సర్వేపల్లి రాధాకృష్ణన్

సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888 సెప్టెంబరు 5 - 1975 ఏప్రిల్ 17  ; స్థానికంగా రాధాకృష్ణయ్య ) 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు.

అతను గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. అతను 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు. అతను 1939 నుండి 1948 వరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి నాల్గవ వైస్-ఛాన్సలర్‌గా, 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రెండవ వైస్-ఛాన్సలర్‌గా కూడా ఉన్నాడు. రాధాకృష్ణన్ తులనాత్మక మతం, తత్వశాస్త్రం యొక్క 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, విశిష్టమైన పండితులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో కింగ్ జార్జ్ వి చైర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్‌లో 1921 నుండి 1932 వరకు, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని స్పాల్డింగ్ చైర్ ఆఫ్ ఈస్టర్న్ రెలిజియన్ అండ్ ఎథిక్స్ కు 1936 నుండి 1952 వరకు తన సేవలనందించాడు. భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టారని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో (చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశాడు.

సర్వేపల్లి రాధాకృష్ణన్
సర్వేపల్లి రాధాకృష్ణన్


పదవీ కాలం
1962 మే 14 – 1967 మే 13
ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ
గుల్జారీలాల్ నందా (తాత్కాలిక)
లాల్ బహదూర్ శాస్త్రి
గుల్జారీలాల్ నందా (తాత్కాలిక)
ఇందిరా గాంధీ
ఉపరాష్ట్రపతి జాకిర్ హుస్సేన్
ముందు బాబూ రాజేంద్ర ప్రసాద్
తరువాత జాకిర్ హుస్సేన్

పదవీ కాలం
1952 జనవరి 26 – 1962 మే 12
అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్
ప్రధాన మంత్రి జవాహర్ లాల్ నెహ్రూ
తరువాత జాకిర్ హుస్సేన్

వ్యక్తిగత వివరాలు

జననం (1888-09-05)1888 సెప్టెంబరు 5
తిరుత్తణి , మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం 1975 ఏప్రిల్ 17(1975-04-17) (వయసు 86)
మద్రాసు, తమిళనాడు, భారతదేశం
రాజకీయ పార్టీ స్వతంత్రులు
జీవిత భాగస్వామి శివకామమ్మ
సంతానం 5 (కుమార్తెలు)
1 (కుమారుడు)
పూర్వ విద్యార్థి మద్రాసు విశ్వవిద్యాలయం
వృత్తి
  • తత్త్వవేత్త
  • అధ్యాపకుడు
పురస్కారాలు సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతరత్న (1954లో)

రాధాకృష్ణన్ తన జీవితంలో 1931లో నైట్‌హుడ్, 1954లో భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న, 1963లో బ్రిటిష్ రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గౌరవ సభ్యత్వంతో సహా అనేక ఉన్నత పురస్కారాలను పొందాడు. అతను భారతదేశంలోని వెనుకబడిన వృద్ధుల కోసం లాభాపేక్షలేని సంస్థ హెల్పేజ్ ఇండియా వ్యవస్థాపకులలో ఒకరు. రాధాకృష్ణన్ "ఉపాధ్యాయులు దేశంలో అత్యుత్తమ ఆలోచన గలవారు" అని విశ్వసించేవారు. 1962 నుండి, భారతదేశంలో ప్రతీ సంవత్సరం అతని పుట్టినరోజు సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.

జీవిత విశేషాలు

బాల్యం

సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబరు 5 న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరంలో ఉన్న తిరుత్తణిలో తమిళనాడుకు వలస వెళ్లిన తెలుగుదంపతులు సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు.[1] అతను తన ముగ్గురు తోబుట్టువులలో రెండవవాడు. అతని కుటుంబం ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామానికి చెందినది. అతని బాల్య జీవితం తిరుత్తణి, తిరుపతిలో గడిపారు. అతని తండ్రి స్థానిక జమీందార్ (స్థానిక భూస్వామి) సేవలో సబార్డినేట్ రెవెన్యూ అధికారి. అతని ప్రాథమిక విద్య తిరుత్తణిలోని కె.వి. హైస్కూల్‌లో సాగింది. 1896లో ఆయన తిరుపతిలోని హెర్మన్స్‌బర్గ్ ఎవాంజెలికల్ లూథరన్ మిషన్ పాఠశాలకు తరువాత వాలాజాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మారాడు.బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన.

