ప్రొఫెసర్ పురాన్ సింగ్ (1881–1931) ప్రముఖ పంజాబీ కవి, శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త.
పాకిస్థాన్ లోని పొథోహార్ లో అహ్లువాలియా కుటుంబంలో జన్మించారు ఆయన. వీరి కుటుంబం ఆధునిక పంజాబీ సాహిత్యానికి ఆద్యులుగా పేర్కొంటుంటారు. 1897లో రావల్పిండిలోని మిషన్ హై స్కూల్ లో మెట్రిక్యులేషన్ చదివారు. 1900-1903లో ఆయనకు వచ్చిన స్కాలర్ షిప్ తో టోక్యోలోని ఫార్మాసూటికల్ సైన్సెస్ విశ్వవిద్యాలయం నుండి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో డిగ్రీ పట్టా అందుకున్నారు పురాన్ సింగ్. పుట్టుకతో సిక్కు అయినా జపాన్ కు చెందిన బౌద్ధ సన్యాసి ఉకాకురా, స్వామీ రామతీర్థ్ ల ప్రభావంతో బౌద్ధ బిక్షువు, సన్యాసిగా మారారు ఆయన. కానీ 1912లో సైల్ కోట్ లో సిక్కు ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నప్పుడు భాయ్ వీర్ సింగ్ ప్రభావంతో సిక్కు ఆధ్యాత్మిక వేత్తగా మారారు పురాన్ సింగ్.
జపాన్ బౌద్ధ భిక్షువు, అమెరికా కవి వాల్ట్ వైట్ మేన్, స్వామీ రామ్ తీర్థ్, సిక్కు సాధువు భాయ్ వీర్ సింగ్ లతో పరిచయం, వారి ప్రభావం ఆయన జీవితంపై పడింది. జపాన్ లో చదువుకునేటప్పుడు ఆ దేశపు సంప్రదాయాలు, పండుగలు, ప్రకృతి సౌందర్యం, పరిశ్రమలు, జాతి సమగ్రత ఆయనను ఎంతగానో ఆకర్షించాయి. అమెరికా కవి వాల్ట్ పరిచయం ఆయనకు కవితా దృష్టిని ఏర్పరిచింది. రామ్ తీర్థ్ ఇచ్చిన మంత్రం తనను తనకు పరిచయం చేసినట్టుగా భావించారాయన. 1912లో భాయ్ వీర్ సింగ్ ను కలుసుకొన్నప్పుడు సిక్కు మతంపై ఆయన పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి తెచ్చుకున్నారు. ఆ తరువాత నుంచీ సిక్కు ఆధ్యాత్మికవేత్తగా మారారు పురాన్ సింగ్.
నూనెలను వడబోసే ప్లాంట్ ఒకటి లాహోర్ లో స్థాపించారు పురాన్ సింగ్. ఇషార్ దాస్, రాయ్ బహద్దూర్ శివ్ నాథ్ ల సహకారంతో ఈ ప్లాంట్ ను పెట్టారు ఆయన. థైమోల్, ఫెన్నెల్, నిమ్మ నూనెలను తయారు చేసేవారు ఆక్కడ. ఈ వ్యాపారం ఆయన తల్లితండ్రులకు ఇష్టం లేకపోవడంతో, వారితో గొడవ పడి వ్యాపారం వదిలేసి, డెహ్రాడూన్ వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు స్వామీ రాం తీర్థ్ శిష్యునితో ఉన్నారు ఆయన. డిసెంబరు 1904లో లాహోర్ తిరిగి వెళ్ళి ఆక్కడ డైమండ్ వి.జె.