పూసర్ల వెంకట సింధు (జననం: 1995 జూలై 5) భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.
2016 లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. టోక్యో 2020 ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకుంది.
పి.వి. సింధు | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మనామం | పూసర్ల వెంకట సింధు |
జననం | హైదరాబాదు | 1995 జూలై 5
ఎత్తు | 5 feet 10 inches (1.78 m) |
దేశం | భారతదేశం |
వాటం | కుడిచేతి వాటం |
మహిళ సింగిల్స్ | |
అత్యున్నత స్థానం | 16 (18 జనవరి 2013) |
ప్రస్తుత స్థానం | 16 (18 జనవరి 2013) |
BWF profile |
2012 సెప్టెంబరు 21 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన స్థానాల్లో మొదటి 20 క్రీడాకారిణుల జాబితాలో చోటు దక్కించుకోవడంతో సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 2013 ఆగస్టు 10 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి, ఆ పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 2015 మార్చి 30 న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది. 2016 ఆగస్టు 18 న రియో ఒలింపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించి ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తరువాత జరిగిన ఫైనల్లో రజత పతకం సాధించి, ఒలింపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది. 2012 ఒలింపిక్స్ లో కాంస్యపతకం సాధించిన సైనా నెహ్వాల్ తరువాత బ్యాడ్మింటన్ లో పతకం సాధించిన రెండో క్రీడాకారిణిగా సింధు నిలిచింది.
2018లో 85 లక్షల యు.ఎస్. డాలర్ల ఆదాయంతో, 2019లో 55 లక్షల యు.ఎస్. డాలర్ల ఆదాయంతో, సింధు ఫోర్బ్స్ విడుదల చేసే అత్యధిక పారితోషికం తీసుకునే మహిళా అథ్లెట్ల జాబితాలోకెక్కింది. 2020 జనవరిలో భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ భూషణ్ని ఆమె అందుకుంది.
2022లో పీవీ సింధు ప్రతిష్ఠాత్మక స్విస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నారు. దీంతో 2011, 2012లో సైనా నెహ్వాల్ ఈ టైటిల్ రెండుసార్లు గెలుచుకోగా రెండో భారతీయ క్రీడాకారిణిగా సింధు గుర్తింపుపొందారు.
సింధు 1995 జూలై 5 న పి. వి. రమణ, పి. విజయ దంపతులకు హైదరాబాదులో జన్మించింది. ఆ దంపతులిద్దరూ వాలీబాల్ క్రీడాకారులు. రమణ పూర్వీకులు పశ్చిమ గోదావరి జిల్లా జిల్లాకు చెందిన వారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో జన్మించాడు. ఉద్యోగ రీత్యా గుంటూరుకు తరలి వెళ్ళాడు. రమణకు రైల్వేలో ఉద్యోగం రావడంతో తన వాలీబాల్ కెరీర్ కోసం హైదరాబాద్లో స్థిరపడ్డాడు. తల్లి విజయ స్వస్థలం విజయవాడ . 2000 లో రమణకు అర్జున పురస్కారం లభించింది. ఆమె తల్లిదండ్రులిద్దరూ వాలీబాల్ ఆటగాళ్ళైనా సింధు మాత్రం పుల్లెల గోపీచంద్ స్ఫూర్తితో బ్యాడ్మింటన్ ఎంచుకుంది. అప్పటికి గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ పోటీలలో గెలిచి వార్తలలో వ్యక్తిగా ఉన్నాడు. సింధు ఎనిమిదేళ్ళ వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది.
