హరికథ అన్నది తెలుగు వారి సంప్రదాయ కళారూపం.
హిందూ మతపరమైన భక్తి కథలు, ప్రధానంగా హరిలీలలను సంగీత, సాహిత్యాల సంగమంగా చెప్పడాన్ని హరికథ అంటారు. దీనికి తెలుగు సాహిత్యంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నారదుడు మొదటి హరిదాసు అంటారు.దానిని ఒక విశిష్ట కళారూపంగా తీర్చి దిద్దిన వ్యక్తి ఆదిభట్ల నారాయణదాసు. అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ప్రముఖ హరికథ విద్వాంసులు, అష్టభాషాపండితుడు. ఇది సంగీత, సాహిత్యాల మేలు కలయిక. ఈ కథ చెప్పువారిని భాగవతులు లేదా భాగవతార్ అని అంటారు. ఆదిభట్ల నారాయణదాసు, పరిమి సుబ్రమణ్యం భాగవతార్ మొదలగువారు ఈ ప్రక్రియలో ఆద్యులు. హరికథా కళారూపంలో ఒకే ఒక పాత్ర ధారి మూడు గంటల కాలం కథా గానం కావిస్తాడు. ఒకే వ్వక్తి అన్ని పాత్రల్లోనూ జీవించి, రసవత్తరంగా నటిస్తాడు. నోటితో వాచికం చెపుతూ, మృదుమధురమైన గానం పాడుతూ, ముఖంలో సాత్వికమూ, కాలితోనృత్యమూ చేతులతో ఆంగికమూ గుప్పిస్తూ ఆకర్షణీయమైన ఆహార్యంతో ఏకకాలంలో అభినయిస్తాడు. హరికథలో వున్న ప్రత్యేకత ఇదే. మూడు గంటల కాల కూర్చున్నా ప్రేక్షకులకు విసుగు జనించ కుండా పిట్ట కథలతో, మధ్య మధ్య హాస్యరసాన్ని పోషిస్తూ సమాజంలో వున్న కుళ్ళును ఎత్తి చూపిస్తూ, వేదాంత బోధ చేస్తూ జనరంజకంగా హరి కథను గానం చేస్తాడు.హరికథకు చలి విలువ ఉంటుది
కథకుడు కేవలం అతని ప్రతిభవల్లనే ప్రేక్షకులను హరి కథతో రంజింప జేయగలడు. హరికథకుని వేషధారణ కూడా సామాన్యమే. చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూల హారం ధరించి చక్కగా తిలకం దిద్దుతాడు.
హరికథకులు రామాయణం, భారతం, భాగవతం మొదలైన అధ్యాత్మిక సంబంధమైన కథలను విరివిగా చెపుతూ వుంటారు. సంపూర్ణ రామాయణం, సంపూర్ణ భారతం, భాగవతం మొదలైన కథలు వరుసగా పది హేను రోజులూ, నెలరోజుల వరకూ గూడా సాగుతాయి. పట్టణాలలోనూ గ్రామాల్లోనూ పనుల తరుణం అయ పోయిన తరువాతా, పర్వదినాలలోనూ ఆంధ్ర దేశపు హరిదాసులు ఈ కథలు చెపుతూ వుంటారు.
హరికథా ప్రక్రియ ఇతర భారతీయ భాషలలోనూ ఉంది. తమిళుల కథాకాలక్షేపము సంగీత ప్రధానమైనది, కన్నడ హరికథ ప్రవచనాభరితమైనది, మరాఠీ కీర్తనలు భక్తి ప్రధానమైనవి. కానీ తెలుగు హరికథ భక్తి, సంగీత, సాహిత్య, అభినయాల మేలుకలయిక అని తూమాటి దోణప్ప వివరించాడు. 5వేలకు పైగా హరికథలు, హరికథపై 200 మందికి పైగా రచయితలు వ్రాసిన దాదాపు వెయ్యి పుస్తకాల వాజ్ఞ్మయము కలిగిన ఏకైక భాష తెలుగు.