హిందూ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కు ప్రిన్సిపల్ గా పని చేయడం మొదలుపెట్టారు. తిరిగి 1906లో ఉద్యోగానికి రాజీనామా చేసి, డెహ్రాడూన్ లో సబ్బుల ఫ్యాక్టరీ పెట్టారు పురాన్. కానీ కొన్నాళ్ళకు ఫ్యాక్టరీని అమ్మేశారు. తరువాత ఏప్రిల్ 1907లో డెహ్రాడూన్ లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఫారెస్ట్ కెమిస్ట్ గా ఉద్యోగంలో చేరి, 1918లో ఉద్యోగ విరమణ చేశారు. ఆ తరువాత గ్వాలియర్ లోని ఎడారిలో దొరికే రోషా గ్రాస్, యూకలిప్టస్, పళ్ళ చెట్లను చూసి ఎంతో మురిసిపోయారు ఆయన. 1923-1924 మధ్యలో గ్వాలియర్ లోని సురయ్యాలో సర్ సుందర్ సింగ్ మజిథియాతో కలసి ఆయన పంచదార ఫ్యాక్టరీలో పనిచేశారు. పంచదారలు కాల్చిన ఎముకల పొడి కలపకుండానే ఎలా శుద్ధి చేయాలో ఒక వినూత్న పద్ధతిని కనుక్కున్నారు పురానా సింగ్. 1926లో నాంకనా సాహిహ్ వద్ద పంజాబ్ ప్రభుత్వం నుండి కొంత భూమి కౌలుకు తీసుకుని రోషా గడ్డి వ్యాపారం కోసం పెంచారు. 1928లో వరదలతో ఆయన పెంచిన పంటంతా కొట్టుకుపోయినా, తన పుస్తకాలను కాపాడుకొగలిగినందుకు సంతోషించారు ఆయన. ఈ నష్టాన్ని వేదాంతపరంగా తీసుకున్నారు పురాన్. ఈ సందర్భంగా ఒక కవిత కూడా రాశారు ఆయన. తన భవబంధాలు విముక్తి అయినట్టు భావించారు పురాన్.
ఆయన సైన్స్ లోనూ, సాహిత్యంలోనూ చేసిన కృషి సమానంగా ప్రాముఖ్యమైనది. ఆయన శాస్త్రవేత్తగా బిజీగా ఉన్నా సందర్శకులతోనూ, సన్యాసులకు, స్వాతంత్ర్య విప్లవకారులకూ తగినంత సమయం కేటాయించేవారు. వారికి అతిథి మర్యాదలు చేసేవారు. ప్రకృతి, సౌందర్య ప్రేమికుడైన పురాన్ సింగ్ ఆంగ్లంలోనూ, పంజాబీ భాషల్లోనూ కవితలు రాసేవారు.
1930లో టిబి బారిన పడ్డ పురాన్ సింగ్ 31 మార్చి 1931న డెహ్రాడూన్ లో చనిపోయారు.
1923లో ఖుల్హే మైదాన్, ఖుల్హే ఘుండ్, 1923లో ఖులే అస్మానీ రంగ్ అనే కవితా సంకలనాలు రాశారు ఆయన. ఆయన కవిత్వంలో పేదలు, గ్రామస్థులు, రైతులే కథా వస్తువులు. ఆంగ్లంలో ఆయన రాసిన ది సిస్టర్స్ ఆఫ్ ది సిపిన్నింగ్ వీల్ (1921), అన్ స్ట్రంగ్ బీడ్స్ (1923), ది స్పిరిట్ ఆఫ్ ఒనెంటల్ పొయెట్రీ (1926), పంజాబీలో ఖుల్హే మైదాన్, ఖుల్హే ఘుండ్ (1923), ఖుల్హే అస్మానీ రంగ్ (1927), ఖుల్హే లేఖ్ (1929) వంటి కవితా సంకలనాలు చాలా ప్రసిద్ధి చెందాయి. పురాన్ సింగ్ ఆంగ్లంలో ది బుక్ ఆఫ్ టెన్ మాస్టర్స్, ది స్పిరిట్ బార్న్ పీపుల్, స్వామీ రామా, పంజాబీలో ఖుల్లే లేఖ్ (1929), హిందీలో హోర్ లేఖ్ వంటి గద్య రచనలు కూడా చేశారు ఆయన.
This article uses material from the Wikipedia తెలుగు article పురాన్ సింగ్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.