నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 27 ఐరోపా దేశాలు, 2 ఉత్తర అమెరికా దేశాలు, 1 యూరేషియా దేశం సభ్యులుగా ఉన్న అంతర ప్రభుత్వ సైనిక కూటమి.
దీన్ని నార్త్ అట్లాంటిక్ అలయన్స్ అని కూడా అంటారు. ఈ సంస్థ 1949 ఏప్రిల్ 4 న సంతకం చేసిన ఉత్తర అట్లాంటిక్ ఒప్పందాన్ని అమలు చేస్తుంది.
రకం | సైనిక కూటమి |
---|---|
స్థాపించిన తేదీ | 1949 ఏప్రిల్ 4 |
ప్రధాన కార్యాలయం |
|
ఖర్చులు | €873.9 billion US$1.036 trillion |
ఆదర్శ వాక్యం | Animus in consulendo liber "A mind unfettered in deliberation" |
మూలాలు: Anthem: "The NATO Hymn" |
నాటో, తన సభ్య దేశాలకు ఒక సామూహిక భద్రతా వ్యవస్థను ఏర్పరుస్తుంది. దాని సభ్య దేశాలపై ఏదైనా బయటి దేశం దాడి చేస్తే దానికి ప్రతిస్పందనగా పరస్పర రక్షణకు సభ్యదేశాలు కట్టుబడి ఉంటాయి. నాటో ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్లో ఉంది. అయితే మిత్రరాజ్యాల కమాండ్ ఆపరేషన్స్ ప్రధాన కార్యాలయం బెల్జియంలోని మోన్స్ సమీపంలో ఉంది.
నాటోను స్థాపించిన సమయంలో సభ్యదేశాల సంఖ్య 12 ఉండేది. తదనంతరం కొత్త సభ్య దేశాల ప్రవేశంతో 30 కి పెరిగింది. నాటోలో తాజాగా ఉత్తర మాసిడోనియా 2020 మార్చి 27 న చేరింది. నాటో ప్రస్తుతం బోస్నియా హెర్జెగోవినా, జార్జియా, ఉక్రెయిన్ లను ఔత్సాహిక సభ్యులుగా గుర్తిస్తోంది. అదనంగా 20 దేశాలు నాటో శాంతి భాగస్వామ్య కార్యక్రమంలో పాల్గొంటాయి. మరో 15 దేశాలు సంస్థాగత సంభాషణ కార్యక్రమాలలో పాల్గొంటాయి. 2020లో నాటో సభ్యులందరి సంయుక్త సైనిక వ్యయం ప్రపంచ మొత్తం వ్యయంలో 57% పైగా ఉంది. 2024 నాటికి తమ GDP లో కనీసం 2% మొత్తాన్ని రక్షణ కోసం కేటాయించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం తమ లక్ష్యమని సభ్యులు అంగీకరించారు.
అదనపు 20 దేశాలు మరో 15 సంస్థాగత సంభాషణ కార్యక్రమాలలో పాలుపంచుకున్న దేశాలూ నాటో శాంతి భాగస్వామ్య కార్యక్రమంలో పాల్గొంటాయి. 2020లో నాటో సభ్యులందరి సంయుక్త సైనిక వ్యయం ప్రపంచపు మొత్తం వ్యయంలో 57 శాతానికి పైగా ఉంది. 2024 నాటికి తమ GDP లో కనీసం 2 శాతాన్ని రక్షణకు వినియోగించడం తమ లక్ష్యంగా సభ్యులు అంగీకరించారు.
రెండవ ప్రపంచ యుద్ధం తదనంతరం జర్మనీ లేదా సోవియట్ యూనియన్ తమపై దాడి చేసే అవకాశం ఉన్నట్లయితే, డంకిర్క్ ఒప్పందంపై ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ లు కూటమి, పరస్పర సహాయ ఒప్పందంపై 1947 మార్చి 4 న సంతకం చేశాయి. 1948లో, బ్రస్సెల్స్ ఒప్పందం ద్వారా బెనెలక్స్ దేశాలను చేర్చుకుని ఈ కూటమిని విస్తరించారు. అప్పుడు ఈ కూటమిని బ్రస్సెల్స్ ట్రీటీ ఆర్గనైజేషన్ (BTO) అని వెస్ట్రన్ యూనియన్ అనీ అన్నారు. ఆ తరువాత, 1949 ఏప్రిల్ 4 న పశ్చిమ యూనియన్లోని సభ్య దేశాలతో పాటు యునైటెడ్ స్టేట్స్, కెనడా, పోర్చుగల్, ఇటలీ, నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్ లు కలిసి ఉత్తర అట్లాంటిక్ ఒప్పందంపై సంతకం చేశాయి.