విద్య

రాధాకృష్ణన్ తన విద్యాబ్యసన జీవితంలో స్కాలర్‌షిప్‌లు పొందాడు. హైస్కూల్ విద్య కోసం అతను వేలూరులోని వూర్హీస్ కాలేజీలో చేరాడు. ఎఫ్.ఏ (ఫస్ట్ ఆఫ్ ఆర్ట్స్) తరగతి ఉత్తీర్ణుడైన తర్వాత అతను 16 సంవత్సరాల వయస్సులో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ( మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది) చేరాడు. అతను 1907 లో అక్కడ నుండి పట్టభద్రుడయ్యాడు. అతను అదే కళాశాల నుండి తన మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు.

రాధాకృష్ణన్ తాను విద్యాభ్యసనలో ఎంచుకునే విషయాల కంటే యాదృచ్ఛికంగా తత్వశాస్త్రాన్ని అభ్యసించాడు. ఆర్థిక స్థోమత ఉన్న విద్యార్థి కావడంతో, అదే కళాశాలలో పట్టభద్రుడైన బంధువు రాధాకృష్ణన్‌కు తన తత్వశాస్త్ర పాఠ్యపుస్తకాలను అందించినప్పుడు, అది అతని విద్యా కోర్సు తత్త్వశాస్త్రంగా స్వయంచాలకంగా నిర్ణయించబడింది.

సర్వేపల్లి "ది ఎథిక్స్ ఆఫ్ ది వేదాంత అండ్ ఇట్స్ మెటాఫిజికల్ ప్రిసపోజిషన్స్" అనే అంశంపై తన బ్యాచిలర్ డిగ్రీ థీసిస్ రాశాడు. ఇది "వేదాంత వ్యవస్థలో నైతికతకు చోటు లేదనే ఆరోపణలకు సమాధానంగా ఉద్దేశించబడింది." అతనికి బోధించే ఇద్దరు ప్రొఫెసర్లు, రెవ్. విలియం మెస్టన్, డాక్టర్ ఆల్ఫ్రెడ్ జార్జ్ హాగ్ లు రాధాకృష్ణన్ చేసిన ప్రవచనాన్ని మెచ్చుకున్నారు. రాధాకృష్ణన్ థీసిస్ కేవలం ఇరవై సంవత్సరాల వయస్సులో ప్రచురించబడింది. రాధాకృష్ణన్ "భారతీయ సంస్కృతికి సంబంధించిన హాగ్ తో పాటు ఇతర క్రైస్తవ ఉపాధ్యాయుల విమర్శలు నా విశ్వాసానికి భంగం కలిగించాయి. నేను ఆశ్రయించిన సాంప్రదాయక ఆధారాలను కదిలించాయి." అని తెలిపాడు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ 
1963లో ఓవల్ ఆఫీస్‌లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీతో కలిసి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్