హరికథ పుట్టుక గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హరికథ వేదాలనుండి పుట్టిందని కొందరు భావిస్తారు. జమ్మలమడక మాధవరాయశర్మ కథాగానము యొక్క మూలము సామగానమేనని అభిప్రాయం వెలిబుచ్చాడు. మరికొందరు లవకుశుల రామాయణ పారాయణము నుండే హరికథ ఉద్భవించిందని భావిస్తున్నారు. మరికొందరు నారద భక్తిసూత్రము హరికథ యొక్క మూలమని భావించారు. ఇంకొందరు యక్షగానమే హరికథగా రూపాంతరం చెందిందని భావిస్తున్నారు. హరికథ మూలమేదైనా ఆంధ్రదేశములోని హరికథా ప్రక్రియ తన ప్రదర్శనలో వినూతనత్వములోను, నవరస సమ్మేళనం లోనూ, వివిధ రాగాలను పలికించటము లోనూ ప్రత్యేకమైనది.
హరికథల స్వరూపం వేద కాలం నాటిదనీ, సర్వజ్ఞలయిన మహర్షులు ఈ హరి కథా శిల్పాన్ని ప్రప్రథమంగా సృష్టించారనీ పండితులు నిర్ణయించారు. బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు భక్తి సూత్రాలను ఉపదేశిస్తూ హరికథా గానం చేస్తూ వుంటాడని ప్రతీతి. వేద విభజన చేసినా, అష్టాదశ పురాణాలను లిఖించినా మనశ్శాంతి పొందనేరని శ్రీ వ్వాసునకి శ్రీ మద్భాగవతం రచించి హరికథామృధాన్ని పంచిపేదుటూ మానవోద్ధరణ గావింపునని నారదుడు ఆదేశించాడు. తరువాత శుకదేవుడు, సౌనకాది మహర్షులు, సూతుడూ హరికథా రూపకమైన ల్భాగవతాన్ని భారతదేశం అంతటా ప్రచారం చేశారని పాతూరి ప్రసన్నంగారు 1965 పిబ్రవరి నాట్యకళ ' సంచికలో వివరించారు.
హరికథా ప్రథర్శనాలు రాత్రి పూటే జరుగుతూ వుంటాయి. ( కానీ చిత్తూరు జిల్లాలో మహాభరతము ఉత్సవములో హరికతను పగటి పూట మాత్రమే జరుపుతారు. హరికథలోని ఆనాటి భాగాన్ని ఆరాత్రి నాటకముగా ప్రదర్శిస్తారు.) ఇవి ముఖ్యంగా, గణపతి నవరాత్రులు, దశరా, కృష్ణ జయంతి, ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి పర్వ దినాలలో విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ ప్రదర్శనానికి ఖర్చు చాల తక్కువ. ఒకే నాటి ప్రదర్శనమైతే, గ్రామం మధ్య పెద్ద బజారులో గాని, విశాలమైన మైదానంలో గాని ఒక చిన్న పందిరి వేసి పందిరిలో ఎత్తైన దిబ్బను గాని, చెక్కలతో చిన్న స్టేజిని నిర్మించి గానీ రెండు ప్రక్కలా కాంతి వంతమైన పెట్రో మాక్సు లైట్లను అమరుస్తారు. ఆరుబైట ప్రేక్షకులు కూర్చుంటారు. అదే కథ ఒక నెల రోజులు చెప్ప వలసి వస్తే ఒక పెద్ద పందిరి వేసి దానిని చక్కగా అలంకరిస్తారు.
జమ్మలమడక మాధవరాయశర్మ దేవకథా కథనము లోకమున హరికథ నామముగా ప్రసిద్ధముగా ఉన్నదని నిర్వచించాడు. తంగిరాల సుబ్రహ్మణ్యశాస్త్రి హరిని కీర్తించుటయే 'హరికథ'... 'క' బ్రహ్మము, 'థ' ఉండునది. అనగా దేనియందు బ్రహ్మ ఉండునో, దేనియందు బ్రహ్మము తెలియబడునో, దేనియందు బ్రహ్మమును పొందునో దానిని కథయందురు. దీనిని గానము చేయుటయే కథాగానము... అని వివరించాడు. ఆదిభట్ల నారాయణదాసు ఇలా చెప్పాడు - ఆస్తిక్యమును, ధర్మాధర్మములను, సర్వజనమనోరంజనముగ నృత్యగీత వాద్యములతో నుపన్యసించుట హరికథ యనబరగును. అట్టి ఉపన్యాసకుడు కథకుడనబడును. దైవభక్తియు, సత్యము, భూతదయయు హరికథయందలి ముఖ్యాంశములు.
