గణపతి సచ్చిదానంద స్వామీజీ ఒక హిందూ ఆధ్యాత్మిక గురువు.
అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు, నిర్వాహకులు. వీరిని దైవ స్వరూపునిగా భక్తులు భావిస్తారు.
స్వామీజీ ఎవరు? అనే ప్రశ్నకు జవాబుగా దత్తపీఠం వెబ్సైటులో ఇలా వ్రాసి ఉన్నది -
మైసూరులోని అవధూత దత్తపీఠం వీరి ప్రధానకేంద్రం. ఇంకా దేశమంతటా అనేక మఠాలు, పీఠాలు ఉన్నాయి. ధర్మము, భక్తి, భజన, కీర్తన వంటి సంప్రదాయాలు స్వామీజీ బోధించే మార్గాలలో ప్రధానమైనవి. సంగీతం ద్వారా రోగాలను నయం చేయవచ్చునని స్వామీజీ బోధిస్తారు. దీనినే "నాద చికిత్స" అంటారు. స్వయంగా స్వరపరచిన కీర్తనలను స్వామీజీ సంస్కృతం, హిందీ, తెలుగు, కన్నడం, ఇంగ్లీషు భాషలలో సంగీతయుక్తంగా ఆలాపిస్తూ ఉంటే తమకు వాటివలన శారీరిక ఆరోగ్యము, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వము, శాంతి లభించాయని భక్తులు చెబుతుంటారు.
వీరు 1942, మే 26 న జయలక్ష్మి, నరసింహశాస్త్రి దంపతులకు కర్ణాటక రాష్ట్రంలో కావేరి నదీ తీరాన "మేకెదాటు" అనే గ్రామంలో జన్మించారు. బిడ్డకు తల్లిదండ్రులు "సత్యనారాయణ" అనే పేరు పెట్టుకొన్నారు. (అతని తల్లి మేకెదాటు వద్ద వున్న కావేరి నది ఒడ్డున ధ్యానంలో ఉన్న సమయంలో ఆ బిడ్డ జన్మించాడని, పుట్టినపుడే అతని నుదుట విభూతి బొట్టు ఉందనీ దత్తపీఠం వెబ్సైటులో ఉంది) చిన్నతనం నుండే ఆ బాలుడు ఆధ్యాత్మిక సాధనల పట్ల, సంగీతం పట్ల విశేషమైన ఆసక్తి చూపారు. 1951లో అతని మాతృమూర్తి శివైక్యం చెందడానికి ముందు అతనికి దీక్షనొసగింది. మేనత్త వెంకాయమ్మ హఠయోగం నేర్పిందని ఆయన జీవిత చరిత్ర చెబుతోంది.
బడికి వెళ్ళే సమయంలోనే సత్యనారాయణ తన స్నేహితులతో సత్సంగాలు జరిపించడం, కొన్ని అద్భుత సిద్ధులు ప్రదర్శించడం చేసేవాడు. కొంతకాలం అతను పోస్టల్ వర్కర్, బడి పంతులు వంటి ఉద్యోగాలు చేశాడు. ఆ సమయంలో అతని సహాయం వలన కష్టాలనుండి బయటపడిన కొందరు అతనికి జీవితాంతం శిష్యులయ్యారు. అతను భజనలు, కీర్తనలు పాడుతుండేవాడు. యోగా నేర్పుతుండేవాడు. క్రమంగా అతని శిష్యుల సంఖ్య పెరిగింది.
1966లో సత్యనారాయణ మైసూరులోని తన ఆశ్రమంలో నివాసం ఏర్పరచుకొన్నారు. అది అప్పటికి పొలంలో ఒక చిన్న పాక. తరువాత సత్యనారాయణ "గణపతి సచ్చిదానంద స్వామి" అనే పేరును గ్రహించారు. ఆశ్రమానికి వచ్చే సందర్శకులు భక్తులు అధికం కావొచ్చారు. స్వామిజీ, అతని భక్తులు దేశమంతటా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినాన స్వామిజీ హోమగుండంలో ప్రవేశించడం, శివలింగం, శ్రీచక్రం వంటి వస్తువులను వెలికి తీయడం భక్తులకు ప్రియమైన అద్భుతకార్యంగా చెప్పబడుతుంది. నవరాత్రుల సందర్భంగా ఆయన అమ్మ వారికి చేసే పూజలు కూడా భక్తులకు ఇష్టమైనవి.
