రైతు వేదిక రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయం, సాగు చేసే పంటల గురించి చర్చించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది.
ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ను ఏర్పాటుచేసి ఒక్కో క్లస్టర్కు ఒక రైతు వేదికను ఒక్కో వేదిక నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.22 లక్షలతో నిర్మించి అందుబాటులోకి తెచ్చారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయరంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకుగాను నిష్ణాతులైన శాస్త్రవేత్తలతో రైతు వేదికలలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణకు వచ్చే రైతులకు టీ, టిఫిన్లను సైతం అందిస్తున్నారు.
తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు ఉపాధిహామీ నిధులతో పాటు వ్యవసాయశాఖ నిధులు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రూ.573 కోట్లతో 2,604 రైతు వేదికలను నిర్మించారు. ఈ రైతు వేదిక ద్వారా సమావేశాలు, చర్చలు నిర్వహించడంతో పాటు గోడౌన్ గానూ ఈ వేదికలను ఉపయోగిస్తున్నారు. ప్రతి ఐదు వేల ఎకరాల సాగు విస్తీర్ణాని వ్యవసాయ క్లస్టర్గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారు (ఏఈఓ) లను నియమించి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా 2604 క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
ప్రతి రైతు వేదికలో ఏఈఓ, రైతువేదిక కో–ఆర్డినేటర్లకు ఒకటి చొప్పున చాంబర్, 200మంది రైతులు కూర్చునేందుకు వీలుగా సమావేశ మందిరం, రిసెప్షన్, రెండు మరుగుదొడ్లు నిర్మించారు. ఒక్కోవేదిక కోసం కనీసం అర ఎకరం, భూమి లభ్యత ఉన్న చోట ఎకరం ప్రభుత్వం కేటాయించింది. రైతు వేదిక నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక తొలి భవనాన్ని జనగామ జిల్లా కొడకండ్లలో 31 అక్టోబర్ 2020న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
రైతు వేదికల్లో శిక్షణ ద్వారా రైతులను మరింత సుశిక్షితులను చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. రైతు వేదికల నిర్వహణ, వాటి ద్వారా కర్షకులకు అందుతున్న సేవలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, ఒక్కో రైతు వేదిక నిర్వహణకు 2022 ఏప్రిల్ నెల నుండి నెలకు 9 వేల రూపాయల చొప్పున అందజేసేందుకు నిర్ణయించింది. ఈ నిధులతో రైతు వేదికల కరెంట్ బిల్లు, మౌలిక వసతుల కల్పన, మురుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యాలు కల్పించనున్నారు. గతంలోనే ఈ రైతు వేదికల నిర్వహణ కోసం ప్రతినెలా 3 వేల రూపాయలను ఇవ్వడంతోపాటు రైతుల సమావేశాల నిమిత్తం కుర్చీలు, టేబుళ్ళను అందజేసింది.
This article uses material from the Wikipedia తెలుగు article రైతు వేదిక (తెలంగాణ), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.