది. ఆ ఉత్తర్వును ధిక్కరించిన అతను హైకమాండ్ తో విభేదించాడు. ఇది తన వ్యక్తిగత విషయమని పేర్కొంటూ ఆయన యాత్రను కొనసాగించాడు.
తాను తలపెట్టిన ఓదార్పుయాత్రకు అనుమతి ఇవ్వని కారణంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో విభాదాల కారణంగా 2010 నవంబరు 29న కడప లోక్ సభ నియోజకవర్గం నుండి లోక్ సభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసాడు. ఆయన తల్లి విజయమ్మ కూడా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేసి పార్టీకి కూడా రాజీనామా చేసింది. 45 రోజుల్లోపు కొత్త పార్టీని ప్రారంభిస్తానని 2010 డిసెంబరు 7 న పులివెందుల నుంచి అతను ప్రకటించాడు. 2011,మార్చి 11న అతను తూర్పు గోదావరి జిల్లా లోని జగ్గంపేటలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ) ని స్థాపించాడు. ఆ తర్వాత అతని పార్టీ కడప జిల్లాలో ఉప ఎన్నికలకు వెళ్లి దాదాపు అన్ని స్థానాలను భారీ మెజారిటీతో గెలుచుకుంది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికను ఎదుర్కొని 5,45,043 ఓట్ల ఆధిక్యతతో రెడ్డి గెలుపొందాడు. ఆయన తల్లి కూడా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో అతని చిన్నాన్న వై.యస్. వివేకానంద రెడ్డి పై 85,193 ఓట్ల తేడాతో గెలుపొందింది. అతని తల్లి వై.యస్.విజయమ్మ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరించింది.
2012 మే 27, అక్రమాస్తుల ఆరోపణలపై జగన్మోహనరెడ్దిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేసింది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తండ్రి కార్యాలయాన్ని ఉపయోగించుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సిబిఐ రెడ్డికి సమన్లు జారీ చేసింది. మైనింగ్ లీజులు, ప్రాజెక్టుల కేటాయింపుల రూపంలో తమకు అనుమతులు లభించాయన్న ఆరోపణలపై రెడ్డి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన 58 కంపెనీలకు సీబీఐ, ఈడీ సమన్లు కూడా పంపాయి. విచారణ కొనసాగుతుండగా అతని జ్యుడీషియల్ కస్టడీని పదే పదే పొడిగించారు. భారత సుప్రీంకోర్టు 2012 జూలై 4, 2012 2012 ఆగస్టు 9 నవంబరు 7, 2013 మే 9, 2013 మే13 న అతని బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది.
జగన్మోహనరెడ్ది విచారణ వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెడ్డి కుటుంబం ఆరోపిస్తోంది. జైలులో ఉండగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించాలన్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించాడు. 125 గంటల నిరవధిక నిరాహార దీక్ష తర్వాత, అతని చక్కెర స్థాయిలు, రక్తపోటు తగ్గాయి. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ అతని తల్లి విజయమ్మ కూడా నిరాహారదీక్ష చేసింది. అతను జైలు నుండి విడుదలైన తర్వాత 72 గంటల బంద్ నిరసనకు పిలుపునిచ్చాడు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి, ఆయన తల్లి ఇద్దరూ తమ శాసనసభలకు రాజీనామా చేశారు.
16 నెలల పాటు జగన్ చంచల్ గూడ జైలులో ఉన్నాడు. 2013 సెప్టెంబరు 23 న నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
2014లో, ఎన్నికల ప్రీ పోల్స్ సర్వేలలో విశ్లేషకులు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి అనుకూలంగా ఉందని విశ్లేషించారు. కానీ 2014 సార్వత్రిక ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ చేతిలో అతిస్వల్ప ఓట్ల శాతంతో పరాజయం పొంది ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. అతని పార్టీ రాష్ట్ర అసెంబ్లీలోని 175 సీట్లలో 45% ఓట్లతో 67 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం 47%కి చేరుకోగా, 2% గ్యాప్ వైఎస్సార్సీపీ ఓటమికి దారితీసింది.
అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అతను తన 3,000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రజా సంకల్ప యాత్ర అనే పేరుతో ప్రారంభించాడు. దీనిని 2017 నవంబరు 6న కడప జిల్లాలోని ఇడుపులపాయలో ప్రారంభించాడు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 430 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 125 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 2019 జనవరి 9 న ముగిసిన పాదయాత్రకు "రావాలి జగన్, కావాలి జగన్" అనే నినాదాన్ని రూపొందించారు.
రాష్ట్ర విభజనకు సంబంధించిన విభజన హామీలను నెరవేర్చకపోవడం, ప్రత్యేకహోదాను ఇవ్వకపోవడం వంటి విషయాలలో తీవ్రంగా విభేదించి, 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడి, ప్రజలలో ప్రత్యేకహోదాపై అవగాహన కల్పించాడు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారి బాధలను అతి దగ్గరగా తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఇడుపులపాయలో 2017 నవంబరు 16 న ప్రారంభించి 2019 జనవరి 19న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగించాడు. 14 నెలల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు దగ్గర అయ్యాడు.
2018 అక్టోబరు 25న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోని వీఐపీ లాంజ్లో హైదరాబాద్కు విమానం ఎక్కుతున్నప్పుడు అతనిపై కోడి కత్తితో దాడి చేశారు. ఆయన భుజానికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.