హరికథ 17వ శతాబ్దంలో మహారాష్ట్రలో అభంగ్గా అవతరించిందంటారు. కొందరు పండితులు యక్షగానాలే హరికథలుగా రూపాంతరం చెందాయనీ అంటారు. అయితే పరిశోధకులు వీరి అభిప్రాయంతో ఏకీభవించడంలేదు. యక్షగానాలకు, హరికథలకు మధ్య ఎన్నో తేడాలున్నాయనీ కాబట్టి రెండూ వేరని అంటారు. హరికథల్ని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో "కాలక్షేపాలు" అంటారు. ఆధునిక హరికథలు వెలువడక పూర్వం గోగులపాటి కూర్మనాథకవి వ్రాసిన మృత్యుంజయ విలాసం, ఓబయ్య వ్రాసిన గరుడాచల మాహాత్మ్యం మొదలైన యక్షగానాలను, మునిపల్లి సుబ్రహ్మణ్య కవి వ్రాసిన ఆధ్యాత్మ రామాయణ సంకీర్తనలను హరికథలుగా చెప్పుకొనేవారు. కానీ అవి హరికథలు కావంటారు పరిశోధకులు.
ఒకే రోజు కథకైతే, ఏదో ఒక పారితోషికాన్ని హరిదాసుకు ముట్ట జెపుతారు. అదే నెలరోజుల కథలు జరిగిన తరువాత హరిదాసు ఇంటింటికీ వెళ్ళి ప్రతివారినీ కసులు కుంటాడు. నెల రోజుల పాటు మదులకు నెమ్మదిగా హరి కథను విని ముగ్దులైన ప్రజలు భక్తి ప్రవత్తులతో దాసుగారిని గౌరవించి ఎవరికి తోచింది వారు సమర్పిస్తారు. ఇలా హరి దాసు మొత్తంమీద అందరి వద్దా చేరి ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసుకుని సంతృప్తిగా వెళ్ళిపోతాడు. ఈ విధంగా గ్రామ గ్రామాలు తిరిగి హరిదాసులు కార్యక్రమాలిస్తూ వుంటారు. మరి కొందరు ప్రతి సంవత్సరమూ వార్షికంగా ఆయా ప్రదేశాల్లో ఈ కథలు చెపుతూ వుంటారు.
సినిమా, నాటకం అభివృద్ధి కాక పూర్వం గ్రామాల్లో ఇతర జానపద కళారూపాలతో పాటు ఎక్కువ ప్రజాదరణను పొందిన కళారూపాల్లో హరికథ చాల ముఖ్యమైంది. ఏది ఏమైనా అనాటి నుంచి ఈనాటివరకూ శిథిలం కాకుండా నానాటికీ క్రొత్త రూపును సంత రించుకున్న కళారూపం హరికథ.
ఈ హరి కథను అత్యంత ఉత్తమ కళారూపంగా తీర్చి దిద్ది దానికొక గౌవవాన్నీ, విశిష్టతనూ చేకూర్చినవారు ఆదిభట్ల నారాయణ దాసుగారు. ఆయన ఎన్నో హరికథలు రచించారు. ఎంతో మంది ఉద్ధండులైన శిష్య ప్రశిష్యులను తయారు చేశారు.
ఆదిభట్ల నారాయణదాసు 1864 వ సంవత్సరం శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకాలో సువర్ణ ముఖీతీరంలో వున్న అజ్జాడ గ్రామంలో జన్మించారు. వీరు ద్రావిడ బ్రాహ్మణులు. తల్లి నర్ఫసమాంబ. తండ్రి వేంకటచయనులు, చిన్ననాడే తల్లి ద్వారా భాగవతాన్ని విని అధ్యాత్మికత్వాన్ని జీర్ణించుకున్నారు. తండ్రి ద్వారా పాడిత్యాన్నీ, కవిత్వాన్నీ నేర్చు కున్నారు. నారాయణ దాసు గారు స్వయంకృషి వలన సకల విద్యల్నీ అపార జ్ఞానాన్ని సంపాదించారు. దాసుగారు బొబ్బిలి వాస్తవ్యుడైన వాసా సాంబయ్య వద్ద కొంతకాలం వీణ నేర్చుకున్నారు. తరువాత విజయనగరం మహారాజావారి కాలేజీలో యఫ్.ఏ. వరకూ చదివి తరువాత ఆంగ్ల విద్యకు స్వస్తి చెప్పారు. దాసుగారు ప్రప్రథమంగా యక్షగానాలను తరువాత హరికథా ప్రబంధాలను రచించారు. షేక్స్ పియర్, కాళిదాసు గ్రంథాలను అనువాదం చేశారు. వీణా వాదన లోనూ, నృత్య సంగీతాల్లోనూ అసమానమైన ప్రజ్ఞాను సంపాదించారు. లయలో ఈ యన సామర్థ్యం సాటిలేనిది. చల్లపల్లి జమీందారు గారిచే గజయాన, గండపెండేర సత్కారాన్ని పొందారు.
