భారతదేశంలో ఇస్లాం : భారతదేశంలో హిందూమతం తరువాత రెండవ స్థానంలో గలదు.
2007 గణాంకాల ప్రకారం, 13.4% ముస్లింలు గలరు. ప్రస్తుతం భారత్ లో ముస్లింలు ఇండోనేషియా, పాకిస్తాన్ ల తరువాత మూడవ స్థానంలో ఉన్నారు.
నిర్మాణాలు |
ప్రఖ్యాత వ్యక్తులు |
ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్ |
కమ్యూనిటీలు |
ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు |
న్యాయ పాఠశాలలు |
హనఫీ · షాఫయీ · మాలికి · హంబలి |
విశ్వాస పాఠశాలలు |
బరేల్వీ · దేవ్బందీ · షియా · అహ్లె హదీస్ |
భారత్లో మస్జిద్లు |
సంస్కృతి |
ఇతర విషయాలు |
దక్షిణాసియాలో అహ్లె సున్నత్ ఉద్యమం |
ఇస్లాం తొలుత అరబ్బు వర్తకుల ద్వారా శాంతియుతముగా భారతదేశంలో ప్రవేశించింది. పిదప ఎనిమదవ శతాబ్దపు తొలి పాదము నుండి భారతదేశముపై జరిగిన దండయాత్రల వల్ల (అరబ్బులు, తుర్కులు, పర్షియన్లు, అఫ్ఘాన్లు, మంగోలులు వగైరా) రుధిర ధారాయుతంగా కోటానుకోట్ల ప్రజలు మతాంతరీకరణ చేయబడ్డారు హిందువులపై అకృత్యాలు. చరిత్ర పరిశీలించినచో చూస్తే క్రింది విషయాలు కూడా వెల్లడౌతాయి.
మాలిక్ బిన్ దీనార్, 20 మంది ముహమ్మద్ ప్రవక్త అనుయాయులు, మొదట కేరళలోని, కొడుంగళూర్ వచ్చారు. వీరు భారతదేశంలో ప్రవేశించినపుడు, ఈ రాష్ట్రాలలో ఇస్లాం మతానికి మంచి స్పందన లభించింది. తదనంతరం, ఇతర రాష్ట్రాలలో కూడా మంచి స్పందన లభించింది. ఇస్లామీయ తత్వం, ఏకేశ్వరోపాసక నియమం, సర్వమానవ సోదరభావన, సమానత్వాల ప్రవచనాలు, శాస్త్రాలతో కూడిన ఖురాన్, సాదా సీదా జీవన సరళి, మున్నగు విషయాలు ప్రజలపై ప్రభావం చూపాయి. మాలిక్ బిన్ దీనార్ మొదటి మస్జిద్ ను నిర్మించాడు, ఈ మస్జిద్, హిందూ దేవాలయ శైలి (కేరళ శైలి) లో నిర్మింపబడింది. భారతదేశంలోనే కాక భారత ద్వీపకల్పంలోనే ఇది ప్రథమ మస్జిద్ కూడానూ. ఇది సా.శ. 629 లో నిర్మింపబడినదని (వివాదాస్పదం) భావిస్తున్నారు. మరి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యతను ఈ మస్జిద్ సంతరించుకొంది. అది యేమనగా, సౌదీ అరేబియా లోని మదీనా తరువాత ఈ మస్జిద్ 'శుక్రవారపు ప్రార్థనలు' జరుపుకున్న ప్రపంచంలోనే రెండవ మస్జిద్.
చోళ సామ్రాజ్య పతనం తరువాత, క్రొత్తగా యేర్పడిన విజయనగర సామ్రాజ్యానికి చెందిన వర్తకులు, ఉస్మానియా సామ్రాజ్యానికి చెందిన సెల్జుక్ తురుష్కులను, 1279లో వ్యాపార వ్యవహార నిమిత్తం ఆహ్వానించారు. తరువాత తురుష్క వర్తకులు, పెద్ద యెత్తున, తరంగంబాడి (నాగపట్టణం), కరైకల్, ముత్తుపేట్, కూతనల్లూర్, పొడక్కుడిలో వాణిజ్యకేంద్రాలు ధార్మిక కేంద్రాలూ, నెలకొల్పారు. టర్కిష్-అనటోలియా, టర్కిష్-సఫవీదుల శిలాఫలకాలు, తంజావూరు, తిరువరూర్, అనేక గ్రామాలలో కానవస్తాయి. వీటి విషయంగా, పురావస్తువిభాగము, మద్రాసు సంగ్రహాలయంలో ఇవి నేటికినీ లభ్యమవుతాయి. తదనంతరం సా.శ. 1300 లో అరబ్బులు, నాగూరు, కిలక్కరై, అడిరాంపట్టణం, కాయల్పట్నం, ఎర్వాడి, శ్రీలంక లలో షాఫయీలు, (వీరు ఈ ప్రాంతాలలో మరక్కర్ లుగా గుర్తింపు కలిగినవారు) స్థిరనివాసాలేర్పరచుకున్నారు. ఈ మరక్కర్ మిషనరీలు, ఇస్లామీయ బోధనలు వ్యాప్తిచేస్తూ, మలయా, ఇండోనేషియా ప్రాంతాలలో ఇస్లాంను వ్యాపింపజేశారు.
