ధర్మరాజు మహాభారత ఇతిహాసంలో ఒక ప్రధాన పాత్ర.
పాండు రాజు సంతానమైన పాండవులలో పెద్దవాడు. కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు.
పాండురాజు మరణానంతరం పాండవులను భీష్ముడు, ధృతరాష్ట్రుడు తండ్రిలేని లోటు కనిపించకుండా పెంచారు. ఉత్తమ గురువులైన కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీరికి సకల విద్యలను నేర్పించారు. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్నివిధాలా అగ్రగణ్యుడై, తండ్రిని మించిన తనయుడిగా ప్రశంసలను పొందాడు. ఈ యోగ్యతను గమనించిన ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజు పదవిలో నియమించాడు.
విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ధృతరాష్ట్రుడు తన తమ్ముని భాగమైన అర్థరాజ్యాన్ని పాండవులకు పంచి ఇచ్చాడు. ఆ రాజ్యానికి మొదట ఖాండవ ప్రస్థం ముఖ్య పట్టణంగా ఉండేది. శ్రీకృష్ణుని కోరిక మేరకు ఇంద్రుడు పంపిన విశ్వకర్మ ఇంద్రప్రస్థం అనే నూతన రాజధానిని ధర్మరాజుకు నిర్మించి యిచ్చాడు.
తండ్రి పాండురాజును స్వర్గానికి పంపే ఉద్దేశంతో ధర్మరాజు రాజసూయ యాగం దిగ్విజయంగా నిర్వహించాడు. యాగ సభలో శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇఛ్ఛి పూజించాడు. ఆ సందర్భంగా తనను అవమానించిన చేది రాజైన శిశుపాలుని శిరస్సును శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో ఖండించాడు. మయసభ విశేషాలను తిలకించడానికై విడిదిచేసిన దుర్యోధనుడు అవమానానికి గురయ్యాడు.
అసూయతో దుర్యోధనుడు చేసిన దురాలోచన ఫలితంగా మాయాజూదంలో నేర్పరియైన శకుని చేతిలో ధర్మరాజు తన సర్వస్వాన్నీ, సోదరులనూ, చివరికు ద్రౌపదినీ ఒడ్డి ఓడిపోతాడు. దుశ్శాసనుడు పాంచాలిని జుట్టుపట్టి బలవంతంగా సభలోకి ఈడ్చుకొని వచ్చాడు. ద్రౌపదిని వివస్త్రను చయ్యవలసినదిగా దుర్యోధనుడు తమ్ముని అజ్ఞాపించాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయమైన వస్త్రాలను అనుగ్రహిమ్చి ఆమె మానాన్ని రక్షించాడు. ధృతరాష్ట్రుడు తన కుమారుడి తప్పును గ్రహించి, వెంటనే ద్రౌపది కోరిక మేరకు పాండవులను దాస్య విముక్తుల్ని కావించి, వాళ్ళ రాజ్యం తిరిగి ఇచ్చివేశాడు.
మరల దుర్యోధనుడు రెండవసారి జూదమాడడానికి ధర్మరాజుని హస్తినాపురికి పిలిచాడు. ఓడినవాళ్ళు నారచీరలు ధరించి పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం చెయ్యాలి అనేది పందెం. అజ్ఞాతవాస సమయంలో గనక గుర్తింపబడితే, ఆనాటి నుంచి మళ్ళీ పన్నెండేళ్ళు అరణ్యవాసం ప్రారంభించాలి. నియమానికి అంగీకరించిన ధర్మరాజు శకుని చేతిలో మళ్ళీ ఓడిపోయాడు. ధర్మరాజుకు అపకారం చేసిన కౌరవుల పాలనలో వుండడానికి ఇష్టంలేక ఎందరో పౌరులు తమ తమ కుటుంబాలతో పాండవుల వెంట అరణ్యాలకు తరలివచ్చారు. పెద్దల ఉపదేశానుసారం ధర్మరాజు సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్రను వరంగా పొందాడు. దాని ప్రభావం వల్ల అతడు వెంటవచ్చిన యావన్మందినీ పోషిస్తూ, అరణ్యంలో కూడా మహారాజులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు.
అరణ్యవాసంలో ఉండగా ఒకనాడు వేటకువెళ్ళిన భీముని కొండచిలువ చుట్టేసి భక్షించబోయింది. ధర్మరాజు తమ్ముని వెదుకుతూ అక్కడకు వెళ్ళి ఆ మహాసర్పం అడిగిన ప్రశ్నలకు ధర్మబలంతో తగిన సమాధానాలిచ్చి, తమ్మున్ని విడిపించుకొని వచ్చాడు. ఆ పాము శాపం తొలగి నహుషుడు అనే మహారాజయ్యాడు.
ధర్మరాజు మరొక వివాహం దేవిక అనే రాజకుమారి tho అయింది వారిద్దరికి పుట్టిన వాడు యుడేయుడు
This article uses material from the Wikipedia తెలుగు article ధర్మరాజు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.