కర్ణుడు మహాభారత ఇతిహాసములో ఒక వీరుడు.
దూర్వాస మహర్షి కుంతీభోజుని కుమార్తెయైన కుంతికి ఇచ్చిన వరప్రభావంతో సూర్య దేవునికి ఆమెకు కలిగిన సంతానము కర్ణుడు. సూర్యుని అంశాన సహజ కవచకుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్యతేజస్సుతో ప్రకాశించాడు
కర్ణుఁడు కుంతి గర్భాన జన్మించాడు. కుంతి కన్యగా ఉన్నపుడు సూర్యప్రసాదమున పుట్టిన కొడుకు. కన్యకు సంతానం తనకు చేటు తెస్తుందని కుంతి ఇతనిని ఒక పెట్టెలో పెట్టి గంగలో పడవేసి ఇంటికి వెళ్ళిపోయింది. అది సూతవంశజుడు, అతిరథుడు తన భార్య రాధ కు ఆ పెట్టె దొరికింది. అందులో ఉన్న బాలకుని జూచి సంతానం లేని తమకు దేవుడు ప్రసాదించిన బిడ్డగా భావించి అతన్ని పెంచసాగారు. .
మఱియు కర్ణుని పెంపుడుతండ్రి అగు సూతుఁడు అస్త్రవిద్యాభ్యాసమునకై రాజకుమారులకు ఎల్ల అస్త్రవిద్య కఱపుచు ఉన్న ద్రోణాచార్యులు సకలవిద్యలను నేర్పెను కానీ మంత్రసహితమైన కొన్ని దివ్యాస్త్రములను మాత్రము అతనికి ఇవ్వడానికి నిరాకరించెను. అంతట కర్ణుఁడు ఎట్లయిన ఆ అస్త్రాలను గ్రహింపవలెను అను తలఁపున బ్రాహ్మణవేషము వేసికొనిపోయి పరశురాముని ఆశ్రయించి ఆయనవద్ద సాంగముగా అస్త్రవిద్య అభ్యసించి ద్రోణునికి ప్రియశిష్యుడు అగు అర్జునుని యెడల మత్సరము కలిగి ఉండెను. కనుక దుర్యోధనుడు ఈతనిని తనకు పరమాప్తునిగా చేసికొని అంగదేశ రాజ్యాభిషిక్తునిగ చేసెను. ఈతఁడు బ్రాహ్మణవేషముతో పరశురామునియొద్ద విలువిద్య నేర్చకొనునపుడు ఆయన ఈదొంగతనమును తెలిసికొని తాను ఉపదేశించిన మహాస్త్రములు ఇతనికి ఆపత్కాలమున ఫలింపకపోవునట్లు శాపము ఇచ్చెను.
ఇదిగాక కర్ణుఁడు విలువిద్య అభ్యసించువేళ ఒకనాడు ఒక బయల విలుసాధన చేయుచు ఉండఁగా ఒక బాణము అచ్చట మేయుచున్న ఒక బ్రాహ్మణుని ఆవుపెయ్య మీదపడి అది చచ్చెను. దానికి ఆబ్రాహ్మణుఁడు కోపించి కర్ణునికి సమరోద్రేకమున రథచక్రము పుడమిని క్రుంగునట్లును, ఏవీరుని మార్కొని గెలువకోరి పోరునో ఆవీరునిచే అతఁడు చచ్చునట్లును శపించెను. ఈతడు మహాదాత. సూర్యప్రసాదమువలన పుట్టినపుడే తాను పడసి ఉండిన సహజ కవచ కుండలములను ఇంద్రుడు అర్జునుని మేలుకై బ్రాహ్మణవేషము తాల్చి వచ్చి తన్ను యాచింపఁగా అది తెలిసియు వెనుదీయక ఇచ్చివేసెను. కనుకనే "అతిదానాద్ధతఃకర్ణః" అని అంటారు.
కర్ణుడు మహాభారతంలో ఉన్నతమైన స్థానముతో తో పాటు ఎన్నో సంక్లిష్టమైన సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తి గా పేరుపొందాడు . తన ప్రభువైన దుర్యోధనుని ఆదరణ తో మరణించే వరకు ఋణపడి ఉండటం , అవమానాలు కూడా పొందిన వ్యక్తి కర్ణుడు అని చెప్పవచ్చును . కర్ణుడు ఎప్పుడూ సంతోషంగా , దాన గుణంతో ఉండేవాడు. ఎక్కడకు వెళ్లిన "తక్కువ కులం లో జన్మించినవాడు " పిలిచే వారు . ఇది కర్ణుని జీవితాంతం వరకు ఈ అవమానంను ఎదుర్కొన్నాడు . శకుని సలహాలతో విభేదించబడిన కర్ణుడు, దుర్యోధనుని కొరకు తన జీవితం ను పణం గా పెట్టినవ్యక్తి గా చరిత్రలో నిలిచిపోయినాడు.
కర్ణుడు కురుక్షేత్ర యుద్ధం లో 17 వ రోజు, కర్ణుడు అర్జునుడి తో జరిగిన యుద్ధములో మరణించాడు . కర్ణుడికి ఉన్న దివ్య అస్త్రములు , కవచ కుండలాలు అన్ని పోగుట్టుకొని , పరుశురాముడు ఇచ్చిన బ్రహ్మాస్త్ర ప్రయోగం మరిచిపోయి , తన రథచక్రాలు యుద్ధభూమిలో చిక్కుకొన్న తర్వాత మరణం పొందినాడు . కర్ణుడు తన సొంత సోదరుడైన అర్జునిని చేతిలో మరణించాడు.కర్ణుని మరణం తరువాత, కుంతి యుద్ధభూమికి వెళ్ళింది . పాండవులు ఆ రోజు సాయంత్రం కర్ణుడితో తమకున్న సంబంధం గురించి తెలుసుకున్నారు. మరణించిన కర్ణుడి చివరి కర్మలను కూడా వారు నిర్వహించారు.మహాభారతంలో కర్ణుడి మరణం పుట్టుకతోనే సవాలు, అవమానకరమైన , అన్యాయమైన ప్రతిభావంతులైన, ధైర్యవంతుడైన కర్ణుడు తన అంతిమ ప్రత్యర్థి అయిన అర్జునితో మరణించాడు.
This article uses material from the Wikipedia తెలుగు article కర్ణుడు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.