పోటీ | 2010 | 2011 | 2012 | 2013 |
---|---|---|---|---|
కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ | రెండవ రౌండు | |||
BWF ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్స్ | మూడవ రౌండు | |||
చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ | అర్హత | సెమీ ఫైనల్స్ | ||
ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ | రెండవ రౌండు | |||
ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ | సెమీ ఫైనల్స్ | మొదటి రౌండు | క్వార్టర్ ఫైనల్స్ | |
జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ | రెండవ రౌండు | |||
డచ్ ఓపెన్ | రజతపతకం | |||
ఇండియా ఓపెన్ గ్రాండ్ పిక్స్ | రెండవ రౌండు | రెండవ రౌండు | రజతపతకం |
2013 లో తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్లో ఆడిన ప్రపంచ 12వ ర్యాంకర్ పి.వి.సింధు, సంచలనం నమోదు చేసింది. తన కంటే మెరుగైన ర్యాంకులో ఉన్న చైనా క్రీడాకారిణిని ఓడించి కార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2013 ఆగస్టు 8 న జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ యిహాన్ వాంగ్ను 55 నిమిషాల్లోనే 21-18, 23-21 స్కోరుతో ఓడించింది. కవోరి ఇమబెపు (జపాన్) తో 2013 ఆగస్టు 7 న జరిగిన రెండో రౌండ్లో సింధు 21-19, 19-21, 21-17తో విజయం సాధించింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధుకు గట్టిపోటీనే లభించింది. నిర్ణాయక మూడో గేమ్లో సింధు ఒక దశలో 10-13తో వెనుకబడింది. ఈ దశలో ఒత్తిడికి లోను కాకుండా సంయమనంతో ఆడిన సింధు, వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 14-13తో ఆధిక్యంలోకి వచ్చింది. అనంతరం ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది.
పతకాల కోసం భారత్ తల్లడిల్లుతున్న సమయంలో పి.వి.సింధు భారత్కు రెండో పతకాన్ని ఖాయం చేసింది. ఈ ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ విభాగంలో గ్రూప్ ఎంలో కెనడాకు చెందిన మిషెల్లీ లీను 2-1 తేడాతో, హంగరీకి చెందిన లారా సరోసీని 2-0 తేడాతో ఓడించి 16వ రౌండులో చైనీస్ తాయ్ జూ యింగ్ పై 2-0 తో గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది.
క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ ఇహాన్ను 2-0 తో ఓడించి సెమీ ఫైనల్కు చేరుకుంది. 2016, ఆగస్టు 18వ తేదీ జరిగిన సెమీ ఫైనల్స్లో జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహరాతో వీరోచితంగా పోరాడి 2-0 తో ఆమె పై విజయం సాధించి ఫైనల్స్కు చేరింది.
2016 ఆగస్టు 19వ తేదీన జరిగిన ఫైనల్స్లో స్పెయిన్కు చెందిన కరోలినా మారిన్తో వీరోచితంగా పోరాడి 21-19, 12-21,15-21 పాయింట్లతో పరాజయం పాలయింది. ఈ ఒలింపిక్స్లో మహిళల సింగల్స్ బ్యాడ్మింటన్లో ద్వితీయ స్థానం పొంది ఈ క్రీడలలో భారత్కు తొలి, ఏకైక రజత పతకాన్ని సంపాదించిపెట్టింది.
2019 ప్రపంచ ఛాంపియన్షిప్లో ఆమె ఐదో స్థానంలో మొదలుపెట్టింది. వరుస రౌండ్లలో పై యు-పో, ఝాంగ్ బీవెన్లపై వరుస సెట్ల విజయాలతో ఆమె తన ఆటను ప్రారంభించింది. తాయ్ త్జు-యింగ్పై విజయం సాధించడంతో ఆమె అందరినీ ఆకట్టుకుంది. మొదటి రౌండ్ లో తగ్గినా 12–21, 23–21, 21–19తో తాయ్ను ఓడించి సెమీ-ఫైనల్కు చేరింది. సెమీ-ఫైనల్లో, ఆమె చెన్ యుఫీని వరుస సెట్లలో ఓడించి, వరుసగా మూడవ ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది. నోజోమి ఒకుహారాతో జరిగిన ఫైనల్లో, ఆమె 21–7, 21–7తో గెలిచింది. ఈ ప్రక్రియలో, ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలు అయ్యారు.
