గరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి (గ్రద్ద).
శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుదు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు.
కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువ లకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ కోరిక ప్రకారం వెయ్యి పొడుగాటి శరీరం కలిగిన సంతానం, వినత కోరిక ప్రకారం ఇద్దరు ప్రకాశవంతమైన సంతానాన్ని కశ్యప ప్రజాపతి కోరుకొంటాడు. కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కద్రువకు అండాలనుండి వాసుకి, ఆదిశేషుడు ఆదిగా గల వెయ్యి పాములు జన్మిస్తాయి. వినత అది చూసి తొందరపడి తన ఆండాన్ని చిదుపుతుంది. అందునుండి కాళ్లు లేకుండా, మొండెము మాత్రమే దేహముగా కలిగిన అనూరుడు జన్మిస్తాడు. అనూరుడు అంటే ఊరువులు (తొడలు) లేనివాడు అని అర్థం. అనూరుడు తల్లితో నువ్వు సవతి మత్సరముతో నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసీగా ఉండు. రెండవ అండాన్ని భద్రంగా ఉంచు. అందునుండి జన్మించినవాడు నీ దాస్యాన్ని విడుదల చేస్తాడు అని చెబుతాడు. సప్తాశ్వాలను పూన్చిన సూర్యుని రథానికి రథసారథిగా అనూరుడు వెళ్లిపోతాడు.
వినత, కద్రువలు ఒక రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు క్షీర సాగరమథనములో వచ్చిన ఉచ్చైశ్రవము అనే ఇంద్రుడి గుర్రము దూరముగా కనిపించింది. అప్పుడు దూరముగా కనిపిస్తున్న గుర్రమును చూసి, కద్రువ తన సవతితో "చూడు ఆ ఉచ్చైశ్రవము శరీరం అంత తెల్లగా ఉన్నా తోక నల్లగా ఉన్నది" అని అంటుంది. ఉచ్చైశ్రవము తోక తెల్లగా ఉండడం చూసిన వినత, లేదు దాని తోక తెల్లగ ఉన్నదని అంటుంది. దీనితో కద్రువకు మనస్సులో పట్టుదల పెరిగి పందెం వేదాము, తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అంటుంది. వినత పందానికి అంగీకరిస్తుంది. ఆ రోజు పొద్దు పోయిందని తరువాతి రోజు వచ్చి ఆ గుఱ్ఱాన్ని చూడవచ్చని ఇద్దరు అంగీకరించుకొని వారి ఇండ్లకి వెళ్ళిపోతారు.
కద్రువ ఇంటికి వెళ్ళి తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకొని తోక నల్లగా ఉండేటట్లు చేయమని కొడుకులను అడుగుతుంది. కొడుకులు దానికి అంగీకరించక పోయేసరికి కోపముతో మాతృ వాక్యపరిపాలన చెయ్యని మీరందరు పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు చేసే సర్పయాగంలో మరణిస్తారు అని శపిస్తుంది. అది విన్న కర్కోటకుడు అమ్మా నేను వెళ్లి ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అంటాడు.
తరువాతి రోజు వినత, కద్రువలు వెళ్ళి చూడగానే గుఱ్ఱం తోక కర్కోటకుడు చుట్టుకోవడం వల్ల నల్లగా కనిపిస్తుంది. అది చూసి వినత బాధ పడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది.
కొన్ని రోజులకు గరుత్మంతుడు పుడతాడు. గరుడుడిని చూసి కద్రువ, "వినతా! నువ్వు దాసీ వి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడుడిని కూడా దాసీవాడు గా చేసుకొంటుంది. గరుత్మంతుడు తన సవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండేవాడు. ఒకరోజు ఇలా త్రిప్పుతుండగా గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్లి పోతాడు. ఆ సూర్యమండలం వేడికి ఆ సర్పాలు మాడి పోతుంటే కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది. ఆ తరువాత గరుత్మంతుడిని దూషిస్తుంది.