ఎన్నో దేశాల్లో భారీ ఆంజనేయ, కుమార స్వామి (సుబ్రమణ్యస్వామి) విగ్రహాలను స్థాపించి హిందుమత పటిష్ఠానికి కృషి చేశారు. తమ పూజాదికాల్లో దత్త సంప్రదాయానికి పెద్దపీట వేశారు. ఆయన మైసూరు ఆశ్రమంలోని బొన్సాయ్ వనం, మూలికా వనం, అపురూపమైన నవరత్న శిలల మ్యూజియం పర్యాటకులను సైతం ఆకర్షిస్తుంటాయి. ఇతర మత ప్రముఖలతో కలిసి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉంటారు. స్వయంగా తమ ఆశ్రమానికే వారిని వివిధ కార్యక్రమాలకు అహ్వానిస్తూ ఉంటారు. ఆశ్రమం మైసూరులో స్థానికంగా రెండు పాఠశాలలను నడుపుతున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, పేదవారికి, ఆర్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులను నిరంతరం రకరకాల జపాలు చేయాలని, స్తోత్రాలను చేయాలని, లేదా నామలేఖన చేయాలని ఉత్తేజితం చేస్తూ ఉంటారు.
చినుకు చినుకు కలిస్తేనే చెరువు అవుతుంది. అందరూ ఎంతోకొంత కృషి చేస్తేనే సమాజం బాగుపడుతుంది. చినుకు సిగ్గుపడితే చెరువు నిండదు. సమస్యలన్నీ భ్రమలే. సమస్య అనుకున్న దాన్ని సంతోషంగా స్వీకరించు. ఇంకా సమస్య ఎక్కడది. త్యాగమే సమాజ సంక్షేమానికి పునాది. జ్ఞానదానమే నిజమైన యజ్ఞం. తాత్వికులు, సిద్ధాంతుల కోసం మాత్రమే కాదు మతం అంటే. సామాన్యుడిని దేవుడి వద్దకు చేర్చేదే మతం. నాథమూ, భక్తి వేరు కాదు. నామ సంకీర్తన దేవుడి చేరేందుకు దగ్గరి దారి.
1. విశ్వప్రార్థనా మందిరము : దత్తపీఠం మూలస్థానం, మహా శక్తిమంతమైన కాలాగ్నిశ దత్తాత్రేయ ఆలయం, నిత్య హోమశాల, సచ్చిదానందేశ్వర, లక్ష్మీనరసింహ దేవాలయాలు, సకల ధర్మ సమన్వయ కేంద్రం. 2. నాథమండపం : సంగీతానికి అంకితమైన అద్భుత సభామండపం, సప్తస్వర దేవతా మండపం, 22 శ్రుతిస్థానాలకు ప్రతీకగా 22 స్తంభాలమీద నిలబడిన విసనకర్ర ఆకారంలోని సుందర మండపం. 3. శ్రీదత్త వేంకటేశ్వరస్వామి దేవస్థానము : కారణికంగా ప్రతిష్ఠితమైన మహిమాన్విత సన్నిధి, పద్మావతి, ధన్వంతరి, గణపతి, నవగ్రహ, సర్వదోషహరశివ, మరకత సుబ్రహ్మణ్య ఆలయ సముదాయం) 4. విశ్వం - ప్రదర్శనశాల : ప్రపంచవ్యాప్తంగా శ్రీస్వామీజీకి అందిన అరుదైన శిల్ప, కళాఖండాలకు, ప్రశస్తమైన రత్నాలకు, సంగీతవాద్యాలకు, చిత్రవిచిత్ర వస్తు విశేషాలకు ఆలవాలం. 5. కిష్కింధ మూలికావనం: భారతదేశంలోనే అతి పెద్దదైన సుందరమైన వామన వృక్షవనం ( బోన్సాయి గార్డెన్), మనకు ప్రకృతి సంరక్షణా స్ఫూర్తి నిచ్చే మహోద్యమం. 