ఆదిభట్ల నారాయణదాసు పిఠాపురం, ఏలూరు, విజయవాడ, బళ్ళారి, మద్రాసు నగరాల్లో హరికథా ప్రదర్శనాలనిస్తూ అనేక సంస్థానాల్లో సత్కారల నందుకున్నారు. బెంగుళూరులో తన హరికథా కథన ప్రజ్ఞను ప్రదర్శించి మైసూరు మహారాజా దర్బారున కాహ్వానింప బడి గొప్ప సన్మానాన్ని పొందారు. ఈ విధంగా అన్య ప్రాంతాల్లో సన్మానల నందుకున్న దాసుగారి కీర్తిని గుర్తించిన ఆనంద గజపతి మహారాజు దాసుగారిని అహ్వానించి దర్బారు పండితుణ్ణిగా చేసారు. ఆనంద గజపతి మరాణానంతరం దారు మరల ఆంధ్ర దేశ మంతటా హరికథ ప్రదర్శనాలిచ్చారు. 1919 వ సంవత్సరంలో ఆనాటి విజయనగర సంస్థానాధీశ్వరుడు శ్రీ విజయరామ గణపతి సంగీత పాఠశాల నొకదానిని స్థాపించి దానికి ఈయనను అధ్యక్షులుగా నియమించారు. ఈ పదవిలో ఆయన 17 సంవత్సరాలు పనిచేశారు. 1936 లో ఉద్యోగాన్ని వదిలి వేశారు. వృద్యాపం వచ్చే కొద్దీ కథలను తగ్గించి అనేక మంది శిష్యుల్ని తయారు చేసి ఆంధ్ర దేశ హరికథా పితామను డనిపించుకున్నారు. 1945 వ సంవత్సస్రం జనవరి 2 వ తేదీన మరణించారు.
ఆదిభట్ల నారాయణదాసు 80 సంవసరాలు జీ వించారు. వీరి శిష్యులైన వారు నారాయణదాసు సంప్రదాయాన్ని అపారంగా ప్రచారం చేశారు. వీరేగాక, పాణ్యం సీతార భాగవతార్, పట్రాయని సీతారామశాస్త్రి, ప్రయాగ సంగయ్య, బాలాజీదాసు, కోసూరి భోగలింగదాసు, తంపిళ్ళ సత్యనారాయణ, ఎరుకయ్య మొదలైన మహమహులెందరో ఆంధ్ర దేశంలో హరిథా గానాన్ని ప్రచారం చేశారు.
గతంలో కేవలము పురుషులు మాత్రమే హరికథాగానం చేసేవారు. ప్రస్తుత కాలములో స్త్రీలు కూడా హరికథ గానం చేయడము పరిపాటియైనది. వీరికి తిరుమల-తిరుపతి దేవస్థానము వారు కూడా తమ వంతు సహకారాన్నిస్తుండడముతో హరికథా కళా కారిణులు బహుముఖముగా అభివృద్ధి చెందుతున్నారు.
అందులో కాళ్ళ నిర్మల మాత్రమే చెప్పుకోతగ్గది.
|
|
|
|
మొదలైన ప్రసిద్ధ హరి కథకులు నారాయణ దాసు లాంటి పెద్దల బాటల్లో నడచి హరికథ కళను ప్రచారం చేశారు.
ఈనాడు ఆంధ్ర దేశంలో హరి కథ గానకళ విస్తృతంగా వ్యాపించి ప్రజల నెంతగానీ ఆకర్షిస్తూది. రాష్ట్ర వ్వాపితంగా ఈ కళను ఈ క్రింద ఉదహరించిన ఎంతో మంది కళారాధకులు ప్రచారం చేస్తున్నారు.
మొదలైన వారెందరో రాష్ట్ర వ్వపితంగా హరికథా గానం చేసి పేరెన్నిక గన్నారు. పైన ఉదహరించిన వారిలో అనేక మంది కీర్తి శేషులయ్యారు. మరెంతో మంది వృద్ధ్యాప్యంతో బాధలు పడుతున్నారు.
poets haridasulu mallam palli subrahmanya sharma
This article uses material from the Wikipedia తెలుగు article హరికథ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.