మోహన్దాస్ కరంచంద్ గాంధీ, (మహాత్మా గాంధీగా సుప్రసిద్ధులు) జనవరి 30 1948 సాయంత్రం 5.17 నిమిషాలకు బిర్లా నివాసంలోని ప్రార్థనా సమావేశ మందిరానికి వెళుతుండగా హత్యకు గురయ్యారు.
ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా ఆయనకు నాథూరాం గాడ్సే ఎదురుపడ్డాడు. గాంధీకి నమస్కరించాడు. ఇప్పటికే ఆలస్యమైందంటూ గాడ్సేను పక్కకు నెట్టేసే ప్రయత్నం చేయబోయింది గాంధీ అనుచరురాలు అభా ఛటోపాధ్యాయ. కానీ ఆమెను పక్కకు నెట్టిన గాడ్సే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో మూడుసార్లు పాయింట్బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపాడు. దేశ స్వాతంత్య్రోద్యమానికి నేతృత్వం వహించిన మహానుభావుడు అక్కడికక్కడే కుప్పకూలాడు.
మహాత్మాగాంధీ హత్య | |
---|---|
ప్రదేశం | న్యూఢిల్లీ |
తేదీ | 30 జనవరి 1948 17:17 (భారత ప్రామాణిక సమయం) |
లక్ష్యం | మోహన్దాస్ కరం చంద్ గాంధీ |
ఆయుధాలు | బెరెట్టా ఎం 1934 సెమి-ఆటోమేటిక్ పిస్టల్ |
మరణాలు | 1 (గాంధీజీ) |
నేరస్తుడు | నాథూరాం గాడ్సే |
ఆయన మరణానికి ముందు గాంధీజీని హత్యచేయుటకు ఐదుసార్లు ప్రయత్నాలు జరిగినవి. మొదటిసారి 1934లో హత్యాప్రయత్నం జరిగింది.
బిర్లా భవనం వద్ద పూర్వపు హత్యా ప్రయత్నం విఫలం అయిన తరువాత నాథూరామ్ గాడ్సే, నారాయణ్ ఆప్తేలు ముంబయి గుండా పూణే తిరిగివచ్చారు. అచట గంగాధర్ దండవేట్ సహకారంతో నాథూరాం వినాయక్ గాడ్సె, నారాయణ ఆప్టే బెరెట్టా అనే పిస్టల్ ను కొనుగోలుచేసి జనవరి 29 1948 న తిరిగి ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ రైల్వే స్టేషనులో 6వ నంబరు గదిలో గాంధీ హత్య కోసం పథకం రచించారు.
భారత దేశ విముక్తి సంబరం ఇంకా మొదలవనే లేదు ఒక ముసలం పుట్టింది. దాని పేరే మత ప్రాతిపదికన జరిగే విభజన. అఖండ భారతావని రెండుగా చీలాల్సిందేననీ, విభజన జరగకపోతే దేశంలో అంతర్యుద్ధం తప్పదని ముస్లింలీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా హెచ్చరించాడు. దీంతో ఇష్టం లేకున్నా గాంధీ విభజనకు అంగీకరించారు. ఆ సమయంలో వేరుపడిన పాకిస్తాన్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.75 కోట్లు ఇవ్వాలి. విభజన సమయంలో రూ.20 కోట్లు ఇచ్చిన భారతదేశం మిగిలిన డబ్బును ఇవ్వడానికి అంగీకరించలేదు. ఇస్తే, ఆ డబ్బుతో తిరిగి భారత్పైనే యుద్ధానికి దిగుతుందన్న భయమే కారణం. అయితే, ఈ డబ్బు ఇవ్వకపోతే అంతకుమించిన నష్టం జరుగుతుందని గాంధీ ఆందోళన చెందారు. అందుకే బాకీ డబ్బులు చెల్లించాలంటూ 1948, జవనరి 13న దీక్షకు దిగారు. దీంతో డబ్బు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. పాకిస్తాన్ కోసం గాంధీ దీక్షకు దిగడం దేశంలో చాలామందికి రుచించలేదు. భారత్లో విలీనమైన కశ్మీర్ను సగం ఆక్రమించుకుని, పాకిస్తాన్లో హిందువులు, సిక్కుల ఊచకోతకు పాల్పడుతున్న శత్రుదేశానికి ఆర్థిక సాయం కోసం దీక్షకు దిగడాన్ని కొందరు అతివాదులు ఖండించారు. ఈలోగా నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే నేతృత్వంలో గాంధీ హత్యకు కుట్ర సిద్ధమైంది.