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో నాటో ఎటువంటి సైనిక కార్యకలాపాలు నిర్వహించలేదు. ప్రచ్ఛన్నయుద్ధం ముగిసిన తరువాత జరిగిన మొదటి కార్యకలాపాలు, 1990లో యాంకర్ గార్డ్, 1991లో ఏస్ గార్డ్. కువైట్పై ఇరాక్ చేసిన దండయాత్ర వీటికి మూలం. ఆగ్నేయ టర్కీకి కవరేజీని అందించడానికి వాయుమార్గాన ముందస్తు హెచ్చరిక విమానాలను పంపించారు. తరువాత త్వరిత-ప్రతిచర్య దళాన్ని ఆ ప్రాంతంలో మోహరించారు.
యుగోస్లేవియా విచ్ఛిన్నం ఫలితంగా 1992లో బోస్నియన్ యుద్ధం ప్రారంభమైంది. క్షీణిస్తున్న పరిస్థితి కారణంగా 1992 అక్టోబరు 9 న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 816 చేసింది. దీని ప్రకారం, సెంట్రల్ బోస్నియా హెర్జెగోవినా పై నో-ఫ్లై జోన్ ప్త్రకటించింది. దీనిని నాటో 1993 ఏప్రిల్ 12 న ఆపరేషన్ డెనై ఫ్లైట్తో అమలు చేయడం ప్రారంభించింది. 1993 జూన్ నుండి 1996 అక్టోబరు వరకు, ఆపరేషన్ షార్ప్ గార్డ్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియాకు వ్యతిరేకంగా ఆయుధాల నిషేధం, ఆర్థిక ఆంక్షల సముద్ర అమలును జోడించింది. 1994 ఫిబ్రవరి 28 న, నో-ఫ్లై జోన్ను ఉల్లంఘించిన నాలుగు బోస్నియన్ సెర్బ్ విమానాలను కూల్చివేయడంతో నాటో, తన మొదటి యుద్ధకాల చర్యను చేపట్టింది.
తదుపరి కాలంలో నాటో చేపట్టిన వైమానిక దాడులు యుగోస్లావ్ యుద్ధాలను ముగించడానికి తోడ్పడ్డాయి. దీని ఫలితంగా 1995 నవంబరులో డేటన్ ఒప్పందం కుదిరింది.
కొసావోలో KLA వేర్పాటువాదులు, అల్బేనియన్ పౌరులపై స్లోబోదాన్ మిలోసెవిచ్ నేతృత్వంలోని సెర్బియన్ అణిచివేతను ఆపడానికి చేసిన ప్రయత్నంలో, కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 1998 సెప్టెంబర్ 23 న తీర్మానం 1199 ని ఆమోదించింది. US ప్రత్యేక రాయబారి రిచర్డ్ హోల్బ్రూక్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు 1999 మార్చి 23 న విఫలమవడంతో అతను ఈ విషయాన్ని నాటోకి అప్పగించాడు, నాటో 1999 మార్చి 24 న 78 రోజుల బాంబు దాడిని ప్రారంభించింది. ఆపరేషన్ అలైడ్ ఫోర్స్ అప్పటి ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియా సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుంది. సంక్షోభ సమయంలో, కొసావో నుండి వచ్చిన శరణార్థులకు మానవతా సహాయం అందించడానికి నాటో, తన అంతర్జాతీయ ప్రతిచర్య దళాలలో ఒకటైన ACE మొబైల్ ఫోర్స్ (ల్యాండ్) ను అల్బేనియాలో అల్బేనియా ఫోర్స్ (AFOR) పేరుతో మోహరించింది.
బెల్గ్రేడ్లోని చైనీస్ రాయబార కార్యాలయంపై బాంబు దాడితో సహా పౌర ప్రాణనష్టం అధికంగా జరిగింది. మిలోసెవిక్ చివరకు 1999 జూన్ 3 న కొసావో యుద్ధాన్ని ముగించి అంతర్జాతీయ శాంతి ప్రణాళిక నిబంధనలను అంగీకరించాడు. జూన్ 11న, మిలోసెవిక్ UN తీర్మానం 1244 ను ఆమోదించాడు. దీని ప్రకారం KFOR అనే శాంతి పరిరక్షక దళాన్ని స్థాపించడానికి నాటో తోడ్పడింది.