6. సప్తర్షి తీర్థం : భూమండలం మీద అనేక పవిత్ర తీర్థాలతోపాటుగా, విలువైన మూలికలు, ప్రశస్త రత్నాల జలాలతో భక్తులు స్నానం చేసే పుష్కరిణి, శరీర రుగ్మతలను దూరం చేసి సంజీవనం. 7. నక్షత్ర, నవగ్రహ రాశి వనం : శాస్త్రంలో పేర్కొన్నవిధంగా 27 నక్షత్రాలు, 12 రాశులు, సప్తర్షులు, పంచాయతన దేవతలు, నవగ్రహదేవతావృక్షాల అరుదైన ప్రశాంత ఉద్యానవనం . 8. ధర్మధ్వజం: సకల విజ్ఞాన తత్వ్తాల సారం పరబ్రహ్మము అని చాటిచెప్పే అద్భుతమైన ఏకశిలా స్థూపం. 40 నిమిషాల పాటు వినసొంపుగా తత్త్వాన్ని తేలియపరిచే ధ్వని సమేతమైన కాంతి ప్రదర్శన. 9. సుమేరు ధ్యాన మందిరం: క్రియాయోగ సాధనకు, ధ్యానానికి అనువైన త్రికోణాకార భవనము, అన్ని చికాకులు తొలగిపోవాలంటే యోగమే సులభోపాయం అని నిరూపించే నిదర్శనం. 10. జయలక్ష్మీ మాత అన్నపూర్ణా మందిరము : దత్త పీఠానికీ విచ్చేసే వేలాదిమంది భక్తులకు నిరంతరం అన్నదానం జరిగే ప్రదేశం. ఈ అన్నదాన సేవలో పాలుపంచుకోవడం మహాభాగ్యము. 11. ఎస్. జి. ఎస్. ఉచిత వైద్యశాల : పంచకర్మ మెదలైన ఆయుర్వేద చికిత్సా విధానాలతో పాటు ఆధునిక వైద్యసేవలు, చికిత్సా శిబిరాల ద్వారా వేలాదిమంది ప్రజలకు ఉపకరించే సేవాకేంద్రం.
దత్తపీఠంలో ఒక గొప్ప వేదపాఠశాల ఉంది. ఇక్కడ ఋగ్వేద, యజుర్వేద, సామ, అథర్వ వేదములనూ, అలాగే అన్ని వేదాలకూ చెందిన స్మార్త భాగములను కూడా కూలంకషంగా బోధిస్తారు. ఇక్కడి నుండి అనేక మంది విద్యార్థులు పండితులుగా, క్రమపాఠీలుగా, రహస్యాన్త పండితులుగా, ఘనపాఠీలుగా, సలక్షణ ఘనపాఠీలుగా తయారైనారు. అనేక మంది సంస్కృత భాషలో కూడా నిష్ణాతులై ఇతర పాఠశాలల్లోనూ విశ్వవిద్యాలయాల్లోనూ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఇక్కడి విద్యార్థులకు వేద విద్యతో పాటుగా కంప్యూటర్ కి సంబంధించిన నాలెడ్జ్ కూడా అసామాన్యాంగా ఉంటుంది.
దత్త పీఠంలో ఈ క్రింద (కొన్ని ) సూచించిన అనేక కార్యక్రమ పండుగలు జరుగుతాయి.
ఈ ఉత్సవాలు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశికి దీక్షగా జరుగుతాయి. సామాన్యంగా మే, జూన్ ప్రాంతాలలో వస్తాయి. ఈ సందర్భంగా గొప్ప యజ్ఞాలు, మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, అఖిల భారత జ్ఞాన బోధ సభా సమ్మేళనం, వేదపరీక్షలు జరుగుతాయి. అంతర్జాతీయ ప్రతిష్ఠాకరమైన వేదనిధి, నాథనిధి, శాస్త్రనిధి, దత్తపీఠ ఆస్థాన విద్వాన్ ఇత్యాది బిరుదులతో ఉత్తమోత్తమ పండితులకు పురస్కారాలు జరుగుతాయి. ఈ సందర్భములోనే శ్రీదత్త వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవములు కూడా జరుపబడును.