భారతదేశంలో ఇస్లాం వ్యాపించడానికి ముఖ్యకారకుల్లో సూఫీ తత్వజ్ఞులు విశేషమైనవారు. వీరు భారతదేశంలో ఇస్లాం వేళ్ళూనుకొనుటకు తమ పాత్రను అమోఘంగా పోషించారు, సఫలీకృతులైనారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి, నిజాముద్దీన్ ఔలియా, షాహ్ జలాల్, అమీర్ ఖుస్రో, ఖ్వాజా బందా నవాజ్, ఖాదిర్ ఔలియా మున్నగువారు ఈ కోవకు చెందినవారు. ఈ సూఫీ తత్వము, భారతదేశంలోని అన్నివర్గాలనూ ఇస్లాంలోకి ఆహ్వానించడానికి చక్కని కారకమైనది. హిందూ తత్వజ్ఞానమూ, ఇస్లాం సూఫీ తత్వమూ, బొమ్మా-బొరుసుల్లా, ఒకే నాణేనికి రెండువైపుల్లా ప్రజలకు కానవచ్చాయి. ఇస్లాంలోని ఏకేశ్వరోపాసన, సమాన సౌభ్రాతృత్వాలూ, సాదాసీదా జీవనం, ఈ సూఫీ తత్వానికి తోడై, ప్రజలు తండోపతండాలుగా ఇస్లాంలో ప్రవేశించుటకు మార్గం సుగమం చేసింది. భారతదేశంలో సూఫీలు, ఎక్కడనూ సంఘర్షణపడ్డారని, లేదా సంఘర్షణాత్మక ధోరణి అవలంబించారని, లేదా హింసామార్గాలను అవలంబించారని, చరిత్రలో కానరాదు. వీరు శాంతియుతంగా ప్రజలతో మెలగారు. భారతదేశంలోని అంటరానితనం, అస్పృశ్యత, కులవిధానాలు, వర్ణవిభేదాలు కూడా, ఇస్లాం వ్యాప్తికి పరోక్షంగా తోడ్పడ్డాయి. అహ్మద్ సర్హిందీ, నఖ్ష్బందీ సూఫీలు శాంతియుతంగా ఎందరో హిందువులను ఇస్లాంవైపు ఆకర్షితులయేటట్లు చేయగలిగారు.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత స్వతంత్ర సంగ్రామంలోని ముస్లిం ఉద్యమకారులలో ముఖ్యంగా కవులు, రచయితలు కానవస్తారు. వీరిలో ప్రముఖులు మౌలానా అబుల్ కలాం ఆజాద్, హకీం అజ్మల్ ఖాన్, రఫీ అహ్మద్ కిద్వాయి మొదలగువారు. షాజహాన్ పూర్కు చెందిన ముహమ్మద్ అష్ఫాకుల్లా ఖాన్, బ్రిటిష్ వారి ఖజానాను కొల్లగొట్టి వాటిని, స్వతంత్ర సంగ్రామంలోని ఉద్యమకారులకు పంచిపెట్టాడు. సరిహద్దు గాంధీగా ప్రసిద్ధిపొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, భారత స్వతంత్రంకోసం పోరాడి తన 95 సంవత్సరాల జీవితంలోని 45 సంవత్సరాలు జైలులో గడిపిన దేశభక్తుడు. భోపాల్కు చెందిన బర్కతుల్లా గద్దర్ పార్టీ స్థాపకుల్లో ఒకడు. సయ్యద్ రహ్మత్ షా గద్దర్ పార్టీకి చెందిన అండర్-గ్రౌండ్ ఉద్యమకారుడు, ఫ్రాన్స్లో తనకార్యకలాపాలు కొనసాగించాడు. ఫైజాబాదుకు చెందిన అలీ అహ్మద్ సిద్దీఖీ, మలయా, బర్మా లలో ఉంటూ సిపాయిల తిరుగుబాటు కొరకు సయ్యద్ ముజ్తబా హుసేన్తో పథకం వేసి పట్టుబడి 1917 లో ఉరి తీయబడ్డాడు. కేరళకు చెందిన వక్కోమ్ అబ్దుల్ ఖాదర్ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారిచే ఉరితీయబడ్డాడు. బాంబేకి చెందిన ఉమర్ సుభానీ ఒక పారిశ్రామికవేత్త, కోటీశ్వరుడు, కాంగ్రెస్ పార్టీకి కావలసిన మొత్తం డబ్బును మహాత్మా గాంధీకి సమకూర్చేవాడు, తుదకు భారతస్వాతంత్ర్యం కొరకు తన ప్రాణాలనే అర్పించాడు. ముస్లిం స్త్రీలలో హజరత్ మహల్, అస్గరీ బేగం, బీ అమ్మా మున్నగువారు బ్రిటిషువారికి వ్యతిరేకంగా స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు.
