భారత అత్యవసర స్థితి

అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా అత్యవసర స్థితిని విధించిన 1975-77 మధ్యకాలంలోని 21-నెలల కాలాన్ని భారత అత్యవసర స్థితి లేదా ఎమర్జెన్సీగా వ్యవహరిస్తారు.

భారత రాజ్యాంగంలోని 352 (1) అధికరణంలో అంతర్గత కల్లోల స్థితిని ఉద్దేశించి ఏర్పరిచిన అంతర్గత అత్యవసర స్థితిని వినియోగించుకుని అప్పటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ద్వారా 1975 జూన్ 25 అర్థరాత్రి 11.45 నిమిషాలకు అధికారికంగా విధింపజేశారు. 1977 మార్చి 21లో ఉపసంహరించే వరకూ కొనసాగింది. ఆదేశాల ద్వారా పరిపాలిస్తూ ఎన్నికలను నిలిపివేసి, పౌరహక్కులు అడ్డుకునే అధికారాన్ని ప్రధాన మంత్రికి ఈ ఆర్డర్ అందించింది. ఎమర్జెన్సీలో ప్రధానంగా ఇందిరా గాంధీ రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేసి, పత్రికలను సెన్సార్ చేశారు. ప్రధానమంత్రి కుమారుడు సంజయ్ గాంధీ ముందుండి నడిపిన మాస్-స్టెరిలైజేషన్ (సామూహిక గర్భనివారణ కార్యక్రమం) వంటి ఇతర దురాగతాలు కూడా నివేదితం అయ్యాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన కాలాల్లో ఎమర్జెన్సీ ఒకటి.

భారత అత్యవసర స్థితి
ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్తో 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకూ జాతీయ అంతర్గత అత్యవసర స్థితిని విధింపజేసిన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ

నేపథ్యం

ఇందిరా గాంధీ ఎదుగుదల

"ఇందిరయే ఇండియా, ఇండియానే ఇందిరా."

—కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె.బారువా, c. 1974

1971 నాటికి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ పార్టీపైనా పూర్తి ఆధిక్యతను సాధించింది, అలాగే పార్లమెంట్ లో భారీ మెజారిటీ కూడా పొందారు. ప్రభుత్వంపై పట్టును సాధించేందుకు క్యాబినెట్ చేతిలోంచి కేంద్ర ప్రభుత్వ అధికారాలు ప్రధాని కార్యాలయం తీసేసుకుంది. క్యాబినెట్ మంత్రులు అధికార కేంద్రాలుగా మారతారన్న భయంతో ఈ పనిచేశారు. ఈ క్రమంలో కిచెన్ క్యాబినెట్ గా వ్యవహరించే ఆమె అంతర్గత సలహాదారుల బృందంలోని ముఖ్యుడు, ముఖ్యకార్యదర్శి పి.ఎన్.హస్కర్ పై నమ్మకాన్ని పెట్టుకున్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాధికారులు అన్న ఆలోచనను కూలదోసి హస్కర్ ఆప్పటి అధికారంలోని పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించేలాంటి పద్ధతులు తీసుకువచ్చారు.

