సెయ్న్ట్ పీటర్స్బర్గ్ లేదా సెయింట్ పీటర్స్బర్గ్ లేదా సెయిన్ట్ పీటర్స్బర్గ్ రష్యాలోని రెండో అతిపెద్ద నగరం.
న్యెవ నది తీరాన, ఫిన్లెన్డ్ సింధుశాఖ దగ్గర, ఈ నది బాల్టిక్ సముద్రంలో కలిసే చోటన ఈ నగరం ఉంది. 2021 ముగింపు నాటికి సుమారు 56 లక్షల జనాభా కల ఈ నగరం, ఐరోపాలోని అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో నాలుగో స్థానంలో ఉంది. కాగా మొదటి మూడు నగరాలూ, అదే వరుసలో ఇస్తన్బుల్, మాస్కో, లన్డన్లు. ఇది బాల్టిక్ సముద్ర తీరాన గల నగరాల్లో అత్యధిక జనాభా గల నగరం. నాటి రాచరిక రష్యా రాజధానిగా, రాజకీయ ప్రాధాన్యత గల రేవుగా విలసిల్లిన ఈ నగరం, నేడు సమాఖ్య నగరంగా ఉంది.
సెయింట్ పీటర్స్బర్గ్ Санкт-Петербург (Russian) | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
— సమాఖ్య నగరం — | ||||||||
Top-down, left-to-right: The Winter Palace; Palace Bridge; Peter and Paul Cathedral; Saint Isaac's Cathedral; the General Staff Building; the Moyka River from the Pevchesky Bridge to the Red Bridge | ||||||||
| ||||||||
Political status | ||||||||
Country | Russia | |||||||
Federal district | Northwestern | |||||||
Economic region | Northwestern | |||||||
Established | 1703 మే 27 | |||||||
Government (as of October 2018) | ||||||||
• Governor | Alexander Beglov (UR) | |||||||
• Legislature | Legislative Assembly | |||||||
Statistics | ||||||||
Area | ||||||||
• Total | 1,439 km2 (556 sq mi) | |||||||
Area rank | 82nd | |||||||
Time zone(s) | మూస:RussiaTimeZone | |||||||
ISO 3166-2 | RU-SPE | |||||||
License plates | 78, 98, 178, 198 | |||||||
Official languages | Russian |
1703 మే 27న, నాడు ౘారుగా ఉన్న పీటరు మహావీరుడు స్వీడిష్ దుర్గమైన 'న్యెన్షన్ట్స్'ను ఆక్రమించుకుని, ఆ స్థలంలో ఈ నగరాన్ని నెలకొల్పాడు. ఆపోస్తలు సెయ్న్ట్ పీటరు (పునీత పేతురు) పేరు మీద ఈ నగరానికి కొత్త పేరు పెట్టాడు. అప్పటి ౘారు పాలనావ్యవస్థ ముగిసి, రష్యన్ సామ్రాజ్యం ఏర్పడి, రష్యా ఐరోపా అగ్రశక్తుల్లో ఒకటిగా అవ్వడానికి మొదటి మొట్టు ఈ నగర నిర్మాణంతో పడినట్లుగా రష్యన్ సంస్కృతిలోనూ, చరిత్రలోనూ భావిస్తారు. నిర్మాణం నాటికి ఉన్న ౘారు పాలనకూ, తరువాతి రష్యన్ సామ్యాజ్యానికీ, వెరసీ 1713–1918 వరకూ (మధ్యలో మాస్కో రాజధానిగా ఉన్న 1728–30 సంవత్సరాలు మినహా), ఈ నగరం రష్యా రాజధానిగా ఉంది. 1917లోని అక్టోబరు విప్లవం తరువాత బొల్షెవికులు మాస్కోను తమ రాజధానిగా చేసుకున్నారు.