వివాహం, సంతానం

రాధాకృష్ణన్ మే 1903లో 10 సంవత్సరాల వయస్సు గల శివకామమ్మ (1893–1956) తో తన 16 వ యేట వివాహం జరిగింది ఆ దంపతులకు పద్మావతి, రుక్మిణి, సుశీల, సుందరి, శకుంతల అనే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వారికి సర్వేపల్లి గోపాల్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అతను చరిత్రకారుడిగా చెప్పుకోదగిన వృత్తిని కొనసాగించాడు. రాధాకృష్ణన్ కుటుంబ సభ్యులు, అతని మనుమలు, మనుమరాళ్లతో సహా ప్రపంచవ్యాప్తంగా అకాడెమియా, పబ్లిక్ పాలసీ, మెడిసిన్, లా, బ్యాంకింగ్, బిజినెస్, పబ్లిషింగ్, ఇతర రంగాలలో విస్తృతమైన వృత్తులను అభ్యసించారు. భారత మాజీ క్రికెటర్‌ వీ.వీ.ఎస్‌. లక్ష్మణ్‌ ఆయన మేనల్లుడు. శివకాము 1956 నవంబర్ 26న మరణించింది. అప్పటికి వారి వివాహమై దాదాపు 53 సంవత్సరాలు అయింది.

ఉద్యోగం

సర్వేపల్లి రాధాకృష్ణన్ 
బుజ్జాయి గీసిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రంపై తెలుగులో సర్వేపల్లి "రాధాకృష్ణయ్య" అని సంతకం చేసిన సర్వేపల్లి.

ఏప్రిల్ 1909లో, రాధాకృష్ణన్ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ విభాగానికి ఫ్రొఫెసర్ గా నియమితులయ్యాడు. 1918లో మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్.వి.నంజుండయ్య రాధాకృష్ణన్ తత్వశాస్త్రంలో ప్రతిభను గుర్తించి, పిలిపించుకుని ప్రొఫెసరుగా నియమించాడు. అక్కడ అతను మైసూర్‌లోని మహారాజా కళాశాలలో బోధించాడు. అతను ఉపన్యాసాలను విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వినేవారు. అప్పటికి అతను ది క్వెస్ట్, జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎథిక్స్ వంటి ప్రసిద్ధ పత్రికలకు అనేక వ్యాసాలు వ్రాసాడు. అతను తన మొదటి పుస్తకం "ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌" ని కూడా పూర్తి చేశాడు. అతని రెండవ పుస్తకం, "ది రీన్ ఆఫ్ రిలిజియన్ ఇన్ కాంటెంపరరీ ఫిలాసఫీ" 1920లో ప్రచురించబడింది.

కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్‌లు కోరారు. 1921 లో అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో కింగ్ జార్జ్ వి చైర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్‌ లో తత్వశాస్త్రంలో ప్రొఫెసర్‌గా నియమించబడ్డాడు. అతను జూన్ 1926లో బ్రిటిష్ సామ్రాజ్యంలో విశ్వవిద్యాలయాల కాంగ్రెస్‌లో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు. సెప్టెంబరు 1926లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఫిలాసఫీకి ప్రాతినిధ్యం వహించాడు. ఈ కాలంలో జరిగిన మరో ముఖ్యమైన విద్యాసంఘటన ఏమిటంటే , 1929లో ఆక్స్‌ఫర్డ్‌లోని మాంచెస్టర్ కాలేజీలో హిబర్ట్ జీవిత ఆదర్శాలపై ఉపన్యాసాన్ని అందించడానికి ఆహ్వానం అందింది. ఇది "యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్‌"గా పుస్తక రూపంలో ప్రచురించబడింది. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు అతను 'భారతీయ తత్వశాస్త్రం' అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకుంది.

1929లో మాంచెస్టర్ కళాశాలలో ప్రిన్సిపల్ జె. ఎస్ట్లిన్ కార్పెంటర్ ద్వారా ఖాళీ చేయబడిన పదవికి రాధాకృష్ణన్ ఆహ్వానించబడ్డాడు. దీంతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు తులనాత్మక మతంపై ఉపన్యాసాలు ఇచ్చే అవకాశం లభించింది. విద్యకు ఆయన చేసిన సేవలకు గాను జూన్ 1931 జన్మదిన వేడుకల్లో జార్జ్ V చేత నైట్ బిరుదు పొందాడు. ఏప్రిల్ 1932లో భారత గవర్నర్ జనరల్, ఎర్ల్ ఆఫ్ విల్లింగ్‌డన్ ద్వారా అధికారికంగా బిరుదును పొందినప్పటికీ , అతను ఆ తర్వాత బిరుదును స్వాతంత్ర్యానంతరం ఉపయోగించడం మానేశాడు. దీని బదులుగా అతని విద్యాసంబంధమైన 'డాక్టర్' బిరుదును ఇష్టపడేవాడు.

