టి.యస్.విజయచందర్ ఒక ప్రముఖ తెలుగు సినిమా నటుడు.
ఇతడు నటించిన చారిత్రాత్మకమైన కరుణామయుడు, ఆంధ్రకేసరి మొదలైన సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆయన అసలు పేరు రామచందర్. 1942లో మద్రాసులో పుట్టాడు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఈయనకు తాత అవుతారు. విజయచందర్ తల్లి పుష్పావతి, ప్రకాశం పంతులు కూతురు. తండ్రి తెలిదేవర వెంకట్రావు హోమియోపతి వైద్యుడు. బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా. ఆరుమంది సంతానంలో ఈయన మూడోవాడు. విద్యాభ్యాసం అంతా కాకినాడలో జరిగింది.
టి.యస్.విజయచందర్ | |
---|---|
జననం | టి.యస్.విజయచందర్ 1942 మద్రాసు |
ఇతర పేర్లు | రామచందర్ |
ప్రసిద్ధి | కరుణామయుడు, ఆంధ్రకేసరి లో విశేష నటన |
తండ్రి | తెలిదేవర వెంకట్రావు |
తల్లి | పుష్పావతి |
కాకినాడ పి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో ఉండగా ఆయన దృష్టి నాటకాల వైపు మళ్ళింది. ఏడిద నాగేశ్వరరావు, వి.బి.రాజేంద్ర ప్రసాద్లు ఆయనకు సీనియర్లు. ఆయన వేసిన తొలి నాటిక లోభి. మాడా వెంకటేశ్వరరావు, ఏడిద నాగేశ్వరరావు తదితరులు స్థాపించిన రాఘవ కళాసమితిలో అనేక నాటకాల్లో పాల్గొన్నాడు. తర్వాత డిగ్రీ కోసం మళ్ళీ మద్రాస్ కు వెళ్ళాడు. 1963లో డిగ్రీ పూర్తయింది. వాళ్ళ నాన్న 1954లోనే కాకినాడలో వదిలి హైదరాబాద్ కు వచ్చేశాడు. ఈయన డిగ్రీ ఐపోయాక హైదరాబాద్ వచ్చేసి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు.
తొలుత విద్యుత్ శాఖలో 84 రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరాడు. తర్వాత 200 రూపాయలు జీతంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కు మారాడు. అయితే ఒకసారి ఉద్యోగుల సమస్యలపై యూనియన్ వాళ్ళను నిలదీయడంతో వారు ఆయన్ను గన్ ఫౌండ్రీ శాఖ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయశాఖకు బదిలీ చేశారు. అక్కడే కొద్ది కాలం పనిచేసినా అసంతృప్తితో బయటకు వచ్చి సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాస్ కు వెళ్ళాడు.
ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన మరో ప్రపంచం సినిమాలో జర్నలిస్టుగా అవకాశం ఇచ్చారు. తర్వాత కె.ఆర్.విజయ ప్రధాన పాత్రలో నిర్మించిన దేవీ లలితాంబ సినిమాలో విలన్ గా నటించాడు. తరువాత ఆయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పిన సినిమా కరుణామయుడు. ఈ సినిమా విడుదలకు నాలుగేళ్ళు సమయం పట్టినా అద్భుతమైన స్పందన వచ్చింది. అదే పంథాలో రాజాధిరాజు, దయామయుడు, ఇలా వరుసగా సినిమాలు నిర్మించాడు. 1985 లో దర్శకుడు కె.వాసు తీసిన షిరిడీ సాయిబాబా మహత్యం ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన మరో సినిమా. ఇంకా ఎన్.శంకర్ తీసిన భద్రాచలం సినిమా కూడా మంచి పేరు తీసుకుని వచ్చింది.
పెళ్ళయిందికానీ కొన్ని అనివార్యకారణాల వల్ల విడిపోయారు. పిల్లలు కూడా లేరు. తండ్రి సంపాదించిన భూముల సాయంతో తెలిదేవర బిల్డర్స్ పేరుతో నిర్మాణ రంగంలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. సినిమా పరిశ్రమ ఆయన్ను అంతగా ఆదరించింది కాబట్టి హైదరాబాద్ నగర శివార్లలోని 11 ఎకరాల స్థలాన్ని చిత్రసీమలోని సీనియర్ సిటిజెన్స్ కోసం ఇచ్చేశాడు. అంబేద్కర్, రామకృష్ణ పరమహంస పాత్రలను పోషించాలని ఆయన కోరిక.
టి.యస్. విజయ్ చందర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఏపీ ఎఫ్డీసీ) ఛైర్మన్గా 15 నవంబర్ 2019న బాధ్యతలను స్వీకరించాడు.
This article uses material from the Wikipedia తెలుగు article టి.యస్.విజయచందర్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.