నేడు రష్యా సాంస్కృతిక కేంద్రంగా ఎదిగిన ఈ నగరం, 2018లో జరిగిన ఫిఫా ప్రపంచకప్తో అత్యధిక పర్యటకుల సందర్శనలను (1.5 కోట్ల మంది) అందుకుంది. ఈ నగరం రష్యాలోనే కాక ఐరోపాలోని ముఖ్య ఆర్థిక, శాస్త్ర, పర్యటక కేంద్రాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. నేటి కాలంలో ఇది "రష్యా ఉత్తర రాజధాని"గా పేరుగాంచిది. చాలా ప్రభుత్వ సంస్థల కార్యాలయాలకు ఈ నగరం నిలయంగా ఉంది. వాటిలో ముఖ్యమైనవి రష్యా రాజ్యాంగ న్యాయస్థానం, హెరల్డిక్ కౌన్సిల్ ఒఫ్ ద ప్రెసిడెన్ట్ ఒఫ్ రష్యన్ ఫెడరేషన్. ఈ నగరంలో ఉన్న మరో ముఖ్యమైన సంస్థ రష్యా జాతీయ గ్రంథాలయం. రష్యా నావికా దళమువీ, రష్యా సాయుధ దళాల పశ్చిమ సైనిక జిల్లాలవీ ప్రధాన కార్యాలయాలు కూడా ఈ నగరంలోనే ఉన్నాయి. ప్రస్తుతం మాస్కోలో ఉన్న రష్యా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఇక్కడికి మార్చాలని నిర్ణయించడమైనది. సెయ్న్ట్ పీటర్స్బర్గ్, ఇతర సంబంధిత స్మారక కట్టడాల చారిత్రక కేంద్రం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటి. ప్రపంచంలో అతి పెద్ద కళా సంగ్రహశాలల్లో ఒకటైన హర్మిటిజ్, ఐరోపాలో అత్యంత పొడవాటి ఆకాశహార్మ్యం లఖ్త సెన్టర్ ఈ నగరంలోని ఇతర విశేషాలు. ఈ నగరం 2018 ఫిఫా ప్రపంచకప్, యు.ఇ.ఎఫ్.ఎ యురో 2020 క్రీడా కార్యక్రమాలను నిర్వహించింది.
రష్యా పాశ్చాత్యీకరణ మద్దతుదారుడైన నాటి ౘారు పీటరు మహావీరుడు, సంక్ట్ పిటర్బర్గ్ అనే డచ్ పేరుతో ఈ నగరాన్ని నెలకొల్పాడు. అంటే సంతు పేతురు నగరం అని అర్థం. బర్గ్ అంటే నగరం అని అర్థం. డచ్ వ్యాకరణాన్ననుసరించి రోమన్ లిపిలో Sankt-Pieter-Burchగా వ్రాసేవారు. తరువాత జర్మన్ ప్రభావంతో Sankt-Peterburgగా వ్రాసేవారు. 1914 సెప్టెంబరు 1న మొదటి ప్రపంచ యుద్ధం మొదలవగానే జర్మన్ వాసనలు వదులుకోవాలనే ఉద్దేశముతో నాటి ప్రభుత్వం ఈ పేరును ప్యెట్రగ్రట్గా రష్యీకరించింది. ఈ పదం అర్థం కూడా పీటరు నగరం అనే. ప్రముఖ రష్యన్ నాయకుడు లెనిన్ మరణం తరువాత, ఆయన గౌరవార్థం, 1926, జనవరి 26న ఈ నగరం పేరు ల్యెన్యెన్గ్రట్గా మార్చారు. అంటే లెనిన్ నగరం అని అర్థం. 1991, సెప్టెంబరు 6న నగరవ్యాప్త అభిప్రాయ సేకరణ ఫలితాన్ని అనుసరించి మళ్ళీ జర్మన్ పేరైన సంక్ట్ పిటర్బర్గ్గా (Sankt-Peterburg) మార్చారు. రష్యన్లు దీన్ని ప్యెట్యెర్ అనే పొట్టి పేరుతో పిలవగా ఆంగ్ల భాషలో సెయ్న్ట్ పీటర్స్బర్గ్గా (Saint Petersburg) పిలుస్తారు.
