రాజా రామ్మోహన్ రాయ్ (బెంగాలీ: রাজা রামমোহন রায়) (1772, మే 22 –1833, సెప్టెంబరు 27) భారతదేశంలో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించాడు.
అతని విశేషమైన ప్రభావం రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్యా రంగాలలోనే కాకుండా హిందూమతం పైన కూడా కనపడుతుంది. ఇతడు గొప్ప సంఘసంస్కర్త. బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి సతీసహగమన సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి చాలా కృషిచేశాడు. వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చాడు. స్త్రీవిద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి, దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి కృషిచేశాడు.
ఇoడియా వెళ్ళక ముందు ద్వారకా నాథ టాగూర్తో కలసి బ్రహ్మసమాజ్ ను స్థాపించాడు. బ్రహ్మసమాజ్ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక, మత సంస్కరణ ఉద్యమంగా మారి బెంగాల్ లో సాంఘిక, వివేచనాత్మక సంస్కరణలకు దారి తీసింది. వీటన్నిటి వలన రాజా రామ్మోహన్ రాయ్, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఒక ముఖ్యుడిగా గుర్తించబడ్డారు.
రాయ్ రాథానగర్, బెంగాల్ లో 1772 లో జన్మించాడు. కుటుంబంలో మతపరమైన వైవిధ్యం ఉంది. తండ్రి రమాకాంత్ ఒక వైష్ణవుడు కాగా, తల్లి తరిణి శాక్తమతానికు చెందింది. రామ్మోహన్ బెంగాలీ, పర్షియన్, అరబిక్, సంస్కృత భాషలను పదిహేనో యేడు వరకు అభ్యసించాడు.
యుక్తవయస్సులో కుటుంబ ఆచారాలతో సంతృప్తి పొందక, యాత్రలు సాగించడం మొదలు పెట్టాడు. ఆ తరువాత కుటుంబ ప్యవహారాలు చూసుకోవడానికి తిరిగి వచ్చి, కలకత్తాలో వడ్డీ వ్యాపారిగా మారాడు. 1803 నుండి 1814 వరకు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీలో పని చేసాడు.
భారత సంఘ సంస్కరణల చరిత్ర లోనే రామ్మోహన్ రాయ్ పేరు, సతీసహగమనాన్ని రూపుమాపడంతో ముడిపడి చిరస్థాయిగా నిలిచిపోయాడు. రామ్మోహన్ రాయ్, హిందూ పూజారుల అధికారాన్ని ధిక్కరించి, అ కాలములో సాధారణమైన బహు భార్యత్వం నేరమని జనులకు నచ్చ చెప్పాడు.
తాను సంకల్పించిన సామాజిక, న్యాయ, మతపరమైన ఉద్యమాలలో రాయ్ మానవత్వాన్నే ప్రధానంగా తీసుకొన్నాడు. జనులకు తన ఉద్దేశం సమాజంలో ఉన్న మంచి సంప్రదాయాసను నిర్మూలించడం కాదని, కేవలం వాటిపై సంవత్సరాలపాటు నిరాదరణ వలన పేరుకు పోయిన కుళ్ళును తుడిచివెయ్యడం అని చూపించుటకు కష్టపడ్డాడు. ఉపనిషత్తులను గౌరవించి, సూత్రాసను చదివాడు. విగ్రహారాధనను ఖండించాడు. ఆఖండానందాన్ని పొందుటకు, అధ్యాత్మిక చింతన, భగవంతుని ధ్యానం ఉన్నత మార్గాలని, ఇవి చెయ్యలేనివారికి బలులు ఇవ్వడం మార్గమని ప్రతిపాదించాడు. వితంతు పునర్వివాహం, మహిళలకు ఆస్తిహక్కులను సమర్థించాడు.