దానితో దుఃఖితుడై గరుత్మంతుడు తనది, తన తల్లిది దాసీత్వం పోవాలి అంటే చేయవలసిన కార్యాన్ని అడుగుతాడు. అప్పుడు కద్రువ కుమారులు, ఆలోచించి అమృతం పొందాలనే కోరికతో తమకు అమృతం తెచ్చి ఇస్తే గరుత్మంతుడి, వినత ల దాసీత్వం పోతుందని చెబుతారు.
గరుత్మంతుడు అమృతం తీసుకొని వెళ్ళుతుంటే మార్గమధ్యములో ఇంద్రుడు కనిపించి "నాయనా గరుత్మంతా! అమృతం నువ్వు తీసుకొని వెళ్ళడం తగదు. అందరికి అమరత్వం సిద్దించరాదు" అని అంటాడు. అప్పుడు గరుత్మంతుడు - ఇంద్రుడు ఒడంబడిక చేసుకొంటారు. గరుత్మంతుడు అమృతకలశం తీసుకొని వెళ్ళి తన సవతి కుమారులకు ఇచ్చేటట్లు, అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకొని పారిపోయేటట్లు. గరుత్మంతుడు వెళ్ళి ఆ కలశాన్ని తన సవతి సోదరులకు ఇచ్చి దర్భ ల పై ఉంచుతాడు. అమృతం ఇచ్చిన వెంటనే గరుత్మంతుడి దాసీత్వము, అతడి తల్లి దాసీత్వము పోతుంది.
అమృతం సేవించడానికి ముందుగా పవిత్రులవ్వాలనే ఉద్దేశంతో ఆ పాములు స్నానం చెయ్యడానికి వెళ్తాయి. అవి అలా స్నానానికి వెళ్లిన తడవుగా ఇంద్రుడు వచ్చి ఆ అమృతకలశాన్ని ఎత్తుకొని పోతాడు. స్నానం చేసి వచ్చి జరిగింది. సర్పాలు బాధ పడతాయి. అయినా ఆశ చావక, ఆ పాములు దర్భలపై ఉంచి నప్పుడు అమృతం ఏమైనా ఒలికిందేమోనని తమ నాలుకతో నాకుతాయి. ఆ విధంగా నాకడం వల్ల వాటి నాలుకలు చీలి పోతాయి. ఆవిధంగా సర్పాలకు ద్విజిహ్వత్వం (రెండు నాలుకలు) సిద్ధించింది.
ఆ విధంగా తల్లికి దాస్యవిముక్తి కలిగించి, తాను శ్రీమహావిష్ణువుకు వాహనంగా వెళ్లిపోతాడు. సర్వ శక్తిమంతుడు అయి ఉండిన్నీ, తల్లి మాటకోసం సవతి సోదరులను వీపున మోస్తూ, అవమానాలను భరించి, తల్లికీ, తనకూ కూడా ఉన్న దాస్యబంధనాలను ఛేదించుకొని ఉన్నత స్థానానికి వెళ్లిన గరుత్మంతుడు ప్రాతస్స్మరణీయుడు.
అధర్వణ వేదంలో గారుడోపనిషత్తు ఉంది. అందులో వైనతేయుడైన గరుడుడు విషదహారి అని చెప్పబడింది. గరుత్మంతుని స్వరూపం, అతని ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు ఇలా చెప్పారు . -
రామాయణం యుద్ధకాండలో నాగబంధవిమోచన అనే ఘట్టం ఉంది. ఈ భాగం పారాయణకు శ్రేష్టమైన భాగాలలో ఒకటిగా భావిస్తారు.