ఆంగ్లంలో ఇంతకు ముందు దీన్ని Saint Petersburgh అని ఒక అదనపు 'h'తో వ్రాసేవారు. ఇది ఆనాటి ఆంగ్ల 'బర్గ్' పదక్రమమైన burghను సూచిస్తుంది. 1814లో లన్డన్లోని బెయ్స్వాటర్ (Bayswater) జిల్లాలో సెయ్న్ట్ సఫీయా కతీడ్రలు పక్కన ఒక వీధిని తన పర్యటనలో భాగంగా నాటి ౘారు సందర్శించాడు. ఆనాటి నుండి ఆ వీధి సెయ్న్ట్ పీటర్స్బర్గ్ ప్లేస్గా పిలవబడుతుండగా, దాన్ని నేటికీ పాత పద్ధతిలో St. Petersburgh place అని వ్రాస్తుంటారు.
రష్యన్లు ఈ నగరాన్ని "ఐరోపాకు కిటికీ" అనీ, "పశ్చిమ ప్రపంచానికి కిటికి" అనీ పేర్కొంటారు. భూమికి అత్యంత ఉత్తర భాగాన ఉన్న మహానగరం ప్యెట్యెర్. ఈ నగరం మొత్తాన్నీ బురద నేలల మీద కట్టారు. అందుకని దీన్ని "ఉత్తర వెనిస్" అనీ, "రష్యా వెనిస్" అనీ పిలుస్తారు. ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్నందున, వేసవిలో ఒక నెల పాటు రాత్రి ఇక్కడ పూర్తిగా చీకటి పడదు. అందుకని దీన్ని "ద సిటి ఒఫ్ వైట్ నైట్స్" (The city of white nights, అర్థం: తెల్ల రాత్రుల పట్టణం) అని అంటారు. ఈ నగరంలో ఉన్న ఆడంబర నిర్మాణశైలికి గాను "ఉత్తరపు పెల్మైర" అనే పేరు వచ్చింది.
1611లో స్వీడిష్ ఆక్రమణదారులు న్యెవ నది మొదలు దగ్గర 'న్యెన్షన్ట్స్' దుర్గాన్ని కట్టారు. తరువాతి కాలంలో ఈ ప్రాంతం 'ఇంగర్మన్లాన్డ్' (Ingermanland)గా పిలవబడింది. ఇక్కడ ఇంగ్రియన్లు అనే ఫిన్నిక్ తెగ వారు ఉండేవారు. దుర్గం చుట్టూ న్యెన్ అనే నగరం ఏర్పడింది.
17వ శతాబ్ది చివరలో సముద్రయానం, నావికావ్యాపారాలపై ఆసక్తి గల పీటరు మహావీరుడికి, ఐరోపాతో వ్యాపారాలు చేసేందుకు ఒక రేవు కావలసి వచ్చింది. అప్పటికి తెల్ల సముద్రపు రేవు అయిన అర్ఖంగ్యెల్స్క్ సామ్రాజ్యానికి దూరంగా ఉత్తరాన ఉండి, చలికాలంలో వాడకానికి పనికివచ్చేది కాదు.
1703, మే 12న గ్రేట్ నొర్తర్న్ వార్ (Great Northern War, అర్థం: ఉత్తరపు మహా యుద్ధం)లో పీటరు న్యెన్షన్ట్స్ను చేజిక్కించుకుని, దుర్గాన్ని తీయించేసాడు. 1703, మే 27న సముద్రవంక దగ్గరి (సింధుశాఖకు 5 కి.మీ దూరంలో) జయకి దీవిలో పీటర్ అన్డ్ పొల్ దుర్గాన్ని కట్టించాడు. ఇది ఈ కొత్త నగరంలోని మొదటి కట్టడం.
