ఎఱకేశ్వర దేవాలయం, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా, పిల్లలమర్రి గ్రామానికి పశ్చిమ వైవున్న ఒక శివాలయం.
మూసీ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయాన్ని సా.శ 1208లో కాకతీయులకు సామంతులైన రేచర్ల కుటుంబానికి చెందిన బాటిరెడ్డి భార్య ఎఱకసాని నిర్మించింది. పిల్లలమర్రి గ్రామంలో రాతి, గ్రానైట్ చెక్కబడిన నాలుగు దేవాలయాలలో ఈ ఎఱకేశ్వర దేవాలయం ఒకటి. మిగిలిన మూడు దేవాలయాలు (పార్వతి-మహాదేవ నామేశ్వర దేవాలయం, త్రికూటేశ్వర ఆలయం, చెన్నకేశవ దేవాలయం) ఈ దేవాలయానికి తూర్పున 250 మీటర్ల దూరంలో ఉన్నాయి. .
ఎఱకేశ్వర దేవాలయం (పిల్లలమర్రి) | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 17°10′11″N 79°34′56″E / 17.169683°N 79.582198°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సూర్యాపేట |
స్థలం | పిల్లలమర్రి |
సంస్కృతి | |
దైవం | చెన్నకేశవ స్వామి |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | కాకతీయ నిర్మాణ శైలి |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | c. 1208 CE |
65వ జాతీయ రహదారిలో రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 153 కి.మీ దూరంలో, సూర్యాపేట పట్టణానికి వాయువ్యంగా 8 కి.మీ దూరంలో ఈ పిల్లలమర్రి గ్రామం ఉంది.
13వ శతాబ్దం ప్రారంభంలో (సా.శ 1203-1208) కాకతీయుల దగ్గర సామంతులుగా పనిచేసిన రేచర్ల అధిపతులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. సా.శ 1208లో పిల్లలమర్రిలో రేచర్ల కుటుంబానికి చెందిన బాటిరెడ్డి భార్య ఎఱకసాని ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఇక్కడున్న ఒక శాసనంలో పేర్కొనబడింది. అందువల్ల ఇక్కడి దేవుడికి ఎఱకేశ్వరుడు అనే పేరు పెట్టారు. 14వ శతాబ్దం ప్రారంభంలో అల్లావుద్దీన్ ఖిల్జీ దక్కన్ ప్రాంతంలో జరిపిన దాడుల సమయంలో ఈ ఆలయం ధ్వంసం చేయబడింది. ఆ తరువాత ముసునూరి నాయక రాజవంశానికి చెందిన కాపయ్య నాయకుడికి సేవలందిస్తున్న స్థానిక ఫ్యూడటరీ చీఫ్ ద్వారా ఎఱకేశ్వర స్వామిని తిరిగి స్థాపించినట్లు సా.శ 1357నాటి శాసనంలో పేర్కొనబడింది.
ఇక్కడి ప్రాంగణంలో దేవాలయ చరిత్ర, పిల్లలమర్రి గ్రామ చరిత్ర గురించి తెలుగులో రాతి శాసనాలు ఉన్నాయి. సా.శ 1195(శాక. 1117) నాటి శాసనంలో మొదటి ప్రతాపరుద్రుని పాలన గురించి, సా.శ 1208 (శాక 1130) నాటి శాసనంలో గణపతిదేవుని పాలన గురించి ప్రస్తావించబడింది.
1926, 1927లో పురావస్తు శాస్త్రవేత్త, ఎపిగ్రాఫిస్ట్ గులాం యజ్దానీ ఆధ్వర్యంలో ఈ దేవాలయ తొలి పురావస్తు సర్వేలు, డాక్యుమెంటేషన్ పూర్తయి, 1929లో ప్రచురించబడ్డాయి. పిల్లలమర్రిలోని నాలుగు దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటికి తప్పుగా పేరు పెట్టబడ్డాయని ఈ అధ్యయనంలో తేలింది.
ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కోట గుళ్ళు దేవాలయం, కాకతీయ శకంలోని ఇతర దేవాలయాల నిర్మాణ శైలిని పోలినట్లుగా ఈ దేవాలయ నిర్మాణ శైలి ఉంటుంది. ఈ దేవాలయం ఒక ఉపపీఠంపై ఉంచబడి, శిలువ ఆకారంలో ఉంటుంది. దీనికి తూర్పు, ఉత్తర, దక్షిణాలలో మూడు వరండాలు, పశ్చిమాన గర్భాలయం ఉన్నాయి. శిఖర గర్భగుడిని ఇటుక, సున్నంతో తయారు చేశారు. ఈ దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన రాయి ఆసక్తికరమైన ధ్వని లక్షణాలను కలిగి ఉందని చెప్పబడింది. గుడి రాయిని నాణెంతో తట్టినప్పుడు, అది లోహంలా శబ్ధాన్ని చేస్తున్నట్టు అనిపిస్తుంది. దేవాలయంలో స్తంభాలు, గోడలు చెక్కబడ్డాయి. గోడలు ఫ్రెస్కోలతో పెయింట్ చేయబడ్డాయి.
This article uses material from the Wikipedia తెలుగు article ఎఱకేశ్వర దేవాలయం (పిల్లలమర్రి), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.