భారత్ కు అరేబియా, ఆఫ్రికా, గ్రీకు, రోమన్ ప్రాంతాలనుండి సముద్రమార్గాలు ముందునుండే ఉండేవి. కాని ఐరోపాకు చెందిన ఇతరదేశాలవారికి భారతదేశానికి సముద్రమార్గాలు తెలియవు. 1498 లో వాస్కోడిగామా భారతదేశానికి సముద్రమార్గాన వచ్చినపుడు, అదే ప్రథమ సముద్రమార్గమని ఐరోపా వాసులు సంతోషపడిపోయారు,, తమ పుస్తకాలలో ఇది వ్రాసుకున్నారు కూడా. ఐరోపావాసులు భారత ఉపఖండంతో వర్తకసంబంధాలు పెంపొందించుకొని, ప్రయాణాలు కొనసాగించారు. పారిశ్రామిక విప్లవం కారణాన, భారత్ లో తమ స్థానాన్ని పటిష్ఠం చేసుకున్నారు.
బ్రిటిషువారికి వ్యతిరేకంగా, హైదర్ అలీ కుమారుడైన టిప్పూ సుల్తాన్ తన బలాలన్నీ ఉపయోగించి నిరోధించడానికి ఉపయోగించాడు. ఐరోపాకు తెలియని యుద్ధరంగ రాకెట్లు తగ్రఖ్లు ఉపయోగించాడు. ఆఖరుకు 1799 లో టిప్పూ సుల్తాన్, శ్రీరంగపట్టణంలో ఓడిపోయాడు. బెంగాల్ నవాబు అయిన సిరాజుద్దౌలా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దురుద్దేశాలను గ్రహించి, వారి కార్యకలాపాలకు వ్యతిరేకంగా సన్నాహాలు ప్రారంభించాడు. 1757లో ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వారితో ఓడిపోయాడు. మొదటి భారత స్వతంత్ర సంగ్రామం లేదా సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగినపుడు, ముస్లింలలోని అగ్రకులాలను తమ టార్గెట్ గా బ్రిటిష్ వారు ఎంచుకున్నారు. కారణం వీరి ఆధ్వర్యంలోనే సిపాయిల తిరుగుబాటు ఊపందుకుంది. ఢిల్లీ, పరిసరప్రాంతాలలో వీరే, బ్రిటిషువారికి కొరకరాని కొయ్యలయ్యారు. ఢిల్లీ లోని ఎర్రకోట గుమ్మానికి వేలాదిమంది ముస్లింలను ఉరితీసారు. అందుకే దీని ద్వారాన్ని ఖూనీ దర్వాజాగా ప్రజలు పిలుస్తారు. ప్రఖ్యాత ఉర్దూ కవి మిర్జా గాలిబ్ (1797-1869) తన లేఖారచనలైన 'గాలిబ్ లేఖలు' లో దీనిగురించి వర్ణించాడు. ఈ రచనలను రాల్ఫ్ రస్సెల్, ఖుర్షీదుల్ ఇస్లాంలు క్రోడీకరించి తర్జుమాలు చేశారు, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ దీనిని ప్రచురించింది (1994).
మొఘల్ సామ్రాజ్య పతనం తరువాత, భారతదేశంలో ముస్లింలు క్రొత్త సవాళ్ళను ఎదుర్కోవలసివచ్చింది - వాటిలో ముఖ్యమైనవి, సభ్యత, ఇష్టాయిష్టాలను కాపాడుకోవడం, కొత్తప్రభుత్వాలతోనూ, శాస్త్రవిజ్ఞానాలలో ముందంజలోఉన్న క్రొత్తముఖాల (బ్రిటిషు వారి) తో మమేకం కావడం ఇష్టంలేకపోయిననూ రాజీపడడం. ఈ కాలంలో ఫిరంగీ మహల్, మొదట్లో బారాబంకీ లోని సెహాలీలో తరువాత 1690 నుండి లక్నో కేంద్రం చేసుకుని, ఓ విద్యాకేంద్రంగా ముస్లింలకు విద్యాపరంగా సహాయపడి, మార్గదర్శకత్వం చేసింది. ఉత్తర ప్రదేశ్కు చెందిన దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ ఇస్లామీయ, ముస్లింల మనోభావాలకనుగుణంగా 'భారత స్వతంత్ర సంగ్రామం' లో ప్రభావితం కలుగజేసే పాత్రను పోషించింది.
బ్రిటిష్ కాలంలో భారత స్వాతంత్ర్యం కొరకు పోరాడిన కొందరు ప్రముఖులు :: మౌలానా అబుల్ కలాం ఆజాద్, హకీం అజ్మల్ ఖాన్, హస్రత్ మోహానీ, డా. సయ్యద్ మహమూద్, ప్రొఫెసర్ మౌల్వీ బర్కతుల్లా, డా. జాకిర్ హుసేన్, సైఫుద్దీన్ కిచ్ల్యూ, అల్లామా షిబ్లీ నౌమానీ, వక్కోం అబ్దుల్ ఖాదర్, డా. మంజూర్ అబ్దుల్ వహాబ్, బహాదుర్ షా జఫర్, హకీం నుస్రత్ హుసేన్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సమద్ అచక్జాయి, కోలోనెల్ షాహ్ నవాజ్, డా. యం.ఏ. అన్సారీ, రఫీ అహ్మద్ కిద్వాయీ, ఫకృద్దీన్ అలీ అహ్మద్, అన్సర్ హర్వానీ, తాక్ షేర్వానీ, నవాబ్ వికారుల్ ముల్క్, నవాబ్ మొహ్సినుల్ ముల్క్, ముస్తఫా హుసేన్, వీ.యం. ఉబైదుల్లా, ఎస్.ఆర్. రహీం, బద్రుద్దీన్ తయ్యబ్ జీ, మౌల్వీ అబ్దుల్ హమీద్.