ఇందిర కాంగ్రెస్ పార్టీలోని తన ప్రత్యర్థులను తీవ్రంగా అణచివేశారు, ఆ క్రమంలో పార్టీ 1949లో కాంగ్రెస్ (ఓ) (ఓ అంటే ఆర్గనైజేషన్, సిండికేట్ గా పేరొందిన కాంగ్రెస్ పాతనేతలు ఇందులో ఉన్నారు), ఇందిర యొక్క కాంగ్రెస్ (ఆర్) కింద విడిపోయింది. ఆలిండియా కాంగ్రెస్ కమిటీలోనూ, పార్టీ ఎంపీల్లోనూ ఎక్కువభాగం ప్రధాని ఇందిర పక్షం వహించారు. పూర్వపు కాంగ్రెస్ పార్టీ పద్ధతుల్లోని అంతర్గత ప్రజాస్వామ్యం వంటివి లేకుండా ఇందిర పార్టీ విధానాలు వ్యతిరక్తంగా తయారయ్యాయి. కాంగ్రెస్ (ఆర్) లో నాయకులు ఇందిరా గాంధీకి, ఆమె కుటుంబానికి విధేయంగా, సన్నిహితంగా ఉండడం వల్లనే తాము పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నత పదవులు పొందగలమని తెలుసుకున్నారు. మితిమీరిన పొగడ్తలు సర్వసాధారణమైపోయింది. కాంగ్రెస్ శాసనసభా పక్షం నుంచి ఎన్నికవడానికి మారుగా ముఖ్యమంత్రులుగా ఇందిర తనకు విధేయుల్ని నేరుగా నియమించే పద్ధతులు ప్రబలాయి.

ఆమె ప్రభుత్వం 1969లో బ్యాంకుల జాతీయీకరణ, 1970లో రాజభరణాల రద్దు వంటి వామపక్ష అనుకూల, ప్రజారంజకమైన కార్యకలాపాలు చేపట్టడంతో ప్రజల్లో ఆమె పలుకుబడి పెరిగింది. ఆ పలుకుబడి వల్ల ఇందిరకు తన మాట చెల్లించుకోగల సామర్థ్యం వచ్చింది. ఈ కార్యకలాపాలు కూడా హఠాత్తుగా ఆర్డినెన్సుల ద్వారా చేపట్టి తన ప్రత్యర్థులను షాక్ కి గురిచేసేవారామె. సిండికేట్, ఇతర ప్రత్యర్థుల ఇమేజికి భిన్నంగా, ఇందిరను "ఆర్థికరంగంలో సోషలిజం, మతపరంగా లౌకికత్వం, పేదల పక్షపాతంతో మొత్తానికి దేశాభివృద్ధికి అనుకూలురాలిగా" భావించేవారు.

1971 సాధారణ ఎన్నికల్లో, ప్రజలను ఇందిరా గాంధీ ఇచ్చిన గరీబీ హఠావో! (పేదిరక నిర్మూలన) అన్న నినాదం ఉత్తేజపరిచింది. ఆ ఎన్నికల్లో ఆమెకు 518 లోక్ సభ స్థానాలకు 352 భారీ ఆధిక్యత లభించింది. చరిత్రకారుడు రామచంద్ర గుహ అనంతరకాలంలో రాసినట్టు "ఆ భారీ విజయంతో కాంగ్రెస్ (ఆర్) తన ఉనికిని గుర్తుచేసే (ఆర్) అన్న ప్రత్యయం అవసరం లేకుండా నిజమైన కాంగ్రెస్ గా పేరొందింది". డిసెంబరు 1971లో, ఆమె యుద్ధ నాయకత్వంలో భారతదేశం బంగ్లాదేశ్ విమోచనాన్ని విజయవంతంగా నిర్వహించింది. తన ఆగర్భ శత్రువైన పాకిస్తాన్ ను యుద్ధంలో ఓడించి, అప్పటివరకూ తూర్పు పాకిస్తాన్ గా ఉన్న ప్రాంతాన్ని బంగ్లాదేశ్ అన్న నూతన దేశంగా ఏర్పరచడంలో భారతదేశం, అందునా ప్రధాని ఇందిర, ముఖ్య పాత్ర వహించారు. తర్వాతి నెలలో భారతరత్న పురస్కారం అందుకుని తన జీవితంలో అత్యున్నత శిఖరం అనదగ్గ కాలాన్ని అనుభవించారు. ఆమె జీవితచరిత్రకారుడు ఇందర్ మల్హోత్రా ప్రకారం అప్పటికి "ద ఎకనమిస్ట్ అభివర్ణించినట్టుగా భారత సామ్రాజ్ఞి అన్న పదం సరిపోయిందన్నట్టుగా తోచింది". లోక్ సభలో ఆమెను సాధారణంగా నియంతలా వ్యవహరిస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని గురించి భట్రాజు పొగడ్తలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించే ప్రతిపక్ష నేతలే ఆమెను దుర్గ, చండి అంటూ ప్రశంసించారు. ఇందిరను దుర్గగా వాజపేయి అభివర్ణించారని ప్రతీతి, కానీ ఆయన ఒక ఇంటర్వ్యూలో కాదని చెప్పారు