రష్యాలోని వెట్టి కూలీలను ఈ నగరం కట్టడానికి వాడారు. కొంతకాలం పాటు స్వీడిష్ యుద్ధ ఖైదీలు కూడా, పీటరు కుడిభుజమైన అలెక్సన్డర్ మెన్షికొవ్ అధ్వర్యంలో[ఆధారం చూపాలి], ఈ నగర నిర్మాణానికి వాడుకోబడ్డారు. ఈ నిర్మాణంలో ఎన్నో వేల మంది సెర్ఫ్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నిర్మాణ పనులు జరిగినంత కాలం, పీటరు తన కుటుంబంతో మూడు గదుల చెక్కలింట్లో ఉండేవాడు.[ఆధారం చూపాలి] నిర్మాణం పూర్తయ్యాక, ఈ నగరం సెయ్న్ట్ పీటర్స్బర్గ్ గవర్నరేట్కు కేంద్రంగా మారింది. 1704 నుండే ప్యిటిర్ను రాజధానిగా తన మాటల్లో పిలుస్తున్న పీటరు, 1712లో రాజధానిని అధికారికంగా మాస్కో నుండి ప్యిటిర్కు మార్చాడు.
కట్టటం పూర్తయ్యాక మొదట్లో కొన్ని ఏళ్ళు న్యెవ నదికి కుడి ప్రక్కన, పీటర్ & పోల్ కతీడ్రల్ చుట్టూ నగరం విస్తరించుకుపోయింది. కానీ కొంత కాలానికే ఒక ప్రణాళిక ప్రకారం విస్తరణ జరపడం మొదలుపెట్టారు. 1716లో డొమెనికొ ట్రెజిని అనే ఆర్కిటెక్టు, వసిల్యెవ్స్కియ్ దీవిని నగర కేంద్రంగా పెట్టి, దాన్ని కాలువలతో దీర్ఘ చతురస్రపు గళ్ళుగా విభజించే పథకాన్ని సిద్ధం చేసాడు. ఈ పథకం పూర్తి అవలేదు కానీ, నగరంలో వీధులు ఉన్న తీరు చూస్తే ఇలా కట్టడం మొదలైందని అర్థం అవుతోంది. తరువాత అదే సంవత్సరంలో ఫ్రెన్చ్ ఆర్కిటెక్ట్ జీన్-బాప్టిస్ట్ అలెక్సాన్డ్రె లె బ్లాన్డ్ను పీటరు చీఫ్ ఆర్కిటెక్ట్గా నియమించాడు.
ఇలా ట్రెజినీ, ఇతర ఆర్కిటెక్ట్లు పీటరుని సంతృప్తి పరిచే ఆకృతులు తయారుచేసే క్రమంలో పుట్టిన నిర్మాణ శైలిని "పీట్రిన్ బరొక్" శైలిగా పేర్కొంటారు. 18వ శతాబ్ది ప్రారంభంలో కట్టిన కట్టడాల్లో ఈ శైలి కనిపిస్తుంది. నేడు వీటిలో ముఖ్యమైనవి మెన్షికొవ్ నగరు, కున్స్ట్కమర, పీటర్ & పౌలు కతీడ్రలు, ట్వెల్వ్ కొలెజ్యాలు. వీటితో పాటు 1724లో ఏర్పాటైన ఎకెడమీ ఒఫ్ సైన్సెస్, యునివర్సిటీ, ఎకెడమిక్ జిమ్నెయ్జ్యంలు కూడా ఈ కోవలోకి వస్తాయి.