1930 లలో ముహమ్మద్ అలీ జిన్నా భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నాడు. డా.సర్ ముహమ్మద్ ఇక్బాల్, ఉర్దూ కవి, తత్వవేత్త, హిందూ-ముస్లిం సఖ్యత కొరకు బలీయంగా పాటుపడినవారిలో ఒకడు.
మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్, మౌలానా షౌకత్ అలీ ఇరువురూ సోదరులు, వీరిని 'అలీ సోదరులు' అనికూడా అభివర్ణిస్తారు (ఖిలాఫత్ ఉద్యమం ఫేమ్), మహాత్మా గాంధీతో కలసి భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు.
మౌలానా అబ్దుల్ బారీ ఫిరంగీ మహల్ కు చెందినవాడు. ఇతను గాంధీతో కలసి పోరాడాడు. ముహమ్మద్ ఇక్బాల్ మరణించిన తరువాతి కాలంలో, ముహమ్మద్ అలీ జిన్నా, నవాబ్ జాదా లియాఖత్ అలీ ఖాన్, హుసేన్ షహీద్ సుహర్ వర్దీ, ఇతరులు కొందరు పాకిస్తాన్ వాదాన్ని లేపి, దేశ విభజనకు కారకులయ్యారు. భారతదేశం లోని కొన్ని శక్తులు వీరికి తోడ్పడ్డాయి, బ్రిటిషు వారు ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రోత్సహించి, పోతూ పోతూ దేశాన్ని ముక్కలు చేసి మరీ వెళ్ళారు.
"18వ శతాబ్దం నుంచి ఇస్లాంకు చెందిన పండితులు స్వాతంత్ర్యం కోసం ఉద్యమించారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు. కానీ, వారి గురించి ఇప్పటివరకూ ఏ చరిత్రలో గానీ, దేశంలోని ఏ ప్రాంతీయ భాషా పాఠ్య పుస్తకాల్లోనూ పొందుపర్చలేదు. వాస్తవ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చినట్లయితే ఇప్పుడు దేశ పరిస్థితి భిన్నంగా ఉండేది. దేశంలో ఇరుమతాల మధ్య నిర్మాణమైన రాతిగోడ కూలిపోయేది. స్వాతంత్ర్యోద్యమంలో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి, దేశాన్ని విడగొట్టాలని ఆలోచిస్తున్న తరుణంలో జమియత్ ఉలమా మాత్రం అఖండ భారత్గా ఎలా అవతరించాలి అనే దానిపై చర్చించింది.స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఉలేమాలు ఏనాడూ పదవులు, ఇతర ప్రయోజనాలు కాంక్షించలేదు.వారి త్యాగాలకు తగిన గుర్తింపు, ప్రతిఫలం రాకపోగా.. ముస్లింలు ప్రత్యేక రిజర్వేషన్లు కోరుకొనే దుస్థితి దాపురించింది. ----- కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ (ఈనాడు 6.1.2012)
భారతదేశంలో ముస్లింలు ముస్లిం పర్సనల్ లా అప్లికేషన్ ఆక్టు 1937, (షరియా చట్టాలు) ద్వారా తమ వైయుక్తిక జీవితాలు గడుపుతారు. ఈ చట్టం ముస్లింల వ్యక్తిగత విషయాలైన నికాహ్, మహర్, తలాక్ (విడాకులు), నాన్-నుఫ్ఖా (విడాకులు తరువాత జీవనభృతి), బహుమానాలు, వక్ఫ్, వీలునామా, వారసత్వాలు, అన్నీ ముస్లిం పర్సనల్ లా ప్రకారం అమలుపరచ బడుతాయి. భారతదేశంలోని న్యాయస్థానాలన్నీ ఈ షరియా నియమాలను ముస్లింలందరికీ వర్తింపజేస్తాయి. ఈ ముస్లిం పర్సనల్ లాను సమీక్షించేందుకు, పరిరక్షించేందుకు, ప్రాతినిధ్యం వహించేందుకు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్థాపించబడింది.
