తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలలో ఒకటి.
జిల్లా కేంద్రం తిరుపతి. 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాలలో భాగాలతో కలిపి ఈ జిల్లా 2022 ఏప్రిల్ లో ఏర్పడింది. రాయలసీమ ప్రాంతంలోని ఎనిమిది జిల్లాలలో ఇది ఒకటి. జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ పుణ్యక్షేత్రమైన తిరుమల వేంకటేశ్వర దేవాలయం, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఇతర చారిత్రక దేవాలయాలు ఉన్నాయి. జిల్లాలో శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలి, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఉన్నాయి.
తిరుపతి జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
విభాగం | రాయలసీమ |
స్థాపన | 2022 ఏప్రిల్ 4 |
Founded by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
జిల్లా కేంద్రం | తిరుపతి |
Area | |
• Total | 9,174 km2 (3,542 sq mi) |
Population | |
• Total | 22,18,000 |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
Website | అధికార వెబ్ సైట్ |
ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని (సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం) కలిపి ఈ జిల్లాను ఏర్పరచినందున ఆయా జిల్లాల చరిత్రలే దీనికి ఆధారం.
ఇది తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అన్నమయ్య జిల్లా,చిత్తూరు జిల్లాలు, ఉత్తరాన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,అన్నమయ్య జిల్లాలు, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, చిత్తూరు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 9174 చదరపు కిలోమీటర్లు. ఇది రాష్ట్ర మొత్తం వైశాల్యంలో 5.63 శాతం. జిల్లాలోని పర్వత ప్రాంతం సాధారణ ఎత్తు సముద్ర మట్టంపై 2500 అడుగులు.
గూడురులో మైకా గనులున్నాయి.
తూర్పు కొండలలో భాగమైన శేషాచల కొండలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వృక్ష, జంతు సంరక్షణ జరుగుతుంది. అంతరించి పోతున్న వృక్షాలను పోషించడమే కాక ఇక్కడ ఔషధ మొక్కల పెంపకం కూడా జరుగుతుంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఒక పరిశోధక బృందం ఇక్కడ నిరంతర పరిశోధనలు సాగిస్తున్నది. ఇక్కడ ఇలియాన్ షెల్డి టైల్ అనే కొత్త పామును కనుగొన్నారు. స్లెండర్ కోరల్ స్నేక్ అనే విషపూరిత పామును 2009లో కనుగొన్నారు. ఇది దేశంలో మరెక్కడా కనిపించని అరుదైన పాము. బెట్లుడత ఇది ఇండియన్ జైంట్ స్కైరల్ అని పిలువబడే ఈ ఉడుత బరువు 2.5 కిలోలు ఉంటుంది. బంగ్లాదేశ్, శ్రీ లంకలో ఉండే ఈ ఉడుత భారతదేశంలో ఇది తిరుమల కొండలలో మాత్రమే కనిపిస్తుంది అని పరిశోధకులు అభిప్రాయం. బంగారు బల్లి (గోల్డ్ గెకోగా) పిలువబడే పూర్తి బంగారువర్ణంతో కనిపించే ఈ బల్లి తిరుమల కొండలలో శిలాతోరణం, కపిల తీర్థం వద్ద కనిపిస్తుంది. దేవాంగ పిల్లి (స్లెండర్ లోరీన్)గా పిలువబడే ఈ జంతువు భారతదేశంలో, శ్రీలంకలో కనిపిస్తుంది. తిరుమలలో మాత్రమే కనిపించే ఇది రాత్రివేళలో సంచరిస్తూ కీటకాలను తింటూ చెట్ల కొమ్మల మీద జీవిస్తుంది. ఇక్కడ కనబడే బూడిద రంగు అడవి కోళ్ళు ప్రపంచంలో మరెక్కడా లేవని పరిశోధకుల అభిప్రాయం. శ్రీ వెంటేశ్వర జంతుప్రదర్శనశాలలో వీటి పునరుత్పత్తి కార్యక్రమాలు ప్రారంభించారు.
జాతీయ రహదారులు:
జిల్లాలో గల విశ్వవిద్యాలయాలు
జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, అవి గూడూరు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, తిరుపతి. ఈ రెవెన్యూ డివిజన్లు 34 మండలాలుగా విభజించబడ్డాయి. ఈ జిల్లాలో 822 గ్రామ పంచాయతీలు, 1107 గ్రామాలు ఉన్నాయి.
