గౌరు తిరుపతిరెడ్డి ప్రముఖ వాస్తునిపుణుడు.
గౌరు తిరుపతిరెడ్డి | |
---|---|
జననం | గౌరు తిరుపతిరెడ్డి 1935, ఆగస్టు 20 బొల్లవరం,కడప జిల్లా |
మరణం | 2016, జనవరి 28 ప్రొద్దుటూరు |
మరణ కారణం | అనారోగ్యం |
వృత్తి | వ్యాపారవేత్త, వాస్తు సలహాదారు |
ప్రసిద్ధి | వాస్తు నిపుణుడు |
మతం | హిందూ |
భార్య / భర్త | రామసుబ్బమ్మ |
పిల్లలు | లక్ష్మినారాయణరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వెంకటలక్ష్మమ్మ,లీలావతి,శారద |
తల్లిదండ్రులు | గౌరు నాగిరెడ్డి, వెంకటమ్మ |
గౌరు తిరుపతిరెడ్డి 1935, ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, బొల్లవరం గ్రామంలో గౌరు నాగిరెడ్డి వెంకటమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి సాధారణ రైతు. ఐదవ తరగతి వరకు బొల్లవరం ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. 1955లో బొల్లవరం గ్రామానికే చెందిన రామసుబ్బమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగారు. ఇతడు వివాహం అయ్యాక ప్రొద్దుటూరులోని దేవరశెట్టి మండిలో నెలకు 8 రూపాయల వేతనానికి పనిచేసేవాడు. ఆ సమయంలో పప్పు కొనడానికి గుంటూరు వెళ్లి వస్తుండగా 800 రూపాయలు పోగొట్టుకున్నాడు. అయితే ఆ డబ్బుకుగాను ప్రతి నెలా తన జీతాన్ని జమ చేయించగా ఇతడి నిజాయితీకి మెచ్చి మిల్లు యజమాని మిల్లులో కొంత భాగం ఇచ్చాడు. తరువాత ఇతడు ఆ మిల్లును అభివృద్ధి చేశాడు. ఇతడు వ్యాపార నిమిత్తం విజయవాడకు రైలులో వెళుతుండగా రామబ్రహ్మం అనే వాస్తు పండితుడు పరిచయమయ్యాడు. రామబ్రహ్మం బొల్లవరంలోని ఇతడి ఇంటిని పరిశీలించి వాస్తు సరిగా లేదని చెప్పడంతో ఆ ఇంటిని పడగొట్టించి రామబ్రహ్మం చెప్పిన ప్రకారం తిరిగి నిర్మించాడు. ఆ సందర్భంలో ఇతడికి వాస్తుశాస్త్రం పట్ల ఆసక్తి ఏర్పడి రామబ్రహ్మం వద్ద వాస్తు మెళకువలు తెలుసుకున్నాడు. అనంతరం ఉత్తర కాశీ రాష్ట్రాలకు యాత్రలకు వెళ్లి ఆలయాలను, భవంతులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాడు. అప్పటి నుండి వాస్తు పండితుడిగా ఎనలేని ఖ్యాతిని గడించాడు.
ఇతడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే కాక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ప్రఖ్యాత వాస్తుశిల్పిగా ప్రాచుర్యం పొందాడు. ఇతడు వాస్తు, తదితర అంశాలపై సుమారు 190 పుస్తకాలు రచించాడు. ఇతడు రచించిన 'గౌరు వాస్తు శాస్త్రం' పుస్తకం ఐదు భాషలలోకి అనువదించబడింది. ఈ పుస్తకం 4 లక్షల ప్రతులు అమ్ముడుపోయి 2009 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. ఇతడు గౌరువాస్తు పేరుతో ఒక మాసపత్రిక నడిపాడు. ఇతని వద్ద వాస్తు చెప్పించుకున్న వారిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, నందమూరి తారక రామారావు, మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ, రామోజీరావు మొదలైన ప్రముఖులున్నారు. వీరేకాక అనేకమంది రాజకీయ సినీ ప్రముఖులు ఇతని సేవలను ఉపయోగించుకున్నారు. ఇతడు ప్రతి యేటా వెలువరించే క్యాలెండరుకు మంచి గిరాకీ ఉంది.
ఇతడు ప్రొద్దుటూరులో ఆంధ్రకేసరి స్త్రీల ఉచిత కుట్టుమిషన్ శిక్షణా కేంద్రాన్ని స్థాపించి ఎంతోమంది మహిళలకు జీవనోపాధి కల్పించాడు. ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్డులో కల వాస్తు కాంప్లెక్స్లో వేమన ఉచిత హోమియో ఆసుపత్రిని నడుపుతూ బీద రోగులకు సహాయం చేశాడు. ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులో వేమన మెడికల్స్ ప్రారంభించి తక్కువ ధరకే మందులను సరఫరా చేశాడు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు స్పందించి ఎన్నో సార్లు విరాళాలు ఇచ్చాడు. ఎన్నో సంస్థలకు గుప్త దానాలు చేశాడు.
ఇతడు పలు అవార్డులను పొందాడు. వాస్తు సేవారత్న, వాస్తు భగీరథ, వాస్తుశిల్పి, వృక్షమిత్ర, వాస్తు పెరియార్ మొదలైన బిరుదులను పొందాడు.
ఇతడు 2016, జనవరి 28 గురువారం నాడు తన 81వ యేట ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో మరణించాడు.
This article uses material from the Wikipedia తెలుగు article గౌరు తిరుపతిరెడ్డి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.