2022 అక్టోబరు 30న గుజరాత్లోని మోర్బీ జిల్లాలో మచ్చు నదిలో కేబుల్ వంతెన కూలిన ఘటన సంభవించింది.
ఈ వంతనను భారతదేశంలోని గుజరాత్లోని మోర్బీలో మచ్చు నదిపై 150 ఏళ్ల క్రితం నిర్మించారు. దీనిని స్థానికులు ఝూల్తా పుల్ (ఊగే వంతెన) అని అంటారు. 2022 అక్టోబరు 30న సాయంత్రం 6:40 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. ఆ సమయంలో వంతెనపై దాదాపు ఐదు వందల మంది ఉన్నారని అనధికార సమాచారం. ఒక్కసారిగా తీగల వంతెన కూలిన ఘోర దుర్ఘటనలో 78 మంది ప్రాణాలు కోల్పోగా అధిక సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు నది నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నారు. మరికొందరు ప్రవాహంలో కొట్టుకుపోయారు. త్రివిధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. అయినా మృతుల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది. మరుసటిరోజు ఉదయానికి 132 మంది మరణించినట్టుగా అధికారులు లెక్క తేల్చారు. 177 మందిని రక్షించామన్నారు.
సమయం | 6:40 p.m. IST |
---|---|
తేదీ | 2022 అక్టోబరు 30 |
ప్రదేశం | మోర్బి, గుజరాత్, భారతదేశం |
భౌగోళికాంశాలు | 22°49′06″N 70°50′34″E / 22.81833°N 70.84278°E |
మరణాలు | 132 |
గాయపడినవారు | 100+ |
ఈ వంతెన మోర్బి మునిసిపాలిటీకి చెందినది. కాగా 2001 భూకంపం తర్వాత మరమ్మతుల కోసం ప్రైవేట్ ట్రస్ట్ ఒరెవాతో ఒప్పందం చేసుకుని గత కొంత కాలంగా మూసివేసారు. గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా ఈ వంతెనను 2022 అక్టోబరు 26 న తిరిగి తెరిచారు. దీపావళి సెలవులకు తోడు ఆదివారం కూడా కావడంతో ఈ వంతెన వద్ద పర్యాటకుల రద్దీ బాగా ఉంది. సందర్శకుల సంఖ్య మరీ ఎక్కువ కావడంతో అధిక బరువును మోయలేక వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. మరమ్మతుల అనంతరం వంతెన ప్రారంభించిన నాలుగు రోజులకే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఝూల్తా పుల్ అనేది 19వ శతాబ్దంలో భారతదేశంలో బ్రిటిష్ పాలనలో నిర్మించబడిన 765 అడుగుల పొడవైన పాదచారుల వంతెన. దీన్ని 1879 ఫిబ్రవరి 20న ప్రారంభించారు. దర్బార్గఢ్ - నాజర్బాగ్ను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనకు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. 3.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసిన వంతెనకు అవసరమైన మెటీరియల్ ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు. ఈ వంతెనను 1879 ఫిబ్రవరి 20న బాంబే గవర్నర్ రిచర్డ్ టెంపుల్ ప్రారంభించాడు.
ఈ ఘటనపై స్పందించిన గుజరాత్ ప్రభుత్వం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. దీని కోసం ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని హోం మంత్రి హర్ష్ సంఘ్వి తెలిపాడు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బ్రిజేష్ మెర్జా ప్రకటించారు. తీగల వంతెన కూలిపోయిన ఘటనలో సభ్యుడిని కోల్పోయిన కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన బాధితులకు యాబై వేల రూపాయలు అందజేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ PMO ఇండియాలో ప్రకటించారు.
ఈ దుర్ఘటనలో 2022 నవంబరు 1వ తేదీ ఉదయానికి మృతుల సంఖ్య 135కి చేరింది. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారు. పలువురి ఆచూకీ గల్లంతు కావడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తన సొంత రాష్ట్రం గుజరాత్ లో జరిగిన ఈ దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మోర్బీలో తీగల వంతెన కూలిపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, సంఘటన స్థలంలో జరుగుతున్న సహాయక చర్యల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, ఈ ప్రమాదంలో గాయపడి మోర్బీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, వారు ధైర్యంగా ఉండాలని అన్నారు. ఆపై, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అధికారులతో మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
This article uses material from the Wikipedia తెలుగు article 2022 మోర్బీ తీగల వంతెన ప్రమాదం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.