తిరుపతి డివిజన్, సూళ్లూరుపేట డివిజన్లలో ఒక్కొక్కటి 9 మండలాలు, గూడూరు డివిజన్, శ్రీకాళహస్తి డివిజన్లలో 8 మండలాలు ఉన్నాయి . రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 34 మండలాలు క్రింద ఇవ్వబడ్డాయి:
జిల్లాలో 1107 గ్రామాలు, 822 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
జిల్లాలో తిరుపతి నగరం, శ్రీకాళహస్తి, గూడూరు, సూళ్లూరుపేట, పుత్తూరు, వెంకటగిరి, నాయుడుపేట పట్టణాలున్నాయి. ఏర్పేడు, సత్యవేడు, పాకాల 2011 జనాభా లెక్కల ప్రకారం జనగణన పట్టణాలుగా నమోదయ్యాయి.
వరుస సంఖ్య | పేరు | పట్టణ స్థానిక సంస్థ రకం | జనాభా (2011 జనాభా లెక్కలు) |
---|---|---|---|
1 | తిరుపతి | నగర పాలక సంస్థ | 2,87,035 |
2 | శ్రీకాళహస్తి | పురపాలక సంఘం గ్రేడ్ - 1 | 80,056 |
3 | గూడూరు | పురపాలక సంఘం గ్రేడ్ - 1 | 74,047 |
4 | పుత్తూరు | పురపాలక సంఘం గ్రేడ్ - 3 | 54,092 |
5 | వెంకటగిరి | పురపాలక సంఘం గ్రేడ్ - 3 | 52,688 |
6 | సూళ్లూరుపేట | పురపాలక సంఘం గ్రేడ్ - 3 | 41,952 |
7 | నాయుడుపేట | నగర పంచాయతీ | 40,828 |
తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిగా జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా, కొన్ని మండలాలకు జిల్లాకేంద్రం దగ్గరగా ఉంచడానికి, జిల్లా పరిధిలో సర్దుబాట్లు చేశారు.
అసెంబ్లీ నియోజకవర్గాలు: (7)
రేణిగుంటలో ఎలాయ్ కాస్టింగ్, ఎస్వి షుగర్స్, అశ్వినీ ఫార్మసీ, సెమీ గవర్నమెంట్ మింటు ఫ్యాక్టరీ ఉన్నాయి. ఇక్కడే రైలు పెట్టెల మరమ్మత్తు కర్మాగారం ఉంది. ఇతర పరిశ్రమలలో కొన్ని:
రాష్ఠ్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా పరిగణిస్తున్న సత్యవేడు, వరదయ్యపాలెం మండలాలను పారిశ్రామికంగా అభివృద్ధి పరచి, అక్కడి ప్రజలకు ఉపాధిని కల్పించడంతోపాటు, ప్రపంచస్థాయి గుర్తింపు తేవాలన్న ధ్యేయంతో, 2006లో శ్రీసిటీ పేరుతో ఇక్కడ ఒక ప్రత్యేక ఆర్థిక మండలిని స్థాపించటానికై ప్రభుత్వం అనుమతించింది. ఆ మండలాల పరిధిలో, ఆంధ్ర- తమిళనాడు రాష్ఠ్రాల దక్షిణ సరిహద్దుకు చేరువలో, బాగా వెనుకబడిన 14 గ్రామాలలోని వ్యవసాయానికి పనికిరాని లేదా అతితక్కువ ఫలసాయం ఇచ్చే భూములలో 2008 ఆగస్టు 8న శ్రీసిటీ ప్రారంభమైనది. అనతి కాలంలోనే వివిధ దేశాలకు చెందిన అనేక భారీ పరిశ్రమల స్థాపనతో, శ్రీసిటీ ప్రగతి ప్రస్థానంలో పరగుతీస్తూ, ప్రపంచ వాణిజ్య పటంలో ప్రముఖ స్థానాన్ని పొందింది. దేశ, విదేశ సంస్థల ఎగుమతి వాణిజ్య సౌలభ్యం కొరకు 3800 ఎకరాలలో ఏర్పరచిన 'ప్రత్యేక ఆర్థిక మండలి' [Secial Economic Zone (SEZ) - సెజ్], 2200 ఎకరాలలో దేశీయ ఉత్పత్తుల వాణిజ్య కేంద్రం (Domestic Tariff Zone), స్వేచ్ఛావ్యాపారం మరియూ గిడ్డంగి మండలం (Free Trade and Warehousing Zone), వంటి వసతులన్నీ ఒకే చోట ఉండేలా, శ్రీసిటీ నిర్మాణ రూపకల్పన చేశారు. ప్రపంచ ప్రఖ్యాత జురాంగ్ కన్సల్టెంట్స్ (సింగపూర్) వారిచే రూపొందించబడిన శ్రీసిటీ, ఒక ప్రపంచస్థాయి వ్యాపారకేంద్రానికి ఉండవలసిన అన్ని మౌలిక వసతులనూ, అంతర్జాతీయ జీవన శైలి సదుపాయాలను, హంగులనూ కలిగియున్నది. శ్రీసిటీలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ విశాలమైన రహదారులు, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, మంచినీటిశుద్ధి కేంద్రం, సౌర విద్యుత్ కేంద్రము, మురుగు, పారిశ్రామిక వ్యర్ధాల శుద్ధి వసతులు, హరిత వనాలు, నివాస భవన సముదాయాలను నిర్మించారు.
