భాయ్ వీర్ సింగ్ (5 డిసెంబర్ 1872 -10 జూన్ 1957 ) ప్రముఖ కవి, సిక్కు పునురుజ్జివ ఉద్యమానికి వేదాంతి, పంజాబీ సాహిత్య, సంప్రదాయాల పునరుర్ధరణకు కృషి చేసిన వ్యక్తి.
ఆయన చేసిన కృషి చాలా సిక్కులకు ప్రభావశీలమైనది. సిక్కు మతాన్ని నమ్మిన సాధువులకు ఇచ్చే భాయ్ పదంతో ఆయనను గౌరవించింది సిక్కు సమాజం.
1872లో అమృత్ సర్లో డాక్టర్ చరణ్ సింగ్ కు మొదటి సంతానంగా జన్మించారు వీర్. ముల్తాన్ రాజ్యానికి వైస్ గవర్నర్ కి సమానమైన హోదా దీవాన్ కౌరా మాల్ వంశం వీరిది. ఆయన తాత కహ్న్ సింగ్ (1788-1878) సిక్కు మఠంలో సిక్కు మత ప్రబోధకునిగా ఉన్నారు. సంస్కృతం, బ్రజ్ భాషల్లోనూ, ఆయుర్వేదం, సిద్ధా, యునానీ వైద్యాల్లో పండుతుడు కహ్న్ సింగ్. ఆయన తన విద్యలన్నీ ఒక్కగానొక్క కొడుకు చరణ్ సింగ్ కు నేర్పారు. చరణ్ సిక్కు సమాజంలో చాలా ప్రముఖమైన వ్యక్తి. ఆయన కవిత్వం, సంగీతంలో ప్రావిణ్యం కలవారు. ఈ సాహిత్యాభిలాషను కొడుకు వీర్ సింగ్ కు అలవరిచారు చరణ్. వీర్ సింగ్ 17వ ఏట తనంత తానుగా చతర్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. వీర్ సింగ్ అమృత్ సర్ లో 1957 జూన్ 10న మరణించారు.
వీర్ సింగ్ ప్రాచీన సిక్కు సాహిత్యాన్నే కాక, ఆధునిక ఆంగ్ల చదువు కూడా చదువుకున్నారు. పర్షియన్, ఉర్దు, సంస్కృత గ్రంథాలు కూడా చదివారు ఆయన. అమృత్ సర్లో చర్చి మిషన్ స్కూల్ లో మెట్రిక్యులేషన్ పరీక్షలో మండలం మొత్తం మీద మొదటి స్థానం సాధించారు ఆయన. చర్చి మిషన్ హైస్కూలులో మాధ్యమిక విద్యను అభ్యసించే సమయంలో తోటి విద్యార్థులు క్రిస్టియన్ మతాన్ని పొగడడంతో, సిక్కు మతంపై అభిమానం ఉన్న వీర్ సింగ్ కు వారి మాటలు నచ్చేవి కావు. అందుకే ఆధునిక సాహిత్య రీతులను ఉపయోగించి సిక్కు మత ప్రచారం చేయడం ప్రారంభించారు వీర్ సింగ్. సిక్కు మతానికి చెందిన కథలు, కవితలు, పురాణాలు, చరిత్ర, తాత్విక ఆలోచనలను రాశారు వీర్ సింగ్.
వీర్ సింగ్ కవిగా తన కెరీర్ ఎంచుకున్నారు. మెట్రిక్యులేషన్ పరీక్ష అయిన తరువాత తన తండ్రి స్నేహితుడు వాజిర్ సింగ్ తో కలసి ఒక ప్రింటింగ్ ప్రెస్ ను మొదలుపెట్టారు వీర్. మొదటగా స్కూలు పిల్లలకు భౌగోళిక పాఠ్యపుస్తకాలను ప్రింట్ చేశారు వారు.
సింగ్ సభా ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొనేవారు. తన ఆశయాలను ప్రచారం చేయడానికి ఖల్సా ట్రాక్ట్ సొసైటీని 1894లో స్థాపించారు ఆయన. ఈ సొసైటీ పంజాబీ ఆధునిక సాహిత్యాన్నే మార్చివేసింది.
సిక్కు వేదాంతాన్ని, చరిత్రను, తత్త్వాన్నీ నిర్గునైరా అనే పేరుతో తక్కువ ఖర్చులో పుస్తకాలు ప్రచురించేది ఈ సొసైటీ. ఈ పత్రిక ద్వారా పాఠకులకు బాగా దగ్గరయ్యారు వీర్ సింగ్. శ్రీ గురు నానక్ చమత్కార్, శ్రీ గురు కల్గిధర్ చమత్కార్ పుస్తకాలను ప్రతీ ప్రచురణలోనూ సీరియల్ గా ప్రచురించేవారు ఆయన.
సుందరి (1898), బిజయ్ సింగ్ (1899), సత్వంత్ కౌర్ (1900లో మొదటి భాగం, 1927లో రెండో భాగం) వంటి నవలలు రాశారు ఆయన. అవంతిపూర్ దే ఖందర్ నవలలో కాశ్మీర్ లో హిందూ విగ్రహాల ధ్వంసం గురించి వర్ణించారు ఆయన.
సుభగ్జీ దా సుధార్ హితిన్ బాబా నౌధ్ సింగ్ నవలలో పురాణ పాత్ర రాణా సూరత్ సింగ్ గురించి రాశారు. ఆయన నవలల్లో భర్త చనిపోయిన ఆడవారు తిరిగి పెళ్ళి చేసుకోవడాన్ని సమర్ధిస్తూ, వారి అభ్యున్నతి గురించి రాశారు.
ఆ తరువాత దిల్ తరంగ్ (1920), తరెల్ తుప్కే (1921), లహిరన్ దే హర్ (1921), మటక్ హులరే (1922), బీలియన్ దే హర్ (1927), మేరే సయియన్ జియో (1953) వంటి రచనలు చేశారాయన.
నవంబరు 1899లో పంజాబీ వార పత్రిక ఖల్సా సమాచార్ ను ప్రారంభించారు. గైనీ హజ్రా సింగ్ రాసిన నిఘంటువును విస్తరించి 1927లో ప్రచురించారు. సిఖన్ దీ భగత్ మలా (1912), ప్రాచీన్ పంత్ ప్రకాశ్ (1914), పురాతన్ జనమ్ సఖి (1926), సఖి పోథీ (1950) వంటి ప్రాచిన సిక్కు రచనలను తిరిగి ప్రచురించారు వీర్ సింగ్.
1955లో సాహిత్య అకాడమీ అవార్డు, 1956లో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి ఆయనను గౌరవించింది భారత ప్రభుత్వం.
-
This article uses material from the Wikipedia తెలుగు article భాయ్ వీర్ సింగ్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.