భారతదేశంలోని మొత్తంజనాభాలో ముస్లింలు 13.4% గలరు. ఇతర మైనారిటీలలాగా, వీరుకూడా, భారత అభ్యున్నతికి తమ శాయశక్తులా పాటుపడుతున్నారు. కాని వీరి, సరాసరి ఆదాయం, ఇతర మతస్తుల కంటే చాలా తక్కువస్థాయిలో ఉంది. దీనికి గల కారణాలు, స్త్రీలలో నిరక్ష్యరాస్యత, సాధారణ నిరక్ష్యరాస్యత, అధిక సంతానం, నిరుద్యోగం, పేదరికం, భూములు లేకపోవడం, శాస్త్ర సాంకేతిక రంగాలలో విద్య, పరిజ్ఞానాలు లేకపోవడం, విద్యా విజ్ఞానాల పట్ల నిర్లక్ష్యవైఖరులూ మొదలగునవి. సచ్చర్ కమిటీ నివేదికల ప్రకారం, 4% భారతీయ ముస్లింలు, తమ పిల్లలను మదరసా లకు పంపిస్తున్నారు, ఇచ్చట ప్రధాన మాధ్యమం ఉర్దూ. మిగతా 96% మంది తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. కోనుగోలు శక్తి భారతీయ ముస్లిం సముదాయాలలో 2005 లో $30, (లేదా జాతీయమొత్తంలో 4%). కానీ, 13.1 కోట్ల ముస్లింలు, రోజువారీ తలసరి ఖర్చు రూ. 20 ($0.50 ) కలిగి ఉన్నారు. ఈ లెక్కలు అర్జున్ సేన్ గుప్తా నివేదిక కండీషన్స్ ఆఫ్ వర్క్ అండ్ ప్రమోషన్ ఆఫ్ లైవ్లీహుడ్ ఇన్ ది అన్-ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆధారంగా ఇవ్వబడినవి.[1] ఈ వైవిధ్యాలున్ననూ, 2.5 కోట్ల బలీయమైన ముస్లిం మధ్యతరగతి, 20వ శతాబ్దంలోని ఆఖరు దశాబ్దాలలో అవతరించింది.
సచ్చర్ కమిటీ నివేదిక (ఇది ప్రభుత్వ నివేదిక)ల ప్రకారం, ముస్లింలు అనేక రంగాలలో ఉదాహరణకు ప్రభుత్వ, సామాజిక రంగాలు, తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ప్రభుత్వ రంగాలలో ముస్లింల ఉద్యోగాలు (సచ్చర్ నివేదికల ఆధారంగా)
రంగం లేదా విభాగం | ముస్లింల % |
---|---|
మొత్తం | 4.9 |
PSUs | 7.2 |
ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ | 3.2 |
రైల్వేలు | 4.5 |
న్యాయం | 7.8 |
ఆరోగ్యం | 4.4 |
రవాణా | 6.5 |
హోం affairs | 7.3 |
విద్య | 6.5 |
ముస్లింలు, వ్యవసాయ, సేవా, సహజ వనరుల అభివృద్ధి రంగాలలో రావాలి. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలోనూ రావాలి. సచ్చర్ కమిటీ నివేదికల ప్రకారం, భారతదేశంలో 13.4% వున్న ముస్లింలకు, వ్యవసాయ భూమి కేవలం 1% ఉంది. అనగా వీరు వ్యవసాయ రంగంలో లేరు, వీరు ప్రభుత్వాలనుండి భూములు పొంది వ్యవసాయ రంగంలో ముందుకు రావాలి. ముస్లింలు పట్టణ, నగర ప్రాంతాలలో ఎక్కువగా నివసిస్తున్నారు. 'స్లమ్' యేరియాలలో నివాసాలెక్కువ. పల్లెలలో నివాసాలు తక్కువ, దీనికి కారణాలు వెతకాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు 10 శాతం, ఇతర మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సు చేసింది. అలాగే అన్ని మతాల్లోని దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని, ముస్లింలు, క్రైస్తవులు, జైన్లు, పార్సీలను ఎస్సీ పరిధి నుంచి మినహాయిస్తూ 1950లో వెలువరించిన ఆదేశాలను రద్దు చేయాలని పేర్కొంది. ఎస్సీ హోదాను హిందువులకు మాత్రమే పరిమితం చేస్తూ అప్పట్లో ఆ ఉత్తర్వులిచ్చారు. అనంతరం బౌద్ధులు, సిక్కులకు కూడా అవకాశం కల్పించారు. (ఈనాడు19.12.2009)
భారతదేశంలో అనేక ముస్లిం విద్యాసంస్థలున్నాయి. ఇక్కడ జాబితా ఇవ్వబడినది :
భారతదేశంలో ఇస్లాం అతిపెద్ద మైనారిటీ మతం, ముస్లింలు 2001 జనగణనాల ప్రకారం 13.4% లేదా 13.8 కోట్లమంది జనాభా కలరు. కానీ కొందరు, ఈ సంఖ్యకన్నా ఎక్కువ ముస్లింలున్నారని తెలుపుతారు. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ మైనారిటీ కమీషన్ ఛైర్మన్, పదవీవిరమణ చెందిన హైకోర్టు న్యాయమూర్తి 'జస్టిస్ కే.ఎం. యూసుఫ్', హిందూ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో "భారతదేశంలో ముస్లింలు 20% గలరు" అన్నాడు. [2]
2001 గణాంకాల ప్రకారం, భారతదేశంలోని ముస్లిం జనాభాలోని 47% మూడురాష్ట్రాలలోనే కనిపిస్తుంది, అవి ఉత్తర ప్రదేశ్, (30.7 మిలియన్లు) (18.5%), పశ్చిమ బెంగాల్ (20.2 మిలియన్లు) (25%),, బీహార్ (13.7 మిలియన్లు) (16.5%). జమ్మూ కాశ్మీరులో 67%, లక్షద్వీపాలులో 95%, గలరు. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాంలో 31%, పశ్చిమ బెంగాల్లో 25%, కేరళలో 24.7%,, కర్నాటకలో 12.2% ముస్లింలున్నారు. భారతదేశంలో 2001 జనగణనాల ప్రకారం ముస్లింల జనాభా.
