సుబేదార్ నీరజ్ చోప్రా (జననం 1997 డిసెంబరు 24) జావెలిన్ త్రోలో పాల్గొనే ఒక భారతీయ ట్రాక్ & ఫీల్డ్ అథ్లెట్.
అతను ప్రపంచ అథ్లెటిక్స్ ప్రకారం అంతర్జాతీయంగా రెండవ స్థానంలో ఉన్నాడు. చోప్రా భారత సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO). ఒలింపిక్స్లో భారతదేశానికి బంగారు పతకం సాధించిన మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. అతను ఐఎఎఎఫ్ (IAAF) ప్రపంచ U20 ఛాంపియన్షిప్లో భారతదేశం తరుపున గెలిచిన మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్, 2016 లో అతను 86.48 మీటర్ల ప్రపంచ అండర్ -20 రికార్డు త్రోను సాధించాడు, ప్రపంచ రికార్డు సృష్టించిన మొదటి భారతీయ అథ్లెట్గా నిలిచాడు.
వ్యక్తిగత సమాచారం | |
---|---|
జాతీయత | భారతదేశం |
జననం | పానిపట్ , హర్యానా, భారతదేశం | 1997 డిసెంబరు 24
విద్య | డీఏవీ కాలేజ్ , చండీగఢ్ |
క్రీడ | |
దేశం | భారతదేశం |
క్రీడ | ఫీల్డ్ అండ్ ట్రాక్ |
పోటీ(లు) | జావెలిన్ త్రో |
సాధించినవి, పతకాలు | |
వ్యక్తిగత అత్యుత్తమ(s) | 88.07 (2021) = 2020 టోక్యో ఒలింపిక్స్ – స్వర్ణ పతకం |
చోప్రా ఆగస్టు 7న తన రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లు విసిరి ఫైనల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు, అథ్లెటిక్స్లో స్వర్ణ పతకం సాధించిన మొదటి భారతీయ ఒలింపియన్గా, అథ్లెటిక్స్లో స్వాతంత్ర్యానంతరం భారత తొలి ఒలింపిక్ పతక విజేతగా నిలిచాడు.
అమెరికాలోని యుజీన్లో జరుగుతున్న 2022 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో నీరజ్ చోప్రా 2022 జలై 24న జావెలిన్ త్రో ఫైనల్లో 88.13 మీటర్ల దూరం విసిరి రజతం కైవసం చేసుకున్నాడు. 2003 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అంజు బాబీ జార్జ్ తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పతకం గెలిచిన రెండవ భారతీయుడిగా నీరజ్ చోప్రా నిలిచాడు.
నీరజ్ చోప్రా హర్యానా రాష్ట్రం, పానిపట్ జిల్లా, ఖాంద్రా గ్రామంలో 1997 డిసెంబరు 24న సతీష్ కుమార్ చోప్రా, సరోజ్ బాలాదేవి దంపతులకు జన్మించాడు. చోప్రా చండీగఢ్ డీఏవీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
చిన్నప్పుడు ఒకసారి అతని ఊబకాయం గురించి స్థానిక పిల్లలు అతడిని ఆటపట్టించారు, దాంతో చోప్రా తండ్రి అతడిని మద్లౌడాలోని వ్యాయామశాలలో చేర్పించాడు; తరువాత అతను పానిపట్ లోని జిమ్లో చేరాడు. పానిపట్ లోని శివాజీ స్టేడియంలో ఆడుతున్నప్పుడు, అతను కొంతమంది జావెలిన్-త్రో క్రీడాకారులను చూసి స్వయంగా పాల్గొనడం ప్రారంభించాడు.
చోప్రా సమీపంలోని పానిపట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్, SAI) కేంద్రాన్ని సందర్శించాడు, అక్కడ 2010 శీతాకాలంలో జావెలిన్ త్రోయర్ జైవీర్ చౌదరి అతనిలోని ప్రతిభను గుర్తించాడు. శిక్షణ లేకుండా చోప్రా 40 మీటర్ల త్రో వేయగల సామర్థ్యాన్ని గమనించి, చౌదరి అతని మొదటి కోచ్ అయ్యాడు. చౌదరి నుండి, జలంధర్లో జావెలిన్ కోచ్ కింద శిక్షణ పొందిన మరికొంత మంది అనుభవజ్ఞులైన అథ్లెట్ల నుండి చోప్రా క్రీడ యొక్క ప్రాథమిక విషయాలను నేర్చుకున్నారు. ఆ తర్వాత త్వరలోనే తన మొదటి పతకం, జిల్లాస్థాయి పోటీలలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఆపై అతని సామర్ధ్యాలను అభివృద్ధి చేసుకుంటూ పానిపట్లో నివసించడానికి అతని కుటుంబాన్ని ఒప్పించాడు.