న్యాయవ్యవస్థపై ప్రభుత్వం నియంత్రణ

ప్రఖ్యాత గోలక్ నాథ్ కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం మౌలికాంశాలైన ప్రాథమిక హక్కులు వంటివాటిని ప్రభావితం చేస్తూన్నప్పుడు రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించకూడదని వ్యాఖ్యానించింది. ఈ తీర్పును రద్దుచేస్తూ ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ ఆధిక్యతలో ఉన్న పార్లమెంట్ 1971లో ప్రాథమిక హక్కులను ప్రభావితం చేసేలాంటి రాజ్యాంగ సవరణలు కూడా చేయొచ్చన్న 24వ సవరణ ఆమోదించింది. పూర్వపు రాజులు, జమీందార్లకు ఇచ్చిన రాజాభరణాలు రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకమైన తీర్పునిస్తే 26వ సవరణ తీసుకువచ్చారు. దానిలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పును రద్దుచేసే విధంగా రాజభరణాల రద్దును రాజ్యాంగబద్ధం చేశారు. ఈ న్యాయవ్యవస్థ-శాసనవ్యవస్థల నడుమ యుద్ధం చారిత్రాత్మక కేశవానంద భారతి కేసు వరకూ కొనసాగింది. ఈ కేసు తీర్పులో 24వ సవరణ ప్రశ్నించబడింది. అతికొద్ది 7-6 ఆధిక్యతతో, సుప్రీంకోర్టు ధర్మాసనం పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరణ చేసే హక్కును నియత్రిస్తూ రాజ్యంగ మౌలిక నిర్మాణాన్ని మార్చేందుకు వినియోగించరాదని తీర్పునిచ్చింది. తదనంతరం కేశవానంద భారతి కేసులో తీర్పుని వ్యతిరేకించిన మైనారిటీలోకెల్లా సీనియర్ అయిన ఎ.ఎన్.రేని భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రధాని ఇందిర నియమించారు. ఈ నియామకంలో తీర్పుకు అనుకూలమైన మెజారిటీలోని ముగ్గురు సీనియర్ జడ్జిలు - జె.ఎం.షెలాత్, కె.ఎస్.హెడ్గే, గ్రోవర్ లను అధిగమించి రేని పదవి వరించింది. స్వతంత్రంగా ఉండాల్సిన న్యాయవ్యవస్థను ఇందిర నియంత్రించే ప్రయత్నాలు చేయడాన్ని అటు పత్రికలు, ఇటు జయప్రకాశ్ నారాయణ్ వంటి ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