తొమ్మిది రోజులు జరగే ఈ ఉత్సవాలు సంపూర్ణమైన పూజా కార్యక్రమాలతోను, నాథసేవాకార్యక్రమాలతోను నిండి ఉంటాయి. ఈ తొమ్మిది రోజులలో శ్రీస్వామీజీలో అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటుంది. సామాన్యంగా సెప్టెంబరు, అక్టోబరు మాసాలలో వస్తూ ఉంటుంది.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాత్మకుడైన ఆదిగురు దత్తాత్రేయ స్వామి జన్మదిన మహా పర్వదినమిది. మార్గశీర్ష పూర్ణిమ, ఇది సామాన్యంగా డిసెంబరులో వస్తుంది. ఇది మూడురోజుల ఉత్సవం. విశేషమైన దత్తపూజలు. దత్తహోమాలు ఉంటాయి.
శ్రీ స్వామీజీ అగ్నికుండంలో దిగి హోమం చేసేది ఈ ఉత్సవంలోనే. ఇది ఒకరోజు ఉత్సవం రాత్రంతా శ్రీసచ్చిదానందేశ్వరుడికి అభిషేకాలు, రుద్రహోమం జరుగుతాయి కైలాసం దిగి వచ్చినట్లుంటుంది, ఫిబ్రవరి, మార్చి నెలలలో ఉంటుంది. ఈ పై నాలుగు ఉత్సవాలలోనూ శ్రీస్వామీజీ సామాన్యంగా మైసూర్ దత్తపీఠంలోనే ఉంటారు.
ఈమె శ్రీ స్వామీజీ వారి తల్లి. యోగ దీక్షాగురువు కూడా ఈ మహాతల్లి జన్మంచినది, పరమపదించినది కూడా శంకరజయంతి నాడే. ఇది ఒక రోజు ఉత్సవం. సామాన్యంగా ఏప్రిలే, మే మసాలలో వస్తుంది.
శ్రీ స్వామీజీవారి తండ్రి శ్రీ నరహరి తీర్థస్వామివారి ఆరాధన మహోత్సవము శ్రావణ శుద్ధ అష్టమి రోజు ఆగస్టు మాసములో ఆచరించబడును,
ఈ పీఠం హైదరాబాదు నుండి దిండిగల్ వెళ్ళే దారిలో ఉంది. ఈ మఠం విశాలమైన ఇరవై ఐదు ఎకరాల తోటలో ఉంది. చుట్టూ అందమైన ఉధ్యానవనము పెంచారు. సచ్చిదానంద స్వామి వచ్చినపుడు, ఇతర కార్యక్రమముల నిర్వహణకు అన్ని హంగులతో పెద్ద సభాస్థలం ఉంది. దానిని ఆనుకొని విశ్రాంతి గదులు ఉన్నాయి. ఇక్కడ కల ఆంజనేయ దేవాలయములోని మూలవిరాట్ మరకతంతో చేయబడింది. ఇదే ఆవరణలో విఘ్నేశ్వరాఅలయము. అమ్మవారి ఆలయములు ఉన్నాయి. "అమ్మ వొడి" అనే వృద్దుల శరణాలయము ఉంది. ఇక్కడ దాదాపు వందమంది వృద్దులకు వసతి సదుపాయములు కలవు
స్వామివారు అనంతపురంజిల్లా,రాప్తాడు మండలంలోని బొమ్మేపర్తి గ్రామనికి, స్వామివారికి ఉన్న అనుబంధాన్ని జీవిత చరిత్రలో భాగము చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందిజై గురుదత్తా.
This article uses material from the Wikipedia తెలుగు article గణపతి సచ్చిదానంద స్వామి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.