యునైటెడ్ స్టేట్స్లో సెప్టెంబర్ 11 దాడుల కారణంగా, నాటో చరిత్రలో మొదటిసారిగా నాటో చార్టర్లోని ఆర్టికల్ 5 ను అమలు చేయవలసి వచ్చింది. సభ్యునిపై దాడిని అందరిపై దాడిగా పరిగణించాలని ఆ ఆర్టికల్ పేర్కొంటుంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ నిబంధనల ప్రకారం దాడులు దీనికి అర్హమైనవేనని నాటో నిర్ధారించడంతో 2001 అక్టోబర్ 4 న ఆదేశం ధృవీకరించబడింది. దాడులకు ప్రతిస్పందనగా నాటో తీసుకున్న ఎనిమిది అధికారిక చర్యలలో ఆపరేషన్ ఈగిల్ అసిస్ట్, ఆపరేషన్ యాక్టివ్ ఎండీవర్లు ఉన్నాయి., ఈ ఆపరేషన్లు 2001 అక్టోబర్ 4 న ప్రారంభమయ్యాయి.
కూటమి ఐక్యతను చూపింది: 2003 ఏప్రిల్ 16 న, 42 దేశాలకు చెందిన దళాలతో ఏర్పాటైన అంతర్జాతీయ భద్రతా సహాయ దళానికి (ISAF) నేతృత్వం వహించేందుకు నాటో అంగీకరించింది. ఒప్పందం సమయంలో ISAFకి నాయకత్వం వహించిన రెండు దేశాలైన జర్మనీ, నెదర్లాండ్స్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పందొమ్మిది మంది నాటో రాయబారులు దీనిని ఏకగ్రీవంగా ఆమోదించారు. నాటోకి నియంత్రణను అప్పగించడం ఆగస్టు 11న జరిగింది. ఉత్తర అట్లాంటిక్ ప్రాంతం వెలుపల ఒక మిషన్కు బాధ్యత వహించడం నాటో చరిత్రలో ఇది మొదటిసారి.
14 ఏప్రిల్ 2021న, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ మే 1 నాటికి ఆఫ్ఘనిస్తాన్ నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడం ప్రారంభించడానికి కూటమి అంగీకరించిందని తెలిపాడు. నాటో దళాల ఉపసంహరణ ప్రారంభమైన వెంటనే, తాలిబాన్ ఆఫ్ఘన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడిని ప్రారంభించింది, కూలిపోతున్న ఆఫ్ఘన్ సాయుధ దళాల పైకి వేగంగా ముందుకు సాగింది. 2021 ఆగస్టు 15 నాటికి, తాలిబాన్ మిలిటెంట్లు ఆఫ్ఘనిస్తాన్లోని అత్యధిక భాగాన్ని నియంత్రణ లోకి తెచ్చుకున్నారు. రాజధాని నగరం కాబూల్ను చుట్టుముట్టారు. నాటో సభ్య దేశాలలోని కొంతమంది రాజకీయ నాయకులు ఆఫ్ఘనిస్తాన్ నుండి పాశ్చాత్య దళాలను అస్తవ్యస్తంగా ఉపసంహరించుకోవడం, ఆఫ్ఘన్ ప్రభుత్వం పతనం కావడం నాటో స్థాపించినప్పటి నుండి ఎదుర్కొన్న అతిపెద్ద పరాజయంగా అభివర్ణించారు.
ఆగష్టు 2004లో, ఇరాక్ యుద్ధ సమయంలో, ఇరాకీ భద్రతా దళాలకు సహాయం చేయడానికి ఒక శిక్షణ మిషన్ - నాటో నాటో ట్రైనింగ్ మిషన్ - ను ఏర్పాటు చేసింది. నాటో ట్రైనింగ్ మిషన్-ఇరాక్ (NTM-I) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1546 నిబంధనల ప్రకారం ఇరాక్ మధ్యంతర ప్రభుత్వపు అభ్యర్థన మేరకు స్థాపించారు. NTM-I లక్ష్యం ఇరాక్ భద్రతా దళాల శిక్షణా నిర్మాణాలు, సంస్థల అభివృద్ధికి సహాయం చేయడం. తద్వారా ఇరాక్ అవసరాలను తీర్చే సమర్థవంతమైన, స్థిరమైన సామర్థ్యాన్ని నిర్మించడం. NTM-I అనేది పోరాట మిషన్ కాదు, ఇది నార్త్ అట్లాంటిక్ కౌన్సిల్ రాజకీయ నియంత్రణలో ఉన్న ఒక ప్రత్యేకమైన మిషన్.