ఒక సంవత్సరం పాటు చౌదరి కింద శిక్షణ పొందిన తరువాత, 13 ఏళ్ల చోప్రాను పంచకులలోని టౌ దేవిలాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో చేర్చారు. అప్పుడి హర్యానా రాష్ట్రంలో సింథటిక్ రన్వేతో ఉన్న రెండు సౌకర్యాలలో ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి. అక్కడ రన్నింగ్ కోచ్ నసీమ్ అహ్మద్ కింద జావెలిన్ త్రోతో పాటు సుదూర పరుగులో శిక్షణ పొందాడు. పంచకులాకు ప్రత్యేక జావెలిన్ కోచ్ లేనందున, చోప్రా, తోటి జావెలిన్ త్రో ఆటగాడు పర్మీందర్ సింగ్, చెక్ దేశ ఛాంపియన్ జాన్ జెలెజ్నీ వీడియోలను డౌన్లోడ్ చేసి, అతని శైలిని అనుకరించడానికి ప్రయత్నించారు. మొదట్లో టౌ దేవిలో, చోప్రా సాధారణంగా దాదాపు 55 మీటర్లు విసిరేవాడు, కానీ కొన్నిరోజులకే తన పరిధిని పెంచుకున్నాడు 2012 అక్టోబరు 27 న లక్నోలో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో, 68.40 మీటర్ల కొత్త జాతీయ రికార్డు త్రోతో స్వర్ణం సాధించాడు.
2013 లో, చోప్రా తన మొదటి అంతర్జాతీయ పోటీ, యుక్రెయిన్ లో జరిగిన వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్లో ప్రవేశించాడు. అతను 2014 లో తన మొదటి అంతర్జాతీయ పతకాన్ని గెలుచుకున్నాడు, బ్యాంకాక్లో జరిగిన యూత్ ఒలింపిక్స్ అర్హత పోటీలలో రజతం సాధించాడు. 2014 సీనియర్ నేషనల్స్లో తన తొలి 70 మీటర్లపై త్రో వేసాడు.
2015 లో, ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్సిటీ అథ్లెటిక్స్ మీట్లో 81.04 మీటర్లు విసిరి, చోప్రా జూనియర్ కేటగిరీలో మునుపటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు; ఇది అతని మొదటి 80 మీటర్లపై త్రో.
కేరళలో జరిగిన 2015 నేషనల్ ఆటలలో చోప్రా ఐదవ స్థానంలో ముగించాడు, ఫలితంగా జాతీయ స్థాయి శిక్షణ శిబిరం కోసం పిలుపు అందుకున్నాడు. దాంతో 2016 లో పంచకుల వదిలి పాటియాలాలోని నేతాజీ సుభాష్ నేషనల్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్కు వెళ్ళాడు. చోప్రా ప్రకారం, జాతీయ శిబిరంలో చేరడంతో అతని కెరీర్ ఒక మలుపు తిరిగింది, ఎందుకంటే అక్కడ పంచకుల కంటే మెరుగైన సౌకర్యాలు, మెరుగైన నాణ్యమైన ఆహారం, మెరుగైన శిక్షణ అందుకున్నాడు. అతని ప్రకారం, జాతీయ స్థాయి జావెలిన్ త్రోయర్లతో శిక్షణ పొందడం అతని మనోధైర్యాన్ని పెంచింది. కేవలం చోప్రా కొరకు 2010 కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత కాశీనాథ్ నాయక్ను కోచ్ గా కేటాయించారు, అయితే నాయక్ శిక్షణ నియమావళి చాలా కష్టంగా ఉందని, నెలన్నర తర్వాత తనంతట తానుగా శిక్షణను తిరిగి ప్రారంభించాడు.