26 దేశాలకు చెందిన 165 కు పైగా కంపెనీలు, సుమారు 25,000 కోట్ల పెట్టుబడితో తమ వ్యాపార కలాపాల నిర్వహణకు శ్రీకారం చుట్టాయి. వీటిలో దాదాపు 90 పరిశ్రమలు ఉత్పత్తి దశకు చేరుకోగా, మిగిలినవి నిర్మాణ దశలో లేదా ప్రభుత్వ అనుమతులు పొందే దశలో ఉన్నాయి.
ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, రక్షణ, సౌరశక్తి, ఏరోస్పేస్ పరికరాలు-విడిభాగాల ఉత్పత్తి, భారీ వాహనాలు, ఖనిజాలను వెలికి తీసే యంత్ర సామగ్రి, హార్డ్ వేర్ వంటి బహుళ పారిశ్రామిక ఉత్పత్తుల తయారీ సంస్థలకు ఇది అనువైనది.
పెప్సీకో, అల్స్టం, కొబెల్కో, కాల్గేట్ పామోలివ్, కెల్లాగ్స్, డేనీల్ ఇండియా, నిట్టాన్ వాల్వ్స్, లావాజ్జా, పయోలాక్స్, వీఅర్వీ, వెస్ట్ ఫార్మా, అస్త్రోటెక్, రాక్వర్త్, ఎవర్టన్ టీ వంటి పలు అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ఇక్కడ తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. జపాన్ దేశానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత వాహన ఉత్పత్తి సంస్థ 'ఇసుజు', తన అనుబంధ కంపెనీ 'ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' యొక్క కర్మాగారాన్ని రెండు దశలలో మొత్తం రూ.3000 కోట్ల వ్యయంతో, ఇక్కడ నిర్మించింది. అదేవిధంగా, అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన మొండెలెజ్ ఇంటర్నేషనల్ సంస్థ, తన అనుబంధ కంపెనీ 'కాడ్బరీ ఇండియా' ను, సుమారు 1000 కోట్ల రూపాయిల పెట్టుబడితో, ఆసియ-పసిఫిక్ ప్రాంతంలోనే అతి పెద్ద చాక్లెట్ల ఉత్పత్తి కర్మాగారాన్ని స్థాపించింది. ఆరోగ్య పరిరక్షణకుపకరించే వస్తు వుల తయారీకి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జపాన్ కంపెనీ యూనిచాం ఉత్పత్తి ప్రారంభించింది.
ఈ కంపెనీల రాకతో సుమారు 35000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించింది. ఉపాధి పొందుతున్న వారిలో 50 శాతం మహిళలే. అధిక శాతం మంది మహిళా ఉద్యోగులున్న పరిశ్రమలు అనేకం ఇక్కడున్నాయి. మహిళలకు ఆర్థిక స్వావలంబన దొరికితే వారి కుటుంబ స్థితిగతులు మెరుగై, పిల్లల భవిష్యత్ బాగుంటుందన్న తలంపుతో మహిళలకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడానికి శ్రీసిటీ ప్రణాళికలు రచించింది. తదనుగుణంగా అక్కడి వివిధ పరిశ్రమల యాజమాన్యాలు స్త్రీ శక్తికి అగ్రతాంబూలం ఇచ్చారు, మహిళా శక్తికే పెద్దపీట వేశారు. ఒక్క ఫాక్స్కాన్కు చెందిన రైజింగ్ స్టార్ పరిశ్రమలోనే 11 వేలకు పైగా మహిళలు పనిచేస్తుండగా, మిగిలిన వారు ఎం.ఎస్.ఆర్. గార్మెంట్స్, కెల్లోగ్స్, పాల్స్ ప్లష్, మాండెలెజ్ (క్యాడ్బరీ), ఎవర్టన్ టీ, కాల్గేట్ పామోలివ్, యూనీఛాం, పెప్సికో మొదలైన పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. ఆయా కంపెనీల ఉద్యోగుల సంఖ్యలో మహిళలు, సుమారు 20 నుండి 90 శాతం దాకా ఉన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా జరుపుకునే పశువుల పండుగ జల్లి కట్టు అంటారు. అప్పుడు జరిగే పార్వేట ఉత్సవం, గంగ పండుగ, ముక్కోటి ఏకాదసి, కావిళ్లు పండుగ, కార్తీక మాసంలో జరిగే సుద్దుల పండుగ, మహాభారత ఉత్సవాలు జిల్లాకు ప్రత్యేకమైన పండుగలు.
This article uses material from the Wikipedia తెలుగు article తిరుపతి జిల్లా, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.