1931లో డా. సి.ఆర్.రెడ్డి తర్వాత రాధాకృష్ణన్ ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్‌గా పనిచేశాడు. 1931 నుండి 1936 వరకు ఆ పదవిలో ఉన్నాడు. తన మొదటి కాన్వకేషన్ ప్రసంగంలో, అతను తన స్థానిక ఆంధ్ర గురించి ఇలా మాట్లాడాడు,

"మనం ఆంధ్రులం అదృష్టవశాత్తూ కొన్ని విషయాల్లో స్థితప్రజ్ఞులం. భారతదేశంలోని ఏ ప్రాంతమైనా సమర్ధవంతమైన ఐక్యతా భావాన్ని పెంపొందించుకోగలిగితే అది ఆంధ్రలోనే అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సంప్రదాయవాదం పట్టు బలంగా లేదు. మన ఔదార్యత, మనస్సు యొక్క బహిరంగత బాగా తెలిసినవి. మన నైతిక భావం, సానుభూతి కల్పన సిద్ధాంతం వల్ల పెద్దగా తారుమారు కాలేదు. మా మహిళలు సాపేక్షంగా ఎక్కువ స్వేచ్ఛగా ఉన్నారు. మాతృభాషపై ప్రేమ మనందరినీ బంధిస్తుంది."

అప్పట్లో రాధాకృష్ణన్‌ పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు.

1931లోనే రాధాకృష్ణన్ "లీగ్ ఆఫ్ నేషన్స్ 'ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'" సభ్యులుగా ఎన్నుకైనాడు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకుడుగా పనిచేసాడు.. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశాడు.

1937లో, అతను సాహిత్యంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యాడు, అయితే ఈ నామినేషన్ ప్రక్రియ, గ్రహీతలందరికీ, ఆ సమయంలో పబ్లిక్ కాదు. అవార్డు కోసం తదుపరి ప్రతిపాదనలు 1960ల వరకు స్థిరంగా కొనసాగుతాయి. 1939లో Pt. మదన్ మోహన్ మాలవ్య తన వారసుడిగా బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) వైస్-ఛాన్సలర్‌గా రావాలని ఆహ్వానించారు. అతను జనవరి 1948 వరకు దాని వైస్-ఛాన్సలర్‌గా పనిచేశాడు.

1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ కు సభ్యుడుగా పనిచేసాడు. 1947 ఆగస్టు 14-15తేదీన మధ్యరాత్రి 'స్వాతంత్ర్యోదయం' సందర్భాన రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది.

1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు రాధాకృష్ణన్ నియమితుడైనాడు

రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు.

సర్వేపల్లి తాత్వికచింతన

ఇతను పాశ్చాత్య తత్వవేత్తలు ఎలా తమ భావనలను తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న వేదాంత ప్రభావానికి ఎలా లోనవుతున్నారో చూపించాడు. అతని దృష్టిలో తత్వం అనేది జీవితాన్ని అర్ధం చేసుకోవటానికి ఒక మార్గం, భారతీయ తత్వాన్ని అర్ధం చేసుకోవటం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించాడు. భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, అందులో వివేకం, తర్కం ఇమిడి ఉన్నాయని చూపించి, భారతీయ తాత్వికచింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాడు. [2]

