దక్షిణాఫ్రికాలో బయట పడ్డ కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
వేగంగా వ్యాపిస్తున్న బి.1.1.529 వేరియంట్ కి ఒమైక్రాన్ అని పేరు పెట్టిన డబ్ల్యూహెచ్వో, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రకటించింది.
కొద్ది రోజులుగా దక్షిణాఫ్రికాలో 200 పైగా కేసులు నమోదవుతున్నాయి.నవంబర్ 25 న 2,465 కేసులు నిర్ధారణ అయ్యాయి.కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న గ్వాటెంగ్ ప్రావిన్స్ పరిధిలోని రోగుల నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్షించగా కొత్త వేరియంట్ (బి.1.1.529)ను గుర్తించారు.కేసులు వేగంగా పెరగడానికి కొత్త వేరియంటే ప్రధాన కారణమని ఆరోగ్య మంత్రి జో పాహ్లా వెల్లడించారు.ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ కేసులు 100 పైగా బయటపడగా,పొరుగు దేశం బొట్స్వానాలో నలుగురికి సోకింది.దక్షిణాఫ్రికా నుంచి హాంకాంగ్కు వచ్చిన ఇద్దరు పర్యాటకుల్లోనూ గుర్తించారు.మరో ఆఫ్రికా దేశం మలావీ నుంచి వచ్చిన పౌరుడికి కొత్త వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయిందని ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత్, దక్షిణాఫ్రికా, బోట్వ్సానా, హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులకు పకడ్బందీగా స్ర్కీనింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాల్లో పాజిటివ్ నిర్ధారణ అయ్యే వారి శాంపిళ్లను జన్యుక్రమ విశ్లేషణ కోసం ఎప్పటికప్పుడు ల్యాబ్లకు పంపాలని నిర్దేశిస్తూ రాష్ట్రాలు, యూటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు.
ఒమిక్రాన్ వేరియంట్తో తొలి మరణం యూకేలో నమోదైంది. ఈ విషయం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ 12 డిసెంబర్ 2021న ధ్రువీకరించారు.
వ్యాప్తి వేగం ఎక్కువగా ఉండటం, స్పైక్ ప్రొటీన్లో ఎక్కువ సంఖ్యలో ఉత్పర్తివర్తనాల దృష్ట్యా బి.1.1.529 వేరియంట్, డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైందనే ప్రచారం జరుగుతోంది. కొత్త వేరియంట్పై చర్చించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)సాంకేతిక సలహా బృందం అత్యవసరంగా సమావేశమై బి.1.1.529 వేరియంట్కు ‘ఒమైక్రాన్’ అని పేరుపెట్టింది.దాన్ని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది.
బి.1.1.529’ స్పైక్ ప్రొటీన్లో అత్యధికంగా 30కిపైగా ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్లు) జరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మరో 20 ఉత్పరివర్తనాలు కూడా 'బి.1.1.529’లో జరిగాయని వెల్లడైంది.ప్రస్తుత వ్యాక్సిన్లన్నీ వైరస్ స్పైక్ ప్రొటీన్ను లక్ష్యంగా చేసుకొని పనిచేసేవే.ఇప్పటివరకు తాము చూసినవాటిలో ఈ వేరియంట్నే ప్రమాదకరమైనదిగా పేర్కొన్న యూకే అత్యవసర పరిశోధనలు చేస్తామని ప్రకటించింది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న హెచ్ఐవీ రోగిలో ఈ కరోనా వేరియంట్ ఉత్పరివర్తనాలకు గురై ఉండవచ్చు అని లండన్లోని యూసీఎల్ జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఫ్రాంకోయిస్ బలౌక్స్ అభిప్రాయపడ్డారు.
ఒమైక్రాన్ వేరియంట్ అత్యంత ఆందోళనకరమైనదని డబ్ల్యూహెచ్వో ప్రకటించిన నేపథ్యంలో 18 దేశాలు దక్షిణాఫ్రికాతో సహా, ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి.ఇజ్రాయెల్ ఓ అడుగు ముందుకేసి విదేశీయులు ఇజ్రాయెల్లోకి ప్రవేశించడంపై నిషేధం విధించింది.50 ఆఫ్రికన్ దేశాలను రెడ్ లిస్టులో పెట్టింది.కొత్త వేరియంట్ సోకిన వారి కాంటాక్టులను గుర్తించేందుకు “షిన్ బెట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీ”కీ చెందిన వివాదాస్పద ఫోన్ మానిటరింగ్ టెక్నాలజీని వినియోగించేందుకూ అనుమతి ఇచ్చింది.ఇజ్రాయెల్కు చెందిన హక్కుల సంస్థలు ఈ చర్యను వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇది తాత్కాలిక అవసరమని ఇజ్రాయెల్ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్ చెప్పారు.
ఒమిక్రాన్ వేరియంట్ గురించి ఎన్నో విషయాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటి పట్ల ఒక నిర్ధిష్ట నిర్ధారణకు రావాలంటే వాటిని శాస్త్రీయ ప్రాతిపదికన పరీక్షించాల్సిన అవసరం ఉంది'' అని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా అన్నారు.
ఒమిక్రాన్లో 30 కంటే ఎక్కువ మ్యుటేషన్లు ఉన్నాయి. వైరస్ స్పైక్ ప్రోటీన్లో ఈ మ్యుటేషన్లు ఏర్పడ్డాయి.
వైరస్ స్పైక్ ప్రోటీన్లో మ్యుటేషన్ కారణంగా ఈ వేరియంట్ రోగనిరోధక శక్తిని ఎదురించగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. టీకాల వల్ల శరీరంలో ఏర్పడిన రోగ నిరోధక శక్తి లేదా మరే ఇతర ఇమ్యూనిటీ కూడా ఈ వైరస్ను ప్రభావితం చేయలేవు.
అటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని అన్ని కోవిడ్ వ్యాక్సీన్లను సమీక్షించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా వ్యాక్సీన్లు, వైరస్ స్పైక్ ప్రోటీన్కు వ్యతిరేకంగా యాంటీబాడీలను అభివృద్ధి చేస్తాయి. దీని ఆధారంగానే వైరస్ పనిచేస్తుంది'' అని ఆయన చెప్పారు.
ఇప్పుడు ఒమిక్రాన్ ఈ స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలోనే మ్యుటేషన్ చెందుతోంది. అంటే దీనిపై వ్యాక్సీన్లు మరీ అంత సమర్థంగా పనిచేయకపోవచ్చు'' అని గులేరియా అభిప్రాయపడ్డారు.
వేరియంట్ ఎక్స్ఈ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. కరోనా బీఏ2 ఒమిక్రాన్ తో పోలిస్తే ఒమిక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్ 10 శాతం వృధ్ధిరేటు ఉందని డబ్ల్యూహెచ్ఓ ఎపిడెమియోలాజికల్ నివేదిక పేర్కొంది. ఎక్స్ఈ కరోనా వేరియంట్ మొదటిసారి బ్రిటన్ లో 2022 జనవరి 19న కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ఏ మాత్రం అశ్రద్ధకు తావివ్వకుండా అందరూ కొవిడ్ నియమనిబంధనలను తు.చ.తప్పకుండా పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్లో ఒమిక్రాన్ ఎక్స్ఈ కి సంబంధించిన తొలి బాధితురాలు 50 ఏళ్ల కాస్ట్యూమ్ డిజైనర్ ముంబాయి వాసి. ఆమె 2022 ఫిబ్రవరి 10న దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి వచ్చారు.
This article uses material from the Wikipedia తెలుగు article ఒమిక్రాన్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.