రాజకీయ అలజడి

1973-75 కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త రాజకీయ ఆందోళనలు చెలరేగాయి. (దీనివల్ల కొందరు కాంగ్రెస్-పార్టీ నేతలు మరింత శక్తిని ఎన్నికైన పరిపాలకుని చేతిలో పెట్టేలాంటి ప్రెసిడెంట్ విధానం కావాలని కోరారు). డిసెంబరు 1973 నుంచి మార్చి 1974 వరకూ గుజరాత్ లో సాగిన నవ నిర్మాణ్ ఉద్యమం వీటన్నిటిలోనూ ప్రసిద్ధిపొందింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా సాగిన విద్యార్థి ఉద్యమం చినికి చినికి గాలివానగా మారి ప్రభుత్వాన్ని రద్దుచేసేదాకా సాగింది. ఉద్యమం, ఆందోళనల ఫలితంగా ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్ భాయ్ పటేల్ రాజీనామా, ఆపైన రాష్ట్రపతి పాలన విధింపు జరిగాయి. 1977లో తిరిగి ఎన్నికలు జరిగాకా ఇందిర కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన జనతా కూటమి చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది. మార్చి-ఏప్రిల్ 1974లో బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీహార్ ఛాత్ర సంఘర్ష్ సమితి చేసిన విద్యార్థి ఉద్యమానికి జెపిగా వ్యవహరించే గాంధేయ సోషలిస్టు, ప్రముఖ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ మద్దతు లభించింది. 1974 ఏప్రిల్లో పాట్నాలో జెపి విద్యార్థి, రైతు, కార్మిక సంఘాలు అహింసాయుతంగా భారతీయ సమాజాన్ని మార్చాలంటూ "సంపూర్ణ విప్లవానికి" పిలుపునిచ్చారు. అలానే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు, కానీ కేంద్రం అంగీకరించలేదు. నెలరోజుల తర్వాత దేశంలోకెల్లా అతిపెద్ద యూనియన్ అయిన భారతీయ రైల్వే ఉద్యోగుల యూనియన్ దేశవ్యాప్త సమ్మె చేసింది. వేలాదిమంది కార్మికులను నిర్బంధించి, వారి కుటుంబాలను రైల్వే క్వార్టర్స్ నుంచి తరిమివేసి ఇందిరా గాంధీ ప్రభుత్వం ఈ సమ్మెను దారుణంగా అణచివేసింది. పార్లమెంటులో కూడా ప్రభుత్వం చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. 1966లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇందిరా గాంధీ లోక్ సభలో 10 అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నారు.

రాజ్ నారాయణ్ తీర్పు

1971 పార్లమెంటరీ ఎన్నికల్లో ఇందిరా గాంధీ చేతిలో ఓడిపోయిన రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో ఇందిరా గాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం వినియోగించుకున్నారని కేసు దాఖలుచేశారు. నారాయణ్ తరఫున రాజకీయ నాయకుడు, న్యాయవాది శాంతి భూషణ్ వాదించారు. ఇందిరా గాంధీ ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు హాజరుకావాల్సివచ్చింది. ఓ ప్రధాని కేసు విచారణలో ప్రశ్నించబడడం అదే తొలిసారి. 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జగ్మోహన్ లాల్ సిన్హా ప్రధాని మీద ఆరోపణలు వాస్తవమని తేలిందంటూ కేసు తీర్పునిచ్చారు. ఆమె ఎన్నిక చెల్లదంటూ తీర్పునివ్వడమే కాక, ఆరేళ్ళపాటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని రద్దుచేశారు. ఓటర్లకు లంచాలివ్వడం, ఎన్నికల అక్రమాలు వంటి ఆరోపణలు వీగిపోయాయి, కానీ ఆమె ప్రభుత్వ యంత్రాగాన్ని తప్పుగా వినియోగించుకున్న అంశంలో నేరస్తురాలని తేలింది. ఈ నేరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సభలకు వేదికలు నిర్మించడం, వాటికి రాష్ట్ర విద్యుత్తు విభాగం నుంచ విద్యుత్తు వినియోగించుకోవడం, అప్పటికి రాజీనామా చేయని ప్రభుత్వాధికారి యశ్ పాల్ పూర్తయ్యేలా చూడమని దర్శకుడు అన్నారు.
ఇందిరపై మరింత తీవ్రమైన ఆరోపణలు ఉన్నా అవి తొలగి వాటితో పోలిస్తే అల్పమైన ఆరోపణల వల్ల ఆమెను పదవి నుంచి తొలగించడంతో, ద టైమ్స్ ఈ పరిణామాన్ని ట్రాఫిక్ టికెట్ మీద ప్రధానమంత్రిని పదవిలోంచి తలొగించడంగా అభివర్ణించింది. ఐతే వ్యాపార, విద్యార్థి, ప్రభుత్వ ఉద్యోగ యూనియన్లు చేసిన ఆందోళనలతో దేశంలోని పలు ప్రాంతాలు స్తంభించిపోయాయి. జెపి, రాజ్ నారాయణ్, సత్యేంద్ర నారాయణ్ సిన్హా, మొరార్జీ దేశాయిల నాయకత్వంలో ఢిల్లీలో చేసిన ఆందోళనలో పార్లమెంట్ భవనం, ప్రధాని నివాసాలకు దగ్గర్లోని రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. ప్రధానికి వ్యతిరేకంగా జస్టిస్ సిన్హా తీర్పునివ్వడానికి దాదాపు నాలుగేళ్ళు పట్టడంతో నారాయణ్ నిరంతర ప్రయత్నాలు, పట్టుదల ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి.
ఇందిరా గాంధీ హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాలుచేశారు. జస్టిస్ వి. ఆర్. కృష్ణ అయ్యర్ 1975 జూన్ 24న హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, ఎంపీగా ఇందిర పొందుతున్న అన్ని సౌకర్యాలను ఆపివేయాలని, ఓటింగు నుంచి నిరోధించాలని ఆదేశించారు. ఐతే ఆమె ప్రధానిగా కొనసాగడానికి అనుమతించారు.