రాష్ట్రం | జనాభా | ముస్లింలు | % ముస్లింలు |
---|---|---|---|
భారత్ | 1,028,610,328 | 138,188,240 | 13.43% |
అండమాన్ నికోబార్ దీవులు | 356,152 | 29,265 | 8.22% |
ఆంధ్ర ప్రదేశ్ | 76,210,007 | 6,986,856 | 9.17% |
అరుణాచల్ ప్రదేశ్ | 1,097,968 | 20,675 | 1.88% |
అస్సాం | 26,655,528 | 8,240,611 | 30.92% |
బీహారు | 82,998,509 | 13,722,048 | 16.53% |
చండీగఢ్ | 900,635 | 35,548 | 3.95% |
ఛత్తీస్గఢ్ | 20,833,803 | 409,615 | 1.97% |
దాద్రా నాగర్ హవేలీ | 220,490 | 6,524 | 2.96% |
డామన్ డయ్యు | 158,204 | 12,281 | 7.76% |
ఢిల్లీ | 13,850,507 | 1,623,520 | 11.72% |
గోవా | 1,347,668 | 92,210 | 6.84% |
గుజరాత్ | 50,671,017 | 4,592,854 | 9.06% |
హర్యానా | 21,144,564 | 1,222,916 | 5.78% |
హిమాచల్ ప్రదేశ్ | 6,077,900 | 119,512 | 1.97% |
జమ్మూ కాశ్మీరు | 10,143,700 | 6,793,240 | 66.97% |
ఝార్ఖండ్ | 26,945,829 | 3,731,308 | 13.85% |
కర్ణాటక | 52,850,562 | 6,463,127 | 12.23% |
కేరళ | 31,841,374 | 7,863,842 | 24.70% |
లక్షద్వీపాలు | 60,650 | 57,903 | 95.47% |
మధ్యప్రదేశ్ | 60,348,023 | 3,841,449 | 6.37% |
మహారాష్ట్ర | 96,878,627 | 10,270,485 | 10.60% |
మణిపూర్ (Excl. 3 Sub-divisions) | 2,166,788 | 190,939 | 8.81% |
మేఘాలయ | 2,318,822 | 99,169 | 4.28% |
మిజోరం | 888,573 | 10,099 | 1.14% |
నాగాలాండ్ | 1,990,036 | 35,005 | 1.76% |
ఒడిషా | 36,804,660 | 761,985 | 2.07% |
పాండిచ్చేరి | 9,74,345 | 59,358 | 6.09% |
పంజాబ్ | 24,358,999 | 382,045 | 1.57% |
రాజస్థాన్ | 56,507,188 | 4,788,227 | 8.47% |
సిక్కిం | 540,851 | 7,693 | 1.42% |
తమిళనాడు | 62,405,679 | 3,470,647 | 5.56% |
త్రిపుర | 3,199,203 | 254,442 | 7.95% |
ఉత్తరాంచల్ | 166,197,921 | 30,740,158 | 18.50% |
ఉత్తరాంచల్ | 8,489,349 | 1,012,141 | 11.92% |
పశ్చిమ బెంగాల్ | 80,176,197 | 20,240,543 | 25.25% |
మతాల ఆధారంగా, జనాభా విభజనా శాతం - : 1961 నుండి 2001 గణాంకాలు (అస్సాం, జమ్మూ కాశ్మీరును తప్పించి.)
సంవత్సరం | శాతము |
1951 | 10.1% |
1971 | 10.4% |
1981 | 11.9% |
1991 | 12.0% |
2001 | 12.8% |
1961 - 2001 గణాంకాల ఆధారంగా, భారతదేశంలో మతాల ఆధారంగా సమూహాల శాతం (అస్సాం, జమ్మూ కాశ్మీరులను కలుపుకుని).
