పార్వతి (ఆంగ్లం: Parvati) హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత.
త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ, మాణిక్యాంబ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి, అశోక సుందరి, జ్యోతి, మానసలు పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
వేద సాహిత్యంలో పార్వతి గురించి చెప్పలేదు. కేనోపనిషత్తు (3.12) లో ఉమ లేదా హైమవతి అనే దేవత గురించి చెప్పబడింది. ఆ దేవత ఇంద్రాదులకు బ్రహ్మముడు గురించిన జ్ఞానము తెలియజేసింది. క్రీ.పూ. 400 తరువాత వచ్చిన పురాణేతిహాస సాహిత్యంలో సతి, పార్వతి గురించిన కథలు ఉన్నాయి. పురాణాలలో దక్షుని కుమార్తె అయిన 'సతీదేవి' (దాక్షాయణి) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. తీవ్రమైన తపసు ఆచరించి (ఉమ, అపర్ణ అనే పేర్లు ఈ తపసు కారణం వలన వచ్చాయి.) శివుని వరించింది. శివుడు ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించాడు.1. హిమవంతునికి మేరువుకూఁతురైన మనోరమయందు పుట్టిన రెండవ కొమార్తె. ఈమె యొక్క అక్క గంగాదేవి. తొలిజన్మమున ఈమె దక్షుని కూఁతురు అయిన ఉమాదేవి. అపుడు తన తండ్రి అయిన దక్షప్రజాపతి చేసిన యజ్ఞమునకు తన భర్త అగు రుద్రుని పిలువక అవమానించెను అని అలిగి మహాకాళి స్వరూపమును వహించి అత్యాగ్రహమున దేహత్యాగముచేసి ఆవల పార్వతిగ పుట్టి రుద్రునికి భార్య అయ్యెను. ఈమె ఒకకాలమున రుద్రునితో కూడి ఉండఁగా దేవతలు ఆకూటమికి విఘ్నముచేసిరి. అందువలన వారికి స్వభార్యల యందు పుత్రసంతానము లేకుండునటుల ఈమె శపియించెను. మఱియు ఆకాలమునందు రుద్రునికి రేతస్సుజాఱి భూమియందు పడెను. భూమి దానిని ధరింపను ఓపక దేవతలసహాయమున అగ్నిని వాయువును వహించునట్లు చేయఁగా వారు ఆరేతస్సును హిమవత్పర్వత సమీపమున గంగయందు చేర్చిరి. అది కారణముగా గంగ గర్భము తాల్చి ఆగర్భమును భరింపలేక శరవణమునందు విడిచిపుచ్చెను. అందు కుమారస్వామి పుట్టెను. అతనికి షట్కృత్తికలు పాలిచ్చిరి కనుక కార్తికేయుఁడు అను పేరును, ఆపాలు ఆఱుముఖములతో ఒక్కతేపనె అతఁడు పానముచేసెను కనుక షణ్ముఖుఁడు అను పేరును అతనికి కలిగెను. స్ఖలితము అయిన రేతస్సువలన పుట్టినందున స్కందుఁడు అనియు అంటారు. ఇది కాక పార్వతి తన దేహమున కూడవలసిన తన భర్తయొక్క రేతస్సును భూమిధరించినందున భూమికి బహు భర్తలు కలుగునట్లు శాపము ఇచ్చెను. మఱియు గంగా నిర్గతమైన ఈసౌమ్యతేజము వలన సువర్ణము మొదలగు లోహములు కలిగినట్లును, ఆగంగానిక్షేపమువలన పొదలునట్టి సువర్ణ ప్రభల చేత తృణవృక్ష లతాగుల్మ ప్రభృతి ఉద్భిజ్జములు సువర్ణంబులు అయ్యెను అనియు పురాణములు చెప్పుచు ఉన్నాయి. వినాయకుడు, కుమారస్వామి వారి పుత్రులు.
అష్టోత్తర శతనామ స్తోత్రాలలో లలితా అష్టోత్తర శతనామ స్తోత్రం చాలా ప్రశస్తమైనటువంటిది. ఈ అష్టోత్తర శతనామ స్తోత్రం నామావళి వలె ఉంటుంది. స్తోత్రం అనేది పద్యం అయితే, నామావళి పేరు పేరునా దేవుని పిలిచినట్లు ఉంటుంది. ప్రతి నామానికి ముందు ఓమ్ అనే ప్రణవ మంత్రం, చివర నమః అనే ఆత్మ సమర్పణా చరణం ఉంటాయి. మిగిలిన దేవతల నామావళిలో ఆత్మ సమర్పణా చరణమైన నమః ఒక సారి మాత్రమే ఉంటే,లలితా అష్టోత్తరంలో నమో నమః అని రెండు పర్యాయాలు వస్తుంది.
సిన్దూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్
తారానాయక శేఖరాం స్మిత ముఖీం ఆపీన వక్షోరుహామ్
పాణిభ్యామళిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిబ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామమ్బికామ్
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చిన యమ్మ దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ, కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
పార్వతికి ఎన్నోపేర్లు ఇంకెన్నో అవతారాలూ ఉన్నాయి.వాటిలో కొన్ని -
పార్వతిని, ఆమె అనేక రూపాలను స్తుతించే పెక్కు ప్రార్థనలు, స్తోత్రాలు, గేయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ పేర్కొనబడినవి.
This article uses material from the Wikipedia తెలుగు article పార్వతి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.