పీవీ సింధు తొలి మ్యాచ్లో ఇజ్రాయెల్ షట్లర్ సెనియా పాలికర్తో తలపడి కేవలం 28 నిమిషాల్లో 21-7, 21-10తో వరుస సెట్లలో మ్యాచ్ గెలిచింది. ఆమె తన రెండో మ్యాచ్లో హాంకాంగ్ ప్లేయర్ చియాంగ్ ఎంగన్తో తలపడి 21-9, 21-16తో వరుస సెట్లలో గెలుపొంది ప్రి క్వార్టర్స్కు చేరుకుంది. సింధు ప్రిక్వార్టర్స్లో డెన్మార్క్కు చెందిన మియా బ్లిచ్ఫెల్డ్తో తలపడి 21-15, 21-13తో గెలిచి క్వార్టర్ ఫైనల్ కు చేరింది.
ఆమె క్వార్టర్ ఫైనల్లో జపాన్కు చెందిన యమగూచిపై 21-13, 22-20తో విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. పీవీ సింధు సెమి ఫైనల్ లో చైనీస్ తైపీ షట్లర్ తైజుయింగ్తో తలపడి 18-21, 12-21తో ఓటమి పాలైంది. అనంతరం మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో చైనా క్రీడాకారిణి బింగ్ జియావో పై 21-13, 21-15 తేడాతో గెలిచి కాంస్య పతకం గెలిచింది.
2021లో ఇండోనేషియా మాస్టర్స్ - దీన్నే అధికారికంగా దైహట్సు ఇండోనేషియా మాస్టర్స్ 2021 (ఆంగ్లం: DAIHATSU Indonesia Masters 2021)అని అంటారు. ఇది ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్. ఈ అంతర్జాతీయ టోర్నమెంట్ ఇండోనేషియాలోని బాలి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో 16 నవంబరు నుండి 2021 నవంబరు 21 వరకు జరిగింది. టైటిల్ విజెత US$600,000 బహుమతిగా గెలుచుకుంటారు. ఈ సంవత్సరం టోర్నమెంట్ సూపర్ 500 నుండి సూపర్ 750గా అప్గ్రేడ్ చేయబడింది.
2021 నవంబరు 18న బాలిలో జరిగిన ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఏస్ షట్లర్ పివి సింధు స్పెయిన్కు చెందిన క్లారా అజుర్మెండిపై అద్భుత విజయాన్ని నమోదు చేసి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. అయితే 2021 నవంబరు 21న జరిగిన సెమీఫైనల్లో జపాన్కు చెందిన టాప్ సీడ్ అకానె యమగుచి చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి పివి సింధు నిష్క్రమించింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో 13-21, 9-21 తేడాతో కేవలం 32 నిమిషాల్లోనే ఓటమిపాలైంది. తొలి సెట్లో కాస్త పోరాడినా ప్రయోజనం దక్కలేదు. రెండో సెట్లోనూ ఆరంభంలో అకానె యమగుచి మీద ఆధిక్యత ప్రదర్శించింది. ఆ తరువాత ఒక్కసారిగా పుంజుకున్న అకానె యమగుచి సూపర్ గేమ్ ఆడటంతో పివి సింధు ఓటమిని చవిచూసింది. ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ ఛాంపియన్ గా దక్షిణ కొరియా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అన్ సే-యంగ్ కైవాసం చేసుకుంది.
ఇదే ఏడాది సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టైటిళ్లను గెలుచుకున్న పి.వి. సింధు తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకోవడంతో ప్రస్తుత సీజన్లో ఆమెకిది మూడో టైటిల్ అయింది. 2022 జూలై 17న సింగపూర్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జీ యీపై 21-9, 11-21, 21-15 తేడాతో పి.వి. సింధు విజయం సాధించింది. ఇది తన కెరీర్లోనే తొలి సూపర్ 500 టైటిల్ అవడం విశేషం.