చేపట్టిన పదవులు

సర్వేపల్లి రాధాకృష్ణన్ 
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై సర్వేపల్లి విగ్రహం
  • మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తాత్విక శాస్త్ర ఉపన్యాసకుడిగా, ఉపప్రాధ్యాపకుడుగా, ప్రాధ్యాపకుడిగా వివిధ పదవులను నిర్వహించాడు
  • 1918 నుండి 1921 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రాధ్యాపకుడిగా (ప్రొఫెసర్) పనిచేసాడు.
  • 1921లో, అప్పటి భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తాత్విక పీఠమైన, కింగ్ జార్జ్ 5 చెయిర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ కు రాధాకృష్ణన్‌ను నియమించారు.
  • 1926 జూన్‌లో బ్రిటనులో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రేసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు. తరువాత ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ తాత్విక కాంగ్రేసులో సెప్టెంబరు 1926లో కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు.
  • 1929లో ఆక్స్‌ఫర్డులోని మాంచెస్టరు కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేయుటకు అతనును ఆహ్వానించారు. దీనివలన ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు "తులనాత్మక మతం" (Comparative Religion) అనే విషయం మీద ఉపన్యాసం ఇవ్వగలిగే అవకాశం వచ్చింది.
  • 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతి (వైస్ ఛాన్సలర్)గా పనిచేసాడు.
  • 1936లో,స్పాల్డింగ్ ఫ్రొఫెసర్ ఆఫ్ ఈస్ట్రన్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ అనే పీఠంలో ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలో 1952లో భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు కొనసాగాడు.
  • 1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి (వైస్ ఛాన్సలర్)గా పనిచేసాడు.
  • 1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసాడు.
  • 1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరుపున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించాడు.
  • 1948లో విశ్వవిద్యాలయాల విద్యా కమిషనుకు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు.
  • 1948లో యునెస్కో కార్యనిర్వాహక బృందానికి అధ్యక్షుడిగా ఉన్నాడు.
  • 1952లో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయ్యాడు.
  • 1962లో బ్రిటీషు ఎకాడమీకి గౌరవసభ్యునిగా ఎన్నుకోబడ్డారు.

పొందిన గౌరవాలు

సర్వేపల్లి రాధాకృష్ణన్ 
అప్పటి భారత రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా భారతరత్న పురస్కారాన్ని అందుకుంటున్న సర్వేపల్లి

వివిధ దేశాల గౌరవాలు

  • ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు, గౌరవానికిగాను ప్రతీ సంవత్సరం అతను పుట్టిన రోజును సెప్టెంబరు 5 ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
  • 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్ఠాత్మక సర్ బిరుదు ఇతనును వరించింది.
  • 1954లో మానవ సమాజానికి అతను చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతరత్న బిరుదు పొందాడు.
  • 1954లో మెక్సికో ప్రభుత్వం ఆ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం" ఆర్డర్ ఆఫ్ ద అజ్ టెక్ ఈగిల్" పురస్కారాన్ని అందించింది.
  • 1961లో జర్మనీ పుస్తక సదస్సు శాంతి బహుమానం (Peace Prize of the German Book Trade) పొందాడు.
  • 1963 జూన్ 12న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కి గౌరవ సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు.
  • ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవాటి నుండి వందకు పైగా గౌరవ పురస్కారాలు, డాక్టరేటులు సంపాదించాడు.
  • ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయం సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్ధం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్ను ప్రకటించింది.