గాంధీ హత్యలో నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టేతోపాటు మిత్రులు సావర్కర్, విష్ణు కర్కరే, శంకర్ కిష్టయ్య, గోపాల్ గాడ్సే, మదన్లాల్ బహ్వా, దిగంబర్ బడ్గే చేతులు కలిపారు. అంతా కలిసి ఎలాగైనా గాంధీని అంతమొందించాలని సిద్ధమయ్యారు. హత్య జరిగిన తరువాత పారిపోకూడదని, తమ ఉద్దేశం అందరికీ తెలియపరిచేలా లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. జనవరి 20న ఢిల్లీలోని బిర్లాహౌస్లో గాంధీని హత్య చేయాలనుకున్నారు. ముందస్తు పథకం ప్రకారం గాంధీ ప్రసంగిస్తున్న వేదిక వెనక వైపు ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ నుంచి కాల్పులు జరపాలనుకున్నాడు దిగంబర్ బడ్గే. కానీ, కుదరలేదు. అక్కడ ఉన్న కిటికీ నుంచి గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సే బాంబు విసురుదామనుకున్నాడు. అయితే అనుకోని కారణాల వల్ల ఆ కుట్ర విఫలం అవటమే కాదు కుట్రదారులు దొరికి పోయారు కూడా. అయితే అప్పటికి గాంధీ అతి మంచితనమే వారికి వరమయింది. వారిని విడిచి పెట్టవలసిందిగా కోరింది స్వయంగా మహాత్ముడే. కానీ వారు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. మరో సారి కుట్రకు తెగబడ్డారు.
జనవరి 30, 1948 సాయంత్రం 5.17 నిమిషాలకు బిర్లా నివాసంలోని ప్రార్థనా సమావేశ మందిరానికి వెళుతుండగా హత్యకు గురయ్యారు. ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా ఆయనకు నాథూరాం గాడ్సే ఎదురుపడ్డాడు. గాంధీకి నమస్కరించాడు. గాంధీ సహాయకురాలు అభా ఛటోపాధ్యాయ ఇప్పటికే ఆలస్యమైందంటూ గాడ్సేను పక్కకు నెట్టేసే ప్రయత్నం చేయబోయింది. కానీ ఆమెను పక్కకు నెట్టిన గాడ్సే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో మూడుసార్లు పాయింట్బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపాడు. గాంధీజీ అక్కడికక్కడే మరణించాడు. నాథూరామ్ గాడ్సే హత్యాస్థలం నుండి పారిపోయే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. అతన్ని నిర్భంధించి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషనుకు తీసుకొని వెళ్ళారు. అక్కడ డి. ఎస్. పి సర్దార్ జస్వంత్ సింగ్ మొదటి సమాచార నివేదిక (FIR) తయారు చేసాడు. న్యాయ స్థానాలలో తగిన విచారణ అనంతరం నాథూరామ్ గాడ్సేను అతనికి హత్యలో సహకరించిన నారాయణ ఆప్టేలను 1949 నవంబరు 15న ఉరి తీసారు.
ఢిల్లీ లోని రాజ్ ఘాట్ మహాత్మా గాంధీ దహన స్థలం. 1949 జనవరి 31 న జరిగిన అతని హత్య తరువాత నిర్మించబడింది. ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ఎలాంటిదంటే భారత దేశ సందర్శనకి వచ్చిన విదేశీ ప్రతినిధులు అందరూ రాజ్ ఘాట్ కి వచ్చి, పుష్పాంజలి ఘటించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం పరిపాటిగా మారింది. రాజ్ ఘాట్ యమునా నదీ తీరం లోని మహాత్మా గాంధీ మార్గ్ లో ఉంది. ఢిల్లీ లోని ఈ అత్యంత ప్రజాకర్షక ప్రదేశం నల్ల రాతితో నిర్మించబడిన చదరపు ఆకార వేదిక. ఒక వైపు శాశ్వత జ్వాల వెలుగుతూ ఉంటుంది. దీని చుట్టూ కాలి రాతి తోవ, పచ్చని మైదానం ఉన్నాయి. మహాత్ముని చే పలుకబడిన ఆఖరి మాటలుగా భావించబడే “ హే రాం” అనే అక్షరాలు స్మృతి లేఖనంపై రాయబడి ఉన్నాయి. ఇచ్చట ప్రతి శుక్రవారం స్మారక కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆ మహా నాయకుని జయంతి, వర్ధంతి రోజులలో ప్రార్థనా సమావేశాలు జరుగుతాయి.
This article uses material from the Wikipedia తెలుగు article మహాత్మా గాంధీ హత్య, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.