అందరికీ విద్య, ముఖ్యంగా మహిళలకు విద్యను సమర్థించాడు. అచార సంబంధమైన సంస్కృత విద్య కంటే ఇంగ్లీషు విద్య మంచిదని భావించి, సంస్కృత పాఠశాలలకు ప్రభుత్వ నిధులను వ్యతిరేకించాడు. 1822 లో ఇంగ్లీషు పాఠశాలను ప్రారంభించాడు.
తాను కనుగొన్న సామాజిక, మతపరమైన దురాచారాలను నిర్మూలించడానికి బ్రహ్మ సమాజ్ ను స్థాపించడు. బ్రహ్మ సమాజం వివిధ మతాలలో ఉన్న మంచిని గ్రహించి ఉన్నతంగా ఎదగటానికి తోడ్పడ్డాడు.
1831 లో మొఘల్ సామ్రాజ్య రాయబారిగా ఇంగ్లండుకు వెళ్లాడు. ఫ్రాన్స్ ను కూడా దర్శించాడు. బ్రిస్టల్ లోని స్టేపెల్ టన్ లో 1833 లో మెదడువాపు వ్యాధితో మరణించాడు.
రవీంద్రనాథ టాగూరు:
“ | రామ్మోహన్ రాయ్, భారతదేశము లో పుట్టినప్పుడు అమావాస్య ఆంధకారము రాజ్యము ఏలుతూ ఉంది. మృత్యువు ఆకాశములో పొంచి ఉంది. రామ్మోహన్ నిద్ర లేచి, బెంగాలీ సమాజము పై దృష్టి సారించేటప్పటికి అది ఆత్మల తో నిండి ఉన్నది. ఆ సమయము లో పురాతన హిందూ సాంప్రదాయ భూతము శ్మశానము తో సమాజము పై తన ఆధిపత్యమును ఉంచెను. దానికి ప్రాణము లేక, జీవము లేక, బెదిరింపులు సాంప్రదాయ సంకెలలు మాత్రమే కలిగి ఉండేది. రామ్మోహన్ రోజులలో హిందూ సమాజ ఖండములు వేలకొద్దీ గోతులతో, ఒక్కొక్క గోతిలో జీవములు (మనుష్యులు) తర తరములు గా ఎదుగుతూ మరణిస్తూ, సమాజము ముసలితనము అచేతనము (కదలిక లేకపోవడము) కలిగి ఉండేది. రామ్మోహన్ నిర్భయముగా సమాజమును విషసర్పము వంటి దాస్యము నుండి విముక్తము చెయ్యడానికి ముందుకు సాగాడు. ఈ నాటి కుర్రకారు కూడా నవ్వుతూ ఆ చచ్చిన పామును తన్నగలుగుతున్నారు. ఇప్పుడు మనము ఆ పాములను చూసి (సాంప్రదాయములు), వాటి విషము వలన భయపడకుండా నవ్వి ఊరుకుంటాము. వాటి అనంతమైన శక్తిని ఆకట్టుకునే కళ్ళనూ, వాటి తోకల విష కౌగిలిని మనము మరిచి పోయాము. అనాటి బెంగాలీ విద్యార్థులు, ఇంగ్లీషు విద్య బలము తో, హిందూకాలేజీ నుండి బయటకు వచ్చి, ఒక రకమైన మత్తును పెంచుకొనిరి. వారు సమాజము హృదయము నుండి కారుతున్న రక్తము తో ఆటలు ఆడుకున్నారు. వారికి హిందూసమాజము లో ఎటువంటి ఆచారము ఉన్నతముగా పవిత్రముగా కనపడలేదు. అటువంటి సమయములో రామ్మోహన్ రాయ్ జన్మించి, మంచి చెడులను నిశిత దృష్టి తో సహనము తో పరిశీలించెను. అజ్ఞానము లో ఉన్న హిందూ సమాజమనకు అన్నిటినీ తగలబెట్టే చితిమంటలు పెట్టక, జ్ఞానమనే జ్యోతిని మాత్రము వెలిగించెను. అది రాజా రామ్మోహన్ రాయ్ గొప్పదనము" | ” |
This article uses material from the Wikipedia తెలుగు article రామ్మోహన్ రాయ్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.