శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం భాగవతం దశమ స్కంధములో చెప్పబడింది.
భాగవతం | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మధురా నగరాన్ని శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన యాదవ వంశానికి చెందిన వాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. అది విన్న వెంటనే కంసుడు కుపితుడై దేవకీ దేవి జుట్టు ముడి పట్టుకొని తన కరవాలము తీసుకొని సంహరించబోతాడు. అప్పుడు వసుదేవుడు అడ్డు పడి, "కంసా! నీకు అత్యంత ప్రియమైన సోదరిని చంపుతావా? ఆమె కాదు కదా నిన్ను సంహరించేది. ఆమె గర్భం నుండి జన్మించిన కుమారుడు కదా నిన్ను సంహరించేది. దేవకి గర్భం లో ఉన్న ప్రతి సంతానాన్ని తీసుకొని నీకు సమర్పిస్తాను" అని చెబుతాడు. దానికి కంసుడు అంగీకరించి ఆమెను వసుదేవుని ఇంటికి పంపుతాడు. దేవకి గర్భం దాలుస్తుంది; సంతానాన్ని పొందుతుంది. దేవకి పొందిన సంతానాన్ని వెంటనే వసుదేవుడు కంసునికి సమర్పిస్తాడు. వసుదేవుని సత్య నిష్ఠకు మెచ్చి, "వసుదేవా! నీ ఎనిమిదో సంతానం కదా నన్ను సంహరించేది. ఇప్పటి ఈ సంతాన్ని తీసుకొని ఆనందించు. ఎనిమిదో సంతానాన్ని తీసుకొని నాకు సమర్పించు" అని కంసుడు చెబుతాడు. వసుదేవుడు ఆనందంతో తన సంతానాన్ని తీసుకొని మధురానగరం వెడతాడు.
ఇది ఇలా ఉండగా ఒకరోజు నారదుడు ఆ మార్గం గుండా వెతూ, కంసుని వద్దకు వెళ్ళి కంసుడి జన్మ రహస్యం చెబుతాడు. "కంసా! నువ్వు క్రితం జన్మలో కాలనేమి అనే రాక్షసుడవు. ఈ యాదవులందరు దేవతలు. దేవకి గర్భంలో పుట్టే సంతానం వల్ల మరణిస్తావు" అని చెబుతాడు. కంసుడు వెంటనే ఆగ్రహం చెంది, మధురా నగరం వెళ్ళి దేవకీ దేవి సంతానాన్ని అంతనూ సంహరిస్తాడు. ఆ తరువాత దేవకిని వసుదేవుడిని, ఆడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు.
దేవకీ దేవి ఏడవ మారు గర్భం ధరించి నప్పుడు, విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశ పెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భ స్రావం అయిందని అనుకొంటారు. కొన్ని రోజులకు దేవకీ దేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది. దేవకీదేవి ఎనిమిదో మారు గర్భం ధరించి నప్పుడు కంసుడికి చెడు శకునాలు, మృత్యు భీతి కలుగుతుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భములో ఉండడం చూసి దేవతలు, యక్ష, కిన్నర, కింపురుషులు దేవకీ దేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తుతిస్తారు.
దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణీ నక్షత్ర యుక్తమైనప్పుడు జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు ఏదో దైవంతో ప్రేరేరింపబడినట్లు, కృష్ణుడిని పొత్తిళ్ళలో పెట్టుకొని, చెరసాల బయట నిద్ర పోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకొని, యమునా నది వైపు బయలు దేరుతాడు. యమునానది వసుదేవుడు రావడం చూసి రెండుగా చీలి పోతుంది. యమునా నది నుండి బయలు దేరి నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువును తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. ఆఏడుపు విన్న కావలి వారు నిద్ర లేచి దేవకీ దేవి ఎనిమిదోమారు ప్రసవించింది అని కంసుడుకి చెబుతారు. ఆ మాట విన్న కంసుడు చెరసాలకు వస్తాడు. ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరబోతుంటే దేవకీ దేవి "నీకు పుట్టింది మేనకోడలు,చంపొద్దు" అని వేడుకొంటుంది. కంసుడు ఆమాట వినక, శిశువును సంహరించడానికి పైకి విసురుతాడు. అలా పైకి విసరబడిన శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదా శారంగాలతో ఆకాశం లోకి లేచి పోయి తాను యోగ మాయ నని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయం అవుతుంది.
దేవకీవసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లె లోని యశోదాదేవి ఒడిని చేరి, అక్కడే పెరిగాడు.
This article uses material from the Wikipedia తెలుగు article కృష్ణ జననం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.