భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు భారతదేశంలో ప్రతిష్ఠాత్మకగా భావించే సినిమా అవార్డులు.
ఇవి భారత ప్రభుత్వంచే ఏడాదికి ఒకసారి ప్రకటించబడి రాష్ట్రపతి చేతులు మీదగా గ్రహీతలకు అందజేయబడతాయి. ముందటి సంవత్సరము దేశంలో విడుదలైన అన్ని భాషల చిత్రాలను ప్రత్యేక జ్యూరీ పరిశీలించి ముఖ్య విభాగాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. అంతేకాకుండా వివిధ భాషలలోని ఉత్తమమైన చిత్రాలను కూడా ఎంపిక చేస్తారు.
1953 లో భారతదేశంలో నిర్మింపబడిన వివిధ భాషా చిత్రాలనుంచి ఎంపిక చేయబడ్డ అత్యుత్తమ చిత్రాలకు పురస్కారాలు అందచేయాలని 1954 లో ప్రభుత్వం మొట్టమొదటి సారిగా నిర్ణయించింది. ఆ విధంగా భారతదేశంలో ఉత్తమ చలనచిత్రాలకు పురస్కారాలు అందచేయడమనే ప్రక్రియ మొదలయిందని చెప్పుకోవచ్చు. ఈ పురస్కారాలను అప్పట్లో “స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిల్మ్స్”గా పిలిచే వారు.
నిజానికి 1949 ఆగష్టు నెలలో అప్పటి మద్రాస్ ప్రభుత్వానికి చెందిన సెన్సార్ బోర్డ్ ప్రెసిడెంట్ రాసిన ఒక లేఖలో ఆ యేడు నిర్మింపబడిన తెలుగు , తమిళ చిత్రాలనుంచి ఎంపిక చేయబడ్డ అత్యుత్తమ చిత్రాలకు 500 రూపాయల బహుమతి ప్రదానం చేయబడుతుందని ప్రకటించారు. కానీ ఆ అవార్డులు నిజంగానే అందచేశారా? ఒక వేళ చేసి ఉంటే ఆ బహుమతులు అందుకున్న సినిమాలు ఏవి? అనే విషయం మాత్రం ఎక్కడా లభించలేదు.
అలాగే 1954 లో జాతీయ అవార్డుల ప్రధానం చెయ్యకమునుపే కొన్ని భారతీయ సినిమాలు ప్రపంచంలోని ఇతరదేశాల్లో ప్రదర్శింపబడి పలు అవార్డులు గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా 1936 లో నిర్మింపబడిన మరాఠీ చిత్రం ’సంత్ తుకారాం’ అనే భక్తి ప్రధాన చిత్రం వెనిస్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శింపబడడమే కాకుండా అక్కడ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది. ఆ విధంగా అవార్డ్ పొందిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా ’సంత్ తుకారాం’ని పేర్కొనవచ్చు. అలాగే 1946 లో కేతన్ ఆనంద్ రూపొందించిన ’నీచా నగర్’ అనే హిందీ చలన చిత్రం ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ పట్టణంలో జరిగిన మొట్టమొదటి చలనచిత్రోత్సవంలో పాల్గొనడమే కాకుండా అత్యుత్తమ చిత్రంగా అవార్డు కూడా గెలుచుకుంది.
హయతుల్లా అన్సారీ రచించిన “నీచా నగర్” అనే కథ ఆధారంగా ఈ చలనచిత్రం రూపొందించబడింది. నిజానికి “నీచా నగర్” కథ మాక్సిమ్ గోర్కీ రచించిన “లోయర్ డెప్త్స్” అనే కథకు అనుకరణ. ఇదే కథ ఆధారంగా అంతకు ముందు ప్రముఖ ఫ్రెంచ్ దర్శకుడు రెన్వాఆ తర్వాత ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురొసావా కూడా చలనచిత్రాల్ని నిర్మించారు. ఈ విధంగా మన దేశంలో జాతీయ చలనచిత్ర పురస్కారాలు మొట్టమొదటి సారిగా 1954 లో మొదలయినప్పటికీ మన దేశానికి చెందిన చిత్రాలు అప్పటికే కొన్ని విదేశీ పురస్కారాలు అందుకుని ఉన్నాయన్నమాట.