మూలాలు

Tags:

భారత అత్యవసర స్థితి నేపథ్యంభారత అత్యవసర స్థితి మూలాలుభారత అత్యవసర స్థితి1975ఇందిరా గాంధీజూన్ 25ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్భారత రాజ్యాంగంసంజయ్ గాంధీస్వతంత్ర భారతదేశ చరిత్ర

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతీయ శిక్షాస్మృతినీతి ఆయోగ్సప్త చిరంజీవులుకాలుష్యంఆప్రికాట్మానవ జీర్ణవ్యవస్థజ్ఞాన సరస్వతి దేవాలయం, బాసరవిటమిన్ బీ12తెలుగు కవులు - బిరుదులుపోషకాహార లోపంపది ఆజ్ఞలుపవన్ కళ్యాణ్సమాసంపెరుగుఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్డొక్కా మాణిక్యవరప్రసాద్పేర్ని వెంకటరామయ్యవడ్డీనువ్వు నేనుఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంఅంగారకుడు (జ్యోతిషం)సిద్ధార్థ్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాఆహారంసుకన్య సమృద్ధి ఖాతావాయల్పాడు శాసనసభ నియోజకవర్గంవిశ్వామిత్రుడునువ్వులుసోనియా గాంధీభారతదేశ జిల్లాల జాబితాసావిత్రి (నటి)తేటగీతితెనాలి రామకృష్ణుడుయోగి ఆదిత్యనాథ్సూర్యుడుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిరామోజీరావుభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుప్రకాష్ రాజ్పరకాల ప్రభాకర్శ్రీముఖిభారత రాజ్యాంగ సవరణల జాబితానాయుడుకోదండ రామాలయం, ఒంటిమిట్టసంధ్యావందనంకాకతీయులుమకరరాశిసన్ రైజర్స్ హైదరాబాద్రామాయణంసాయిపల్లవినిర్మలా సీతారామన్చరవాణి (సెల్ ఫోన్)మృగశిర నక్షత్రముక్రికెట్సత్యనారాయణ వ్రతంభారత రాజ్యాంగ పీఠికసౌర కుటుంబంనన్నయ్యడి. కె. అరుణమండల ప్రజాపరిషత్శుక్రుడు జ్యోతిషంరెడ్డిఆవుశివుడుఏప్రిల్ 27అయోధ్యవర్షంఅర్జునుడుతిరుపతినామవాచకం (తెలుగు వ్యాకరణం)అమరావతిహనుమాన్ చాలీసాపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంఆటలమ్మ2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలంగాణ చరిత్రకుతుబ్ షాహీ సమాధులు🡆 More