సంవత్సరం | శాతము |
1961 | 10.7% |
1971 | 11.2% |
1981 | 12.0% |
1991 | 12.8% |
2001 | 13.4% |
విషయము | హిందువులు | ముస్లింలు |
---|---|---|
2001 - మొత్తం జనాభాలో శాతము | 80.5 | 13.4 |
10-సంలలో పెరుగుదల % ('91–'01 ల ప్రకారం)[β] | 20.3 | 36.0 |
లింగ నిష్పత్తి* (సగటు. 933) | 931 | 936 |
అక్షరాస్యత రేటు (సగటు. 64.8) | 65.1 | 59.1 |
పనులలో పాల్గొనే రేటు | 40.4 | 31.3 |
గ్రామాలలో లింగ నిష్పత్తి | 944 | 953 |
పట్టణాలు నగరాలలో లింగ నిష్పత్తి | 894 | 907 |
పిల్లలలో లింగ నిష్పత్తి (0–6 సం.) | 925 | 950 |
ముస్లిం జనాభా పెరుగుదల రేటు, ప్రతి జనగణనకు
సం. | మొత్తం జనాభా | ముస్లిం జనాభా | శాతము |
---|---|---|---|
1951 | 361,088,090 | 35,856,047 | 9.93% |
1961 | 439,234,771 | 46,998,120 | 10.70% |
1971 | 548,159,652 | 61,448,696 | 11.21% |
1981* | 683,329,097 | 77,557,852 | 11.35% |
1991** | 846,427,039 | 102,586,957 | 12.12% |
2001 | 1,028,737,436 | 138,159,437 | 13.43% |
2011 | 1,210,193,422 | 172,210,523 | 14.23% |
2100? | 1,780,000,000 | 320,000,000 | 18.50% |
భారతదేశంలోని ముస్లింల సముదాయం, అధికంగా, సున్నీ బరేల్వీ సూఫీ సాంప్రదాయాలను అనుకరిస్తారు. ఈ సూఫీ తరీఖా, షరియా సూత్రాలకు కొంత విరుద్ధంగా కనిపించినా తత్వజ్ఞానం మారిఫత్, అవలంబీకరణ్ తరీఖత్, సత్యం హకీకత్ ల చుట్టూనే వుంటుంది. కానీ సూఫీలు ప్రవచించిన మార్గానికి విరుద్ధంగా సమాధుల చుట్టూ తమ ధార్మిక సమయాలను గడుపుకుంటూ, తాత్విక ఆలోచనలకు బదులుగా హంగామాలు సృష్టించుకుంటూ, ఈ హంగామాలే తమ మోక్షాలకు మార్గమని నడుచుకుంటున్న నేటి ముస్లిం సముదాయం, నిజంగా సూఫీలు ఏమి అమలు చేశారు అని ఒక్క సారి బేరీజు వేసుకొని మరీ తమ భక్తిని చాటుకునే సమయం ఆసన్నమైనది. సూఫీలు ఏకేశ్వరోపాసనేగాక, ఈశ్వరప్రేమను పొందే ప్రేమమార్గాన్నీ బోధిస్తారు. భారతదేశంలో ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి, హజరత్ నిజాముద్దీన్ ఔలియాలు ప్రముఖ ఔలియాలు. వీరు, సవ్యమైన మార్గంలో పయనించిన ఔలియాలుగా ప్రసిద్ధి. కొందరైతే, ఈ ఔలియాల మార్గాన్ని అనుసరిస్తున్నామని చెప్పి, ఆయా ఔలియాల పేరుతో ఉర్సుకార్యక్రమాలలో మునిగితేలుతున్నారు. ఈ కార్యక్రమాలలో తాత్విక ఆలోచనలు, ధార్మిక శోధనలూ, ఆధ్యాత్మిక చింతనలూ, కానరావు. ఔలియాల సమాధులపై పుష్పగుచ్చాలుంచి, ఖవ్వాలీలను రాత్రంతా వింటే, అల్లాహ్ ప్రసన్నమైపోతాడనే వింత ఆలోచనలు మాని, ఆయా ఔలియాలు బోధించిన మార్గాలు, వాటిలోని సూక్ష్మ విషయాల సంగ్రహణ ముఖ్యం. ఖవ్వాలీలలో సినిమా పాటల రాగాలు, వాటి పేరడీలు ఔలియాల శ్లాఘనాలకు జోడించి ఆలాపించుకోవడంకూడా భక్తిక్రింద భావించుకునే పామరులు, ఇన్నోసెంట్లూ గల ఈ సముదాయాలలోని ముస్లింలను చూస్తే చుక్కాని లేని నావలో ప్రయాణం సాగిస్తున్నవారిలా అనిపిస్తారు. ఐననూ, సూఫీలలో, పీర్ (గురువు), మురీద్ (శిష్యుడు) ల సాంప్రదాయం, అంచెలంచెలుగా పెరుగుతూ పోతున్నది. ప్రతిఒక్కరికీ గురువుండడం సముచితం, ఆగురువుకి ధార్మికజ్ఞానం వుండడం ఇంకనూ సముచితం. ధార్మిక జ్ఞానం గల గురువులు భారతదేశంలో లెక్కకు మించినవారున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ సూఫీ సాత్విక చింతన వర్థిల్లుతూ వుంది కూడా. ఈ కోవకు చెందిన వారు నాలుగు తరీఖాల వారు, ఆ తరీఖాలు, ఖాదరియా, చిష్తియా, నఖ్ష్బందియా, సహర్వర్ధియా. ఈ తరీఖాల పరంపరలు కొనసాగుతూ ప్రజలకు ధార్మిక బోధనలు గావిస్తూ, ఇస్లామీయ తత్వం అనే మార్గంపై నడిపిస్తూనే ఉన్నాయి.