1725లో, 52 ఏళ్ళ వయసులో పీటరు చనిపోయాడు. రష్యాను ఆధునీకరించాలన్న ఆయన ప్రయత్నాలకు ఉన్నత వర్గాల నుండి వ్యతిరేకత ఎదురైంది. ఆయనపై ఎన్నో హత్యాయత్నాలు జరగడమే కాక, ఆయన కొడుకు కూడా రాజద్రోహానికి పాల్పడ్డాడు. ఏదేమైననూ, పీటరు మరణం తరువాత, 1728లో, రాజుగా ఉన్న రెండవ పీటరు రాజధానిని మాస్కోకి మార్చాడు. మళ్ళీ ఇంకో నాలుగేళ్ళలో, అంటే 1732లో, అప్పటి చక్రవర్తినిగా ఉన్న అన్నా తిరిగి రాజధానిని ప్యిటిర్కు మార్చింది. ఆ తరువాత 186 ఏళ్ళ వరకూ రమనఫ్ వంశ పీఠంగా, ప్రభుత్వ రాజధానిగా ఈ నగరం ఉంది. మళ్ళీ 1917లో జరిగిన రష్యా విప్లవంతో ఈ నగరం యొక్క రాజధాని హోదాకు తెరపడింది.
1736–37లో నగరంలో మంటలు రేగి, చాలా భాగాల్లో తగలబడిపోయింది. తగలబడిపోయిన ప్రాంతాలను తిరిగి కట్టడానికి రాజనీతిజ్ఞుడు ఐన బుఱ్ఖఱ్ద్ ఖ్రిస్తొఫొర్ మినిఖ్ అధ్వర్యంలో ఒక బృందం తయారైంది. ఈ బృందం నగరాన్ని ఐదు విభాగాలుగా విభజించింది. నగర కేంద్రాన్ని నెవకీ, ఫొంతన్కకీ మధ్యన ఉన్న తూర్పు తీరానికి మార్చింది.
ఈ కేంద్రంలో మూడు వీధులు కట్టబడ్డాయి. మూడూ సరిగ్గా మధ్యలో ఉన్న ఎడ్మరల్టి బిల్డింగ్ దగ్గర కలుసుకుంటాయి. ఈ వీధుల పేర్లు నెఫ్స్కి ప్రొస్పెక్త్, గొఱొఖొవ వీధీ, వొజ్నెసెన్స్కియ్ అంతర్వృక్షరథ్య. నగరం ఏర్పడిన తరువాత 60 ఏళ్ళ పాటు విలసిల్లిన బరోకు నిర్మాణ కళ, ఎలిజబెత్ బరోకు శైలి వాడడంతో తారాస్థాయికి చేరింది. ఈ శైలిలో నిర్మాణాలు చేసిన వాళ్ళలో ముఖ్యుడు ఇటలీ వాసుడు బర్టొలొమెయొ రస్ట్రెల్లి. ఇతని కట్టడాల్లో ముఖ్యమైనది జిమ్ని ద్వరెౘ్ (Зимний дворец , అర్థం: శీతాకాలపు కోట). 1760ల్లో బరోకు శైలి చోటులోకి నియొ-క్లసికల్ శైలి వచ్చింది.
1762లో స్థాపించబడ్డ మాస్కో, సెయ్న్ట్ పీటర్స్బర్గ్ల రాతి కట్టడాల కమీషను, నగరంలో ఏ కట్టడం కూడా జిమ్ని ద్వరెౘ్ కంటే ఎత్తు ఉండకూడదనీ, కట్టడాల మధ్య ఎడం ఉండకూడదనీ నియమాలు పెట్టింది. 1760ల–1780ల మధ్యలో, కెథ్రిన్ మహావీరురాలి పాలనలో, నెవ తీరం చుట్టూ నల్లరాతి (గ్రనైటు) గట్లు కట్టబడ్డాయి.
1850లో నెవపైన మొట్టమొదటి పూర్తిస్థాయి వంతెన ఐన, బ్లగొవిషిన్స్కియ్ మొస్ట్పై రాకపోకలు మొదలయ్యాయి. దానికి ముందు కేవలం బల్లకుదుర్ల వంతెనలే ఉండేవి. 1769–1833లో తవ్విన ఒబ్వొడ్నియ్ కనల్ (Обводный канал , అర్థం: ఉపమార్గ కాలువ) నగరానికి దక్షిణ సరిహద్దు అయ్యింది.
This article uses material from the Wikipedia తెలుగు article సెయింట్ పీటర్స్బర్గ్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.