ప్రత్యేకహోదా సాధించాలనే తపనతో, ప్రత్యేకహోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 18వ తారీఖున పార్లమెంటులో తన ఎంపీలతో ఎన్డీయే ప్రభుత్వంపై మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడమే కాకుండా, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడంతో తన ఎంపీల చేత ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేయించి వారిచేత ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నిరాహార దీక్షను చేపట్టించి ప్రజల మనోగతం ప్రపంచానికి తెలిసేలా చేశాడు. తాను చేసే ప్రత్యేకహోదా పోరాటాన్ని మెచ్చి రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు, ప్రత్యేకహోదా సాధన సమితి లాంటి అనేక ప్రజా సంఘాలు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాయి.
2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 శాసన సభ స్థానాలకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 2019 సాధారణ ఎన్నికల్లో ఆయనే ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మెజారిటీ (90000) సాధించిన శాసన సభ్యుడు. ఆ పార్టీ 25 లోక్సభ స్థానాలకు గాను 22 స్థానాలను గెలుచుకుంది.
అతను 2019 మే 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. జగనన్న అమ్మ ఒడి, నవరత్నాలు వంటి అనేక సంక్షేమ పథకాలతో అతను ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందాడు. జగనన్న అమ్మ ఒడి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తల్లులు లేదా సంరక్షకులకు, వారి పిల్లలను చదివించడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. నవరత్నాలు అనేది రైతులు, మహిళలు, వైద్యం, ఆరోగ్యం, విద్య, ప్రత్యేక హోదా వంటి తొమ్మిది సంక్షేమ పథకాల సమాహారం. మాజీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతిలో కొత్త రాజధాని ప్రణాళికలను ఆయన రద్దు చేశాడు. కర్నూలు, అమరావతి, విశాఖపట్నంలలో న్యాయ, పరిపాలన, శాసన శాఖల కోసం మూడు వేర్వేరు రాజధానులను ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనపై అమరావతి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2022 మార్చి తీర్పులో అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. "రాజధానిని మార్చడం, విభజించడం లేదా మూడు రాజధానులు చేయడం కోసం ఎటువంటి చట్టాన్ని రూపొందించే సామర్థ్యం ప్రభుత్వానికి లేదని" తీర్పునిచ్చింది.
2023 ఏప్రిల్ నాటికి, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం, అతను భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి, మొత్తం ఆస్తులు 510 కోట్లు.
2022 జూలైలో 8, 9 తేదీల్లో గుంటూరులో జరిగిన వైఎస్ఆర్సిపి ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికయ్యాడు. ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదించారు.
ప్రజలకు పాలనను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, గ్రామ సచివాలయం వ్యవస్థను ప్రారంభించాడు. ఇది అన్ని ప్రభుత్వ శాఖల సేవలు, సంక్షేమ సేవలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించడానికి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన స్థానిక ప్రభుత్వం కల్పించిన సౌకర్యం. భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సేవలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్లను నియమించింది. గ్రామాలు స్వయం సమృద్ధి, స్వయంప్రతిపత్తి గల సంస్థలుగా మారడాన్ని ప్రోత్సహించే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య భావన నుండి ఈ పథకం ప్రేరణ పొందింది కనుక ఇది గాంధీ జయంతి నాడు ప్రారంభించబడింది.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ రాష్ట్రంలో కోవిడ్-19ని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించింది. “ఏపీలో ఏ టైర్-1 నగరం లేనందున రాష్ట్ర విభజన తర్వాత మాకు తృతీయ సంరక్షణ సౌకర్యాలు లేవు. లోపం ఉన్నప్పటికీ, కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్రం సహేతుకమైన పని చేసింది, ” అని జగన్మోహనరెడ్డి నరేంద్రమోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో అన్నారు.
'గ్రామ వాలంటీరు వ్యవస్థ' అనే ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం స్వచ్ఛంద సేవకుల ద్వారా ప్రజల ఇంటి వద్దకు ప్రభుత్వ సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజల ఇంటి వద్దకే పాలనా సేవలను అందించడం దీని లక్ష్యం. 72 గంటల్లో ప్రజలకు పాలన అందించేందుకు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసారు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల మధ్య వాలంటీర్లను వారధిగా చేయడం ద్వారా ఈ గ్రామ సచివాలయాలు కూడా 2019 అక్టోబరు 2 నుండి ప్రారంభించారు. ఈ పథకంలో 1 వలంటీర్ ప్రతి గ్రామంలో 50 కుటుంబాలను సంక్షేమ పథకాలను ఇళ్ళకు చేరవేసే బాధ్యతను తీసుకుంటారు. ప్రతి వాలంటీర్కు గుర్తింపు కార్డులు ఇవ్వబడతాయి. వారికి నెలకు రూ.5000 భత్యం లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 2014 ఎన్నికల సమయంలో ప్రజలకు నవరత్నాలుగా పిలువబడే తొమ్మిది పధకాలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
మన బడి నాడు నేడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం. ఇది పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు వివిధ చర్యలను చేపట్టడం ద్వారా అన్ని పాఠశాలల్లో అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి, డ్రాపౌట్ రేటును తగ్గించడానికి ప్రవేశపెట్టబడింది.
అంతకు ముందువారు నారా చంద్రబాబునాయుడు | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2019 మే 30 నుండి | Incumbent |
This article uses material from the Wikipedia తెలుగు article వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.