ఇంద్రజిత్తు మాయాయుద్ధం చేసి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. రామలక్ష్మణుల దేహంపై ప్రతి అంగుళం బాణాలతో నిండిపోయింది. వానరసేన సిగ్గువిడిచి పరుగులు తీసింది. ఆ నాగాస్త్ర బంధాలనుండి తప్పుకోవడం ఎవరివల్లా కాదని విజయ గర్వంతో ఇంద్రజిత్తు తండ్రివద్దకు వెళ్ళి తాను రామలక్ష్మణులను చంపి వానరసేనను నిర్వీర్యం చేసేశానని చెప్పాడు. భయభీతులైన వానరులంతా రాఘవుల చుట్టూ కూర్చుని దుఃఖించసాగారు. కొద్దిగా సృహ వచ్చిన రాముడు లక్ష్మణుని చూచి వ్యాకులపడి, తన ప్రతిజ్ఞలన్నీ మిధ్యలయ్యాయని వగచి, ప్రాయోపవేశానికి సిద్ధనయ్యాడు. తనకు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపి వానరులను తిరిగి వెళ్ళిపొమ్మన్నాడు. వారు శక్తి వంచన లేకుండా మిత్ర కార్యం నిర్వహించారని, అయినా ఈశ్వరాజ్ఞ ఉల్లంఘించరానిదని చెప్పాడు. వానరులందరూ కళ్ళనీళ్ళు పెట్టుకొన్నారు. శరతల్పగతులైన రామలక్ష్మణులను చూచి విభీషణుడు హతాశుడయ్యాడు. సుగ్రీవుడు మాత్రం విభీషణుడిని ఓదార్చి అతనికి లంకాధిపత్యం నిశ్చయమన్నాడు.
అంతా విషణ్ణులైన సమయానికి పెద్ద సుడిగాలి వీచి సముద్రం కల్లోలమయ్యింది. గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చాడు. అతని రాకతో శరరూపంలో రామ సౌమిత్రులను పట్టుకొని ఉన్న సర్పాలన్నీ పారిపోయాయి. గరుడుడు తన రెండు చేతులతోను రామలక్ష్మణుల సర్వావయవాలను నిమిరాడు. వెంటనే వారి గాయాలు మాయమై వారికి మునుపటి కంటే ఎక్కువ తేజస్సు, బల వీర్య పరాక్రమాలు సమకూరాయి. వారిని కౌగలించుకొని గరుడుడు - "మీరు జాగరూకతతో ఉండండి. నేను మీకు స్నేహితుడనెలా అయ్యానో తరువాత తెలుస్తుంది. రామా! నువ్వు లంకను నాశనం చేసి రావణుని చంపి సీతను పొదడం తథ్యం" - అని చెప్పి, రామలక్ష్మణులకు ప్రదక్షిణం చేసి ఆకాశానికి ఎగిరి పోయాడు.
మహా భారతం ఆది పర్వములో సర్పయాగానికి ముందుగా వినత, కద్రువుల వృత్తాంతము, గరుత్మంతుని కథ చెప్పబడింది. భగవద్గీత విభూతి యోగము 30వ శ్లోకములో కృష్ణుడు తాను వైనతేయశ్చ పక్షిణామ్ - పక్షులలో నేను వినతాసుతుడైన గరుత్మంతుని - అని తెలిపాడు.
సాధారణంగా విష్ణువు ఆలయాలలో మూలవిరాట్టు విగ్రహానికి అభిముఖంగా గరుత్మంతుని విగ్రహం ఉంటుంది. శ్రీవైష్ణవ చిహ్నాలలో ఊర్ధ్వపుండ్రాలకు ఇరుప్రక్కలా శంఖ చక్రాలు, వానికి ఇరుప్రక్కలా హనుమంతుడు, గరుత్మంతుడు ల బొమ్మలు చూపుతారు.
పండుకొనేముందు ఈ శ్లోకం పఠించే సంప్రదాయం ఉంది. ఇందులో గరుత్మంతుని స్మరణ కూడా ఉంది.
This article uses material from the Wikipedia తెలుగు article గరుత్మంతుడు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.