ఇతర గౌరవాలు

  • రాధాకృష్ణన్ చిత్రపటాన్ని భారతదేశ రాజ్యసభ ఛాంబర్‌లో అలంకరించారు.
  • 1933–37: సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఐదుసార్లు నామినేట్ చేయబడ్డాడు.
  • 1938: బ్రిటిష్ అకాడమీ ఫెలోగా ఎన్నికయ్యాడు.
  • 1947: ఇన్‌స్టూట్ ఇంటర్నేషనల్ డి ఫిలాసఫీలో శాశ్వత సభ్యునిగా ఎన్నిక.
  • 1959: ఫ్రాంక్‌ఫర్ట్ నగరం యొక్క గోథే ప్లేక్ పురస్కారం.
  • 1961: జర్మన్ బుక్ ట్రేడ్ యొక్క శాంతి బహుమతి.
  • 1962: భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం, ప్రతి సంవత్సరం సెప్టెంబరు 5న రాధాకృష్ణన్ పుట్టినరోజున జరుపుకుంటారు, "ఉపాధ్యాయులు దేశంలో అత్యుత్తమ ఆలోచన గలవారుగా ఉండాలి" అనే రాధాకృష్ణన్ విశ్వాసాన్ని గౌరవిస్తూ ఈ దినాన్ని జరుపుకుంటారు.
  • 1968: సాహిత్య అకాడమీ ఫెలోషిప్, ఒక రచయితకు సాహిత్య అకాడమీ అందించే అత్యున్నత గౌరవం (ఈ అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఆయన).
  • 1975: 1975లో టెంపుల్‌టన్ ప్రైజ్ అందుకున్నాడు. ఈ టెంపుల్టన్ ప్రైజ్ మొత్తాన్ని అతను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి విరాళంగా ఇచ్చాడు.
  • 1989: రాధాకృష్ణన్ జ్ఞాపకార్థం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ద్వారా రాధాకృష్ణన్ స్కాలర్‌షిప్‌ల సంస్థ. స్కాలర్‌షిప్‌లు తరువాత "రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్‌లు"గా మార్చబడ్డాయి.
  • అతను సాహిత్యంలో నోబెల్ బహుమతికి పదహారు సార్లు, నోబెల్ శాంతి బహుమతికి పదకొండు సార్లు నామినేట్ అయ్యాడు.

భారత తపాలా శాఖ 1967, 1989 లలో స్మారక తపాలా స్టాంపులు విడుదలచేసింది.

జనాదరణ పొందిన సంస్కృతిలో

సర్వేపల్లి రాధాకృష్ణ (1988) అనేది రాధాకృష్ణన్ గురించి తెలియజేసిన డాక్యుమెంటరీ చిత్రం, దీనికి ఎన్.ఎస్. థాపా దర్శకత్వం వహించాడు, దీనిని భారత ప్రభుత్వ చలనచిత్ర విభాగం నిర్మించింది.

రచనలు

  • The Ethics of the Vedanta and Its Material Presupposition (వేదాంతాలలోని నియమాలు, వాటి ఉపయోగం ఒక తలంపు) (1908) - ఎం.ఏ. పరిశోధనా వ్యాసం.
  • The Philosophy of Rabindranath Tagore (రవీంద్రుని తత్వం) (1918).
  • The Reign of Religion in Contemporary Philosophy (సమకాలీన తత్వంపై మతం ఏలుబడి) (1920).
  • Indian Philosophy (భారతీయ తత్వం) (2 సంపుటాలు) (1923, 1927).
  • The Hindu View of Life (హిందూ జీవిత ధృక్కోణం) (1926).
  • The Religion We Need (మనకు కావలిసిన మతం) (1928).
  • Kalki or The Future of Civilisation (కల్కి లేదా నాగరికత భవిష్యత్తు) (1929).
  • An Idealist View of Life (ఆదర్శవాది జీవిత ధృక్కోణం) (1932).
  • East and West in Religion (ప్రాక్‌ పశ్చిమాలలో మతం) (1933).
  • Freedom and Culture (స్వాతంత్ర్యం, సంస్కృతి) (1936).
  • The Heart of Hindusthan (భారతీయ హృదయం) (1936).
  • My Search for Truth (Autobiography) (నా సత్యశోధన (ఆత్మకథ)) (1937).
  • Gautama, The Buddha (గౌతమ బుద్ధుడు) (1938).
  • Eastern Religions and Western Thought (తూర్పు మతాలు, పాశ్చాత్య చింతన) (1939, రెండవ కూర్పు 1969).
  • Mahatma Gandhi (మహాత్మా గాంధీ) (1939).
  • India and China (భారతదేశం, చైనా) (1944).
  • Education, Politics and War (విద్య, రాజకీయం, యుద్ధం) (1944).
  • Is this Peace (ఇది శాంతేనా) (1945).
  • The Religion and Society (మతం, సంఘం) (1947).
  • The Bhagwadgita (భగవధ్గీత) (1948).
  • Great Indians (భారతీయ మహానీయులు) (1949).
  • East and West: Some Reflections (తూర్పు, పడమర: కొన్ని చింతనలు) (1955).
  • Religion in a Changing World (మారుతున్న ప్రపంచంలో మతం) (1967).