2016 దక్షిణ ఆసియా క్రీడలలో, చోప్రా గౌహతిలో అథ్లెటిక్స్ ఫైనల్స్లో కొత్త వ్యక్తిగత అత్యుత్తమ విజయాన్ని సాధించాడు, 83 మీటర్ల ఒలింపిక్ అర్హత మార్కుకు కాస్త తక్కువైనా, 82.23 మీటర్ల త్రోతో స్వర్ణం గెలిచాడు. అతను ఆ నెలలో ఆస్ట్రేలియన్ కోచ్ గ్యారీ కాల్వర్ట్ కింద శిక్షణ కూడా ప్రారంభించాడు. చోప్రా పోలాండ్లోని బిడ్గాష్చ్ లో జరిగిన 2016 ఐఎఎఎఫ్ ప్రపంచ యు20 పోటీలలో 86,48 మీటర్ల త్రోతో కొత్త ప్రపంచ జూనియర్ రికార్డ్ను నెలకొల్పి బంగారు పతకం గెలిచాడు. అలా ఒక ప్రపంచ రికార్డు సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్ చోప్రానే, అదే సమయంలో ఇది ఒక కొత్త జాతీయ రికార్డు కూడా. ఆ పోటీలలో అతను యు20 రికార్డ్ డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ కేషోర్న్ వాల్కాట్ రికార్డును అధిగమించినప్పటికీ, 2016 వేసవి ఒలింపిక్స్ అర్హతకు చివరి తేదీ జూలై 11 ఒక వారం ముందే వెళ్ళిపొతయింది. దాంతో అర్హత సాధించలేకపోయింది. 2016 ఏప్రిల్ లో న్యూఢిల్లీలో జరిగిన ఫెడరేషన్ కప్ సమయంలో వచ్చిన వెన్నునొప్పి కారణంగా రియో కోసం అతని సన్నాహాలు కూడా దెబ్బతిన్నాయి, ఇది పోటీలో అతని ప్రదర్శనను గణనీయంగా ప్రభావితం చేసింది.
దక్షిణ ఆసియా క్రీడలలో చోప్రా ప్రదర్శన, అతని సామర్థ్యం భారత సైన్యాన్ని ఆకట్టుకుంది. అతనికి రాజ్పుతానా రైఫిల్స్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) గా నేరుగా నియామకాన్ని నాయబ్ సుబేదార్ ర్యాంక్తో ఇచ్చింది, ఈ ర్యాంక్ సాధారణంగా అథ్లెట్లకు మంజూరు చేయబడదు, వీరిని సాధారణంగా నాన్-కమిషన్డ్ ఆఫీసర్లుగా (NCO) నియమించుకుంటారు. 2016 సెప్టెంబరు లో, అతను బెంగుళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రంలో శిక్షణ కోసం నేతాజీ సుభాస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నుండి బయలుదేరాడు. అతను 2016 డిసెంబరులో అధికారికంగా జెసిఓగా చేరాడు, తదనంతరం అతని శిక్షణను కొనసాగించడానికి పొడిగించిన సెలవులను పొందాడు.
2017 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో చోప్రా 85.23 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్ల కోసం ఆగస్టులో లండన్కు వెళ్లాడు, కానీ ఫైనల్స్కు చేరుకోవడానికి ముందే తొలగించబడ్డాడు. ఆగస్టు 24 న, జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్స్లో తన మూడవ ప్రయత్నంలో గజ్జల (groin) చోట పెద్ద గాయమయింది, ఆ ప్రయత్నంలో అతను 83.39 మీటర్ల దూరాన్ని సాధించాడు; గాయం కారణంగా, అతను తన నాల్గవ ప్రయత్నాన్ని ఫౌల్ చేసాడు, తన మిగిలిన చివరి రెండు ప్రయత్నాలను దాటవేసాడు. అతని మొదటి, ఉత్తమ త్రో 83.80 మీటర్లు అతనికి ఏడవ స్థానంలో నిలిపింది. ఫలితంగా, 2017 లో అన్ని తదితర పోటీల నుండి వైదొలిగాడు. గాయాల నుండి కోలుకున్న తర్వాత, వెర్నర్ డేనియల్స్తో శిక్షణ కోసం జర్మనీలోని ఆఫెన్బర్గ్కు వెళ్లాడు. అతని మాజీ కోచ్ కాల్వర్ట్ తన కాంట్రాక్టుపై వివాదాల కారణంగా మేలో భారతదేశాన్ని విడిచిపెట్టాడు.
2018 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల జావెలిన్ త్రోలో, అతను 86.47 మీటర్ల సీజన్-ఉత్తమ త్రోను నమోదు చేశాడు, కామన్వెల్త్ గేమ్స్లో జావెలిన్ త్రోలో గెలిచిన మొదటి భారతీయుడయ్యాడు. 2018 మేలో దోహా డైమండ్ లీగ్లో 87.43 మీటర్లు విసిరి జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.