వరుస సంఖ్య | సంవత్సరం | టోర్నమెంటు | ఫైనల్లో ప్రత్యర్థి | స్కోరు |
---|---|---|---|---|
1 | 2011 | డచ్ ఓపెన్ | యావో జీ | 16–21, 17–21 |
2 | 2012 | సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ | లిండావెని ఫానెట్రి | 15-21, 21-18, 18-21 |
3 | 2014 | సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ | సైనా నెహ్వాల్ | 14-21, 17-21 |
4 | 2015 | డెన్మార్క్ ఓపెన్ | లీ షురూయ్ | 19-21, 12-21 |
5 | 2016 | దక్షిణ ఆసియా క్రీడలు | గద్దె రుత్విక శివాని | 11–21, 20–22 |
6 | 2016 | ఒలింపిక్స్ | కరోలినా మారిన్ | 21–19, 12–21, 15–21 |
సింధు 14 ఏళ్ళ వయస్సులోనే అంతర్జాతీయ సర్క్యూట్లోకి ప్రవేశించింది. కొలంబోలో జరిగిన 2009 సబ్-జూనియర్ ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఆమె కాంస్య పతక విజేత. 2010 ఇరాన్ ఫజ్ర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఛాలెంజ్లో ఆమె సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. 2011 జూన్లో ఆమె పి.సి. తులసిని ఓడించి మాల్దీవుల అంతర్జాతీయ ఛాలెంజును గెలుచుకుంది. 2012 జూలై 7 న, ఆమె 18-21, 21–17, 22–20తో ఫైనల్లో జపనీస్ క్రీడాకారిణి నోజోమి ఒకుహారాను ఓడించి ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. ఆసియా ఛాంపియన్షిప్లో లి జుయెరుయ్పై ఆమె దాదాపు విజయం సాధించింది, కానీ 21–11, 19–21, 8–21తో ఓడిపోయింది. 2015 లో ఒత్తిడివల్ల ఫ్రాక్చర్ తో దాదాపు ఆరు నెలలు ఆటకు దూరమైంది, అయినా 2016 రియో ఒలింపిక్స్కు అర్హత సాధించగలిగింది. సింధు 2016 చైనా ఓపెన్లో తన మొదటి సూపర్సిరీస్ టైటిల్ను గెలుచుకుంది, కొనసాగింపుగా 2017 లో మరో నాలుగు ఫైనళ్లతో, దక్షిణ కొరియా, భారతదేశంలో టైటిళ్లను సొంతంచేసుకుంది. దానికి తోడు, ఆమె 2018 కామన్వెల్త్ క్రీడలు, 2018 ఆసియా క్రీడలలో ఒక్కొక్క రజత పతకాన్ని, ఉబెర్ కప్లో రెండు కాంస్య పతకాలను గెలుచుకుంది. సింధును 2020 మార్చి 8 న బిబిసి సంవత్సరపు భారతీయ మహిళా క్రీడాకారిణిగా ఎంపిక చేశారు. ఏప్రిల్లో, క్రీడలో శుభ్రమైన, న్యాయమైన ఆటను ప్రోత్సహించడానికి బి.డబ్యు,ఎఫ్ (BWF) కమిటీ ప్రచారానికి "ఐ యామ్ బాడ్మింటన్" రాయబారులలో ఒకరిగా ఆమె ఎన్నికయ్యారు. 2021 మేలో, క్రీడల్లో తారుమార్లను నివారించే లక్ష్యంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రచారం "బిలీవ్ ఇన్ స్పోర్ట్"లో బ్యాడ్మింటన్ నుండి వచ్చిన ఇద్దరు రాయబారులలో ఒకరిగా ఆమె ఎన్నికయ్యారు. హైదరాబాద్ హంటర్స్ జట్టుకు నాయకత్వం వహించింది.
|
|
పోటీ | 2016 |
---|---|
ఒలింపిక్స్ | రజతపతకం |
పోటీ | 2014 |
---|---|
కామన్ వెల్త్ క్రీడలు | కాంస్యపతకం |
పోటీ | 2011 |
---|---|
కామన్ వెల్త్ యువ క్రీడలు | స్వర్ణపతకం |
This article uses material from the Wikipedia తెలుగు article పి.వి. సింధు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.