ఇతర విశేషాలు

  • రాధాకృష్ణన్ ది చాలాపేద కుటుంబం. ఉన్నత విద్య చదివించే స్తోమత లేదని తండ్రి వీరాస్వామి కొడుకును పూజారి వృత్తి చేయమన్నాడు. కానీ రాధాకృష్ణన్‌కు చదువంటే ప్రాణం. అందుకే ఉన్నత పాఠశాల చదువుకోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరాడు. ఇక అప్పటినుంచీ ఇతను చదువంతా ఉపకారవేతనాలతోనే సాగిపోయింది. భోజనం చేసేందుకు అరిటాకు కొనలేని పరిస్థితుల్లో అతను నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
  • మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎం.ఏ పూర్తిచేసిన రాధాకృష్ణన్ ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరాడు. అతను పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. అతను రోజులో 12 గంటల పాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవాడు. ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాసేవాడు. రాధాకృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పదవులు చేపట్టడమే కాదు, ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి (వైస్‌ఛాన్స్‌లర్) గా పనిచేశాడు. రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశాడు.
  • అతను రాసిన 'ఇండియన్ ఫిలాసఫీ' పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేక ఆహ్వానంపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించాడు. 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్'లో సభ్యుడిగా ఉండి, విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు.
  • 1952లో బారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారత రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు చేపట్టాడు. 1954లో భారతరత్న పురస్కారం దక్కింది. ఏనాడూ ఎటువంటి ఆడంబరాలకు పోలేదు.
  • రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం 25 శాతం తీసుకుని మిగతాది ప్రధాన మంత్రి సహాయ నిధికి తిరిగి ఇచ్చాడు.
  • రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై, ప్రేమాభిమానాలు చూపేవాడు. అతను మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్‌గా వెళ్లేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి, తమ గురువును కూర్చోబెట్టి, రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట.
  • రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతను శిష్యులు, అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా, దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని అతను కోరారట. ఆరోజు నుంచే అతను పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

మూలాలు

వనరులు

  1. ^ liveindia.comలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి
  2. ^ భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం Archived 2011-10-08 at the Wayback Machine
  3. ^ డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్ర (సమగ్రంగా) sify.comలో
  4. ^ నాస్తికత్వంపైన ఉల్లేఖనాలు
  5. ఇంతకుముందు ఉన్న రాష్ట్రపతుల గురించి భారత ప్రభుత్వంవారి అధికారిక వెబ్‌సైటులో చూడండి
  6. సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతి రాత , అతను గొంతును కూడా ఇక్కడ వినవచ్చు

బాహ్య లంకెలు

సర్వేపల్లి రాధాకృష్ణన్ 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.


ఇంతకు ముందు ఉన్నవారు:
ఈ హోదా లేదు
ఉప రాష్ట్రపతి
19521962
తరువాత వచ్చినవారు:
జాకీర్ హుస్సేన్


ఇంతకు ముందు ఉన్నవారు:
రాజేంద్ర ప్రసాద్
భారత రాష్ట్రపతి
1962 మే 131967 మే 13
తరువాత వచ్చినవారు:
జాకీర్ హుస్సేన్

Tags:

సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత విశేషాలుసర్వేపల్లి రాధాకృష్ణన్ వివాహం, సంతానంసర్వేపల్లి రాధాకృష్ణన్ ఉద్యోగంసర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి తాత్వికచింతనసర్వేపల్లి రాధాకృష్ణన్ చేపట్టిన పదవులుసర్వేపల్లి రాధాకృష్ణన్ పొందిన గౌరవాలుసర్వేపల్లి రాధాకృష్ణన్ జనాదరణ పొందిన సంస్కృతిలోసర్వేపల్లి రాధాకృష్ణన్ రచనలుసర్వేపల్లి రాధాకృష్ణన్ ఇతర విశేషాలుసర్వేపల్లి రాధాకృష్ణన్ మూలాలుసర్వేపల్లి రాధాకృష్ణన్ వనరులుసర్వేపల్లి రాధాకృష్ణన్ బాహ్య లంకెలుసర్వేపల్లి రాధాకృష్ణన్18881975ఆంధ్ర విశ్వవిద్యాలయంఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంఉప రాష్ట్రపతిఏప్రిల్ 17కలకత్తా విశ్వవిద్యాలయంచైనాతత్వంపాకిస్తాన్భారత రాష్ట్రపతిసెప్టెంబర్ 5

🔥 Trending searches on Wiki తెలుగు:

మృణాల్ ఠాకూర్శాసనసభ సభ్యుడుడీజే టిల్లురామచంద్రపురం శాసనసభ నియోజకవర్గంక్రిక్‌బజ్ఆయాసంజన సాంద్రతస్వామి వివేకానందఅభిరామిధనూరాశిచిత్త నక్షత్రముషడ్రుచులునవీన్ పట్నాయక్తెలంగాణా సాయుధ పోరాటంపుష్పశ్రీలీల (నటి)భారతీయ రిజర్వ్ బ్యాంక్ట్విట్టర్పార్వతిశత్రుఘ్నుడుచాకలి ఐలమ్మఅరటిభారతదేశంలో బ్రిటిషు పాలనఠాకూర్ రాజా సింగ్వంగవీటి రాధాకృష్ణఅనూరాధ నక్షత్రంఉత్తరాభాద్ర నక్షత్రముటిల్లు స్క్వేర్నాగులపల్లి ధనలక్ష్మికల్వకుంట్ల కవితవిమల (రచయిత్రి)దేశాల జాబితా – వైశాల్యం క్రమంలోభారత ప్రధానమంత్రుల జాబితాయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ఆటలమ్మచెప్పవే చిరుగాలివేమిరెడ్డి ప్రభాకరరెడ్డిరెండవ ప్రపంచ యుద్ధంబొల్లివిష్ణువు వేయి నామములు- 1-1000భారత రాజ్యాంగ పీఠికఅశ్వని నక్షత్రముశుభ్‌మ‌న్ గిల్తెలుగు సంవత్సరాలుమధుమేహంపొంగులేటి శ్రీనివాస్ రెడ్డితెలంగాణా బీసీ కులాల జాబితామకరరాశికన్యాదానంఫ్యామిలీ స్టార్వసంత ఋతువుఆవేశం (1994 సినిమా)ప్రీతీ జింటాహస్తప్రయోగంపాండవులునాన్న (సినిమా)తూర్పు చాళుక్యులుఇజ్రాయిల్గాయత్రీ మంత్రంగుమ్మలూరి శాస్త్రిఅనుష్క శెట్టిధూర్జటిభీమా (2024 సినిమా)హరే కృష్ణ (మంత్రం)అంజలి (నటి)ఇండియన్ సివిల్ సర్వీసెస్శర్వానంద్మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిఆది పర్వముగూగుల్రామప్ప దేవాలయంమదర్ థెరీసాపూరీ జగన్నాథ దేవాలయంఫ్లిప్‌కార్ట్మంతెన సత్యనారాయణ రాజుఇండియన్ ప్రీమియర్ లీగ్సంధ్యావందనంశ్రీ కృష్ణుడుహృదయం (2022 సినిమా)🡆 More