2018 ఆగస్టు లో, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఆసియా క్రీడలలో చోప్రా అరంగేట్రం చేసాడు. ఆ ఆటలలో జరిగే దేశాల పరేడ్ లో భారత బృందానికి జెండా మోసాడు. ఆగస్టు 27 న, అతను 2018 ఆసియా క్రీడలలో పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించడానికి 88.06 మీటర్ల దూరం విసిరాడు, తన స్వంత జాతీయ రికార్డును మెరుగుపరుచుకున్నాడు. ఆసియా క్రీడల్లో జావెలిన్ త్రోలో భారతదేశానికి ఇదే మొదటి బంగారు పతకం. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న కోసం అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) సిఫారసు చేసిన ఏకైక ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ చోప్రా మాత్రమే, కానీ 2018 సెప్టెంబరులో అర్జున అవార్డును అందుకున్నాడు. నవంబరులో సైన్యం అతన్ని సుబేదార్ పదవికి ప్రమోట్ చేసింది.
తదనంతరం 2021 కి వాయిదా వేయబడిన, 2020 టోక్యో ఒలింపిక్స్కు చోప్రా తన జర్మన్ కోచ్ ఉవే హోన్, బయోమెకానిక్స్ నిపుణుడు క్లాస్ బార్టోనిట్జ్, ఫిజియోథెరపిస్ట్ ఇషాన్ మార్వా మార్గదర్శకత్వంతో శిక్షణ పొందాడు. 2018 - 2019 సమయంలో, హోన్ చోప్రా యొక్క త్రోయింగ్ టెక్నిక్ను మెరుగుపరిచాడు, హోన్ ప్రకారం ఇది గతంలో "అటవికం"గా ఉంది.
చోప్రా తన కుడి మోచేతి ఎముకలో స్పర్స్, దానికి సంబంధించిన శస్త్రచికిత్స కారణంగా దోహాలో 2019 ప్రపంచ పోటీలకు దూరమయ్యాడు. పటియాలాలో, విజయనగర్ లోని స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్ లో ధ్యానం, పునరావాస శిక్షణతో కొంతకాలం కోలుకున్న తర్వాత, చోప్రా జర్మన్ బయోమెకానిక్స్ నిపుణుడు క్లాస్ బార్టోనిట్జ్ దగ్గర శిక్షణ కోసం 2019 నవంబరులో దక్షిణాఫ్రికా వెళ్లాడు. గతంలో, అతనికి గ్యారీ కాల్వర్ట్ , వెర్నర్ డేనియల్స్ శిక్షణ ఇచ్చారు.
16 నెలల విరామం తరువాత 2020 జనవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన అథ్లెటిక్స్ సెంట్రల్ నార్త్ వెస్ట్ లీగ్ సమావేశంలో 87.86 మీటర్ల త్రో గెలిచి అంతర్జాతీయ పోటీలలో తిరిగి ప్రవేశించాడు. ఈ 85 మీటర్లపై త్రోతో టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే అర్హత సాధించాడు.
దక్షిణాఫ్రికా తరువాత, చోప్రా శిక్షణ కోసం టర్కీకి వెళ్లాడు, కాని COVID-19 మహమ్మారి కారణంగా 2020 మార్చిలో భారతదేశానికి తిరిగి రావలిసి వచ్చింది. భారతదేశంలో మహమ్మారి, లాక్డౌన్ కారణంగా, చోప్రా మరుసటి సంవత్సరం ఎనైఎస్ (NIS) పాటియాలాలో శిక్షణ పొందాడు. 2020 చివరలో, జాతీయ జావెలిన్ బృందం కోసం భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది, చోప్రా 2020 డిసెంబరు నుండి 2021 ఫిబ్రవరి వరకు దానికి హాజరయ్యారు.
2021 మార్చి 5 న, చోప్రా మళ్లీ 88.07 మీటర్లు విసిరి తన స్వంత జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు, అలాగే అంతర్జాతీయంగా మూడో ర్యాంక్ కు ఎదిగాడు.
