మట్టి, జీవానికి ఆధారమైన సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, వాయువులు, ద్రవాలు, జీవ పదార్థాల మిశ్రమం.
భూమిలో మట్టి ఉండే భాగాన్ని పెడోస్పియర్ అని అంటారు. ఈ పెడోస్ఫియరు పొర నాలుగు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది:
పై విధులన్నిటి కారణంగా మట్టి మార్పులకు లోనౌతూంటుంది.
మట్టిని నేల/నేలలు అని కూడ అనవచ్చు. భూమి అని, ధూళి అనీ కూడా అంటారు; కొన్ని శాస్త్రీయ నిర్వచనాల్లో ధూళి అంటే స్థానభ్రంశం చెందిన మట్టి అని నిర్వచిస్తూ, ఆ రెండింటి మధ్య భేదాన్ని సూచిస్తారు.
లిథోస్పియర్, హైడ్రోస్పియర్, వాతావరణం, జీవావరణాలతో పెడోస్పియర్ పరస్పర సంబంధంలో ఉంటుంది. మట్టి, ఖనిజాలూ సేంద్రీయ పదార్థాలతో కూడుకున్న ఘన స్థితి లోను, వాయువులను (మట్టి వాతావరణం), నీటినీ (మట్టి ద్రావణం) కలిగి, సూక్ష్మరంధ్రాలతో బోలుగా ఉండే స్థితిలోనూ ఉంటుంది. దీన్ని బట్టే శాస్త్రవేత్తలు, మట్టి ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉంటుందని సంభావిస్తారు.
వాతావరణం, రిలీఫ్ (ఎత్తు, ధోరణి, భూఖండిక వాలు), జీవులు, కాలక్రమంలో సంకర్షణ చెందుతూ ఉండే మాతృ పదార్థాలు (సహజ ఖనిజాలు) వంటి అనేక కారకాల సమ్మేళనమే నేల. ఇది అనేక భౌతిక, రసాయన, జీవ ప్రక్రియలకు లోనౌతూ నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. వీటి కారణంగా శైథిల్యం జరుగుతూ ఉంటుంది. దాని సంక్లిష్టత కారణం గాను, బలమైన అంతర్గత అనుసంధానాల కారణంగానూ, మట్టిని పర్యావరణ శాస్త్రవేత్తలు ఒక పర్యావరణ వ్యవస్థగా భావిస్తారు.
సాధారణంగా మట్టిలో 50% ఘనపదార్థాలు (45% ఖనిజాలు, 5% సేంద్రియ పదార్థం), 50% ఖాళీలు (రంధ్రాలతో కూడుకుని) ఉంటాయి. ఈ రంధ్రాల్లో సగభాగాన్ని నీరు, మిగతా సగాన్ని వాయువులూ ఆక్రమించి ఉంటాయి. ఖనిజాలు, సేంద్రీయ పదార్థాల శాతం స్వల్పకాలావధుల్లో స్థిరంగా ఉంటుంది. నీరు, వాయువుల శాతం మాత్రం చాలా ఎక్కువగా మారుతూ ఉంటుంది. ఒకటి పెరిగితే రెండవది అంతే మొత్తంలో తగ్గుతుంది. ఈ సూక్ష్మ రంధ్రాల్లో ఉండే స్థలం ద్వారా, మట్టిలో ఉండే జీవానికి కీలకమైన గాలీ, నీరూ ప్రవహిస్తూ ఉంటాయి. మట్టిలో ఉండే సాధారణ సమస్య అయిన అవిరళత (ఒత్తుగా, బిగుతుగా, ఖాళీల్లేకుండా ఉండడం - ఇంగ్లీషులో కాంపాక్షన్) కారణంగా, ఈ ఖాళీ తగ్గి, వీటి ప్రవాహానికి అవరోధం ఏర్పడుతుంది. దాంతో మట్టిలో ఉండే మొక్కల వేర్లకు, జీవులకూ గాలి, నీరూ సరిగా అందకుండా పోతుంది.
సరిపడినంత సమయం ఉన్నపుడు, నేలల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పొరలు ఉండే మట్టి ప్రొఫైల్ ఏర్పడుతుంది. ఈ పొరల ఆకృతి, సమ్మేళనం, సాంద్రత, సచ్ఛిద్రత (పోరాసిటీ), స్థిరత్వం, ఉష్ణోగ్రత, రంగు, రియాక్టివిటీ వంటి లక్షణాలలో భిన్నత్వం ఉంటుంది. ఈ పొరల మందంలో చాలా అంతరం ఉంటుంది. సాధారణంగా వీటి మధ్య ఖచ్చితమైన సరిహద్దులు ఉండవు. మట్టి లోని పదార్థాల రకాలు, వాటిని మార్పులకు లోను చేసే ప్రక్రియలు, ఆ ప్రక్రియలను ప్రభావితం చేసే కారకాలపై ఆధారపడి ఈ సరిహద్దులు ఏర్పడతాయి. మట్టి లక్షణాలపై జీవసంబంధమైన ప్రభావాలు ఉపరితలం దగ్గర బలంగా ఉండగా, భౌగోళిక రసాయన ప్రభావాలు లోతుకు వెళ్ళేకొద్దీ పెరుగుతూ ఉంటాయి. ప్రౌఢస్థితిలో ఉండే మట్టి ప్రొఫైళ్ళలో సాధారణంగా A, B, C అనే మూడు ప్రాథమిక పొరలు ఉంటాయి. A, B పొరలు సాధారణంగా సోలమ్లో ఉంటాయి. మట్టిలో ఉండే జీవపదార్థం ఎక్కువగా సోలమ్ లోనే ఉంటుంది. అందున్నూ, A పొర లోనే ఇది మరింత ప్రముఖంగా ఉంటుంది.
This article uses material from the Wikipedia తెలుగు article మట్టి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.