2009 ఆగస్టు 17 నుండి, సోమాలి సముద్రపు దొంగల నుండి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లోను, హిందూ మహాసముద్రంలోనూ సముద్ర ట్రాఫిక్ను రక్షించడానికి, ప్రాంతీయ రాష్ట్రాల నావికాదళాలు, కోస్ట్ గార్డ్లను బలోపేతం చేయడానికీ నాటో యుద్ధనౌకలను మోహరించింది. ఈ ఆపరేషన్ను నార్త్ అట్లాంటిక్ కౌన్సిల్ ఆమోదించింది. ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ నుండి యుద్ధనౌకలు అనేక ఇతర దేశాల నౌకలు కూడా ఇందులో చేరాయి. సోమాలియాలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మిషన్లో భాగంగా సహాయాన్ని పంపిణీ చేస్తున్న ఆపరేషన్ అలైడ్ ప్రొవైడర్ నౌకలను రక్షించడంపై ఆపరేషన్ ఓషన్ షీల్డ్ దృష్టి సారించింది. రష్యా, చైనా, దక్షిణ కొరియాలు కూడా ఈ కార్యకలాపాలలో పాల్గొనేందుకు యుద్ధ నౌకలను పంపాయి. ఈ ఆపరేషన్ సముద్రపు దొంగల దాడులను నిరోధించడానికి, అంతరాయం కలిగించడానికి, నౌకలను రక్షించడానికీ, ఈ ప్రాంతంలో సాధారణ స్థాయి భద్రతను పెంచడానికీ నాటో ప్రయత్నించింది.
లిబియా అంతర్యుద్ధం సమయంలో, కల్నల్ ముయమ్మర్ గడ్డాఫీ ప్రభుత్వానికి నిరసనకారులకూ మధ్య హింస పెరిగింది. 2011 మార్చి 17 న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1973 ని ఆమోదించింది. ఇది కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. పౌరులను రక్షించడానికి సైనిక చర్యకు అనుమతి ఇచ్చింది. మార్చి 19న ఫ్రెంచ్ వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ హర్మట్టన్తో నాటో సభ్యులతో కూడిన సంకీర్ణం లిబియాపై నో-ఫ్లై జోన్ను అమలు చేయడం ప్రారంభించింది.
నాటోలో ప్రధానంగా ఐరోపా, ఉత్తర అమెరికా ఖండాల్లోని ముప్పై దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ దేశాలలో కొన్నిటికి బహుళ ఖండాలలో భూభాగం ఉంది. నాటో పరిధి దక్షిణాన, అట్లాంటిక్ మహాసముద్రంలోని కర్కట రేఖ వరకు ఉంది. తొలి ఒప్పంద చర్చల సమయంలో అమెరికా, బెల్జియన్ కాంగో వంటి కాలనీలను ఒప్పందం నుండి మినహాయించాలని పట్టుబట్టింది. అయితే ఫ్రెంచ్ అల్జీరియా 1962 జూలై 3 న స్వాతంత్ర్యం పొందే వరకు నాటో పరిధిలో ఉండేది. ఈ ముప్పై దేశాల్లో పన్నెండు 1949లోనే చేరిన మూల సభ్యులు. మిగిలిన పద్దెనిమిది మంది తదనంతరం చేసిన విస్తరణలలో చేరాయి.
1960ల మధ్య నుండి 1990ల మధ్య వరకు, ఫ్రాన్స్ "గాల్లో-మిటర్రాండిజం" అనే విధానం ప్రకారం నాటో కు అతీతంగా సైనిక వ్యూహాన్ని అనుసరించింది. నికోలస్ సర్కోజీ 2009లో సమీకృత సైనిక కమాండ్, డిఫెన్స్ ప్లానింగ్ కమిటీలో ఫ్రాన్స్ తిరిగి చేరాలని చర్చలు జరిపాడు. తరువాతి సంవత్సరం ఈ కమిటీని రద్దు చేసారు. న్యూక్లియర్ ప్లానింగ్ గ్రూప్ లో చేరని ఏకైక నాటో సభ్య దేశం ఫ్రాన్స్ మాత్రమే. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ల వలె కాకుండా, ఫ్రాన్సు తన అణ్వాయుధ జలాంతర్గాములను కూటమికి అప్పగించదు. కొద్దిమంది సభ్యులు తమ స్థూల దేశీయోత్పత్తిలో రెండు శాతం కంటే ఎక్కువ, రక్షణ కోసం ఖర్చు చేస్తారు. నాటో రక్షణ వ్యయంలో మూడొంతుల వాటా యునైటెడ్ స్టేట్స్దే.
This article uses material from the Wikipedia తెలుగు article నాటో, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.