మహమ్మారి కారణంగా, శిక్షణ కోసం స్వీడన్ వెళ్లడానికి కావాల్సిన వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. వారాల తరబడి ప్రయత్నించాక, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జోక్యంతో తన కోచ్తో కలిసి ఐరోపాకు వెళ్లడానికి అనుమతి దొరికింది. సమావేశం సిడాడ్ డి లిస్బోవా కోసం పోర్చుగల్కు వెళ్లడానికి ముందు అతను తప్పనిసరియైన నిర్బంధ వ్యవధి కోసం 2021 జూన్ 5 న పారిస్కు వెళ్లాడు. అతను తన అంతర్జాతీయ సీజన్ 2021 ను 83.18 మీటర్లు విసిరి అక్కడ ప్రారంభించాడు, అది అతనికి బంగారు పతకం సాధించింది. చోప్రా తన కోచ్ తో తదుపరి శిక్షణ కోసం స్వీడన్లోని ఉప్సలాకు వెళ్లే ముందు జూన్ 19 వరకు లిస్బన్లోనే ఉన్నాడు.
అతను జూన్ 22 న స్వీడన్లో జరిగిన కార్ల్స్టాడ్ మీట్లో పాల్గొన్నాడు, అక్కడ అతను 80.96 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత ఫిన్లాండ్ లో జరిగిన కుర్టేన్ ఆటలలో 86,79 మీటర్ల త్రోతో కాంస్యం గెలుచాడు. కుర్టేన్ ఆటల తరువాత మరో పొటీకై స్విట్జర్లాండ్ లోని లూసర్న్ కు ప్రయాణించాడు కానీ అలసట కారణంగా ఉపసంహరించుకున్నాడు. అతను జూలై 13 న గేట్స్హెడ్లో జరిగే డైమండ్ లీగ్లోకి ప్రవేశించడానికి యునైటెడ్ కింగ్డమ్ వీసా పొందడానికి ప్రయత్నించాడు, కానీ మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. బదులుగా ఉప్సలాలో తన నైపుణ్యం మెరుగుకై శిక్షణ కొనసాగించాడు.
2021 ఆగస్టు 4 న, జపాన్ జాతీయ స్టేడియంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి చోప్రా ఒలింపిక్స్లో అరంగేట్రం చేశాడు. ఫైనల్కు ప్రవేశించడానికి అతను తన అర్హత గుంపులో 86.65 మీటర్లు విసిరాడు. ఆగస్టు 7 న తన రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లు విసిరి ఫైనల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు, అథ్లెటిక్స్లో స్వర్ణ పతకం సాధించిన మొదటి భారతీయ ఒలింపియన్గా, అథ్లెటిక్స్లో స్వతంత్ర భారత్ తొలి ఒలింపిక్ పతక విజేతగా నిలిచాడు. చోప్రా పతకంతో కలిపి 2020 ఒలింపిక్స్లో భారతదేశం మొత్తం ఏడు పతకాలు గెలిచింది, 2012 లండన్ ఒలింపిక్స్లో గెలిచిన ఆరు పతకాల ఉత్తమ ప్రదర్శనను అధిగమించింది. టోక్యోలో అతని ప్రదర్శన ఫలితంగా, చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో అంతర్జాతీయంగా రెండవ ర్యాంక్ అథ్లెట్ అయ్యాడు. 2008 సమ్మర్ ఒలింపిక్స్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో బంగారు పతకం సాధించిన అభినవ్ బింద్రా తర్వాత వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న రెండో భారతీయుడిగా చోప్రా నిలిచాడు. అతను తన విజయాన్ని స్ప్రింటర్స్ మిల్కా సింగ్, PT ఉష, భారతదేశ మాజీ ఒలింపియన్లకు అంకితమిచ్చాడు.
సంవత్సరం | పనితీరు | స్థలం | తేదీ |
---|---|---|---|
2013 | 69.66 మీటర్లు | పాటియాలా, భారతదేశం | 26 జూలై |
2014 | 70.19 మీటర్లు | పాటియాలా, భారతదేశం | 17 ఆగస్టు |
2015 | 81.04 మీటర్లు | పాటియాలా, భారతదేశం | 31 డిసెంబరు |
2016 | 86.48 మీటర్లు | బైడ్గోస్జ్జ్, పోలాండ్ | 23 జూలై |
2017 | 85.63 మీటర్లు | పాటియాలా, భారతదేశం | 2 జూన్ |
2018 | 88.06 మీటర్లు | జకార్తా, ఇండోనేషియా | 27 ఆగస్టు |
2020 | 87.86 మీటర్లు | దక్షిణ ఆఫ్రికా | 28 జనవరి |
2021 | 88.07 మీటర్లు | పాటియాలా, భారతదేశం | 5 మార్చి |
2022 | 88.13 మీటర్లు | యుజీన్, అమెరికా | 24 జూలై |
This article uses material from the Wikipedia తెలుగు article నీరజ్ చోప్రా, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.