స్వామి వివేకానంద భారతదేశానికీ, హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ 1893 సెప్టెంబరు 11న చికాగోలో మొదటి ప్రపంచ మత సమ్మేళనంలో చేసిన ప్రసంగం సుప్రసిద్ధమైనది.
స్వామీ వివేకానంద 1893 ప్రపంచ మత సమ్మేళనానికి భారత దేశానికీ, హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించారు. 11 నుంచి 1893 సెప్టెంబరు 27లో నిర్వహించిన ఆ సమ్మేళనం మొదటి ప్రపంచ మత సమ్మేళనం. ప్రపంచవ్యాప్తంగా పలు మతాల ప్రతినిధులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. వివేకానంద చేసిన ఈ చరిత్రాత్మక ప్రసంగంలో ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా (మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా) అని సంబోధిస్తూ ప్రారంభించడంతోనే శ్రోతలను ఆకట్టుకున్నారు. సాధారణంగా లేడీస్ అండ్ జంటిల్మన్ అన్న సంబోధనకు అలవాటు పడ్డ వారిని, ఈ పిలుపులోని ఆత్మీయత ఆకర్షించింది. ఆయన సందేశానికి, వాక్పటిమకూ, నిజాయితీతో కూడిన సంభాషణకు అక్కడి ప్రతినిధులు ఆకర్షితులయ్యారు. అమెరికన్ పత్రికలు సైతం వివేకానందుని వ్యక్తిత్వం, సందేశాన్ని ప్రశంసించాయి.
1893 సెప్టెంబరు 11న పర్మినెంట్ మెమోరియల్ ఆర్ట్ ప్యాలెస్ (ప్రస్తుతం ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షికాగో) లో వరల్డ్ కొలంబియన్ ఎక్స్పొజిషన్లో భాగంగా ప్రపంచ మత సమ్మేళనం జరిగింది. అదే రోజున వివేకానందుడు తన తొలి ప్రసంగం చేశాడు. ఎంతో ఆలస్యం తరువాత మధ్యాహ్న సమయంలో అతనికి అవకాశం వచ్చింది. మొదట కాస్త కంగారు, అధైర్యం కలిగితే సరస్వతీ దేవికి నమస్కరించాడు. ఆ తర్వాత తన శరీరంలోకి కొత్త శక్తి వచ్చిన అనుభూతి కలిగింది; మరెవరో తన శరీరాన్ని ఆక్రమించినట్టు అయింది - "భారతదేశపు ఆత్మ, ఋషుల ప్రతిధ్వని, రామకృష్ణుని స్వరం, పునరుజ్జీవనం చెందిన కాలపు ఆత్మ మాటలకు వాహికగా" ప్రసంగిస్తున్న అనుభూతితో తన ప్రసంగం ప్రారంభించాడు. "అమెరికా సోదర సోదరీమణులారా!" అంటూ ప్రారంభించడంతోనే ఏడువందల మంది జనం లేచి రెండు నిమిషాల పాటు కరతాళధ్వనులతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. కరతాళధ్వనులు నిశ్శబ్దంలోకి మణిగిపోయాకా మళ్ళీ తన ప్రసంగాన్ని ఆరంభించాడు. చారిత్రకంగా చాలా ఇటీవలదైన ఆ దేశానికి "ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఋషులైన వైదిక ఋషి పరంపరకు చెందిన సన్యాసుల తరఫున, ప్రపంచానికి సామరస్యాన్ని, విశ్వంలోని ప్రతీదాన్నీ ఆమోదించగల తత్వాన్ని నేర్పిన మతం తరఫున" శుభాభినందనలు తెలియజేస్తూ ప్రారంభించాడు.
వివేకానందుడు తన సందేశంలో భారతదేశ మత సామరస్యాన్ని గురించి, వైవిధ్యాన్ని గురించి వివరించాడు. ప్రాచీన కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో దాడులు ఎదుర్కొన్న నుంచి ఇజ్రాయెలీలు, పార్సీలు వంటివారిని స్వీకరించి హృదయాలకు హత్తుకున్న భారతదేశానికి చెందినవాడినని గర్విస్తున్నానన్నాడు. వివిధ మార్గాల ద్వారా సాగిన మానవులంతా భగవంతుణ్ణి చేరుకుంటారని చెప్పే హిందూ సూక్తులను, భగవద్గీత శ్లోకాన్ని ప్రస్తావించాడు. చారిత్రకంగా ఎన్నో నాగరికతలు, దేశాలను నాశనం చేసిన మూఢభక్తి, మతతత్వాలను సర్వమత సమ్మేళనం దూరం చేస్తుందని విశ్వసిస్తున్నట్టు చెప్పాడు .
2012లో మూడు రోజుల ప్రపంచ సమ్మేళనాన్ని చికాగోలో కౌన్సిల్ ఫర్ ఎ పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్తో కలిసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ (వాషింగ్టన్ కాళీ ఆలయానికి చెందినది) నిర్వహించింది. ఈ కార్యక్రమం వివేకానందుని 150వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటుచేశారు.
This article uses material from the Wikipedia తెలుగు article స్వామి వివేకానంద ప్రపంచ మతసమ్మేళన ప్రసంగం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.