20వ శతాబ్దంలో తబ్లీగీ జమాత్ అనే ఓ సమూహమూ బయలుదేరినది. వీరు ప్రముఖంగా తబ్లీగ్ లేదా ఇస్లాం సూక్ష్మ ధర్మాలను ప్రపంచానికి చేరవేయుట అనే కార్యక్రమంలో మునిగి ఉన్నారు. వీరి ఉద్దేశ్యమూ ఆహ్వానించదగినదే. ధార్మిక చింతలు నశిస్తున్న ఈ కాలంలో తిరిగీ ప్రజలలో ధార్మిక చింతనలు కలుగజేయడం శుభసూచకమే. ఇదో ప్రత్యేక మైన సంస్థగాదు. ఇదో పిలుపు ఇహపరలోకాలలో అల్లాహ్ ను ఏవిధంగా ప్రసన్నుడిని చేసుకోవాలనే తపన వీరిలో మెండుగా కనిపిస్తుంది. ఈ జమాత్ ను ఓ రూపం ఇచ్చిన వారిలో మౌలానా ఇలియాస్, అష్రఫ్ అలీ థానవీ, మౌలానా జకరియా మొదలగువారు. వీరి తపన, ప్రజలలో తిరిగీ స్వచ్ఛత పెంపొందించడం. అల్లాహ్ పట్ల భయభక్తులు పెంపొందించడం, తమ 'ఆమాల్' అనగా నడవడికలను శుద్ధిచేసుకొనవలెనని, వీటిద్వారా కలుగు అల్లాహ్ దయను పొందవలెనని ప్రగాఢ తాపత్రయం. ఈ తబ్లీగ్, ఇంకోవిధంగా చెప్పాలంటే, "సత్ప్రవర్తనల పునరుజ్జీవనం". భారత్ లోనే కాక, ప్రపంచంలోని ముస్లిం సమూహాలన్నీ, ఇస్లామీయ పాఠశాలల భేదాలను మరచి, ఈ 'స్వీయ ప్రచ్ఛాళనా ఉద్యమం' లో తండోపతండాలుగా ప్రవేశిస్తున్నారు. ఇస్లామీయ ధార్మిక చింతనలు గలవారికి ఈ ఉద్యమం కొంత ఊరటను కలుగజేస్తుంది.
భారతీయ నిర్మాణ శైలులు, ఇస్లామీయ శైలుల ప్రవేశంతో, ఓ కొత్తరూపాన్ని సంతరించుకున్నాయి. 12 వ శతాబ్దం నుండి ఈ ఇస్లామీయ శైలులు, భారతశైలులతో కలసి, ఇండో-ఇస్లామీయ శైలులనే కొత్త శైలితో అందరినీ అలరించాయి.
ఇస్లామీయ నిర్మాణాలలో 'ఆర్క్' ల ఉపయోగాలెక్కువ. ఇస్లాంలో జంతుజీవజాలబొమ్మలు, మానవుల బొమ్మలు, శిల్పాలు, నిషేధం. అందుకొరకే, పూల తీగలు, సన్నని పూల, తీగల, సన్నని చెట్ల రూపాలు అధికంగా కానవస్తాయి. ఇరాన్ డిజైనుల శైలి పియత్రా దురా శైలి ఎక్కువగా కనబడుతుంది. అరబ్బులు, తురుష్కులు, మస్జిద్లు, మీనార్లను ఎక్కువగా నిర్మించారు. వీరి నిర్మాణాలలో మస్జిద్లు, మీనార్లు కోటలు, నగరాలు, సమాధులు (హుమాయూన్ సమాధి, అక్బర్ సమాధి, ముంతాజ్ మహల్ సమాధి (తాజ్ మహల్), ఔరంగజేబు తన భార్య గుర్తుగా బీబీ కా మక్బరా, ఔరంగాబాదులో నిర్మించాడు.) కానవస్తాయి.
మస్జిద్లు : మస్జిద్ ల నిర్మాణాలలో, స్తంభాలతో గూడిన వరండా, ఆవరణం, మింబర్, మిహ్రాబ్, గుంబద్, మీనార్లు కానవస్తాయి. ఇవియేగాక వజూ కొరకు వజూఖానాలు, నీటికొలనులు 'హౌజ్' లూ కానవస్తాయి.
సమాధులు : ఔరంగజేబు సమాధి చాలా సీదాసాదాగా వుంటే, షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ సమాధి తాజ్ మహల్ హంగామాతో కూడి వుంటుంది. ఇలాంటి నిర్మాణాలకు ఇస్లామీయ శైలి అనే కంటే, ముస్లింల సమాధుల శైలి అంటే బాగుంటుంది, (ఇస్లాం ధర్మాను సారం సమాధులపై నిర్మాణాలు నిర్మించరాదు). హుమాయూన్ సమాధి, అక్బర్ సమాధి, జహాంగీర్ సమాధి, ఇలా చక్రవర్తులందరి సమాధులూ కానవస్తాయి. ఈ సమాధుల నిర్మాణశైలి, హుజ్రాహ్, జరీహ్, మక్బరా, ఖబ్ర్, గుంబద్, రౌజా లతో కూడివుంటుంది.
ఇస్లామీయ నిర్మాణ శైలులను మూడు వర్గాలుగా విభజించవచ్చును : 1. ఢిల్లీ శైలి (1191 నుండి 1557 వరకు); 2. రాష్ట్రాల శైలి, ఉదాహరణకు జౌన్ పూర్, దక్కన్;, 3. మొఘల్ శైలి (1526 నుండి 1707 వరకు).
.]] |
Articles
This article uses material from the Wikipedia తెలుగు article భారతదేశంలో ఇస్లాం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.