అలాగే మన తెలుగు చలనచిత్రమయిన పాతాళ భైరవి భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుండి ఎంపికయిన ఏకైక చిత్రంగా గుర్తింపు పొందింది. ఇలాంటి ఖ్యాతి సాధించిన మరో తెలుగు చలనచిత్రం మల్లీశ్వరి. ఈ సినిమా బీజింగ్లో జరిగిన చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై, 1953 మార్చి 14న చైనీస్ సబ్ టైటిల్స్ చేర్చి 15 ప్రింట్లతో చైనాలో విడుదలయింది.ఈ విధంగా కొన్ని భారతీయ సినిమాలు అక్కడక్కడా గుర్తింపు పొందినప్పటికీ మొట్టమొదట ఉత్తమ చలనచిత్రాలకు పురస్కారాలు అందచేయాలనుకున్నది మాత్రం 1954 లోనే.
1953 లో మొట్టమొదటి సారిగా జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించాలనుకున్నప్పుడు రోజుల్లోకి వెళ్తే అప్పటికే మన దేశంలోని అన్ని భాషల్లో కలిపి దాదాపు 250 కి పైగా సినిమాలు నిర్మాణమయ్యేవి. అయితే ఈ 250 సినిమాల్లో కేవలం కొన్ని సినిమాలనే అత్యుత్తమైనవిగా ఎన్నుకోవాలంటే అంత సులభమైన విషయమేమీ కాదు. అందుకే అప్పటి జ్యూరీ సభ్యులకు భరతముని రచించిన “నాట్య శాస్త్రం” లోని సూత్రాలను పాఠించారని అప్పటి ప్రధానోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక చూస్తే తెలిసొస్తుంది.
భరతుని నాట్య శాస్త్రం ప్రకారం నాట్యం లేదా నాటకం ఎల్ల వేళలా వినోదాన్ని అందచేయగలగాలి. వినోదంతో పాటు ప్రజల్లో విజ్ఞానాన్ని పెంపొందించగలగాలి. వీటన్నింటితో పాటు ప్రజల మనసును నిజాయితీతో నింపి వారికి సత్ప్రవర్తన అలవడేలా చేసి తద్వారా దేశము, ఆ దేశ ప్రజల ఉన్నతికి తోడ్పడేదే నిజమైన నాట్యమని భరతముని నాట్య శాస్త్రంలో రచించిన వాక్యాలను ఈ ఆహ్వాన పత్రిక మొదటి పేజీ పై ప్రస్తావించారు.బహుశా ఈ కారణంగానే ఆ తర్వాత చాలా ఏళ్ళ పాటు జాతీయ అవార్డులకు నామినేట్ చేసిన చిత్రాలను గమనిస్తే వాటిలో ఎక్కువగా దేశ భక్తి పూరిత చిత్రాలు, నీతి నిజాయితీ ప్రబోధించే చిత్రాలు అలాగే అప్పటి ప్రభుత్వం ప్రకటించిన వివిధ పథకాలను పొగుడుతూ తీసిన చిత్రాలే కనిపిస్తాయి.
అంటే చలనచిత్ర ప్రక్రియను ఒక కళగా గుర్తించి అందులోని కళాత్మక అంశాలను ప్రోత్సాహించడానికి మొట్టమొదటి జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఏర్పడలేదనే చెప్పాలి. తొలినాళ్ళలో చలనచిత్రంలోని సాంకేతికత కంటే కూడా కథ, ఆయా కథలు ప్రబోధించే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. అందుకే కాబోలు మొట్టమొదట జాతీయ అవార్డులకు పంపించే సినిమాల్లో ఇలాంటి అంశాలని చొప్పించి మరీ రూపొందించేవారట.
అధికారిక నామం : స్వర్ణ కమలం
అధికారిక నామం : రజత కమలం
This article uses material from the Wikipedia తెలుగు article భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.